التحقيق والإيضاح لكثير من مسائل الحج والعمرة والزيارة على ضوء الكتاب والسنة

التحقيق والإيضاح لكثير من مسائل الحج والعمرة والزيارة على ضوء الكتاب والسنة

ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో హజ్, ఉమ్రహ్ మరియు జియారతుకు సంబంధించిన అనేక విషయాల పరిశోధన, విశ్లేషణ మరియు వివరణ.

Language: lang_te
Prepared by: అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్
Version: 3.1
Translations 42
Amharic Azerbaijani Bengali Bosnian +38
Attachments 7
PDF
Audio
Video
+3

ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో హజ్, ఉమ్రహ్ మరియు జియారతుకు సంబంధించిన అనేక విషయాల పరిశోధన, విశ్లేషణ మరియు వివరణ.

గౌరవనీయులైన షేఖ్ అల్లామా

అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్

తొలి పలుకులు

అనంత కరుణాప్రదాత, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,

సకల ప్రశంసలు, కృతజ్ఞతలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే శోభించును, మంచి పర్యవసానం దైవభీతి గలవారి కొరకే, మరియు ఆయన దాసుడు, అంతిమ ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలు, శాంతి కురియుగాక!

ఆ తరువాత:

ఇది హజ్ యొక్క గొప్పతనం మరియు దాని మర్యాదలను వివరిస్తూ రాసిన ఒక చిన్న సందేశము. హజ్ ప్రయాణం చేయాలనుకునేవారు పాటించాల్సిన విషయాలు, హజ్, ఉమ్రహ్ మరియు జియారత్  కుసంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలను ఇందులో సంక్షిప్తంగా మరియు స్పష్టంగా వివరించాను. ఈ రచనలో అల్లాహ్ అంతిమ గ్రంథం మరియు ఆయన అంతిమ ప్రవక్త యొక్క సున్నతుల ఆధారాలను అనుసరించాను. దీనిని ముస్లింలకు ఒక హితబోధగా, ఉపదేశంగా మరియు అల్లాహ్ యొక్క ఈ వాక్కును అమలు చేయడం కోసం దీనిని సంకలనం చేసాను: మరియు వారిని ఉపదేశిస్తూ వుండు, నిశ్చయంగా, ఉపదేశం విశ్వాసులకు ప్రయోజనకర మవుతుంది. [అద్'దారియాత్ 51:55] మరియు అల్లాహ్ వాక్కు: మరియు అల్లాహ్ గ్రంథ ప్రజలతో: "దీనిని ప్రజలకు తెలియజేయండి మరియు దానిని దాచకండి." అని చేయించిన ప్రమాణాన్ని [ఆలే ఇమ్రాన్ 3:187] మరియు అల్లాహ్ వాక్కు: ...మరియు పుణ్యకార్యాలు మరియు దైవభీతి విషయాలలో, ఒకరికొకరు తోడ్పడండి... [అల్ మాయిదా 5:2]

మరియు ప్రామాణికమైన హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “అద్దీను (ధర్మము) ఒక నిష్కల్మషమైన బోధన, ఉపదేశం”*. మేము ఇలా అడిగాము: “ఎవరి కొరకు, ఓ ప్రవక్తా?”. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ కొరకు, ఆయన గ్రంథం (ఖుర్’ఆన్) కొరకు, ఆయన సందేశహరుని కొరకు, ముస్లిముల పండితుల కొరకు మరియు సాధారణ ముస్లిములందరి కొరకు” అని పలికినారు. [1] [1] దీనిని ముస్లిం నమోదు చేసినారు, హదీథు సంఖ్య (55)

తబరానీలోని హుదైఫా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన మరో హదీథులో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “ముస్లింల పరిస్థితిపై చింతించనివాడు వారిలో ఒకడు కాడు. అలాగే, ఎవడైనా ఉదయం, సాయంత్రం అల్లాహ్, ఆయన ప్రవక్త, ఆయన గ్రంథం, ఆయన ఇమామ్ మరియు సాధారణ ముస్లింలకు హృదయపూర్వకంగా హితబోధ (నిజాయితీ మరియు మంచి పరామర్శ) చేయకపోతే, అతడు వారిలోంచి కాడు.” [2] [2] దీనిని తబ్రానీ ఔసత్ లో నమోదు చేసినారు, హదీథు సంఖ్య 7469.

ఇది నా కొరకు మరియు ముస్లింలందరి కొరకు ప్రయోజనకరం కావాలని, ఈ ప్రయత్నాన్ని ఆయన ప్రసన్నత కొరకు చేసిన ప్రయత్నంగా పరిగణించబడాలని, అలాగే పరలోకంలోని స్వర్గవనాల విజయానికి కారణంగా ఉపయోగ పడాలని అల్లాహ్ ను వేడుకుంటున్నాను. నిశ్చయంగా, ఆయన అన్నింటినీ వినువాడు, ప్రతిస్పందించువాడు. ఆయనే మా కోసం తగినవాడు, మరియు ఆయనే అత్యుత్తమ నిర్వాహకుడు.

అధ్యాయం

హజ్ మరియు ఉమ్రహ్ తప్పనిసరి అని, వాటిని వెంటనే చేయాలని తెలిపే ఆధారాలు:

ఇది గ్రహించిన తరువాత, మీరు తెలుకోండి, మహోన్నతుడైన అల్లాహ్ తన దాసులపై తన పవిత్ర గృహమైన కఆబా యొక్క హజ్ యాత్ర చేయడాన్ని తప్పనిసరి చేశాడు మరియు దాన్ని ఇస్లామ్ యొక్క ముఖ్యమైన మూలస్థంభాలలో ఒకటిగా చేశాడు. 'అల్లాహ్ నన్ను మరియు మిమ్మల్ని సత్యాన్ని తెలుసుకొని దానిని అనుసరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక!' మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: అల్లాహ్ కు ప్రజలపై ఉన్న హక్కు ఏమిటంటే – ఎవరైతే దాని వైపు ప్రయాణించే శక్తీ, స్థోమత కలిగియుంటారో, వారు ఆ గృహయాత్ర (హజ్) తప్పక చేయాలి. ఎవరైతే దీనిని తిరస్కరిస్తారో, నిశ్చయంగా అల్లాహ్ సకల లోకవాసులలో ఎవరి అవసరమూ, ఎంత మాత్రమూ లేని నిరపేక్షాపరుడు (అని తెలుసుకోవాలి). [ఆలే ఇమ్రాన్ 3: 97].

సహీహైన్ లో అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనము: ఇస్లాం ధర్మం ఐదు పునాదులపై ఆధారపడి ఉంది: అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడనీ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవప్రవక్త అని సాక్ష్యము పలకటం, నమాజ్ స్థాపించటం, జకాత్ చెల్లించటం, రమదాన్ నెలలో ఉపవాసాలు పాటించటం, అల్లాహ్ యొక్క కాబా గృహం యాత్ర చేయటం. ([3]). [3] దీనిని అల్ బుఖారీ నమోదు చేసినారు, హదీథు సంఖ్య (8) మరియు ముస్లిం నమోదు చేసినారు, హదీథు సంఖ్య (16).

సయీద్ తన సునన్‌లో ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఇలా చెప్పారని ఉల్లేఖించినారు: నేను ఈ ప్రదేశాలకు కొంతమంది వ్యక్తులను పంపాలని అనుకున్నాను - వారు (ప్రజలను) పరిశీలించి, ఎవరైనా స్తోమత [4] ఉండి కూడా హజ్ చేయకుండా ఉంటే, వారి మీద జిజియా విధించాలని. వారు ముస్లింలు కారు, వారు ముస్లింలు కారు [5]. [4] అంటే: ఆర్థిక సామర్థ్యం. [5] "జామిఅ్ అల్-అహాదీథ్" లో హదీథు సంఖ్య (31221)గా "సునన్ సయీద్ ఇబ్న్ మన్సూర్" కు ఆపాదించబడింది, కానీ అందుబాటులో ఉన్న దాని ప్రతిలో  నేను దానిని పొందలేదు.

మరియు అలీ రదియల్లాహు అన్హు ఇలా చెప్పారని ఆయన నివేదించారు: ఎవరికైనా హజ్ చేసే సామర్థ్యం ఉండి కూడా అతను హజ్‌ యాత్ర చేయడాన్ని నిర్లక్ష్యం చేస్తే , అతను యూదుడిగా లేదా క్రైస్తవుడిగా మరణిస్తాడన్న దానిలో పట్టింపు లేదు [6]. [6] తిర్మిథీ, హదీథు సంఖ్య (812).

హజ్ చేసే సామర్థ్యం ఉండి కూడా ఎవరైనా హజ్ చేయకపోతే, అతను త్వరగా హజ్ చేయవలసిన అవసరం ఉంది; ఎందుకంటే ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: హజ్ – అంటే ఫర్ద్ హజ్ – చేయుటలో త్వరపడండి. ఎందుకంటే మీలో ఎవరికి ఏ అవాంతరం ఎదురవుతుందో తెలియదు [7]. [7] అబూ దావుద్, హదీథు సంఖ్య (1732).

ఎవరైతే హజ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటారో, వారిపై హజ్ తక్షణమే చేయటం వాజిబ్ అవుతుంది; ఈ అల్లాహ్ వచనంలోని స్పష్టమైన భావం ప్రకారం: మరియు అల్లాహ్ కు ప్రజలపై ఉన్న హక్కు ఏమిటంటే – ఎవరైతే దాని వైపు ప్రయాణించే శక్తీ, స్థోమత కలిగియుంటారో, వారు ఆ గృహయాత్ర (హజ్) తప్పక చేయాలి. ఎవరైతే దీనిని తిరస్కరిస్తారో, నిశ్చయంగా అల్లాహ్ సకల లోకవాసులలో ఎవరి అవసరమూ ఎంత మాత్రమూ లేని నిరపేక్షాపరుడు (అని తెలుసుకోవాలి). [ఆలే ఇమ్రాన్ 3:97] ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఖుత్బా ప్రసంగంలో ఇలా సెలవిచ్చారు: ఓ ప్రజలారా! అల్లాహ్ మీపై హజ్‌ను ఫర్ద్ చేశాడు, కాబట్టి హజ్ చేయండి [8]. [8] ముస్లిం, హదీథు సంఖ్య (1337).

ఉమ్రహ్ వాజిబ్ అని సూచించే హదీథులు కూడా ఉన్నాయి: అవి,

జిబ్రయీల్ అలైహిస్సలాం ఇస్లాం గురించి ప్రశ్నించినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన జవాబు: «ఇస్లాం అనగా: నీవు లా ఇలాహ ఇల్లల్లాహ్' వ అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్' (నిశ్చయంగా అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు, మరియు నిశ్చయంగా ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు) అని సాక్ష్యం ఇవ్వడం, నమాజు స్థాపించటం, జకాతు ఇవ్వటం, కాబా గృహము హజ్ చేయటం మరియు ఉమ్రహ్ చేయటం, జనాబత్ నుంచి గుసుల్ చేయటం, సంపూర్ణంగా ఉదూ చేయటం, రమదాన్ ఉపవాసాలు పాటించటం. ([9])» దీనిని ఇబ్ను ఖుజైమా మరియు దారుల్ ఖుత్నీ, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు హదీథు నుండి నమోదు చేసినారు. దారుల్ ఖుత్నీ: ఇది స్థిరమైన మరియు సహీహ్ ఇస్నాద్ కలిగిన హదీథు అన్నారు. [9] ఇబ్నె ఖుజైమహ్, హదీథు సంఖ్య (1)

వాటిలో: ఆయిషా రదియల్లాహు అన్హా హదీథు. అందులో ఆమె ఇలా సెలవిచ్చారు: "ఓ రసూలల్లాహ్‌! స్త్రీలపై జిహాద్ ఉందా?" అని అడిగారు. దానికి ఆయన ఇలా జవాబిచ్చారు: "వారిపై జిహాద్ ఉంది, అయితే అందులో పోరాటం ఉండదు; అది హజ్ మరియు ఉమ్రహ్" [10] దీనిని అహ్మద్ మరియు ఇబ్ను మాజహ్ సహీహ్ ఇస్నాద్‌తో నమోదు చేసినారు. [10] దీనిని బుఖారీ నమోదు చేసినారు, హదీథు సంఖ్య (1520).

హజ్ మరియు ఉమ్రహ్ జీవితంలో ఒక్కసారి మాత్రమే తప్పనిసరి, ఎందుకంటే సహీహ్ హదీథులో ప్రవక్త ﷺ ప్రవచనము ఇలా ఉన్నది: «‌హజ్ ఒకసారి, దాని కన్నా ఎక్కువసార్లు చేస్తే అది స్వచ్ఛంద పుణ్యకార్యం (నఫిల్ ఆచరణ) అవుతుంది »[11]. [11] అన్-నసాయీ,  హదీథు సంఖ్య (2620)

స్వచ్ఛందంగా హజ్ మరియు ఉమ్రహ్ వీలైనంత ఎక్కువగా చేయుట సున్నతు, ఎందుకంటే ఇది సహీహైన్‌లో నమోదు చేయబడిన అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనలో “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: «ఒక ఉమ్రహ్ తర్వాత మరొక ఉమ్రహ్ చేయటం వాటి మధ్య జరిగిన పాపాలన్నిటికీ పరిహారం అవుతుంది. మబ్రూర్ (ఆమోద ముద్రపడిన) హజ్ కు ప్రతిఫలం స్వర్గం తప్ప మరేమి లేదు.» [12]. [12] అల్ బుఖారీ, హదీథు సంఖ్య (1773) మరియు ముస్లిం,  హదీథు సంఖ్య (1349).

అధ్యాయం

పాపాల నుండి తౌబా  చేయడం (పశ్చాత్తాప పడటం) మరియు అన్యాయం, దౌర్జన్యం చేయుట నుండి వైదొలగటం తప్పనిసరి.

ముస్లిం హజ్ లేదా ఉమ్రహ్ ప్రయాణానికి దృఢంగా సంకల్పించుకున్నప్పుడు, అతను తన కుటుంబ సభ్యులను మరియు స్నేహితులను అల్లాహ్ యొక్క తఖ్వా (భయభక్తులు) కలిగి ఉండాలని ఉపదేశించుట ఉత్తమం. తఖ్వా అనగా అల్లాహ్ ఆజ్ఞలను పాటించడం మరియు ఆయన నివారించిన, నిషేధించిన వాటిని విడిచి పెట్టడం.

అతడు తన హక్కులు మరియు అప్పులు లిఖించి, వాటిపై సాక్షులను ఏర్పాటు చేయుట ఉత్తమం. అలాగే, పాపాలన్నిం నుండి నిజమైన తౌబా చేయడం అతనికి తప్పనిసరి, ఎందుకంటే అల్లాహ్ వాక్కు ఇలా ఉన్నది: మరియు ఓ విశ్వాసులారా! మీరందరూ కలసి అల్లాహ్ ను క్షమాపణకై వేడుకుంటే, మీరు సాఫల్యం పొందవచ్చు! [అన్-నూర్ 24: 31].

తౌబా యొక్క వాస్తవికత: పాపాలను పూర్తిగా విడిచిపెట్టడం, గతంలో జరిగి పోయిన వాటిపై పశ్చాత్తాపం చెందడం, భవిష్యత్తులో వాటిని తిరిగి చేయకూడదనే దృఢ నిశ్చయం కలిగి ఉండడం. ఒకవేళ అతని వలన ఇతరులపై అన్యాయం జరిగి, వారి హక్కులు పోగొట్టుకుని ఉంటే – అది ప్రాణానికి సంబంధించినదైనా, ఆస్తికి సంబంధించినదైనా, గౌరవానికి సంబంధించినదైనా – తన ప్రయాణానికి ముందు వాటిని వారికి తిరిగి ఇచ్చి వేయాలి లేదా వారి నుండి క్షమాపణ పొందాలి. ఎందుకంటే ప్రవక్త ﷺ నుండి సహీహ్ రివాయత్‌లో ఈ విధంగా తెలుపబడినది: ఎవరిపై తన సహోదరుని సంపదకు సంబంధించి లేదా గౌరవానికి సంబంధించి ఏదైనా అన్యాయం జరిగి ఉంటే, దాన్ని ఈ రోజే అతని వద్దకు వెళ్లి పరిష్కరించుకోవాలి; ఎందుకంటే రేపు ప్రళయ దినాన అతని వద్ద దీనార్ గాని దిర్హం గాని ఉండవు. దౌర్జన్యం చేసిన వ్యక్తి వద్ద సత్కార్యాలు ఉన్నట్లయితే, అతని అన్యాయానికి సమానంగా అవి అతని నుండి తీసుకోబడతాయి; ఒకవేళ అతని వద్ద సత్కార్యాలు లేకపోతే, పీడితుని పాపాలు ఆ దౌర్జన్యపరుడిపై మోపబడతాయి. [13] [13] అల్ బుఖారీ, హదీథు సంఖ్య (2449).

మరియు అతడు హజ్ మరియు ఉమ్రహ్ కోసం పవిత్రమైన హలాల్ సంపాదన నుండి ఖర్చు చేయాలి. ఎందుకంటే సహీహ్ రివాయత్‌లో పేర్కొన్నట్లుగా ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చినారు: నిశ్ఛయంగా అల్లాహ్ పరమ పరిశుద్ధుడు కేవలం పరిశుద్ధమైనవి మాత్రమే అంగీకరిస్తాడు. [14] [14] ముస్లిం, హదీథు సంఖ్య (1015).

మరియు తబ్రానీలోని అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనలో, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:” ఒక వ్యక్తి పవిత్రమైన, ధర్మబద్ధమైన (హలాల్) సంపాదనతో హజ్‌ కు బయలుదేరి, తన కాలును సవారీపై ఉంచి 'లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక్ (హాజరయ్యాను, ఓ అల్లాహ్, హాజరయ్యాను)' అని పలికినప్పుడు, ఆకాశం నుండి ఒక పిలుపు ఇలా వెలువడుతుంది: 'లబ్బైక వ సఅదైక్ (నేను ఇక్కడ ఉన్నాను, నేను నీ సేవలో ఉన్నాను)! నీ ఆహారం హలాల్, నీ యాత్రాసాధనం హలాల్, నీ హజ్ మబ్రూర్ (అంగీకారమైనది), దానిలో ఏ శిక్షా (పరిహారమూ) లేదు.' కానీ, ఒక వ్యక్తి అపవిత్రమైన (హరామ్) సంపాదనతో బయలుదేరి, తన కాలును సవారీపై ఉంచి, 'లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక్' అని పలికినప్పుడు, ఆకాశం నుండి ఒక పిలుపు ఇలా వెలువడుతుంది: 'లా లబ్బైక వ లా సఅదైక్ (నీ పిలుపుకు బదులివ్వను, నీ సేవలో ఉండను)! నీ ఆహారం హరామ్, నీ ఖర్చు హరామ్, నీ హజ్ అంగీకారమైనది కాదు.' [15] [15] అల్ ముఅ్జమ్ అల్ కబీర్‌, తబ్రానీ, హదీథు సంఖ్య (2989) .

హజ్ యాత్రికుడు ఇతరుల చేతిలో ఉన్నది ఆశించకుండా, ఇతరుల వద్ద యాచించకుండా, తన ఖర్చులు తానే భరించగలిగే స్థితిలో స్వయం సంపూర్ణుడై ఉండాలి. ఎందుకంటే ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు: “ఎవరైతే యాచించకుండా తమని తాము రక్షించుకుంటారో అల్లాహ్ వారిని యాచించే అవసరం రాకుండా రక్షిస్తాడు, మరెవరైతే ఉన్న దాంతోనే సంతృప్తి చెందుతాడో, అల్లాహ్ అతనికి అందులోనే సమృద్దిని ప్రసాదిస్తాడు [16].” [16] అల్ బుఖారీ, హదీథు సంఖ్య (1427) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1035).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనము: ఒక మనిషి ఇతరులను యాచిస్తూనే ఉంటాడు, చివరికి ప్రళయదినం వచ్చే సరికి, అతని ముఖంపై మాంసపు తునక కూడా మిగలదు." [17]. [17] అల్ బుఖారీ, హదీథు సంఖ్య (1474) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (4040).

హజ్ యాత్రికుడు తన హజ్ మరియు ఉమ్రహ్ ల ద్వారా అల్లాహ్ ప్రసన్నతను, పరలోక నివాసమును పొందే ఉద్దేశ్యాన్ని కలిగి ఉండటం తప్పనిసరి. ఈ ఉన్నత స్థలాలలో అల్లాహ్‌కు సమీపం కావడానికి ఆయన ప్రసన్నమయ్యే మాటలు, పనులను చేయాలి. అతడు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏమిటంటే – హజ్‌ను ఇహలోక ప్రయోజనాల కోసం, ధన సంపాదన కోసం, ఇతరుల ముందు ప్రదర్శన కోసం, ఖ్యాతి కోసం, గర్వించడం కోసం చేయకూడదు. అలా చేస్తే, అది అతి చెడ్డ ఉద్దేశ్యాల్లో ఒకటి అవుతుంది. అలాంటి ఉద్దేశ్యం ఆచరణను వ్యర్థం చేయడం, అల్లాహ్ స్వీకరించక పోవడానికి కారణం అవుతుంది. ఎందుకంటే మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ఎవరు ప్రాపంచిక జీవిత సౌకర్యాలు మరియు దాని అలంకరణ కోరుకుంటారో మేము వారి కర్మల ఫలితాన్ని, ఈ జీవితంలోనే పూర్తిగా చెల్లిస్తాము. మరియు అందులో వారి కెలాంటి లోపం జరుగదు. కానీ, అలాంటి వారికి పరలోకంలో నరకాగ్ని తప్ప మరేమీ ఉండదు. వారు ఇందులో (ఈ లోకంలో) పాటు పడినదంతా వ్యర్థమై పోతుంది మరియు వారు చేసిన కర్మలన్నీ విఫలమవుతాయి. [హూద్ 11:15-16]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ఎవడు (ఇహలోక) తాత్కాలిక సుఖాలు కోరుకుంటాడో - మేము కోరిన వానికి - దానిలో మాకు ఇష్టం వచ్చినంత, ఒసంగుతాము. తరువాత అతని కొరకు నరకాన్ని నియమిస్తాము, దానిలో అతడు అవమానంతో బహిష్కరించ బడినవాడై దహింపబడతాడు. ఆఖిరతును కోరుకునే వారు, దాని కోసం తగిన ప్రయత్నం చేసే వారు మరియు విశ్వాసులైన వారు, వారి ప్రయత్నం ప్రశంసనీయమైనదిగా ఉంటుంది. [అల్ ఇస్రా 17:18-19]

ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిరూపితమైనది. ఇంకా ఆయన ఇలా సెలవిచ్చారు: “మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ‘మీరు చేస్తున్న బహుదైవారాధన (షిర్కు) నుండి నేను నిరుపేక్షాపరుడినీ; ఎవడు ఒక కార్యం చేసి దాంట్లో నాకు భాగస్వామ్యంగా మరొకరిని చేర్చితే, నేను అతడిని మరియు అతను చేస్తున్న షిర్కును (భాగస్వామ్యులను) వదిలేస్తాను’ [18].” [18] ముస్లిం, హదీథు సంఖ్య (2985).

మరియు ఇంకా అతడు తన ప్రయాణంలో ధర్మనిష్ఠాపరలైన, అల్లాహ్‌ పట్ల భయభక్తులు కలిగిన, ధార్మికత మరియు ఇస్లామీయ జ్ఞానం (ఫిఖ్) కలిగిన సజ్జనులను తోడుగా చేసుకోవాలి. అలాగే, అతడు అజ్ఞానులను (అసభ్యపరులు) మరియు నిషిద్ధకారులను (పాపాలలో నిమగ్నమైనవారిని) తోడుగా చేసుకోవడం నుండి అత్యంత జాగ్రత్త పడాలి.

మరియు అతడు తన హజ్ మరియు ఉమ్రహ్ లలో ఏ అంశాలు షరీయతు ప్రకారం ఆచరించవలసి ఉన్నాయో, వాటిని నేర్చుకోవాలి, వాటిలో ధార్మిక జ్ఞానం (ఫిఖ్) పొందాలి మరియు ఏమైనా సందేహం ఉంటే దానిని తెలుసుకోవడానికి ప్రశ్నించాలి, తద్వారా స్పష్టమైన జ్ఞానంతో తన హజ్ మరియు ఉమ్రహ్ లను నిర్వహించ గలుగుతాడు. అతడు తన ప్రయాణం కొరకు (దుప్పి, కారు, విమానం లేదా ఏదైనా వాహనం) అధిరోహించినప్పుడు, అల్లాహ్‌ నామస్మరణ చేయడం, ఆయనను స్తుతించడం, మూడుసార్లు "అల్లాహు అక్బర్" అని పలకడం అతని కొరకు ఉత్తమం. అతడు ఇంకా ఇలా పలకాలి: సర్వలోపాలకు అతీతుడైన ఆయన (అల్లాహ్) దీనిని మాకు వశపరచాడు, లేకపోతే ఆ (వశపరచుకునే) సామర్థ్యం మాకు లేదు. మరియు నిశ్చయంగా, మేము మా ప్రభువు వైపునకే మరలిపోవలసి ఉన్నది! [జుఖ్'రుఫ్ 43:13 - 14]

ఓ అల్లాహ్! నిశ్చయంగా ఈ ప్రయాణంలో మంచినీ, దైవభీతిని, మరియు నీవు ఇష్టపడే పనులు చేసే సద్బుద్ధినీ మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాను, ఓ అల్లాహ్! ఈ ప్రయాణాన్ని మా కొరకు సులభతరం చేయి మరియు ఈ ప్రయాణ దూరాన్ని త్వరగా పూర్తి చేసేలా చేయి. ఓ అల్లాహ్! ఈ ప్రయాణంలో నీవే నాకు తోడు. నా కుటుంబానికి నీవే సంరక్షకుడివి, ప్రయాణపు శ్రమా, ఇబ్బందుల నుండీ, చెడూ, బాధకర దృశ్యాల నుండీ, అలాగే నా ఇంటివారిలోనూ, నా సంపదలోనూ నష్టం వాటిల్లిన స్థితిలో నేను మరలటం నుండీ ఓ అల్లాహ్! నీ శరణు వేడుతున్నాను. [19] ఇది ప్రవక్త ﷺ నుండి సహీహ్‌గా నిర్ధారించబడింది. దీనిని ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు. దీనిని ముస్లిం తన సహీహ్‌లో నమోదు చేశారు. [19] ముస్లిం, హదీథు సంఖ్య (1342).

మరియు అతడు తన ప్రయాణంలో అధికంగా అల్లాహ్ దిక్ర్ (స్మరణ), ఇస్తిగ్ఫార్ (అల్లాహ్ వద్ద క్షమాపణ కోరుట), అల్లాహ్‌ తో దుఆలు చేయాలి మరియు వేడుకోవాలి. అంతేకాకుండా, ఖుర్ఆన్‌ పఠించాలి, దాని భావార్థాలపై దీర్ఘాలోచన చేయాలి, మరియు తప్పక నమాజులను జమాతుతో కలిసి ఆచరించాలి. అతడు తన నాలుకను అర్థం పర్థం లేని మాటలు, అనవసరమైన చర్చలు, మితిమీరిన నవ్వులు, విందులు చేయడం నుండి కాపాడుకోవాలి. అలాగే, తన నాలుకను అబద్ధాలు, చాడీలు, నిందలు, అపనిందలు, ఇతరులను అవమానించటం నుండి రక్షించుకోవాలి, ముఖ్యంగా తన సహచర యాత్రికులు మరియు ఇతర ముస్లింలను కించపరిచే మాటల నుంచి దూరంగా ఉండాలి.

అతడు తన సహచర యాత్రికులతో మంచిగా ప్రవర్తించాలి, వారికి హితకరంగా ఉండాలి, మరియు తన ద్వారా వారికే హానీ కలగకుండా జాగ్రత్తపడాలి. అలాగే, అతడు సాధ్యమైనంత వరకు వారికి మంచిని ఆదేశించాలి, చెడును నిరోధించాలి, అయితే దీనిని వివేకంతో (హిక్మత్) మరియు మంచి ఉపదేశంతో (మౌఇజతు హసనా) చేయాలి.

అధ్యాయం

హాజీ మీఖాత్‌ వద్దకు చేరుకున్నప్పుడు చేయవలసిన ఆచరణలు:

అయితే, హాజీ మీఖాత్‌ వద్దకు చేరుకున్నప్పుడు, అతను గుసుల్ చేయడం మరియు సుగంద ద్రవ్యాలు పూసుకోవడం ముస్తహబ్ (అభిలషణీయం). ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇహ్రామ్‌కి ముందు కుట్టిన బట్టలను విడిచి, గుసుల్ చేసినట్లు ప్రస్తావించబడింది. ఇంకా, సహీహైన్‌లో (సహీహ్ అల్-బుఖారీ మరియు సహీహ్ ముస్లింలలో) ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా ఉల్లేఖించినారు: నేను అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఇహ్రాంలో ప్రవేశించే ముందు మరియు హలాలైనప్పుడు (హజ్ లేదా ఉమ్రహ్ పూర్తయినప్పుడు, కాబా ప్రదక్షిణం చేయడానికి ముందు) సుగంధ ద్రవ్యాలు పూసేదానిని [20] . అలాగే, ఆయిషా రదియల్లాహు అన్హా ఉమ్రహ్ కోసం ఇహ్రామ్ ధరించిన స్థితిలో తనకు ఋతుస్రావం మొదలైనా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెను గుసుల్ చేయమని మరియు హజ్ కోసం ఇహ్రామ్ ధరించమని ఆదేశించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అస్మా బింత్ ఉమైస్ (రదియల్లాహు అన్హా) జుల్-హులైఫాలో ప్రసవించినప్పుడు, ఆమెను గుసుల్ చేయమని, మర్మవయవాలను గుడ్డతో చుట్టుకోవాలని, తరువాత ఇహ్రామ్ స్థితిలోనికి ప్రవేశించమని ఆదేశించారు. దీని నుండి తెలిసేది ఏమిటంటే, ఒక స్త్రీ మీఖాత్‌కు చేరుకున్నప్పుడు ఆమె హైద్ (ఋతుస్రావం) లేదా నిఫాస్ (ప్రసవానంతర రక్తస్రావం) లో ఉన్నా, ఆమె గుసుల్ చేసి, ఇతర యాత్రికులతో పాటు ఇహ్రామ్ ధరించాలి. ఆమె హజ్ వ్యక్తి చేసే పనులన్నీ చేయాలి, కాని కాబాగృహం చుట్టూ తవాఫ్ చేయకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా (రదియల్లాహు అన్హా) మరియు అస్మా (రదియల్లాహు అన్హా)లను ఇలాగే ఆదేశించారు. [20] అల్ బుఖారీ, హదీథు సంఖ్య (1539) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1189). [21] ముస్లిం, హదీథు సంఖ్య (1218).

ఇహ్రామ్‌ లో ప్రవేశించడానికి సిద్ధమైనవారు తమ మీసాల, గోర్ల, చంకల, మర్మాంగాల పరిసర జుట్టు విషయంలో శ్రద్ధ వహించటం ముస్తహబ్ (అభిలషణీయం). అవసరం ఉన్న స్థాయిలో వాటిని తగ్గించుకోవాలి, తొలగించాలి. తద్వారా ఇహ్రామ్‌లో ప్రవేశించిన తర్వాత వాటిని తీసివేయాల్సిన అవసరం రాకుండా ఉంటుంది, ఎందుకంటే ఇహ్రామ్‌లో ఉన్నప్పుడు ఇలా చేయడం నిషిద్ధం. ఇంకా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాల గురించి ఎల్లప్పుడూ శ్రద్ధ వహించమని ముస్లింలకు ఆదేశించారు. దీనికి సహీహైన్ (సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం)లో ప్రామాణికమైన హదీథు ఆధారంగా ఉంది. అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “మనిషి సహజత్వ ప్రక్రియలలో ఐదు విషయాలు ఇమిడి ఉన్నాయి: అవి సుంతీ, నాభి క్రింది భాగములోని వెంట్రుకలను తొలగించుట, మీసాలను కత్తిరించుట (కురచగా చేయుట), (చేతి వేళ్ళ మరియు కాలి వేళ్ళ) గోళ్ళు కత్తిరించుట మరియు చంకలలోని వెంట్రుకలు తొలగించుట ([22]).” [22] అల్ బుఖారీ, హదీథు సంఖ్య (5891) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (257).

సహీహ్ ముస్లింలో అనస్ రదిఅల్లాహు అన్హు ఉల్లేఖన, ఆయన ఇలా తెలిపారు : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీసాల కత్తిరింపు, గోర్ల కత్తిరింపు, చంకల వెంట్రుకల తొలగింపు, మరియు నాభి క్రింద వెంట్రుకల తొలగింపు గురించి మాకు సమయం నిర్దేశించారు: వీటిని నలభై రోజుల కంటే ఎక్కువగా వదిలేయకూడదు ([23]). [23] ముస్లిం, హదీథు సంఖ్య (258).

మరియు అన్-నసాయి ఈ హదీథును క్రింది పదాలతో నమోదు చేసినారు: «రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఒక కాలాన్ని నిర్దేశించారు» [24], దీనిని అహ్మద్, అబూ దావూద్ మరియు తిర్మిథీ, అన్-నసాయీ పదాలతో ఉల్లేఖించారు. ఇహ్రామ్ సమయంలో తల నుండి ఏదైనా తొలగించడం (వెంట్రుకలు పీకడం) పురుషులకు గానీ, మహిళలకు గానీ ధర్మబద్ధం కాదు. [24] అన్-నసాయీ, హదీథు సంఖ్య (14)

గడ్డం విషయానికి వస్తే, దాన్ని గీయడం లేదా దాని నుండి ఏదైనా తీసివేయటం అన్ని సమయాలలోనూ నిషిద్ధం. అంతేగాక దాన్ని పెంచడం మరియు సంపూర్ణంగా ఉంచడం తప్పనిసరి. ఇది సహీహైన్‌లో నిరూపితమైనది, ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన ప్రకారం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ముష్రికులకు విరుద్ధంగా ప్రవర్తించండి, గడ్డాన్ని పెంచండి, మీసాలను పూర్తిగా కత్తిరించండి ([25]). ముస్లిం హదీథు గ్రంథం, అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: మీసాలను పూర్తిగా కత్తిరించండి, గడ్డాన్ని పెంచండి, మజూసీలకు విరుద్ధంగా ప్రవర్తించండి ([26]). [25] అల్ బుఖారీ, హదీథు సంఖ్య (2892) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (259). [26] ముస్లిం, హదీథు సంఖ్య (260).

మరియు ప్రస్తుత కాలంలో చాలామంది ఈ సున్నతుకు వ్యతిరేకంగా నడుచుకోవడం, గడ్డాలకు వ్యతిరేకంగా పోరాడడం, సత్యతిరస్కారులు మరియు మహిళలతో పోలి ఉండటాన్ని ఇష్టపడటం ఒక గొప్ప ఫిత్నా (విపత్తు) గా మారింది. ముఖ్యంగా, ఇది విద్యాబోధనలతో సంబంధం కలిగిన వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. మేము అల్లాహ్‌కు చెందినవారమే, మరియు ఆయన వద్దకే తిరిగి వెళ్లబోతున్నాం. మేము అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నాం, ఆయన మమ్మల్ని మరియు ఇతర ముస్లింలను సున్నతుకు అనుగుణంగా నడిపించుగాక! దాన్ని పాటించటానికి మరియు దాని వైపు పిలిచే కార్యాన్ని చేయుటకు మార్గనిర్దేశించుగాక! ఎంతమంది దానిని విడచి పెట్టినా సరే, అల్లాహ్ మాత్రమే మనకు సరిపోతాడు మరియు ఆయన అద్భుతమైన సంరక్షకుడు. అల్లాహ్ తప్ప మరెవరికీ శక్తి లేదు, మరియు మరెవరికీ బలము లేదు; ఆయన సర్వోన్నతుడూ, మహాశక్తిమంతుడూ.

అనంతరం పురుషుడు నడుము క్రింద ఒక దుప్పటి మరియు పైన ఒక దుప్పటి ధరిస్తాడు. అవి తెల్లటి రంగులో, శుభ్రమైనవిగా ఉండడం ముస్తహబ్. అలాగే చెప్పులు ధరించి ఇహ్రామ్‌లో ప్రవేశించడం ముస్తహబ్, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: మీలో ఎవరైనా ఇహ్రామ్‌లో ప్రవేశించేటప్పుడు ఇజార్, రిదా మరియు రెండు చెప్పులను ధరించండి. కానీ, రెండు చెప్పులు లేకపోతే, మడమల క్రిందికి ఉండేలా మేజోళ్ళను కత్తిరించుకొని ధరించండి [27]. దీనిని ఇమామ్ అహ్మద్ రహిమహుల్లాహ్ నమోదు చేసినారు. [27] ముస్లిం, హదీథు సంఖ్య (1177).

స్త్రీ ఇహ్రామ్‌లో నల్ల, ఆకుపచ్చ లేదా ఏది తలచుకుంటే అది  ఇతర రంగుల దుస్తులను ధరించవచ్చు. అయితే, పురుషుల వేషధారణను అనుకరించకుండా జాగ్రత్తగా ఉండాలి. కానీ, ఇహ్రామ్‌లో ఉండగా ఆమెకు నిఖాబ్ మరియు గ్లౌజులు ధరించటం అనుమతించబడలేదు. అయితే, నిఖాబ్ మరియు గ్లౌజులు కాకుండా, ఆమె ముఖాన్ని మరియు చేతులను ఇతర వస్త్రంతో కప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "ఇహ్రామ్‌లో ఉన్న స్త్రీ నిఖాబ్ మరియు గ్లౌజులు ధరించకూడదు" అని వారించారు. అంతేగాక, కొంతమంది సామాన్య ప్రజలు స్త్రీ ఇహ్రామ్‌ను ప్రత్యేకంగా ఆకుపచ్చ లేదా నలుపు రంగులోనే ఉండాలని నమ్మడం అర్థహీనమైనది, దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు.

గుసుల్ చేయడం, శరీరాన్ని శుభ్రపరచుకోవడం మరియు ఇహ్రామ్ దుస్తులను ధరించడం పూర్త అయిన తరువాత, హజ్ లేదా ఉమ్రహ్ లో నుంచి తాను ఎంచుకున్న ఆరాధనలో ప్రవేశించాలని మనసులో నియ్యత్ చేసుకోవాలి (నిశ్చయించుకోవాలి). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: «నిశ్చయంగా ఆచరణలు వాటి సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి. ప్రతి వ్యక్తికి అతని సంకల్పానుసారంగా ప్రతిఫలము లభిస్తుంది.»[28]. [28] అల్ బుఖారీ, హదీథు సంఖ్య (1) మరియు ముస్లిం,  హదీథు సంఖ్య (1907).

ఇహ్రామ్‌లో ప్రవేశించేటప్పుడు, తన సంకల్పాన్ని స్పష్టంగా పలుకడం శాస్త్రీయమైనది. ఒకవేళ ఉమ్రహ్ కోసం సంకల్పం చేసుకుంటే, ఇలా చెప్పాలి: "లబ్బైక్ ఉమ్రతన్ (ఉమ్రహ్ కోసం హాజరయ్యాను)" లేదా "అల్లాహుమ్మ లబ్బైక ఉమ్రతన్ (ఓ అల్లాహ్, ఉమ్రహ్ కోసం హాజరయ్యాను)". ఒకవేళ హజ్ కోసం సంకల్పం చేసుంటే, ఇలా చెప్పాలి: "లబ్బైక హజ్జన్ (హజ్ కోసం హాజరయ్యాను)" లేదా "అల్లాహుమ్మ లబ్బైక హజ్జన్ (ఓ అల్లాహ్, హజ్ కోసం హాజరయ్యాను)". హజ్ మరియు ఉమ్రహ్ రెండింటి సంకల్పం చేసుకుంటే, ఇలా చెప్పాలి: "అల్లాహుమ్మ లబ్బైక ఉమ్రతన్ వహజ్జన్ (ఓ అల్లాహ్ ఉమ్రహ్ మరియు హజ్ కోసం హాజరయ్యాను)". అత్యుత్తమ పద్ధతి ఏమిటంటే, ఈ తలబియ్యహ తన వాహనం (ఒంటె లేదా వాహనం)పై కూర్చున్న తరువాత పలకడం. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా తన ప్రయాణ సవారిపై మీఖాతు నుండి కదలడం మొదలైన తరువాతే ఇహ్రామ్‌ సంకల్పాన్ని ఉచ్ఛరించారు. ఇది ఉత్తమమైనది మరియు సరైనది అని చెప్పిన ఉలమాల అభిప్రాయం.

ఇహ్రామ్‌ కొరకు మాత్రమే తన సంకల్పాన్ని స్పష్టంగా ఉచ్ఛరించడం శాస్త్రీయమైనది, ఇది దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ప్రామాణికంగా వచ్చినది. ఇతర ఆరాధనలలో (నమాజు, ఉపవాసం మొదలైనవి) సంకల్పాన్ని మనస్సులో చేసుకోవడంతోనే సరిపోతుంది, అంతేగానీ పైకి ఉచ్ఛరించడం శాస్త్రీయం కాదు.

నమాజు, తవాఫ్ మరియు ఇతర ఆరాధనల కొరకు సంకల్పాన్ని నోటితో పలికే అవసరం లేదు. కావున అతడు "నేను ఇలా నమాజు చేయాలని సంకల్పిం చేసుకున్నాను" లేదా "నేను ఇలా తవాఫ్ చేయాలని సంకల్పం చేసుకున్నాను" అని పైకి ఉచ్ఛరించడం శాస్త్రీయం కాదు. ఇలా ఉచ్ఛరించడం బిద్‌అతుగా (ధర్మంలో కొత్తగా కల్పించబడిన విషయంగా) పరిగణించబడుతుంది. ఇంకా, దీన్ని గొంతెత్తి పైకి పలకడం, మరింత తీవ్రమైన పెద్ద పాపంగా మారుతుంది. ఒకవేళ సంకల్పాన్ని ఉచ్ఛరించడం శాస్త్రీయమైనదైతే , ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి శాస్త్రీయమైనదై ఉంటే, ఆయన తన చేతల ద్వారా లేదా మాటల ద్వారా స్పష్టంగా వెల్లడించి ఉండేవారు. అదే విధంగా, సహాబాలు (సలఫ్ సాలిహీన్) కూడా దాన్ని ఆచరించి ఉండేవారు. కాబట్టి, మనస్సులో నియ్యత్ చేసుకోవడంతోనే సరిపోతుంది, నోటితో ఉచ్ఛరించ వలసిన అవసరం లేదు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి, అలాగే సహాబాల నుండి (రదియల్లాహు అన్హుమ్) ఇలా చేయడం ప్రామాణికంగా అందించబడక పోవడం వల్ల, ఇది బిద్‘అహ్ (కొత్తగా కల్పించబడిన విషయం) అని మనకు తెలుస్తోంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అన్ని వ్యవహారాలలో అతి చెడ్డవి కొత్తపోకడలు, నూతన ఆవిష్కరణలు. ప్రతీ కొత్తపోకడా మార్గభ్రష్టత అవుతుంది ([29]). ముస్లిం హదీథు గ్రంథము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “ఎవడైనా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసి పుచ్చబడుతుంది” [30] దాని ప్రామాణికత ధృవీకరించబడింది. ముస్లిం హదీథు పదాలలో ఇలా ఉన్నది: ‘ఎవరైతే మా ఆదేశాలలో లేని పనిని చేస్తారో, అది తిరస్కరించబడుతుంది.[31]’ [29] ముస్లిం, హదీథు సంఖ్య (867). [30] అల్ బుఖారీ, హదీథు సంఖ్య (2697) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1718). [31] అల్ బుఖారీ, హదీథు సంఖ్య (2550) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1718).

అధ్యాయం స్థానిక మీఖాతులు మరియు వాటి సరిహద్దులు:

మొత్తం మీఖాతులు ఐదు:

ఒకటి: జుల్ హులైఫహ్. ఇది మదీనా ప్రజల మీఖాత్. ఇది ప్రజలలో "అబ్యార్ అలీ" అనే పేరుతో ప్రసిద్ధి చెందినది.

రెండవది: అజ్-జుహ్-ఫహ్, ఇది షామ్ (సిరియా, జోర్డాన్, ఫలస్తీనా) ప్రజల కోసం మీఖాత్. అజ్-జుహ్-ఫహ్ ఇప్పుడు ఒక ప్రాచీన గ్రామంగా ఉంది, రాబిగ్ కు సమీపంలో ఉంది. ప్రస్తుతం ప్రజలు రాబిగ్ నుండి ఇహ్రామ్‌ ధరిస్తున్నారు. రాబిగ్, అజ్-జుహ్-ఫహ్ మీఖాతుకు చాలా సమీపంగా ఉండటం వల్ల, అక్కడి నుండి ఇహ్రామ్‌లో ప్రవేశించటం కూడా సరైనదే.

మూడవది: ఖర్నుల్-మనాజిల్, ఇది నజ్ద్ ప్రాంత ప్రజల కోసం మీఖాత్. ఇది నేటి కాలంలో "అస్-సైల్ అల్ కబీర్" అనే పేరుతో ప్రసిద్ధి పొందింది.

నాల్గవది: యలమ్'లమ్, ఇది యెమెన్ ప్రజల కోసం మీఖాత్.

ఐదవది: జాతు ఇర్ఖ్, ఇది ఇరాఖ్ ప్రజల మీఖాత్.

ఈ మీఖాతులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పైన పేర్కొన్న ప్రజల కోసం మరియు, అలాగే వాటిని దాటి వెళ్లే హజ్ లేదా ఉమ్రహ్ చేయాలని సంకల్పించిన వారి కోసం వర్తిస్తాయి.

ఈ మీఖాతులను దాటి వెళ్లే ప్రతి ఒక్కరూ అవి చేరుకునే ముందే ఇహ్రామ్‌లో ప్రవేశించాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. హజ్ లేదా ఉమ్రహ్ చేసేందుకు మక్కా వెళ్ళాలని సంకల్పించిన వారెవరికైనా, ఇహ్రామ్ స్థితిలో కాకుండా ఈ మీఖాతులను దాటడం అనుమతించ బడలేదు. ఇది భూమిపై ప్రయాణించేవారికైనా, ఆకాశ మార్గం (విమాన ప్రయాణం) ద్వారా వెళ్లేవారికైనా ఒకే విధంగా వర్తిస్తుంది, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మీఖాతులను నిర్ణయించినప్పుడు ఇలా అన్నారు: «అవి ఆయా ప్రాంతాల ప్రజల కోసం, మరియు ఆయా మీఖాతులను దాటి వెళ్లే ఇతర ప్రాంతాల వారికి కూడా, హజ్ మరియు ఉమ్రా చేయాలని సంకల్పించిన ప్రతి ఒక్కరికీ [మీఖాతులు] అయినవి.» [32]. [32] అల్ బుఖారీ, హదీథు సంఖ్య (1524) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1181).

విమాన మార్గం ద్వారా మక్కాకు హజ్ లేదా ఉమ్రహ్ కోసం వెళ్లే వ్యక్తి కోసం సున్నత్ పద్ధతి: విమానంలో ఎక్కే ముందు గుసుల్ చేయడం మరియు దానికి సంబంధించిన పరిశుభ్రతను పాటించడం. మీఖాతుకు సమీపంగా వచ్చినప్పుడు ఇహ్రామ్ దుస్తులను (ఇజార్ & రిదా) ధరించి, సమయం ఉంటే ఉమ్రహ్ కోసం "లబ్బైక ఉమ్రహ్ (ఉమ్రహ్ కోసం హాజరయ్యాను)" అనే తలబియ్యా పలకాలి; సమయం తక్కువగా ఉంటే హజ్ కోసం "లబ్బైక హజ్ (హజ్ కోసం హాజరయ్యాను)" అనే తలబియ్యా పలికినా పర్వాలేదు. విమానంలో ఎక్కే ముందే లేదా మీఖాతుకు చేరుకునే ముందే ఇహ్రామ్ దుస్తులు ధరించినా అనుమతించబడింది; అయితే ఇహ్రామ్ నియత్ (నుసుక్‌లో ప్రవేశించడం మీఖాతులో కాకుండా వేరే చోట) చేయకూడదు, తలబియ్యా కూడా పలకకూడదు; ఇవి మీఖాతుకు సమాంతరంగా చేరుకున్నప్పుడు లేదా దానికి దగ్గరైనప్పుడు మాత్రమే చేయాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఇహ్రామ్‌లో ప్రవేశించడం మీఖాత్ వద్దనే చేశారు. కాబట్టి ముస్లింలు ఈ విషయంలోనూ, మత సంబంధమైన ఇతర విషయాల్లోనూ , ఆయనను అనుసరించడం వారి కర్తవ్యం; ఎందుకంటే అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్‌లో ఇలా సెలవిచ్చాడు: వాస్తవానికి, రసూలుల్లాహ్ లో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది... [అహ్జాబ్ 33: 21]. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్జతుల్ వదా సందర్భంగా ఇలా పలికినారు: «మీరు నా నుండి హజ్ ఆచరణలను నేర్చుకోండి»[33]. [33] ముస్లిం, హదీథు సంఖ్య (1297)

మక్కాకు ప్రయాణించే వ్యాపారి, కట్టెలు తెచ్చేవాడు, పోస్ట్ మ్యాన్, కొరియర్ ఉద్యోగి లేదా ఇతర అవసరాల కోసం వెళ్లే వారు, హజ్ లేదా ఉమ్రహ్ చేసేందుకు ఉద్దేశించనట్లయితే, వారు ఇహ్రామ్ ధరించే అవసరం లేదు. అయితే, ఇహ్రామ్‌లో ప్రవేశించాలనుకుంటే, వారికి అనుమతి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ మీఖాతుల గురించి వివరిస్తూ, ఇలా అన్నారు: అవి ఆయా ప్రాంతాల ప్రజల కోసం, మరియు ఆయా మీఖాతులను దాటి వెళ్లే ఇతర ప్రాంతాల వారికి కూడా, హజ్ మరియు ఉమ్రా చేయదలచినవారికి [మీఖాతులు] అయినవి. [34] దీని అర్థం ఏమిటంటే, మీఖాతును దాటే వ్యక్తి హజ్ లేదా ఉమ్రహ్ చేసేందుకు ఉద్దేశించకపోతే, అతను ఇహ్రామ్ ధరించవలసిన అవసరం లేదు. [34] దీని ఉల్లేఖన ముందు వచ్చి ఉన్నది .

మరియు ఇది అల్లాహ్ తన దాసుల పట్ల కనికరంగా, సులభతరంగా ఉంచిన నియమం. కాబట్టి అల్లాహ్‌కు మాత్రమే సకల కృతజ్ఞతలు మరియు ప్రశంసలు శోభిస్తాయి. దీనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణలే మద్దతు నిస్తాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాను ఫతహ్ చేసిన సంవత్సరం (ఫత్హ్-ఎ-మక్కా సమయంలో) ఇహ్రామ్‌లో ప్రవేశించలేదు. అప్పుడు ఆయన తలపై రక్షణ కోసం "మిఘ్ఫర్" (లోహపు టోపీ) ధరించారు. ఆ సమయంలో ఆయన ఉద్దేశ్యం హజ్ లేదా ఉమ్రహ్ చేయడం కాకుండా, మక్కాను విజయవంతంగా స్వాధీనం చేసుకోవడం మరియు అక్కడి షిర్క్‌ను తొలగించడం మాత్రమే అయి ఉండినది.

మీఖాతులకు సమీపంలో నివసించే ప్రజలు (ఉదాహరణకు జిద్దహ్, ఉమ్మెస్సలమ్, బహ్రా, అష్షరాయిఅ, బద్ర్, మస్తూరా మరియు వాటి సమీప ప్రాంతాలు) వారు ఈ ఐదు మీఖాతులలో దేనికీ వెళ్ల వలసిన అవసరం లేదు. ఆ ప్రజల నివాస స్థలమే వారి మీఖాతు. అక్కడి నుండే వారు హజ్ లేదా ఉమ్రహ్ కోసం ఇహ్రామ్‌లో ప్రవేశించవచ్చు. అయితే, వారి నివాస స్థలం మీఖాతు సరిహద్దులోపల, మీఖాతుకు దగ్గరగా ఉంటే, వారి ముందు రెండు అవకాశాలు ఉన్నాయి: దగ్గరలోని మీఖాతు వద్ద ఇహ్రామ్ ధరించాలి. లేదా, తమ నివాస స్థలంలోనే ఇహ్రామ్ ధరించాలి. ఇది ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీథ్‌లో చెప్పిన సాధారణ నియమం ప్రకారం ఉంది. మీఖాతు లోపల ఉన్నవారికి, వారి ఇహ్రామ్ స్థలం ([35]) వారి ఇల్లు. మక్కా ప్రజలు కూడా మక్కా నుండే ఇహ్రాం ధరిస్తారు". ([36]) దీనిని అల్ బుఖారీ, ముస్లిం నమోదు చేసినారు. [35] ఈ హదీథులోని పదం (ఫమహిల్లహు) యొక్క అర్థం: వారు తల్బియా ఉచ్ఛరించే ప్రదేశం, వారు ఇహ్రామ్ ధరించే ప్రదేశం. [36] మునుపటి హదీథులో ఒక భాగం.

కాని ఎవరు హరమ్'లో ఉంటూ ఉమ్రహ్ చేయదలచుకుంటాడో అతను హరమ్ బయటకు (అల్-హిల్ ప్రాంతానికి) వెళ్లి అక్కడ నుండే ఉమ్రహ్ కొరకు ఇహ్రాం కట్టుకోవాలి. ఎందుకంటే హదీథులో ఇలా ఉన్నది: ప్రవక్త ముహమ్మద్ ﷺ ను ఆయిషా (రదియల్లాహు అన్‌హా) ఉమ్రహ్ చేయటానికి అనుమతి కోరినప్పుడు, ఆయన ఆమె సహోదరుడైన అబ్దుర్ రెహ్మాన్‌ను పిలిచి, ఆమెను అల్-హిల్‌కు తీసుకెళ్లమని ఆదేశించారు. అప్పుడు ఆమె అక్కడ నుండే ఇహ్రాం కట్టుకుంది. కాబట్టి, ఇది ఈ విషయాన్ని సూచిస్తోంది: ఉమ్రహ్ చేసేవాడు హరమ్'లో నుండే ఉమ్రహ్ కొరకు ఇహ్రాం కట్టుకోకూడదు, హరమ్ సరిహద్దులకు వెలుపల ఉన్న అల్-హిల్ ప్రాంతం నుండే ఇహ్రాం కట్టుకోవాలి.

ఈ హదీథు అబ్దుల్లా బిన్ అబ్బాస్ యొక్క మునుపటి హదీథును ప్రత్యేకం చేస్తుంది మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త ﷺ యొక్క హదీథును వివరిస్తుంది: ఇక చివరికి, మక్కా ప్రజలు తల్బియాను మక్కాలో నుండే ఉచ్ఛరిస్తారు." ([37]) ఇది ఉమ్రహ్ ఇహ్రామ్ కోసం కాదు, హజ్ కోసం మాత్రమే, ఎందుకంటే ఇహ్రామ్‌ను హరామ్‌ నుండి కట్టడం ఉమ్రహ్ కొరకు అనుమతించబడితే, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హాను అలా అనుమతించేవారు. అల్-హిల్ ప్రాంతానికి వెళ్లమని ఆమెను కష్ట పెట్టేవారు కాదు. మరియు ఇది స్పష్టమైన సాక్ష్యం మరియు ఇది మెజారిటీ పండితుల అభిప్రాయం, అలాగే ఇది మోమిన్‌కు (ఇమాన్ కలిగినవానికి) మరింతగా జాగ్రత్త పడే మార్గం. ఎందుకంటే, దీని వలన రెండు హదీథులను కలిపి అమలు చేయడం సాధ్యమవుతుంది. మరియు అల్లాహ్ యే భాగ్యమును కలిగించేవాడు. [37] దీని ఉల్లేఖనం ముందు వచ్చి ఉన్నది .

కానీ, కొంతమంది ప్రజలు ఇప్పటికే హజ్జ్‌కు ముందు ఒకసారి ఉమ్రహ్ చేసి ఉన్నా కూడా, హజ్జ్ తర్వాత తన్ఇమ్ లేదా జయిర్రానా లేదా ఇతర ప్రదేశాల నుంచి మరికొన్ని ఉమ్రహ్ లు చేసేందుకు అధికంగా ప్రయత్నించడం గురించి షరీయత్ ప్రకారం సమర్థించబడినదని నిర్ధారించే ఎలాంటి ఆధారాలు లేవు. అంతేకాక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) హజ్జ్ పూర్తయ్యాక (వెంటనే అదే ప్రయాణంలో) మరో ఉమ్రహ్ చేయలేదు. ఆయిషా (రదియల్లాహు అన్హా) మాత్రమే తన్ఇమ్ నుండి ఉమ్రహ్ చేసారు, ఎందుకంటే ఆమె మక్కాలో ప్రవేశించేటప్పుడు ఋతుస్రావం కారణంగా ఉమ్రహ్ చేయలేకపోయారు. అందుకే, ఆమె తాను ముందు చేసిన ఉమ్రహ్ కు బదులుగా మరొక ఉమ్రహ్ చేయటానికి అనుమతించమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అభ్యర్థించగా, దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంగీకరించారు. దీంతో, ఆమెకు రెండు ఉమ్రహ్ లు లభించాయి: హజ్జ్‌లోని ఉమ్రహ్, ప్రత్యేకంగా మరలా చేసిన ఉమ్రహ్. కాబట్టి, ఎవరికైనా ఆయిషా (రదియల్లాహు అన్హా) పరిస్థితిలో ఉంటే, హజ్జ్ పూర్తయ్యాక మరో ఉమ్రహ్ చేయడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. ఇది అన్ని హదీథులను అనుసరించడం మరియు ముస్లింలకు సౌలభ్యం కల్పించడం అవుతుంది.

హజ్జ్ పూర్తి చేసిన తరువాత, మక్కాలో ప్రవేశించినపుడు చేసిన ఉమ్రహ్ కాకుండా మరొక ఉమ్రహ్ చేయడంలో హాజీలు నిమగ్నం కావడం నిస్సందేహంగా అందరికీ కష్టం కలిగించేది అవుతుంది. ఇది అధిక జనసమ్మర్దాన్ని, అపశ్రుతులను పెంచుతుంది. అలాగే, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకతకు మరియు ఆయన సున్నతుకు విరుద్ధంగా ఉంటుంది. అల్లాహ్ మాత్రమే భాగ్యమును కలిగిస్తాడు.

అధ్యాయం

హజ్ నెలలు కాకుండా ఇతర సమయాలలో మీఖాతుకు చేరుకున్న వారి నియమం గురించి (వివరణ):

తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, (హజ్ నెలలో కాకుండా వేరే సమయాలలో) మీఖాతుకు చేరుకునేవారు రెండు పరిస్థితులలో ఏదో ఒక దానిలో ఉంటారు:

హజ్జ్ మాసాలలో కాకుండా (ఉదాహరణకు, రమదాన్ లేదా షఅబాన్) ఇతర సమయాలలో మీఖాతుకు చేరుకోవడం. ఇలాంటి పరిస్థితిలో, సున్నతు ఏమిటంటే, ఇహ్రామ్ ధరించి ఉమ్రహ్ నియత్ చేసుకోవడం. అతను హృదయంలో ఉమ్రహ్ సంకల్పం చేసుకుని, తన నాలుకతో (లబ్బైక ఉమ్రతన్ - ఉమ్రహ్ కోసం హాజరయ్యాను) లేదా (అల్లాహుమ్మ లబ్బైక ఉమ్రతన్ - ఓ అల్లాహ్ ఉమ్రహ్ కోసం హాజరయ్యాను) అని పలకాలి. అనంతరం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన విధంగా ఇలా తల్బియా పలకాలి: «లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వన్నీమత లక వల్ ముల్క్, లా షరీక లక (ఓ అల్లాహ్, నేను హాజరయ్యాను, నేను నీ పిలుపుకు హాజరయ్యాను. నేను ఇక్కడ హాజరయ్యాను, నీకు భాగస్వాములు ఎవ్వరూ లేరు, నేను నీ పిలుపుకు హాజరయ్యాను. నిశ్చయంగా, సకల స్తోత్రములు, అనుగ్రహాలు మరియు ఆధిపత్యం నీకే చెందును. నీకు భాగస్వాములు ఎవరూ లేరు).» [38]. అతను ఈ తల్బియాను ఎక్కువగా పఠించాలి మరియు అల్లాహ్‌ను ఎక్కువగా స్మరించాలి, అలాగే కాబాగృహం వైపు ప్రయాణించాలి. కాబాగృహం చేరుకున్న తరువాత, తల్బియా పఠించడం ఆపివేయాలి. తర్వాత, కాబాగృహం చుట్టూ ఏడుసార్లు తవాఫ్ చేయాలి, తరువాత మఖామె ఇబ్రాహీం వెనుక రెండు రకాతులు నమాజు చదవాలి. ఆపై, సఫా వద్దకు వెళ్లి, సఫా మరియు మర్వా మధ్య ఏడుసార్లు సయీ చేయాలి. అనంతరం, తల పూర్తిగా ముండించాలి, లేదా తలవెంట్రుకలు చిన్నగా కత్తిరించాలి. ఇంత వరకు ఇహ్రామ్ స్థితిలో అతనిపై ఉన్న నిషిద్ధమైన ప్రతి విషయం ఇప్పుడు అతని కొరకు హలాల్ అవుతుంది, దీనితో అతని ఉమ్రహ్ పూర్తవుతుంది. [38] అల్ బుఖారీ, హదీథు సంఖ్య (1549); ముస్లిం, హదీథు సంఖ్య (1184) లో నమోదు చేసినారు.

రెండవది: అతను హజ్జ్ నెలల్లో మీఖాతుకు చేరుకోవడం. హజ్జ్ నెలలు అంటే షవ్వాల్, దిల్ ఖాయిదహ్, దిల్ హిజ్జ్ తొలి పది రోజులు.

ఇలాంటి వ్యక్తి ముందు మూడు మార్గాలు ఉంటాయి - కేవలం హజ్జ్ చేయడం (ఇఫ్రాద్). కేవలం ఉమ్రహ్ చేయడం (ముతమ్మత్తీ). హజ్జ్ మరియు ఉమ్రహ్ రెండింటినీ కలిపి చేయడం (ఖిరాన్). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన వీడ్కోలు హజ్జ్ (హజ్జత్ అల్ వదా) సమయంలో, దిల్ ఖాయిదహ్ నెలలో మీఖాతుకు చేరుకున్నప్పుడు, తన సహాబాలను ఈ మూడింటిలో  ఏదైనా ఒకటి ఎంచుకోవడానికి వీలు కల్పించారు. అయితే, తనతో పాటు హదీ (ఖుర్బానీ పశువు) లేని వారి కొరకు సున్నతు ఏమిటంటే, ఉమ్రహ్ మాత్రమే చేయడం. అతను హజ్జ్ మాసాల్లో కాకుండా (ఇతర సమయాలలో) మీఖాతుకు చేరుకున్నవారి విషయంలో చెప్పిన విధంగానే ఉమ్రహ్ చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా చేరుకునే సమయానికి, తన సహాబాలకు ఇహ్రామ్‌ను ఉమ్రహ్ గా మార్చమని ఆదేశించారు, మక్కాలో కూడా దీనిపై బలంగా బోధించినారు. అందువలన, వారు తవాఫ్ చేసి, సయీ చేసి, తల వెంట్రుకలు కత్తిరించుకుని లేదా ముండించి ఇహ్రామ్ నుంచి బయటపడ్డారు. అయితే, హదీ (ఖుర్బానీ పశువు) కలిగి ఉన్నవారు తమ ఇహ్రామ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది, మరియు యౌము న్నహర్ (దిల్ హిజ్జా 10వ రోజు) వరకు ఇహ్రాం స్థితి నుండి ముక్తి పొందకూడదు. హదీ (ఖుర్బానీ పశువు) తీసుకెళ్తున్నవారు హజ్జ్ మరియు ఉమ్రహ్ రెండింటికి కలిపి ఒకే ఇహ్రామ్ నియ్యత్ చేసుకోవడం సున్నత్. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలానే చేసినారు. ఆయన హదీ తీసుకెళ్లినందున హజ్జ్, ఉమ్రహ్ కలిపి చేయాలనే సంకల్పం చేసుకున్నారు. అదే విధంగా, ఆయన సహాబాలలో హదీ తీసుకువచ్చిన వారికి ఉమ్రహ్ మాత్రమే చేయాలని మొదట సంకల్పం చేసుకున్నా, తర్వాత హజ్జ్ కూడా కలిపి లబ్బైక్ పలకమని ఆదేశించారు. అతను యౌమున్నహర్ (దిల్ హిజ్జా 10వ రోజు) వరకు ఇహ్రామ్‌లో ఉండాలి. హదీ తీసుకెళ్లిన వ్యక్తి కేవలం హజ్జ్ కోసం ఇహ్రామ్ ధరించి ఉంటే, అతను కూడా యౌము అన్నహర్ వరకు ఇహ్రామ్‌లోనే ఉండాలి, ఉమ్రహ్ చేసిన వారి మాదిరిగా మధ్యలో తహల్లుల్ (ఇహ్రామ్ నుంచి బయటపడటం) చేయలేడు. ఇది ఖిరాన్ (హజ్జ్, ఉమ్రహ్ రెండింటి కొరకు నియ్యత్) చేసిన వ్యక్తి హుకుమ్ మాదిరిగానే ఉంటుంది.

ఈ వర్ణన నుండి, హజ్ కోసం లేదా హజ్ మరియు ఉమ్రహ్ రెండింటిలో ఒకదాని కొరకు మాత్రమే ఇహ్రామ్ వేసుకున్న వ్యక్తి తన ఇహ్రామ్‌లో కొనసాగడం తగినది కాదని తెలుస్తుంది, అయితే తనకి అనుకూలంగా ఉన్న సున్నత్ ఉమ్రహ్ కోసం తాను ఇహ్రామ్ స్థితిలో ప్రవేశించడం మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞాపించినట్లుగా, తన వెంట్రుకలు కత్తిరించడం ద్వారా హలాల్ కావడం (చట్టబద్ధత పొందడం) జరుగుతుంది. అయితే, ఒక వ్యక్తి చివరి దశలో వచ్చి హజ్‌ను కోల్పోయే ప్రమాదంలో ఉన్నట్లయితే, అతను మునుపటి ఇహ్రామ్‌లోనే కొనసాగటానికి ఎటువంటి అభ్యంతరం లేదు - అల్లాహ్ యే అన్నీ ఎరిగినవాడు.

మరియు ఇహ్రాం ధరించిన వ్యక్తి తన హజ్ లేదా ఉమ్రహ్ పూర్తి చేయలేనని భయపడితే, అనగా, అతను అనారోగ్యంతో ఉన్నా లేదా శత్రువు భయంతో లేదా ఇతర కారణాల వల్ల అడ్డంకులను ఎదుర్కొంటున్నా, అతను ఇహ్రాం ధరించినప్పుడు ఇలా పలకడం సముచితం: «పరిస్థితులు నన్ను అడ్డుకుంటే, నేను అడ్డుకోబడిన చోటనే నా ఇహ్రాం ముగుస్తుంది» అని. దుబాఅ బింతె అల్-జుబైర్ రదియల్లాహు అన్హా పేర్కొన్న హదీథు ఆధారంగా ఇది సూచించబడింది. ఆమె ఇలా ఉల్లేఖించినారు: 'ఓ రసూలల్లాహ్! నేను హజ్ చేయాలని అనుకుంటున్నాను, కానీ నేను అనారోగ్యంతో ఉన్నాను.' ఈ విషయంపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: హజ్ చేయి, మరియు ఈ షరతు పెట్టుకో: 'నాకు ఏదైనా విఘ్నం కలిగితే, నేను అక్కడే ఇహ్రామ్ నుంచి విడుదలవుతాను.' [39] ముత్తఫిఖున్ అలైహి [39] అల్ బుఖారీ (హదీథు సంఖ్య: 5089) మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 1207) నమోదు చేసినారు.

ఈ షరతు (నియమం) యొక్క ప్రయోజనం ఏమిటంటే, ఇహ్రాం ధరించిన వ్యక్తి తన హజ్ లేదా ఉమ్రాహ్ ను పూర్తిచేయడంలో అడ్డంకులు ఎదుర్కొంటే—అనారోగ్యం లేదా శత్రువు అడ్డగించడం వంటి వాటి వలన — అతడు ఇహ్రాం నుంచి విడుదల కావచ్చు, మరియు అతనిపై ఏ విధమైన ఫిద్యా (ప్రాయశ్చిత్తం, పరిహారం) ఉండదు.

అధ్యాయం

)చిన్న పిల్లల హజ్ గురించిన ఆదేశం విషయంలో - వారి హజ్( తప్పనిసరి) ఫర్ద్ హజ్ కు సరిపోతుందా?

+బాలుడు లేదా బాలిక హజ్ చేయడం సరిగానే ఉంటుంది. సహీహ్ ముస్లింలో వచ్చినట్లుగా, ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హుమా నుండి ఉల్లేఖించబడిన హదీథు ప్రకారం, ఒక స్త్రీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ఓ రసూలల్లాహ్! ఈ చిన్న పిల్లవాడి కొరకు హజ్ ఉన్నదా (హజ్ పుణ్యాలు లభిస్తాయా)? అని అడిగింది. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం: «అవును, మరియు నీకు ప్రతిఫలం  లభిస్తుంది» [40]. [40] ముస్లిం, హదీథు సంఖ్య (1336)

సహీహ్ బుఖారీలో, అస్సాయిబ్ బిన్ యజీద్ రదియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించబడిన హదీథులో, ఆయన ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు నా హజ్జ్ చేయించబడింది, అప్పుడు నా వయస్సు ఏడు సంవత్సరాలు" [41]. కానీ ఈ హజ్ వారికి ఇస్లామీయ హజ్ (తప్పనిసరి హజ్) స్థానంలో సరిపోదు. [41] అల్ బుఖారీ, హదీథు సంఖ్య (1858)

ఇదే విధంగా బానిసగా ఉన్న వ్యక్తి మరియు బానిసరాలుగా ఉన్న మహిళ కూడా హజ్ చేయగలరు, కానీ ఇది ఇస్లామీయ ఫర్ద్ హజ్‌కు బదులుగా సరిపోదు. దీనికి ప్రామాణికంగా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా నుండి నమోదు చేయబడిన హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పేర్కొన్నారు: ఏ చిన్నారి హజ్ చేసినా, తర్వాత యుక్త వయస్సుకు చేరుకున్న తర్వాత అతనిపై మరొక హజ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అలాగే, ఏ బానిస హజ్ చేసినా, అతను విముక్తుడైన తర్వాత అతనిపై మరొక హజ్ తప్పనిసరిగా ఉంటుంది ([42]). దీనిని ఇబ్ను అబీ షైబా మరియు బైహఖీ హసన్ సనదుతో నమోదు చేసినారు. [42] దీనిని ఇబ్ను అబీ షైబా (జిల్ద్ 4, పుట 444) లో నమోదు చేసినారు.

తరువాత, బాలుడు మంచి చెడు గ్రహించే వయస్సు కంటే తక్కువ వయస్సులో ఉంటే, అతడి తరుఫున అతడి సంరక్షకుడు ఇహ్రామ్‌ కు నియత్ చేస్తాడు, అతడికి ఇహ్రామ్ తొడిగించి, అతడి తరఫున తల్బియా పలుకుతాడు. అప్పుడు ఆ బాలుడు ముహ్రిమ్‌గా మారి పోతాడు, పెద్ద ముహ్రిమ్‌కు నిషిద్ధమైనవే అతడికి కూడా నిషిద్ధంగా ఉంటాయి. ఇదే విధంగా, వివేకం లేని వయస్సులో ఉన్న బాలికకు కూడా ఆమె సంరక్షకుడు ఇహ్రామ్‌కు నియత్ చేసి, ఆమె తరఫున తల్బియా పలుకుతాడు. ఆమె కూడా ముహ్రిమ్‌గా మారుతుంది మరియు పెద్ద ముహ్రిమాకు నిషిద్ధమైనవే ఆమెకు కూడా నిషిద్ధంగా ఉంటాయి. అలాగే, తవాఫ్ సమయంలో వారి దుస్తులు మరియు శరీరాలు పవిత్రంగా ఉండాలి జాగ్రత్త వహించాలి, ఎందుకంటే తవాఫ్ నమాజ్‌ను పోలి ఉంటుంది, మరియు నమాజ్‌కు తహారత్ (పరిశుద్ధత) అవసరమైనట్లుగా, తవాఫ్‌కి కూడా అవసరం.

మరియు ఆ బాలుడు లేదా బాలిక వివేకం కలిగి ఉండే వయస్సులో ఉంటే, వారు తమ సంరక్షకుడి అనుమతితో ఇహ్రామ్ ధరించాలి. ఇహ్రామ్‌లోకి ప్రవేశించేప్పుడు పెద్దవారు చేసేలా వారు కూడా గుసుల్ చేయాలి, సువాసనలు ఉపయోగించుకోవాలి మరియు ఇతర తయారీ చర్యలు తీసుకోవాలి. వారి సంరక్షకుడు వారి వ్యవహారాలను పర్యవేక్షించాలి, ఇది వారి తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు లేదా మరెవరైనా కావొచ్చు. చిన్నారులు చేయలేని పనులను వారి సంరక్షకుడు వారి తరఫున పూర్తి చేయాలి, ఉదాహరణకు జమరాత్ వద్ద రాళ్లు కొట్టటం వంటి పనులు. అయితే, వారు స్వయంగా చేయగలిగే ఇతర మనాసిక్ లను (హజ్ కర్మలను) తామే చేయాలి, ఉదాహరణకు అరఫాలో నిలబడడం, మీనా మరియు ముజ్దలిఫాలో రాత్రి గడపడం, తవాఫ్ చేయడం, మరియు సఫా-మర్వాలో సయీ చేయడం. ఒకవేళ వారు తవాఫ్ చేయలేకపోతే, లేదా సయీ చేయలేకపోతే, వారిని ఎత్తుకుని తవాఫ్ చేయించాలి మరియు సయీ చేయించాలి. వారిని మోసే వ్యక్తి తన తవాఫ్ మరియు సయీని వారితో కలిపి చేయకుండా ఉండడం ఉత్తమం. అతను వారి కోసం ప్రత్యేకంగా తవాఫ్ మరియు సయీ చేసే విధంగా నియత్ చేయాలి. తర్వాత, తన కోసం ప్రత్యేకంగా తవాఫ్ చేసి, సయీ చేయాలి. దీనికి రెండు కారణాలు ఉన్నాయి: ఆరాధనలో (ఇరువురి హజ్ ఆమోదించబడేలా) జాగ్రత్తగా ఉండటానికి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీథును అనుసరించడానికి: «సందేహాస్పద విషయాలను వదిలి నమ్మకంగలిగిన విషయాల వైపుకి మరలండి» [43]. ఒకవేళ వారిని మోసే వ్యక్తి తాను చేసే తవాఫ్‌ను తన కోసం మరియు వారి కోసం అని నియత్ చేసుకుంటే, అది సరిపోతుంది అనే అభిప్రాయం అత్యంత బలమైనదిగా చెప్పబడింది. ఎందుకంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మహిళ తన చిన్న పిల్లవాడి హజ్జ్ గురించి అడిగినప్పుడు, అతని కోసం ప్రత్యేకంగా తవాఫ్ చేయమని ఆదేశించలేదు. ఒకవేళ అదే తప్పనిసరి అయితే, తప్పకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని గురించి తప్పకుండా స్పష్టంగా చెప్పి ఉండేవారు. మరియు అల్లాహ్ అనుగ్రహించేవాడు. [43] తిర్మిథీ, హదీథు సంఖ్య (2518).

తార్కికంగా గుర్తుపట్టగలిగే వయస్సులో ఉన్న బాలుడు లేదా బాలిక తవాఫ్ ప్రారంభించే ముందు హదత్ (అపవిత్రత) మరియు నజాసత్ (అశుద్ధత) నుంచి శుద్ధి చేసుకోవాలి, ఇహ్రామ్‌లో ఉన్న పెద్దవారి కొరకు ఉన్న నియమం మాదిరిగానే. అయితే, చిన్న బాలుడు లేదా బాలిక కోసం ఇహ్రామ్ ధరింపజేయడం వారి సంరక్షకుడికి తప్పనిసరి కాదు. ఇది ఐచ్చికమైన (నఫిల్) అమలుగా ఉంటుంది. ఇహ్రామ్ ధరింపజేస్తే, సంరక్షకుడికి పుణ్యం లభిస్తుంది. ఒకవేళ అలా చేయకపోతే, ఎటువంటి తప్పు లేదు. అల్లాహ్ మాత్రమే సమస్త జ్ఞానము కలిగినవాడు.

అధ్యాయం

మహ్జూరాత్-ఎ-ఇహ్రామ్; ఇహ్రామ్‌లో నిషేధించబడిన పనుల మరియు అనుమతించబడిన పనుల వివరణ:

ఇహ్రామ్ సంకల్పం చేసిన తర్వాత, పురుషుడైనా  స్త్రీ అయినా, తన జుట్టు లేదా గోర్లు కత్తిరించుకోవడం లేదా ఇహ్రాం వస్త్రాలకు సుగంధ పరిమళం పూయడం అనుమతించబడలేదు.

ప్రత్యేకంగా పురుషుడు ఇహ్రామ్‌లో ఉన్నప్పుడు కుట్టిన బట్టలు ధరించకూడదు, అంటే: శరీరాన్ని పూర్తిగా కప్పేలా కుట్టిన దుస్తులు, ఉదాహరణకు: కమీజ్ (చొక్కా), టీ షర్టు లేదా శరీరంలోని కొంతభాగాన్ని కప్పే కుట్టిన దుస్తులు, ఉదాహరణకు: అంగి (వెస్టు) పంచె, సాక్సులు, మోజాలు, అండర్ వేర్. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతి ఉంది: ఒకవేళ ఇజార్ (క్రింది వస్త్రం) లభించకపోతే, షల్వార్ (పాజామా) ధరించవచ్చు. ఒకవేళ చెప్పులు (నాలైన్) లభించకపోతే, మేజోల్లు కత్తిరించకుండా ధరించవచ్చు. దీనికి ఆధారము - ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా నుండి సహీహ్ బుఖారి మరియు సహీహ్ ముస్లింలో నమోదు చేయబడిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీథు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: «చెప్పులు లేనివారు మేజోల్లు ధరించండీ, క్రింది వస్త్రము లేనివారు పాజామా లను ధరించండీ» [44]. [44] అల్ బుఖారీ, హదీథు సంఖ్య (1841) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1179).

ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాలైన్ (చెప్పులు) లభించనప్పుడు మేజోళ్లు (ఖుఫ్ఫైన్) ధరించాల్సిన అవసరం ఉంటే, వాటిని కత్తిరించి ధరించాలని ఇచ్చిన ఆదేశం రద్దయింది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మదీనాలో ముహ్రిమ్ ఏ వస్త్రాలు ధరించవచ్చు అని ప్రశ్నించగా, అప్పుడు ఈ ఆదేశాన్ని ఇచ్చారు. అనంతరం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అరఫాత్‌లో ప్రజలకు ఖుత్బా ఇస్తూ నాలైన్ లేనప్పుడు మేజోల్లు ధరించడానికి అనుమతిచ్చారు, అయితే అవి కత్తిరించమని ఆజ్ఞాపించలేదు. మదీనాలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జవాబును వినని వారు కూడా ఆ అరఫాత్ ఖుత్బాలో హాజరయ్యారు, అత్యవసర సమయంలో వివరణను ఆలస్యంగా ఇవ్వటం సమ్మతం కాదు, ఇది ఉసూలె హదీథు మరియు ఉసూలె ఫిఖ్ (సూత్రాలు)ల నియమం. కాబట్టి మేజోల్లు కత్తిరించే ఆదేశం రద్దు అయ్యిందని తేలింది, ఒకవేళ అది తప్పనిసరి హుకుమై (ఫరద్) ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాన్ని స్పష్టంగా చెప్పేవారు. అల్లాహ్ యే అన్నీ ఎరిగినవాడు.

ఇహ్రామ్‌లో ఉన్న వ్యక్తి మడమల కంటే పైకి వెళ్లని మేజోళ్లు (ఖుఫ్ఫ్) ధరించవచ్చు, ఎందుకంటే అవి నాలైన్ (చెప్పుల) వర్గానికి చెందుతాయి.

ఇహ్రామ్‌లో ఉన్న వ్యక్తి తన ఇజార్ ను (క్రింది వస్త్రాన్ని)  గాఠం, ముడి వేయడం లేదా దారంతో కట్టడం అనుమతించబడింది, ఎందుకంటే దీనిని నిషేధించినట్లు ఎలాంటి ప్రామాణిక ఆధారం (దలీల్) లేదు.

ఇహ్రామ్‌లో ఉన్న వ్యక్తి స్నానం చేయడం, తల శుభ్రం చేయడం, తల నురగలతో మర్దన చేయడం అనుమతించబడింది, ఇది ఆవశ్యకత ఉన్నప్పుడు మృదువుగా, జాగ్రత్తగా చేయాలి. ఈ సమయంలో తల నుండి కొన్ని వెంట్రుకలు పడిపోతే, అతనిపై ఎటువంటి పాపం లేదు.

ఇహ్రామ్‌లో ఉన్న స్త్రీ తన ముఖానికి కుట్టిన వస్త్రాన్ని ధరించకూడదు, ఉదాహరణకు: నిఖాబ్ (ముఖాన్ని కప్పే వస్త్రాలు), ముఖాన్ని కూడా కప్పివేసే బురఖా. అలాగే, తన చేతులకు కూడా కుట్టిన వస్త్రాలను కూడా ధరించకూడదు, ఉదాహరణకు: గ్లౌజులు (ఖిఫాజ్). దీనికి ఆధారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీథు: ఇహ్రామ్‌లో ఉన్న స్త్రీ నిఖాబ్ (ముఖానికి కప్పుకునే వస్త్రం) ధరించకూడదు. గ్లౌజులు (ఖిఫాజ్) ధరించకూడదు. [45] దీనిని ఇమామ్ బుఖారీ నమోదు చేసినారు. మరియు అల్-ఖుఫ్ఫాజాని అంటే చేతులకు సరిపోయే విధంగా సూదితో కుట్టబడిన లేదా నేయబడినది, ఇది ఉన్ని, పత్తి లేదా ఇతర వాటితో తయారు చేయబడుతుంది. [45] బుఖారీ, హదీథు సంఖ్య (1838)

స్త్రీ కొరకు కుట్టిన వస్త్రాలలో ఇతర వస్త్రాలు మినహాయించి ఈ క్రింద పేర్కొన్నవి అనుమతించ బడినాయి — ఉదాహరణకు: చొక్కాలు, ప్యాంటు, తోలు సాక్స్, సాధారణ సాక్స్ మొదలైనవి ధరించడానికి అనుమతి ఉంది.

మరియు అలాగే, ఆమె కొరకు అవసరం వచ్చినప్పుడు ముఖంపై వస్త్రం కప్పుకోవడం అనుమతించబడింది, అయితే తలపై బిగించి కట్టుకోకుండా ఉండాలి. ఆ వస్త్రము ముఖాన్ని తాకినా కూడా ఆమెపై ఎలాంటి దోషం లేదు ; దీనికి ఆయిషా (రదియల్లాహు అన్హా) హదీథు ఆధారంగా ఉంది. ఆమె ఇలా తెలిపారు : మేము దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇహ్రామ్‌లో ఉన్నాము, ఆ సమయంలో ప్రయాణికులు (అశ్వారోహకులు) మా ప్రక్క నుండి వెళ్లేవారు. వారు మా సమీపానికి రాగానే మేము తలపై నుండి ముఖంపై జిల్బాబ్‌ వస్త్రాన్ని జారవిడిచేవారము. వారు మమ్మల్ని దాటిపోయిన తర్వాత మేము తిరిగి ముఖాన్ని బయటపెట్టేవారం. దీనిని అబూదావుద్, ఇబ్నె మాజహ్ నమోదు చేసినారు మరియు దారుల్ ఖుత్నీ కూడా ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) నుండి ఇదే విధంగా నమోదు చేసినారు. [46] అబూ దావుద్, హదీథు సంఖ్య (1833).

అదే విధంగా, ఆమె చేతులను తన వస్త్రంతో లేదా ఇతర వస్త్రంతో కప్పుకోవడంలో ఏ హాని లేదు. అయితే, ఆమె పరాయి పురుషుల సమక్షంలో ఉంటే, తప్పక తన ముఖాన్ని మరియు చేతులను కప్పుకోవాలి, ఎందుకంటే అవి పరదాలో భాగంగా పరిగణించబడతాయి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: మరియు వారి అలంకరణను ప్రదర్శించవద్దని చెప్పు - తమ భర్తల ముందు తప్ప. [అన్-నూర్ 24:31] ముఖం మరియు చేతులు గొప్ప, ఆకర్షణీయమైన అలంకారాలలో ఒకటి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ముఖం - ఈ విషయంలో మరింత ముఖ్యమైనది మరియు గొప్పది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ...మరియు మీరు ప్రవక్త భార్యలతో ఏదైనా అడగ వలసి వచ్చినప్పుడు తెరచాటు నుండి అడగండి. ఇది మీ హృదయాలను మరియు వారి హృదయాలను కూడా నిర్మలంగా ఉంచుతుంది... [అల్ అహ్జాబ్ 33:53]

మరియు చాలామంది మహిళకు తమ ముఖం నుండి ముసుగును తీసివేయడానికి ఖిమార్ (ముసుగు) కింద ఒక కట్టు కట్టుకునే అలవాటు ఉన్నది, దాని గురించి మనకు తెలిసినంతవరకు షరిఅతులో ఎటువంటి ఆధారం లేదు. ఇది చట్టబద్ధమైనది అయి ఉంటే, రసూలల్లాహ్ (ﷺ) తన సమాజానికి దానిని స్పష్టం చేసి ఉండేవారు మరియు దాని గురించి ఆయన మౌనంగా ఉండటం అంటే అది అనుమతించబడలేదు.

ఇహ్రామ్‌లో ఉన్న పురుషులు మరియు స్త్రీలు తమ ఇహ్రామ్ దుస్తులను మురికి లేదా ఇతర అశుద్ధతల నుండి శుభ్రపరచుకోవచ్చు. మరియు వాటిని వేరే శుభ్రమైన ఇహ్రామ్ దుస్తులతో మార్చుకోవటం కూడా వారికి సమ్మతమే.

ఇహ్రామ్‌లో ఉన్న వ్యక్తి జాఫ్రాన్ (కుంకుమపువ్వు) లేదా వరస్ (ఒక రకమైన వాసన గల రంగు పదార్థం) తాకిన దుస్తులు ధరించకూడదు. దీనిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన హదీథులో వారించారు.

ఇహ్రామ్‌లో ఉన్న వ్యక్తి రఫత్ (అశ్లీల మాటలు), ఫుసూక్ (పాపకార్యాలు), మరియు జిదాల్ (వివాదాలు, కలహాలు) విడిచిపెట్టటం తప్పనిసరి. ఎందుకంటే మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: హజ్జ్ నియమిత నెలలోనే జరుగుతుంది. ఈ నిర్ణీత మాసాలలో హజ్జ్ చేయటానికి సంకల్పించిన వ్యక్తి హజ్జ్ (ఇహ్రామ్)లో వున్న సమయంలో (భార్యతో) రతిక్రీడ (రఫస్)కు, దుష్టకార్యాలకు మరియు కలహాలకు దూరంగా ఉండాలి... [అల్ బఖర 2:197]

దీనిని ధృవీకరిస్తూ, ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా సెలవిచ్చారు: ఎవరైతే తన హజ్జ్‌యాత్రను అశ్లీల పనులకు మరియు పాపకర్మలకు దూరంగా ఉంటూ పూర్తి చేస్తారో అతను తన తల్లి ప్రసవించిన రోజు మాదిరిగా (పవిత్రమైన స్థితిలో) మరలుతాడు. [47] రఫస్: సంభోగమును సూచిస్తుంది. అలాగే అశ్లీల మాటలు మరియు చెడు పనులను కూడా దీనితో సూచిస్తారు. ఫుసూక్: పాపకార్యాలను, అల్లాహ్‌ కు అవిధేయతను సూచిస్తుంది. జిదాల్: అనవసరమైన, అసత్యమైన విషయాల్లో తర్కించడం లేదా ప్రయోజనం లేని వాదనలు. అయితే, హక్కును స్పష్టంగా చెప్పడం, తప్పుడు విషయాలను ఖండించడం కోసం మృదువైన వాదన చేయడం అనుమతించబడింది. ఖచ్చితంగా, ఇది అవసరమైనప్పుడు చేయాల్సిన ఒక విధి. అల్లాహ్ వాక్కు: (ప్రజలను) వివేకంతోనూ, మంచి ఉపదేశం (ప్రచారం) తోనూ నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు. మరియు వారితో ఉత్తమరీతిలో వాదించు... [అన్-నహల్ 16:125] [47] దీనిని బుఖారీ, అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన నుండి హదీథు సంఖ్య (1521), ముస్లిం, హదీథు సంఖ్య (1350) నమోదు చేసినారు.

ఇహ్రామ్‌లో ఉన్న పురుషుడికి తన తలను ముడిపెట్టిన వస్త్రంతో కప్పడం హరామ్. ఉదాహరణకు: టోపీ, గుత్రహ్, పాగా (అమామా) లేదా ఇలాంటి ఇతర వస్త్రాలు. అలాగే తన ముఖాన్ని కప్పుకోవడం కూడా హరామ్. దీనికి కారణం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అరఫా రోజు తన సవారీ మీద నుండి కిందపడి మరణించిన వ్యక్తి గురించి ఇలా పేర్కొన్నారు: అతనికి రేగుఆకుల నీటితో గుసుల్ చేయించండి, రెండు వస్త్రాలలో అతనికి కఫన్ ఇవ్వండి, తలపై వస్త్రం కప్పకండి, అతని ముఖమును కప్పకండి, రేపు ప్రళయ దినాన అతను లబ్బైక్ అంటూ లేస్తాడు. ([48]) అల్ బుఖారీ మరియు ముస్లిం హదీథు గ్రంథాలు, ముస్లిం గ్రంథంలోని పదాలతో. [48] అల్ బుఖారీ, హదీథు సంఖ్య (1521) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1350).

టెంట్ లేదా చెట్టు వలె కారు పైకప్పు లేదా గొడుగు నుండి నీడను పొందడంలో ఎటువంటి దోషం లేదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జమ్రతుల్ అఖ్బాలో రమీ చేస్తున్నప్పుడు ఒక గుడ్డతో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంపై  నీడనిచ్చారని సహీహ్ హదీథుల ద్వారా రుజువు చేయబడింది. మరియు నిమ్రహ్ ప్రదేశంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కోసం ఒక గుడారం ఏర్పాటు చేయబడిందని, ఆయన అరఫా రోజున సూర్యాస్తమయం వరకు దానిలో కూర్చున్నారు అని ప్రామాణికమైన హదీథుల నుండి కూడా నిరూపించబడింది.

అడవి జంతువులను శికారు చేసి చంపడం, వాటిని చంపడంలో సహకరించడం, వాటిని వాటి నివాస స్థలాల నుండి తరిమివేయడం, వివాహ ఒప్పందం చేసుకోవడం, సంభోగం చేయడం, పెళ్లి కోసం మహిళలతో మాట్లాడటం (వివాహ ప్రతిపాదన పెట్టడం), మరియు శృంగారాశయంతో వారిని స్పృశించడం ఇహ్రామ్‌లో ఉన్న పురుషులు మరియు మహిళల కొరకు నిషిద్ధం. ఉస్మాన్ రదియల్లాహు అన్హు యొక్క హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఇహ్రాం ధరించిన వ్యక్తి వివాహం చేసుకోకూడదు, వివాహం చేయకూడదు లేదా వివాహ సందేశం ఇవ్వకూడదు." [49] దీనిని ముస్లిం నమోదు చేసినారు. [49] ముస్లిం, హదీథు సంఖ్య (1409).

ఇహ్రామ్‌లో ఉన్న వ్యక్తి మర్చిపోయి లేదా తెలియక కుట్టిన దుస్తులు ధరించినా, తలపై కప్పుకున్నా, అత్తర్ వాడినా — అతనిపై ఎటువంటి ఫిద్యా లేదు. ఇది గుర్తుకు వచ్చిన వెంటనే లేదా తెలిసిన వెంటనే వాటిని తొలగించాలి. అలాగే ఎవడు తన తలని గొరిగించుకున్నా, జుట్టు తీసేసుకున్నా, గోళ్లను కత్తిరించుకున్నా — తాను మర్చిపోయిన వాడైతే లేదా తెలియక చేసిన వాడైతే అతనిపై ఏ దోషమూ లేదు అనడం సరైన అభిప్రాయం.

హరమ్ ప్రదేశంలో జంతు వేట చేయడం, ఆయుధంతో అయినా, సంకేతంతో అయినా లేదా ఇతర మార్గాల్లో అయినా దానికి సహకరించడం ఒక ముస్లింకి నిషిద్ధం. ఇది ఇహ్రామ్‌లో ఉన్నవాడైనా, లేకపోయినా; పురుషుడైనా, మహిళ అయినా — అందరికీ ఇది నిషేధమే.

జంతువును దాని నివాస స్థలంలో నుండి తరిమివేయడం హరమ్ ప్రదేశంలో నిషిద్ధం. అలాగే హరమ్‌లో పెరిగే పచ్చి మొక్కలను లేదా చెట్లను కోయడం కూడా నిషిద్ధమే. హరమ్ పరిధిలో దొరికిన వస్తువును స్వాధీనం చేసుకోవడం కూడా నిషిద్ధం, అయినా దాని యజమానిని గుర్తించేవాడి కొరకు అనుమతించబడుతుంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఈ ప్రదేశం — అంటే మక్కా నగరం — అంత్యదినం వరకు అల్లాహ్ విధించిన పవిత్రతతో పవిత్రమైనదిగా కొనసాగుతుంది. దానిలో ముల్లులు తీసివేయకూడదు, వన్యప్రాణులను తరిమివేయకూడదు, దాని లబ్ధిని (దొరికిన వస్తువులను) యజమాని తెలసి ఉన్నవాడు తప్ప తీసుకోవద్దు, మరియు దాని పచ్చని గడ్డిని కోయకూడదు." [50] ముత్తఫఖున్ అలైహి [50] అల్ బుఖారీ, హదీథు సంఖ్య (1834) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1353).

అల్-మున్షిద్ (المنشد) అనగా: తల్బియా లేదా జిక్ర్‌లను హెచ్చు స్వరంతో పలుకుతూ, ఇతరులకు గుర్తు చేసే వ్యక్తి. అల్-ఖలా (الخلا) అనగా: తాజా, తడి గడ్డిని సూచిస్తుంది. మీనా మరియు ముజ్దలిఫా ఇవి రెండూ హరమ్ హద్దులో ఉన్నాయి. అరఫా మాత్రం హరమ్ వెలుపల, అల్'హిల్ ప్రాంతంలో ఉంది.

అధ్యాయం

హాజీ మక్కాలోనికి ప్రవేశించినప్పుడు చేయవలసిన పనులు మరియు మస్జిద్ అల్-హరామ్‌ లోనికి ప్రవేశించిన తర్వాత తవాఫ్ (ప్రదక్షిణ) చేయడం మరియు దాని విధానం యొక్క వివరణ:

ఇహ్రామ్‌లో ఉన్న వ్యక్తి మక్కాకు చేరుకున్నప్పుడు, మస్జిద్ అల్ హరామ్ లో ప్రవేశించేముందు గుసుల్ చేయడం అభిలషణీయం. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా చేసేవారు. ఇక మస్జిద్ అల్ హరామ్ (కాబా) కు చేరుకున్న తర్వాత, అందులో ప్రవేశించేటప్పుడు కుడి కాలు ముందు పెట్టి ఈ దుఆ చేయటం సున్నతు: "బిస్మిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అఊదు బిల్లాహిల్ అజీమ్, వ బివజ్'హిహిల్ కరీమ్, వ సుల్తానిహిల్ ఖదీమ్, మినష్ షైతానిర్రజీమ్. అల్లాహుమ్మ ఇఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక్." ("అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై శాంతి, శుభాలు కురుయుగాక. మహోన్నతుడైన అల్లాహ్ శరణు కోరుతున్నాను, ఆయన గొప్ప ముఖ కాంతి ద్వారా మరియు బహిష్కరింపబడిన షైతాన్ బారి నుండి శాశ్వత సార్వభౌముడైన ఆయన శరణు వేడు కుంటున్నాను. ఓ అల్లాహ్! నీ కరుణాకటాక్షాల ద్వారాలను నా కొరకు తెరవుము.") ఇది మసాజిద్ అన్నిటిలోకి ప్రవేశించే సమయంలో చేయాలి. అయితే నాకు తెలిసినంతవరకు మస్జిదుల్ హరామ్‌లోకి ప్రవేశించేటపుడు చేయవలసిన ప్రత్యేక దుఆ ఏదీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఉపదేశించబడినట్లు ఋజువు లేదు.

అతను కాబాగృహం వద్దకు వచ్చినప్పుడు, తవాఫ్ ప్రారంభించే ముందు (తమత్తు హజ్ లేదా ఉమ్రహ్ పద్ధతిలో చేస్తున్న వాడైతే) తల్బియా ఆపివేయాలి. తరువాత అతను హజ్రె అస్వద్‌వైపు తిరిగి నేరుగా దాని వైపు వెళ్ళి, దానిని తన కుడిచేతితో స్పృశించాలి, సాధ్యమైతే ముద్దు పెట్టాలి. అయితే జనాలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడాలి. హజ్రె అస్వద్‌ను తాకేటప్పుడు ఇలా పలకాలి: "బిస్మిల్లాహ్, వల్లాహు అక్బర్" లేదా "అల్లాహు అక్బర్ ముద్దు పెట్టడం కష్టం అయితే, తన చేతితో లేదా కర్రతో లేదా అటువంటి వంటి ఏదైనా వస్తువుతో హజ్రె అస్వద్‌ను తాకాలి, మరియు దానితో తాకిన దాన్ని ముద్దు పెట్టాలి. అయితే తాకడం కష్టంగా ఉంటే (బాగా దూరంగా ఉంటే), దాని వైపు కుడి అరచేయి చూపించాలి మరియు "అల్లాహు అక్బర్" అని చెప్పాలి. అయితే చూపించేందుకు ఉపయోగించిన వస్తువును ముద్దు పెట్టకూడదు. తవాఫ్‌ సరైనదిగా ఉండాలంటే, తవాఫ్ చేయువాడు చిన్న లేదా పెద్ద హదథుల నుండి పవిత్రుడై ఉండటం తప్పనిసరి; ఎందుకంటే తవాఫ్ కూడా నమాజు లాంటిదే, అయితే దీనిలో మాటల విషయమై మినహాయింపు ఉంది. తవాఫ్ చేస్తున్నపుడు కఅబాను తన ఎడమవైపు ఉంచాలి. తవాఫ్ ప్రారంభంలో ఇలా పలికతే మంచిదే: «అల్లాహుమ్మ, ఈమానమ్ బిక, వ తస్'దీఖమ్ బికితాబిక, వ వఫాఅన్ బి అహ్'దిక, వ ఇత్తిబా'అన్ లిసున్నతి నబియ్యిక ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసল্লం (ఓ అల్లాహ్‌!, నీపై విశ్వాసంతో, నీ గ్రంథంపై నమ్మకంతో, నీ ఒప్పందాన్ని నెరవేర్చడంలో, నీ ప్రవక్త ముహమ్మద్ ﷺ సున్నతులను అనుసరించడంలో)» ఇది ప్రవక్త ﷺ నుండి ఋజువైనది కనుక అలా చేయడం మంచిదే. తదుపరి, అతను ఏడుసార్లు తవాఫ్ (ప్రదక్షిణ) చేయాలి. మొదటి మూడు ప్రదక్షిణలలో (తవాఫుల్-ఖుదూమ్ — మక్కాలోకి ప్రవేశించగానే చేసే తవాఫ్) అతడు వడి వడిగా నడవాలి (రమల్), అది ఉమ్రహ్ చేసేవాడు అయినా, తమత్తు హజ్ చేసేవాడైనా, ఇఫ్రాద్ హజ్ మాత్రమే చేసేవాడైనా, హజ్ మరియు ఉమ్రహ్ రెండింటికీ ఇహ్రామ్ ధరించి ఖిరాన్ హజ్ చేసేవాడైనా సరే. మిగిలిన నాలుగు ప్రదక్షిణలలో సాధారణ నడక నడవాలి. ప్రతి ప్రదక్షిణను హజ్ర్ అస్వద్ వద్ద నుండే ప్రారంభించాలి మరియు హజ్రె అస్వద్ వద్దనే ముగించాలి.

రమల్ అనగా — అడుగులు దగ్గరగా దగ్గరగా వేస్తూ, వడి వడిగా, త్వరగా నడవడం. ఈ తవాఫ్ మొత్తం (తవాఫ్ ఉల్-కుదూమ్) లో ఇది చేయడం సున్నత్. ఈ తవాఫ్ మొత్తంలో ఇజ్'తిబా చేయడం (అంటే ఇహ్రామ్ యొక్క పై వస్త్రాన్ని కుడి భుజం కనబడేలా మరియు ఎడమ భుజం కప్పేలా ధరించడం) కూడా మంచిది. కేవలం మొదటి మూడు తవాఫ్‌లో మాత్రమే సున్నతు - మిగిలిన తవాఫ్‌ (4 నుండి 7 వరకు) ప్రదక్షణలలో కాదు. అల్-ఇజ్తిబా (الاضطباع): అంటే రిదా (పై వస్త్రం) మధ్య భాగాన్ని కుడి భుజం కింద ఉంచి, దాని రెండు చివరలను తన ఎడమ భుజంపై ఉంచడం.

ఒకవేళ అతడికి తన ప్రదక్షిణల సంఖ్యలో సందేహం కలిగితే, సందేహం లేని సంఖ్య (అంటే — తక్కువదాని) ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి, మూడు ప్రదక్షిణలు చేసానా లేదా నాలుగు చేసానా అనే సందేహం కలిగితే, అతడు వాటిని మూడు ప్రదక్షిణలుగానే పరిగణించాలి. సఫా మర్వాల మధ్య సయీలో కూడా ఇలానే చేయాలి.

ఈ తవాఫ్ ప్రదక్షిణలు పూర్తి చేసిన తరువాత, అతను తవాఫ్ (రెండు రకాతుల) నమాజు చేయడానికి ముందు, తన ఇహ్రామ్ పైవస్త్రాన్ని తన భుజాలపై వేసుకుని, దాని రెండు చివరలను తన ఛాతీపై ఉంచుకోవాలి.

మరియు స్త్రీలు తవాఫ్ సమయంలో అలంకారాలు ధరించి, సువాసనలు పూసుకొని, లేదా స్వల్ప వేషధారణలో ఉండటం — ఇదంతా తప్పుబట్టదగినదే మరియు వారిని హెచ్చరించవలసినది. ఎందుకంటే వారు తక్కువ దుస్తులలో కనిపించడం (అవరణ సరిగ్గా కప్పకుండా ఉండడం) అనేది ఉచితం కాదు. కాబట్టి వారు తవాఫ్ చేయునప్పుడు మరియు పురుషులు ఎదురయ్యే ఇతర సందర్భాలలో అలంకారాలను వదిలి పెట్టాలి, పూర్తిగా కప్పుకుని ఉండాలి. ఎందుకంటే వారు కప్పి ఉంచవలసిన, ఆకర్షణకు మరియు పాపానికి కారణమయ్యే స్త్రీ ముఖము ఆమె అతి పెద్ద అలంకరణ, కాబట్టి దానిని తాను మహరం పురుషులకు తప్ప మరెవరికీ చూపకూడదు. ఎందుకంటే అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: మరియు వారి అలంకరణను ప్రదర్శించవద్దని చెప్పు - తమ భర్తలకు తప్ప. [అన్-నూర్:31] కాబట్టి వారు (స్త్రీలు) హజ్రె అస్వద్‌ను ముద్దుపెట్టునప్పుడు ముఖాన్ని బయటకి చూపించుట సమ్మతము కాదు, ముఖ్యంగా వారు పురుషుల కంటబడే స్థితిలో ఉన్నపుడు. అలాగే వారు హజ్రె అస్వద్‌ను తాకుటకు లేదా ముద్దుపెట్టుటకు అవకాశం లేని పక్షంలో, పురుషులతో తోపులాట చేయుట సమ్మతము కాదు. వారు పురుషుల వెనుక నుండే తవాఫ్ చేయాలి, ఇదే వారికి మేలైనది మరియు కాబాకు దగ్గరగా పురుషులతో తోపులాట చేస్తూ తవాఫ్ చేయడం కంటే ఎక్కువ ఉత్తమమైన ప్రతిఫలాన్ని ఇస్తుంది. రమల్ మరియు ఇజ్'తిబాలకు మొదటి తవాఫ్ లో తప్ప ఇతర తవాఫ్ లలో, సయీలలో, మరియు స్త్రీల విషయంలో షరీఅతు మినహాయింపు ఉంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రెండు పనులు తాను మక్కాకు వచ్చి చేసిన మొదటి తవాఫ్‌లో మాత్రమే చేశారు. తవాఫ్ చేసే వ్యక్తి చిన్న లేదా పెద్ద పాపాల నుండి పవిత్రుడై ఉండాలి, అల్లాహ్‌ యొక్క ఆజ్ఞాపాలన చేసేవాడై, వినయవిధేయతలతో మెలిగే వాడై ఉండాలి.

తవాఫ్ లో అల్లాహ్‌ యొక్క జిక్ర్, దుఆలను ఎక్కువగా చేయడం ముస్తహబ్ (అల్లాహ్ కు ఇష్టమైన పని). తవాఫ్ సమయంలో ఖుర్ఆన్ చదవడమూ మంచిదే. ఈ తవాఫ్ లో అయినా, ఇతర తవాఫ్‌లలోనైనా, లేదా సయీలోనైనా , ఏదైనా ప్రత్యేకమైన జిక్ర్ లేదా ప్రత్యేకమైన దుఆ చేయవలసిన అవసరం లేదు.

కొంతమంది ప్రజలు తవాఫ్ లేదా సయీలో ప్రతి ఒక్క ప్రదక్షిణలో ఒక్కో ప్రత్యేకమైన జిక్ర్‌ లేదా ప్రత్యేకమైన దుఆలు చేయడాన్ని ప్రత్యేకంగా నిర్ణయించుకోవడం చేస్తూ ఉంటారు అయితే, దీనికి అసలు ఆధారం ఏదీ లేదు. ఏ విధంగా జిక్ర్ లేదా దుఆ సులభంగా సాధ్యమవుతుందో అలా చేస్తే చాలు. రుక్న్ యమానీని సమీపించినప్పుడు, దాన్ని తన కుడి చేతితో తాకి “బిస్మిల్లాహ్ వల్లాహు అక్బర్” (బిస్మిల్లాహ్, అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు) అని పలకాలి. దాన్ని ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది తాకడం కష్టం అయితే అలా చేయకుండానే తవాఫ్ కొనసాగించాలి. దాని వైపు చూపించి التكبير (అల్లాహు అక్బర్ అనడం) చేయకూడదు, ఎందుకంటే మాకు తెలిసినంత వరకు ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి సహీహ్ రూపంలో ఏ హదీథు రాలేదు. అలాగే, రుక్న్ యమానీ మరియు హజ్రె అస్వద్ మధ్యలో ఉండగానే, అతడు ఇలా అనడం ముస్తహబ్: (రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతన్ వ ఫిల్ఆఖిరతి హసనతన్ వ ఖినాఅజాబన్నార్)  వోమా ప్రభూ! మాకు ఇహలోకంలో మంచిని మరియు పరలోకంలో కూడా మంచిని ప్రసాదించు మరియు మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు! [అల్ బఖరహ్ 2:201] ప్రతిసారి హజ్రె అస్వద్‌కు సమీపించినప్పుడు దాన్ని తాకి ముద్దుపెట్టుకోవాలి మరియు "అల్లాహు అక్బర్" అని చెప్పాలి. అది తాకడం లేదా ముద్దుపెట్టుకోవడం సాధ్యపడకపోతే, ప్రతి సారి దానిని సమీపించినప్పుడు దాని వైపు సైగ చేసి అల్లాహు అక్బర్ అని పలకాలి.

జమ్‌జమ్ మరియు మఖామె ఇబ్రాహీమ్ యొక్క వెనుక భాగం నుండి తవాఫ్ చేయడంలో ఎటువంటి అభ్యంతరం లేదు, ముఖ్యంగా బాగా రద్దిగా ఉన్న సమయాల్లో. మస్జిద్ మొత్తం తవాఫ్‌కి అనుకూలమైన ప్రదేశమే. మస్జిద్ లోని ప్రాంగణాల (అరూక) లో తవాఫ్ చేసినా అది సరిపోతుంది. అయితే, కాబా‌కు దగ్గరగా తవాఫ్ చేయడం సాధ్యమైతే, అది ఉత్తమం.

తవాఫ్ ముగించగానే, మఖామె ఇబ్రాహీం వెనుక రెండు రకాతులు నమాజు చేయడం సున్నత్, అది సాధ్యమైన పక్షంలో. అయితే రద్ది వలన లేదా ఏదైనా కారణం వలన అక్కడ చేయడం సాధ్యం కాకపోతే, మస్జిద్‌లోని ఏ ప్రదేశం లోనైనా చేయవచ్చు. ఆ రెండు రకాతులలో సూరతుల్ ఫాతిహా తరువాత ఇది పఠించడం సున్నతు: ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా! [అల్- కాఫిరూన్ 109:1] మొదటి రకాతులో మరియు ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు. [అల్ ఇఖ్లాస్ 112:1] రెండవ రకాతులో. ఇలా చేయడం ఉత్తమం. కానీ ఇవి కాక (ఇతర సూరాలు) చదివినా ఎలాంటి పాపమూ లేదు. ఆ తర్వాత హజ్ర్ అస్వద్ వైపు వెళ్లి, సాధ్యమైతే, కుడి చేతితో దాన్ని తాకడం (ఇస్తిలాం) చేయాలి — ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతు.

తర్వాత సఫా కొండ వైపుకు బయలుదేరి, దాని పైకి ఎక్కాలి లేదా దాని వద్ద నిలబడాలి. పైకి ఎక్కడం సాధ్యమైతే, అది ఉత్తమం. సఫా-మర్వాల మొదటి ప్రధక్షిణ ప్రారంభంలో, ఈ ఆయతు పఠించాలి: నిశ్చయంగా, 'సఫా మరియు మర్వాలు అల్లాహ్ చూపిన చిహ్నాలు... [అల్ బఖరహ్ 2:158]

సఫా కొండపై ఖిబ్లా వైపు అభిముఖంగా నిలబడి, అల్లాహ్ ను స్తుతించడం మరియు ఆయన ఘనతను కొనియాడుతూ ఇలా పలకటం ఉత్తమం: 'లా ఇలాహ ఇల్లల్లాహ్, వల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహ్, లహుల్-ముల్కు వ లహుల్-హమ్దు, యుహ్యి వ యుమీతు, వ హువా అలా కుల్లి షయ్ ఇన్ ఖదీర్, లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు, అంజజ వ అదహు, వ నసర అబ్దహు, వ హజమ అల్-అహ్‌జాబ్ వహ్'దహ్.' ('అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన ఒకే ఒక్కడే, ఆయనకు భాగస్వామి లేడు. ఆయనకే విశ్వసామ్రాజ్యం చెందును, ఆయనకే సకల స్తుతులు చెందును. ఆయనే జీవింపజేస్తాడు, మరణింపజేస్తాడు, ఆయన ప్రతిదానిపై సంపూర్ణ ఆధిపత్యము కలిగి ఉన్న సర్వశక్తిమంతుడు. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన ఒక్కడే తన వాగ్దానాన్ని నెరవేర్చాడు, తన దాసుడికి విజయం ప్రసాదించాడు, అహ్'జాబ్ సైన్యాలను ఒంటరిగా ఓడించాడు.') తర్వాత రెండు చేతులను పైకెత్తి ఇష్టమైన దుఆలు చేయాలి. ఈ జిక్ర్ మరియు దుఆను మూడు సార్లు పునరావృతం చేయాలి. తర్వాత సఫా కొండ నుండి దిగి మర్వా కొండ వైపు నడవాలి. మొదటి ఆకుపచ్చ సంకేత స్థంభం నుండి రెండవ ఆకుపచ్చ సంకేత స్థంభం వరకు, పురుషులు వడి వడిగా (రమల్) వేగంగా నడవాలి. స్త్రీల విషయానికొస్తే, వారు రెండు సంకేతాల మధ్య వేగంగా నడవడానికి అనుమతి లేదు ఎందుకంటే వారు 'ఔరాత్' (ముసుగు పెట్టవలసినది)లో ఉంటారు. బదులుగా, వారు సయీ అంతటా నడవాలని మాత్రమే ఆదేశించబడింది. తరువాత, అలా నడుస్తూ మర్వా కొండ పైకి ఎక్కాలి లేదా దాని పక్కన నిలబడాలి. మర్వా పైకి ఎక్కడం సాధ్యమైతే అది ఉత్తమం. సఫా వద్ద పఠించిన మరియు చేసిన విధంగా మర్వా వద్ద కూడా పఠించాలి మరియు చేయాలి, అయితే ఈ ఆయతు చదవడం మినహా; అది మహోన్నతుడై అల్లాహ్ వాక్కు. నిశ్చయంగా, 'సఫా మరియు మర్వాలు అల్లాహ్ చూపిన చిహ్నాలు... [అల్ బఖరహ్ 2:158] ఇది (ఆయత్ చదవడం) సఫా కొండపై మొదటి ప్రధక్షిణ ప్రారంభ సమయంలో మాత్రమే చేయాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతును అనుసరిస్తూ. తర్వాత, సఫా కొండ నుండి దిగి వచ్చి, నడవాల్సిన చోట నడవాలి, వడి వడిగా నడవాల్సిన చోట వడి వడిగా నడవాలి, తద్వారా మరల మర్వా కొండపై చేరాలి. ఇలా మొత్తం ఏడు సార్లు చేయాలి. ఒకసారి సఫా కొండ నుండి మర్వా కొండకు చేరిన నడక "ఒక ప్రదక్షిణగా" లెక్కించ బడుతుంది, మర్వా కొండ నుండి తిరిగి సఫా కొండకు చేరటం మరో ప్రదక్షిణగా లెక్కించ బడుతుంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే విధంగా చేశారు మరియు ఇలా పలికారు: «మీరు నా నుండి హజ్ ఆచరణలను నేర్చుకోండి»[51]. సఈ (సఫా-మర్వాల మధ్య నడక) సమయంలో ఎక్కువగా జిక్ర్ (అల్లాహ్ స్మరణ) మరియు దుఆలు చేయడం ముస్తహబ్ (సిఫారసు చేయబడినది). ఇది చేసేటప్పుడు పెద్ద శుద్ధి (హదథ్ అక్బర్) లేదా చిన్న శుద్ధి (హదథ్ అల్ అస్గర్) లేకుండా పరిశుభ్రంగా ఉండటం మంచిది (తహారుతులో మరియు ఉదూలో చేయడం మంచిది). అయితే, అశుద్ధ స్థితిలో సఈ చేసినప్పటికీ అది చెల్లుబాటు అవుతుంది. అలాగే, ఒక మహిళ తవాఫ్ అనంతరం హైద్ (రుతుస్రావం) లేదా నిఫాసు (ప్రసవ రక్తస్రావం) లకు గురైనా, ఆమె సయీ చేయవచ్చు మరియు అది ఆమెకు సరిపోతుంది. ఎందుకంటే సయీ చేయడానికి తహారత్ (పరిశుద్ధత) అనేది షరతు (తప్పనిసరి నిబంధన) కాదు, అది కేవలం ముస్తహబ్ (అభిలషణీయం) మాత్రమే, ఎలాగైతే ఇంతకు ముందు వివరించబడిందో. [51] దీని ఉల్లేఖనం ముందు వచ్చి ఉన్నది .

సయీ పూర్తయిన తర్వాత, శిరోముండనం చేసుకోవాలి లేదా తలవెంట్రుకలను కత్తిరించుకోవాలి, మరియు పురుషుల కొరకు శిరోముండనం చేసుకోవడం ఉత్తమం. అయితే, జుట్టును కత్తిరించి హజ్ కోసం శిరోముండనాన్ని వదిలేస్తే, అది కూడా మంచిదే. ఒకవేళ హజ్ సమయానికి దగ్గరగా మక్కా వచ్చినట్లయితే, తలవెంట్రుకలు కత్తిరించుకోవడం అతనికి ఉత్తమం, తద్వారా హజ్ సమయంలో మిగిలిన తలవెంట్రుకలను గీయించుకోవచ్చు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ మరియు ఆయన సహాబాలు దిల్-హిజ్జా నాల్గవ తేదీన మక్కాకు వచ్చినప్పుడు, ఆయన హదీ (ఖుర్బనీ పశువు)ను తీసుకురాని వారందరికి తహల్లుల్ అయ్యి, తలవెంట్రుకలను కత్తిరించమని (తక్సీర్) ఆదేశించారు; శిరోముండనం (హల్క్) చేయమని ఆదేశించలేదు. ఇక తలవెంట్రుకలు కత్తిరించడంలో (తక్సీర్) తల మొత్తం కత్తిరించడం అవసరమే; కేవలం కొంత భాగం కత్తిరించడంతో సరిపోదు. అలాగే, శిరోముండనం కొంత భాగాన్ని మాత్రమే చేయడం కూడా సరిపోదు. మహిళల కొరకు శిరోముండనం (హల్క్) షరియత్‌లో అనుమతించబడలేదు; ఆమెకు కేవలం తలవెంట్రుకలు కత్తిరించడమే (తక్సీర్) షరీఅతులో సమ్మతమైనది. మరియు ఆమె తలలో ఉన్న ప్రతి జడ (బ్రెయిడ్) నుండి ఒక అంగుళం చివర (అన్ములా) పరిమాణం లేదా అంతకంటే తక్కువ కత్తిరించాలి. “అన్ములా” అనేది వేళ్ల యొక్క మొనభాగం (చివరి భాగం) అని ఉలమా వివరించారు. ఇది మించిన పరిమాణాన్ని తీసుకోవడం అనుమతించబడలేదు.

కాబట్టి ముహ్రిమ్ (ఇహ్రామ్‌లో ఉన్నవాడు) పైన పేర్కొన్న ఆచరణలు చేయగానే అతని ఉమ్రహ్ పూర్తవుతుంది మరియు ఇహ్రామ్ వలన నిషేధించబడిన ప్రతీ విషయం అతని కొరకు హలాల్ అవుతుంది. కానీ ఒకవేళ అతడు అల్-హిల్ ప్రాంతం నుండి హదీ (ఖుర్బానీ పశువు) తీసుకొచ్చి ఉంటే, అతడు ఇహ్రామ్ నుండి విడుదల కాలేడు, అతనిపై హజ్ మరియు ఉమ్రహ్ రెండింటినీ పూర్తి చేసిన తదనంతరం మాత్రమే హలాల్ అవుతాడు.

ఇఫ్రాద్ హజ్ ( హజ్ ఒక్కటే చేయాలనే ఉద్దేశ్యంతో) లేదా హజ్ మరియు ఉమ్రహ్ రెండింటికీ కలిపి ఒకే ఇహ్రామ్ దీక్ష బూనిన వ్యక్తి (ఖిరాన్ హజ్) విషయానికొస్తే, అతను తన ఇహ్రామ్‌ను ఉమ్రహ్ లో మార్చుకుని, ముతమత్తి (తమత్తు హజ్ చేసేవాడు) చేసే పనిని చేయటం సున్నతు అగును , అతను ఖుర్బానీ జంతువును వెంట తీసుకురాకపోతే, ఎందుకంటే ప్రవక్త (ﷺ) తన సహచరులను ఆ విధంగా చేయమని ఆదేశించి ఇలా పలికినారు: «నేను ఖుర్బానీ పశువును నాతో తీసుకురాకపోతే, మీతో నా ఇహ్రామ్‌ను ముగించేవాడిని» [52]. [52] అల్-బుఖారీ, హదీథు సంఖ్య (1568)

ఒక స్త్రీ ఉమ్రహ్ కోసం ఇహ్రామ్ దీక్ష బూనిన తర్వాత ఋతుస్రావం లేదా పురిటి రక్తం మొదలైతే, ఆమె పవిత్రంగా మారే వరకు సఫా మరియు మర్వా మధ్య సయీ, కాబా చుట్టూ తవాఫ్ చేయకూడదు. ఆమె పవిత్రతను పొందిన తర్వాత, ఆమె తవాఫ్, సయీ చేసి, తన జుట్టును చిన్నగా కత్తిరించుకోవాలి, తద్వారా ఆమె ఉమ్రాహ్ ను పూర్తి చేయాలి. తర్వియా దినం (జుల్-హిజ్జా 8వ తేదీ) ముందు ఆమె పరిశుద్ధత పొందకపోతే, ఆమె తన ప్రస్తుత స్థానం నుండి హజ్ కోసం ఇహ్రామ్ దీక్ష బూని ప్రజలతో కలిసి మీనాకు వెళ్లాలి. అలా చేయడం ద్వారా, ఆమె హజ్ మరియు ఉమ్రహ్ లను కలిపి ఖిరాన్ హజ్ చేసే హాజీ అవుతుంది. ఆమె హజ్ యొక్క అన్ని ఆచారాలను పూర్తి చేయాలి, వాటిలో అరఫాత్ వద్ద నిలబడటం, పవిత్ర మీనా స్థలంలో బస చేయడం, జమ్రాలపై రాళ్లు విసిరేయడం, ముజ్దలిఫా మరియు మీనాలో రాత్రి గడపడం, ఖుర్బానీ అర్పించడం మరియు జుట్టును చిన్నగా కత్తిరించటం వంటివి ఉన్నాయి. ఆమె పరిశుద్ధురాలైన తర్వాత, ఆమె సఫా మరియు మర్వా మధ్య సయీ, కాబా చుట్టూ తవాఫ్ చేయాలి, ఒక తవాఫ్ మరియు ఒక సయీ మాత్రమే చేయాలి, ఇది ఆమె హజ్ మరియు ఉమ్రహ్ లు రెండింటికీ సరిపోతుంది, ఉమ్రహ్ కోసం ఇహ్రామ్ లో ప్రవేశించిన తర్వాత ఋతుస్రావం మొదలైన ఆయిషా రదియల్లాహు అన్హా కథనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఆమెతో ఇలా అన్నారు: “హాజీలు చేసే ఆచరణలన్నీ నువ్వు కూడా ఆచరించు, కానీ శుద్ధి పొందనంత వరకు బైతుల్లాహ్ యొక్క తవాఫ్ చేయవద్దు” [53] ముత్తఫఖున్ అలైహి [53] దీనిని బుఖారీ (హదీథు సంఖ్య: 305) మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 1211) నమోదు చేసినారు.

ఒక స్త్రీ ఋతుస్రావం లేదా పురిటి రక్తస్రావం మొదలైన తర్వాత నహర్ రోజున గులకరాళ్ళను విసిరి, తన జుట్టును చిన్నగా చేసుకున్నప్పుడు, ఇహ్రామ్ కారణంగా ఆమెకు నిషేధించబడిన ప్రతిదీ, సుగంధ ద్రవ్యాలు మరియు అలాంటివి, ఆమె భర్త తప్ప, ఇతర స్వచ్ఛమైన స్త్రీల మాదిరిగానే ఆమె తన హజ్ పూర్తి చేసే వరకు అనుమతించబడతాయి. ఆమె పవిత్రత పొందిన తర్వాత తవాఫ్ మరియు సయీ ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత, ఆమె భర్త ఆమె కొరకు అనుమతించబడతాడు.

అధ్యాయం

దిల్-హిజ్జా ఎనిమిదవ తేదీన హజ్ కోసం ఇహ్రామ్ ధరించి మీనాకు వెళ్లడం గురించిన నియమం:

దిల్ హిజ్జా ఎనిమిదవ రోజు యౌముత్' తర్వియహ్ అని పిలవబడుతుంది, మక్కాలో ఉన్న హరమునకు బయట నుంచి వలస వచ్చి ఉన్నవారు మరియు హజ్ చేయదలచిన మక్కావాసులు తమ నివాసస్థలాల నుండే హజ్‌కు ఇహ్రామ్ ధరించడం ముస్తహబ్‌. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబాలు (రదియల్లాహు అన్‌హుమ్) అబ్తహ్‌లో ఉండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞతో అదే రోజు హజ్‌కి ఇహ్రామ్ ధరించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి బైతుల్లాహ్ వద్ద లేదా మీజాబ్ వద్ద (కాబా పై భాగంలో నీరు కారే పొంగటి ప్రాంతం) ఇహ్రామ్ ధరించమని ఆజ్ఞించలేదు. అలాగే మినా వైపు బయలుదేరే ముందు వీడ్కోలు తవాఫ్ (తవాఫుల్ వదా) ప్రదక్షిణ చేయమని కూడా చెప్పలేదు. ఇది షరీయత్‌లో మంజూరు అయి ఉన్నట్లయితే, ఆయన ఖచ్చితంగా వారికి అలా చేయమని చెప్పేవారు. మొత్తంగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహాబాలు (రదియల్లాహు అన్‌హుమ్) లను అనుసరించడంలోనే అన్ని శుభాలూ ఉన్నాయి.

హజ్‌కి ఇహ్రామ్ ధరించే సమయంలో, మీఖాత్ వద్ద ఇహ్రామ్ ధరించే వేళ చేయబడిన విధంగా, స్నానం చేయడం, శుభ్రంగా ఉండడం మరియు సుగంధద్రవ్యాలు ఉపయోగించడం ముస్తహబ్ (ఇష్టప్రాయమైన) అమలుగా పరిగణించబడుతుంది. హజ్జ్‌కు ఇహ్రామ్ ధరించిన తర్వాత, తర్వియ దినమైన దుల్ హిజ్జ్ ఎనిమిదవ తేదీన జవాల్‌కు ముందు (మిట్టమధ్యానానికి ముందు) లేదా దాని తరువాత మినాకు వెళ్లడం సున్నతు. మరియు ఆరోజు నుండి జమరతుల్ అక్బాకు రాయి విసిరే వరకూ ఎక్కువగా తల్బియా పలకాలి. అలాగే మినాలో జుహ్ర్, ఆస్ర్, మగ్రిబ్, ఇషా, ఫజ్ర్ నమాజులు నెరవేర్చాలి. సున్నతు ఏమిటంటే: ప్రతి నమాజును దాని సమయానికే, ఖస్ర్‌గా (ద్విగుణంగా కాకుండా) చేయాలి. కానీ మగ్రిబ్ మరియు ఫజ్ర్ నమాజులు ఖస్ర్ చేయకూడదు.

మక్కా నివాసితులకూ, ఇతరులకు మధ్య ఏ విధమైన తేడా లేదు; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా వారితో సహా ఇతరులకు కూడా మినా, అరఫా, ముజ్దలిఫాలో నమాజులు ఖస్ర్‌గానే (ద్విగుణంగా కాకుండా) చేయించినారు. మరియు మక్కా వారికి పూర్తిగా (ఇత్మాముగా) చేయమని ఆజ్ఞాపించలేదు. అది వారికి తప్పనిసరి అయి ఉంటే, ఖచ్చితంగా ఆయన వారికి అలా చేయమని ఆదేశించేవారు.

తర్వాత అరఫా రోజు సూర్యోదయం తరువాత హాజీ మినా నుండి అరఫాకు బయలుదేరతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన విధంగా, సాధ్యమైతే జవాల్ (మధ్యాహ్నం) వరకు నిమ్రా అనే ప్రాంతంలో ఆగడం సున్నతు.

కాబట్టి, సూర్యుడు మిట్ట మద్యాహ్నం దాటిన తరువాత, ఇమామ్ లేదా ఆయన ప్రతినిధి ప్రజలకు స్థితికి అనుగుణంగా ఒక ఖుత్బా ఇవ్వటం సున్నతు. ఇందులో ఆ రోజు కొరకు మరియు దాని తరువాత హజ్ చేసే వ్యక్తి కొరకు ధర్మబద్ధమైన విషయాలను వివరిస్తాడు. అల్లాహ్‌కు భయపడి, ఆయనను ఏకైకుడిగా గుర్తించి, అన్ని ఆచరణలను ఆయన కొరకు చిత్తసుద్ధితో చేయాలని ఆదేశిస్తాడు. ఆయన నిషేధించిన విషయాల నుండి దూరంగా ఉండమని వారిని హెచ్చరిస్తాడు. మరియు అందులో దైవ గ్రంథమైన ఖుర్‌ఆన్‌ను మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులను అనుసరించమని, వాటి ఆధారంగా తీర్పు ఇవ్వాలని, వాటిని న్యాయపరంగా అనుసరించాలని వారిని తాకీదు చేస్తాడు — ఈ అన్ని విషయాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుకరించవలెనని తెలియ జేస్తాడు. తరువాత వారు జుహ్ర్ మరియు అస్ర్ నమాజులను, ఒక్క అజాన్ మరియు రెండు ఇఖామతులతో, ముందటి నమాజు సమయములో (జుహ్ర్ సమయం) కలిపి, సంక్షిప్తంగా (ఖస్ర్ తో) చేస్తారు. దీనిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించడం వల్లనే సున్నత్ అయ్యింది. దీనిని జాబిర్ (రదియల్లాహు అన్హు) నుండి ముస్లిం నమోదు చేసినారు.

అనంతరం ప్రజలు అరఫాలో బస చేస్తారు. అరఫా మొత్తం ప్రాంతం (బస చేసే ప్రదేశం) అయినా, బట్ను ఊరణా మాత్రం అందులోనికి రాదు. ఖిబ్లా దిశను మరియు జబలుర్ రహ్మా (కరుణ పర్వతం) ను ఎదురుగా ఉంచుకోవడం సాధ్యమైనట్లయితే అలా చేయడం మంచిది. అవి రెండింటికీ ఎదురుగా నిలబడడం సాధ్యపడకపోతే, కనీసం ఖిబ్లా దిశకు మాత్రం ఎదురుగా నిలబడటం మంచిది, ఆ పర్వతం ఎదురుగా నిలబడకపోయినా పరవాలేదు. ఈ బస చేసే స్థలంలో హజీలు అల్లాహ్‌ను ఎక్కువగా స్మరించేందుకు, దుఆ చేయటానికి, ఆయనను వేడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. దుఆ చేసే సమయంలో చేతులు పైకి ఎత్తాలి. తలబీయా చదివినా, ఖుర్‌ఆన్‌లో ఏదైనా భాగం పఠించినా మంచిదే. లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీకలహు లుహుల్ ముల్'కు వ లహుల్ హమ్'దు,యుహ్యీ వయుమీతు వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్ (అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఒకే ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. సామ్రాజ్యాధికారమంతా ఆయనదే. బ్రతికించేవాడు, మరణింపజేసేవాడు ఆయనే. ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు.). అనే కలిమాను ఎక్కువగా పలకడం సున్నతు, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం గురించి ఇలా సెలవిచ్చారు: అన్నింటి కంటే ఉత్తమమైన దుఆ అరఫారోజు చేసే దుఆ, మరియు అన్నింటికంటే ఉత్తమమైన వచనము నేను మరియు నాకు పూర్వం వచ్చిన ప్రవక్తలు పఠించిన వచనము అది: అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఆయన ఒక్కడే. ఆయనకు సరిసమానులు లేరు. రాజ్యాధికారము ఆయనదే. సర్వస్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయనే జీవింపజేయును, మరణింపజేయును. ఆయనే అన్నింటి పై అధికారం కలవాడు. [54] ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిరూపితమైనది. ఇంకా ఆయన ఇలా సెలవిచ్చారు: “అల్లాహ్’కు అత్యంత ఇష్టమైన పదాలు నాలుగు; అవి ‘సుబ్’హానల్లాహ్’ (అల్లాహ్ పరమ పవిత్రుడు), ‘అల్’హందులిల్లాహ్’ (స్తోత్రములన్ని కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందినవి), ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు) మరియు ‘అల్లాహు అక్బర్’ (అల్లాహ్ అందరికంటే గొప్పవాడు). [55]” [54] తిర్మిథీ, హదీథు సంఖ్య  (3585). [55] ముస్లిం, హదీథు సంఖ్య (2137).

కాబట్టి ఈ స్మరణను (లా ఇలాహ ఇల్లల్లాహ్...) అధికంగా, ఎన్నోసార్లు, మనస్సులో ఏకాగ్రతతో, భయభక్తులతో ధ్యానించటం అవసరం. అలాగే, షరీఅహ్‌లో పేర్కొనబడిన స్మరణలను (అజ్కార్) మరియు దుఆలను అన్ని సమయాలలోను — ముఖ్యంగా ఈ గొప్ప రోజున, ఈ ప్రాముఖ్యతగల స్థలంలో — అధికంగా పఠించాలి. దుఆలలో సంక్షిప్తంగా, సమగ్రమైన అర్థాన్ని కలిగినవి (జామిఉజ్ జిక్రి వద్దుఆ) ఎంచుకోవాలి. అందులో కొన్ని ఇవే:

* సుబ్'హా నల్లాహి వ బిహమ్'దిహి (అల్లాహ్ ఎలాంటి లోపాలూ, కొరతలూ లేని పరమ పవిత్రుడు మరియు సకల స్తోత్రములు, కృతజ్ఞతలు ఆయనకు మాత్రమే శోభిస్తాయి.) సుబహానల్లాహిల్ అజీమ్ (మహోన్నతుడైన అల్లాహ్ పరమ పరిశుద్ధుడు). నీవు (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, నీవు సర్వలోపాలకు అతీతుడవు, నిశ్చయంగా, నేనే అపరాధులలోని వాడను. [అల్ అంబియా 21:87]

లా ఇలాహ ఇల్లల్లాహ్, వలా న'ఆబుదు ఇల్లాహ్ ఇయ్యాహు, లహున్నేమతు వలహుల్ ఫద్'ల్, వ లహుస్సనాఉల్ హసన్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముఖ్లిసీన లహుద్దీన వ లౌ కరిహల్ కాఫిరూన్. (అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన్ని తప్ప మరెవరినీ ఆరాధించము. అనుగ్రహాలు ఆయనవే. కృపావరములు ఆయనవే. మంచి పొగడ్తలు ఆయనకే సొంతం. ఆయన తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. చిత్తశుద్ధితో మా ఆరాధనలను ఆయనకే అంకితం చేస్తాము. తిరస్కారులకు అది ఎంతగా సహించరానిదైనా సరే).

లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్" నష్టం చేకూర్చే శక్తి,ప్రయోజనం చేకూర్చే సామర్ధ్యం అల్లాహ్ కు తప్ప మరెవ్వరికి లేదు [56]. [56] ఈ హదీథును ఇమామ్ ముస్లిం, ఇబ్నె జుబైర్ రదియల్లాహు అన్హు నుండి నమోదు చేసినారు, హదీథు సంఖ్య (594).

ఓ మా ప్రభూ! మాకు ఇహలోకంలో మంచిని మరియు పరలోకంలో కూడా మంచిని ప్రసాదించు మరియు మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు! [అల్ బఖర 2:201]

అల్లాహుమ్మ అస్లిహ్ లీ దీనీ అల్లజీ హువ ఇస్మతు అమ్రీ, వ అస్లిహ్ లీ దున్యాయ అల్లతీ ఫీహా మఆషీ, వ అస్లిహ్ లీ ఆఖిరతీ అల్లతీ ఫీహా మఆదీ, వజ్అలిల్ హయాత జియాదతన్ లీ ఫీ కుల్లి ఖైరిన్, వజ్ అలిల్ మౌత రాహతన్ లీ మిన్ కుల్లి షర్రిన్ [57]. [57] దీనిని ముస్లిం నమోదు చేసినారు, హదీథు సంఖ్య 2720, అబూహురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖన.

అఊఝు బిల్లాహి మిన్ జహ్దిల్ బలా వ దర్కిష్ షఖా వ సూఇల్ ఖజా వ షమాతతిల్ అదా (కష్టములోని బాధ నుండి, దురదృష్టము సోకడ నుండి, చెడు తీర్పు నుండి, శతృవుల ఆనందము నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను) [58]. [58] దీనిని బుఖారీ అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన నుండి నమోదు చేసినారు, హదీథు సంఖ్య (6347).

అల్లాహుమ్మ ఇన్నీ అఊఝు బిక మినల్ హమ్మి వల్ హజన్ వ అఊఝు బిక మినల్ అజ్జి వల్ కసల్ వ అఊఝు బిక మినల్ జుబ్ని వల్ బుఖ్లి వ మినల్ మసమి వల్ మఘ్రమి వ అఊఝు బిక మిన్ గలబతిద్దైని వ ఖహ్రిర్ రిజాల్ (ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను దిగులు, దుఃఖము, బలహీనత, సోమరితనం, పిసినారితనం, పిరికితనం, పాపము, అప్పు, రుణభారం, ప్రజలు నాపై ఆధీక్యతను సంపాదించటం నుండి నీ శరణు వేడుకుంటున్నాను). [59] [59] అబూ ఉమామా అల్-అన్సారీ నుండి అబూ దావుద్ ఈ పదాలతో నమోదు చేసినారు, (వమినల్ మాసమి వల్ మగ్రమి మరియు పాపం మరియు భారీ రుణం) అనే పదాన్ని మినహాయించి, హదీథు సంఖ్య. (1554)

((అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ బరసి, వల్ జునూని, వల్ జుజామి, వ మిన్ సయ్యిఇల్ అస్ఖామి)). ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను తెల్లమచ్చల వ్యాధి నుండి, పిచ్చితనం నుండి, కుష్ఠు వ్యాధి నుండి ఇంకా ఇతర దుర్భర రోగాల బారి నుండి నీ శరణు వేడుతున్నాను. [60] [60] దీనిని అబూ దావుద్, అనస్ రదియల్లాహు అన్హు నుండి నమోదు చేసినారు, హదీథు సంఖ్య (1554).

ఓ అల్లాహ్! నిశ్చయంగా నేను ఇహపరాలలో క్షమాపణ మరియు స్వస్థతను వేడుకుంటున్నాను.

* అల్లాహుమ్మ, ఇన్నీ అస్అలుకల్ అఫ్’వ, వల్ఆఫియత ఫీ దీనీ, వ దున్యాయ, వ అహ్’లీ, వ మాలీ (ఓ అల్లాహ్! నేను స్వస్థత మరియు నీ క్షమాపణ కోరుచున్నాను నా ధర్మంలోనూ, నా ప్రాపంచిక విషయాలలోనూ, నా ఆలుబిడ్డలలోనూ మరియు నా సంపాదనలోనూ నీ మన్నింపు కోరుచున్నాను.)

అల్లాహుమ్మస్తుర్ ఔరాతీ వ ఆ మిన్ రౌఆతీ, అల్లాహుమ్మ ఇహ్ఫజ్నీ మిన్ బైని యదయ్య వ మిన్ ఖల్ఫీ, వ ఆన్ యమీనీ వ ఆన్ షిమాలీ, వ మిన్ ఫౌకీ, వ అఊజు బి అజ్ మతిక ఆన్ ఉగ్తాల మిన్ తహ్ తీ (ఓ అల్లాహ్! నా గోప్య విషయాలను గోప్యంగానే ఉంచు. నా అలజడిని ప్రశాంత పరచు. ఓ అల్లాహ్! నా ముందు వెనకాల నుండి, నా కుడి ఎడమల నుండి, నా పైనుండి నన్ను కాపాడు. క్రింది నుండి హఠాత్తుగా వచ్చే వినాశం నుండి నీ మహోన్నత శరణు వేడుకుంటున్నాను.) [61]. [61] దీన్ని అబూ దావుద్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా నుండి ఉల్లేఖించారు. హదీథు సంఖ్య (5074).

అల్లాహుమ్మగ్ఫిర్లీ జిద్దీ వ హజ్లీ, వ ఖతయీ వ అమ్’దీ, వ కుల్లు జాలిక ఇన్దీ, అల్లాహుమ్మగ్ఫిర్లీ మా ఖద్దమ్తు వ మా అఖ్ఖర్తు, వమా అస్రర్తు వమా ఆలంతు, వమా అంత ఆలము బిహీ మిన్నీ, అన్తల్ ముఖద్దిము వ అన్తల్ ముఅఖ్ఖిరు, వ అన్త అలా కుల్లి షైఇన్ ఖదీర్ [62]. [62] సహీహ్ ముస్లింలో ఉన్న ఒక హదీథ్ (హదీథు సంఖ్య 2719) లోని ఒక భాగము. అబూ మూసా అష్అరీ రదియల్లాహు అన్హు దీనిని ఉల్లేఖించారు.

ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను వ్యవహారములో స్థిరత్వమును మరియు సన్మార్గముపై దృఢత్వాన్ని నీతో అర్ధిస్తున్నాను, మరియు నీ అనుగ్రహమునకు కృతజ్ఞత తెలుపుకోవటమును, నీ ఆరాధనను మంచిగా చేయటమును అర్ధిస్తున్నాను, ఆరోగ్యకరమైన హృదయమును, సత్యం పలికే నాలుకను నీతో అర్ధిస్తున్నాను, మరియు నీకు తెలిసిన మేలును నీతో అర్ధిస్తున్నాను. మరియు నీకు తెలిసిన చెడు నుండి నీ శరణం వేడుకుంటున్నాను. మరియు నీకు తెలిసిన వాటి నుండి నీ మన్నింపును కోరుకుంటున్నాను. నిశ్చయంగా అగోచర విషయాల గురించి బాగా తెలిసినవాడివి నీవే. [63] [63] దీనిని తిర్మిథీ షద్దాద్ బిన్ ఔస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం నుండి నమోదు చేసినారు, హదీథు సంఖ్య (3407).

ఓ అల్లాహ్! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రభూ. నీవు, నా పాపాన్ని మన్నించు, నా హృదయంలోని కోపాన్ని తొలగించు, మరియు నీవు మమ్మల్ని జీవింపజేసినంతవరకూ మార్గభ్రష్టతకు గురి చేసే ఉపద్రవాల నుండి నన్ను రక్షించు. [64] [64] దీనిని అహ్మద్ ఉమ్మె సల్మా రదియల్లాహు అన్హా హదీథు నుండి నమోదు చేసినారు (6/301) .

ఓ అల్లాహ్! సప్తాకాశముల ప్రభువా! భూమి యొక్క ప్రభువా! గొప్ప సింహాసనానికి అధిపతి! మా ప్రభూ! ప్రతీ వస్తువు యొక్క ప్రభూ! విత్తనమును, టెంకను చీల్చేవాడా! తౌరాతును, ఇంజీలును, ఖుర్ఆన్ ను అవతరింపజేసినవాడా! నేను నీవు నుదుటను పట్టుకున్న ప్రతీ వస్తువు యొక్క కీడు నుండి నీతో శరణు వేడుకుంటున్నాను. ఓ అల్లాహ్! నీవే మొదటివాడివి నీ కంటే ముందు ఏదీ లేదు. నీవే చివరివాడివి నీ తరువాత ఏదీ ఉండదు, నీవే బహిరంగమైనవాడివి నీపై ఏదీ లేదు, నీవు గోప్యమైనవాడివి నీ నుండి ఏదీ గోప్యంగా లేదు. నీవు మా నుండి రుణము యొక్క భారమును దించు మరియు మమ్మల్ని పేదరికం నుండి ధనికులుగా చేయి. [65] [65] దీనిని ముస్లిం నమోదు చేసినారు, హదీథు సంఖ్య 2713, అబూహురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖన.

((అల్లాహుమ్మ అతి నఫ్సీ తఖ్వాహా, వ జక్కిహా అంత ఖైరు మన్ జక్కాహా, అంత వలియ్యుహా వ మౌలాహా, అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ అజ్-జీ వల్ కసలి, వ అఊజు బిక మినల్ జుబ్ని వల్ హరమి వల్ బుఖ్లి, వ అఊజు బిక మిన్ అజాబిల్ ఖబ్రి)) ఓ అల్లాహ్! నీవు నా మనస్సుకు దాని భీతిని ప్రసాదించు. మరియు దాన్ని శుద్ధపరచు; దానిని మంచిగా శుద్ధపరిచే వాడివి నీవే. నీవు దాని రక్షకుడవు మరియు సంరక్షకుడవు. ఓ అల్లాహ్! నిశ్చయంగా నేను నిస్సహాయత, సోమరితనం నుండి నీ శరణు కోరుతున్నాను. మరియు పిరికితనం, వృద్ధాప్యం మరియు పిసినారితనం నుండి నీ శరణు కోరుతున్నాను. మరియు సమాధి యాతన నుండి నేను నీ శరణు కోరుతున్నాను. [66] [66] దీనిని ముస్లిం నమోదు చేసినారు, హదీథు సంఖ్య 2722 జైద్ బిన్ అర్ఖమ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన.

ఓ అల్లాహ్! నేను నీకు విధేయుడనయ్యాను, నిన్ను విశ్వసించాను, నిన్నే నమ్ముకున్నాను, నీ వైపే మరలాను, నీ సహాయంతోనే వాదిస్తున్నాను. నీవు నన్ను అపమార్గమునకు లోను చేయకుండా ఉండుటకు నీ ఘనతతో శరణు వేడుకుంటున్నాను. నీవు తప్ప సత్య ఆరాధ్యుడు ఎవరూ లేరు. నీవు సదా జీవించి ఉండేవాడివి, నీకు మరణం లేదు. జిన్నులు, మనుషులు మరణిస్తారు [67]. [67] దీనిని ముస్లిం, ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా నుండి (హదీథు సంఖ్య: 2717) నమోదు చేసినారు.

ఓ అల్లాహ్ నిస్సందేహంగా నేను నిష్ప్రయోజనకరమైన విద్య నుండి, దైవభీతి లేని హృదయం నుండి, ఆత్రం తీరని మనస్సు నుండి మరియు అంగీకరించబడని ప్రార్ధన నుండి నీతో శరణు వేడుకుంటున్నాను. [68] [68] ఇది ముందు ప్రస్తావించబడిన జైద్ ఇబ్న్ అర్కం రదియల్లాహు అన్హు హదీథులోని భాగం హదీథు సంఖ్య (2722).

ఓ అల్లాహ్! చెడు గుణాల నుండి, చెడు కర్మల నుండి, చెడు మనోవాంఛల నుండి, చెడు రోగాల నుండి నన్ను రక్షించు. [69] [69] దీనిని తిర్మిథీ జియాద్ బిన్ ఇలాఖ (రదియల్లాహు అన్హు) తన పిన తండ్రి నుండి ఉల్లేఖించిన హదీథు నుండి (హదీథు సంఖ్య 3591) నమోదు చేసినారు.

* ((అల్లాహుమ్మ అల్హిమ్నీ రుష్దీ, వ ఆఅిజ్నీ మిన్ షర్రి నఫ్సీ)) ((ఓ అల్లాహ్ నాకు మేలు చేకూర్చే విషయాలు నేర్పించు నా మనోవాంఛల కీడు నుండి రక్షించు)) [70]. [70] దీనిని తిర్మిథీ ఇమ్రాన్ బిన్ హుసైన్ రదియల్లాహు అన్హు హదీథు నుండి (హదీథు సంఖ్య: 3483) ఉల్లేఖించారు.

ఓ అల్లాహ్! నీవు హలాల్ (ధర్మసమ్మతం) చేసిన వస్తువుల ద్వారా నీవు హరాం చేసిన వస్తువుల నుండి నన్ను విముక్తి కలిగించు, నీ కరుణా కటాక్షాల ద్వారా నీవు తప్ప అందరి నుండి నన్ను నిరుపేక్షాపరున్ని చేయుము [71]. [71] దీనిని తిర్మిథీ అలీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన నుండి (హదీథు సంఖ్య: 3563) నమోదు చేసినారు.

((అల్లాహుమ్మ ఇన్ని అస్ అలుకల్ హుదా, వత్తుఖా, వల్ అఫాఫ, వల్ ఘినా)) ఓ అల్లాహ్! నిశ్చయంగా నిన్ను నేను మార్గదర్శనాన్ని,దైవభీతిని,రక్షణని మరియు,కలిమిని (సంతృప్తిని) అర్ధిస్తున్నాను. [72]. [72] దీనిని ముస్లిం అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన నుండి (హదీథు సంఖ్య: 2721) నమోదు చేసినారు.

* ((అల్లాహుమ్మ ఇన్ని అస్ అలుకల్ హుదా వస్సదాద)) [73]. ఓ అల్లాహ్! నేను నీతో సన్మార్గమును, సవరణను అర్థిస్తున్నాను. [73] దీనిని ముస్లిం, అలీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన నుండి (హదీథు సంఖ్య: 2725) నమోదు చేసినారు.

ఓ అల్లాహ్! నిశ్చయంగా నేను ఇహపరాల మేలుని, అది నాకు తెలిసినదైనా, నాకు తెలియనిదైనా, నీ నుండి అర్థిస్తున్నాను. మరియు ఇహపరాల కీడు నుండి, అది నాకు తెలిసినదైనా, నాకు తెలియనిదైనా, నేను నీతో శరణు వేడుకుంటున్నాను. మరియు నీ దాసుడు, నీ ప్రవక్త ముహమ్మద్ నిన్ను అర్ధించిన మేలుని నేను నిన్ను అర్థిస్తున్నాను. మరియు నీ దాసుడు, నీ ప్రవక్త ముహమ్మద్ నీతో శరణు వేడుకున్న కీడు నుండి నేను నీతో శరణు వేడుకుంటున్నాను. ఓ అల్లాహ్! నిశ్చయంగా నేను నిన్ను స్వర్గమును మరియు దానికి దగ్గర చేసే మాటను లేదా చేష్టను అర్థిస్తున్నాను. మరియు నేను నీతో నరకము నుండి మరియు దానికి దగ్గర చేసే మాట లేదా చేష్ట నుండి శరణు వేడుకుంటున్నాను. మరియు నీవు నా కోసం చేసిన ప్రతీ తీర్పుని నా కొరకు మేలుగా చేయమని నిన్ను అర్థిస్తున్నాను. [74] [74] దీనిని ఇబ్నె మాజహ్, ఆయిషా రదియల్లాహు అన్హా నుండి హదీథు నెంబరు (3846)  నమోదు చేసినారు.

అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్య దైవం లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. రాజ్యాధికారము ఆయనకే చెందుతుంది. సర్వస్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయనే జీవింపజేస్తాడు, ఆయనే మరణింపజేస్తాడు. సర్వ శ్రేయస్సు ఆయన చేతిలోనే ఉంది. ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు. అల్లాహ్ పరమ పరిశుద్ధుడు. సమస్త స్తోత్రములు అల్లాహ్ కొరకే. మరియు అల్లాహ్ తప్ప వేరే నిజఆరాధ్యుడు లేడు. అల్లాహ్ మహోన్నతుడు. మహాశక్తిశాలి అయిన అల్లాహ్ ప్రసాదించినది తప్ప ఎలాంటి శక్తి కాని, అధికారము కానీ మాకు లేదు. [75] [75] దీనిని బుఖారీ, ఉబాదహ్ బిన్ సామిత్ రదియల్లాహు అన్హు నుండి (హదీథు సంఖ్య: 1154) నమోదు చేసినారు.

ఓ అల్లాహ్ ! నీవు ఇబ్రాహీం ను ఆయన కుటుంబం వారిని కరుణించినట్లుగానే ముహమ్మద్'ను మరియు ఆయన కుటుంబాన్నికరుణించు. నిశ్చయంగా స్తోత్రానికి అర్హుడవు, ఘనత కలవాడవు నీవే. ఓ అల్లాహ్ ! ఇబ్రాహీం పై ఆయన కుటుంబం పై శుభాలు కురిపించినట్లుగానే ముహమ్మద్' మరియు ఆయన కుటుంబంపై శుభాలు కురిపించు. నిశ్చయంగా స్తోత్రానికి అర్హుడవు, ఘనత కలవాడవు నీవే. [76] [76] దీనిని బుఖారీ, కఅబ్ బిన్ ఉజ్రహ్ రదియల్లాహు అన్హు హదీథు నుండి (హదీథు సంఖ్య: 3370) నమోదు చేసినారు.

ఓ మా ప్రభూ! మాకు ఇహలోకంలో శుభాన్ని మరియు పరలోకంలో కూడా శుభాన్ని ప్రసాదించు మరియు మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు! [అల్ బఖర 2:201]

ఈ మహత్తరమైన స్థలంలో (అరఫాత్ మైదానంలో) హజ్ చేయువాడు మునుపు చెప్పిన జిక్ర్'లు, దుఆలు మరియు వాటి అర్థంలో ఉన్న అన్ని జిక్ర్'లు, దుఆలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీద దురూద్ పంపడాన్ని పునరావృతం చేయడం ఉత్తమం. దుఆ చేయుటలో ఉత్సాహం చూపాలి, తన ప్రభువును ఇహలోక, పరలోకాల క్షేమాల కోసం అర్థించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేయునప్పుడు దుఆను మూడుసార్లు పునరావృతం చేసేవారు. కనుక ఇక్కడ కూడా ఆయన (అలైహిస్సలాతు వస్సలాం)ను అనుసరించడం అవసరం.

ఈ స్థలంలో (అరఫాలో) ప్రతి ఒక్కరూ తన ప్రభువైన అల్లాహ్‌ పట్ల పశ్చాత్తాపంతో, వినయంతో, ఆయన మహిమ ముందు లోబడిన హృదయంతో నిలవాలి. అతడు అల్లాహ్‌ నుండి ఆయన యొక్క కరుణ, క్షమాపణలను ఆశించాలి, ఆయన శిక్ష, కోపాల నుండి భయపడాలి. తనను తానే పరిశీలించుకుంటూ, నిష్కల్మషమైన తౌబాను చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది మహత్తరమైన దినం, విశాలమైన సమాగమం. ఈ రోజున, అల్లాహ్ తన దాసులపై తన దాతృత్వాన్ని ప్రసాదిస్తాడు మరియు తన దూతల ముందు వారి గురించి గొప్పగా ప్రశంసిస్తాడు. నరకము నుండి అధికంగా విమోచన కలిగిస్తాడు. ఈ దినం (అరఫా దినం) కంటే ఎక్కువగా షైతాన్ ఇంతగా అవమానించ బడినట్టు, చిన్నబోయినట్లు, పరాభవించబడినట్టు కనిపించిన దినం లేదు — బద్ర్ రోజు మినహా. అల్లాహ్ తన దాసుల పట్ల చూపిన ఉదారత, వారి పట్ల ఆయన చూపిన దయ, ఆయన విముక్తి మరియు క్షమాగుణం గురించి అతడు సాక్ష్యమిచ్చిన విషయాలే దీనికి కారణం.

సహీహ్ ముస్లింలో, ప్రవక్త (ﷺ) ఇలా తెలిపారని ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖించారు: అల్లాహ్ తన దాసులను నరకాగ్నినుండి అరఫా రోజున విడుదల చేసినంతగా వేరే రోజు చేయడు. నిశ్చయంగా అల్లాహ్ సమీపిస్తాడు, దాసులను చూసి దైవదూతల ఎదుట గర్విస్తాడు. పిదప వారిని ‘వీరంతా దేనికోసం ప్రోగయ్యారు ?’ అని అడుగుతాడు. [77]. [77] దీనిని ముస్లిం ఆయిష రదియల్లాహు అన్హా హదీథు నుండి (హదీథు సంఖ్య: 1348) ఉల్లేఖించారు.

కాబట్టి ముస్లింలు అల్లాహ్ ముందు తమ మంచితనాన్ని ప్రదర్శించి, తమ శత్రువు అయిన షైతానును అవమానించాలి, అధికంగా జిక్ర్ చేయడం, దుఆ చేయడం, నిరంతర తౌబా మరియు అన్ని పాపాల నుండి ఇస్తిగ్‌ఫార్ చేయడం ద్వారా షైతానును దుఃఖింప చేయాలి. హజ్జ్ యాత్రికులు ఈ స్థలంలో సూర్యాస్తమయం వరకు జిక్ర్, దుఆ మరియు అల్లాహ్‌ను వేడుకోవడంలో నిమగ్నమై ఉంటారు. సూర్యుడు అస్తమించగానే వారు ముజ్దలిఫా వైపు గౌరవంతో, సౌమ్యతతో వెళతారు. తరచుగా తల్బియా పఠిస్తూ మరియు ప్రవక్త (ﷺ) ఆచారాన్ని అనుసరిస్తూ బహిరంగ మైదానాలలో త్వరత్వరగా ముందుకు వెళతారు. సూర్యాస్తమానికి కంటే ముందుగానే అరఫా నుండి వెళ్లిపోవడం అనుమతించ బడలేదు; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూర్యాస్తమయం అయ్యే వరకు అక్కడే నిలిచారు మరియు ఆయన ఇలా పలికినారు: «మీరు నా నుండి హజ్ ఆచరణలను నేర్చుకోండి»[78]. [78] దీని ఉల్లేఖన ఇంతకు ముందు వచ్చి ఉన్నది.

అందువల్ల వారు ముజ్దలిఫాకు చేరుకున్నప్పుడు, అక్కడ మగ్రిబ్‌ మూడు రకాతులు, మరియు ఇషా రెండు రకాతులు కలిపి (జమా చేసి), ఒక అజాన్ మరియు రెండు ఇఖామతులతో పూర్తి చదవాలి, వారు ముజ్దలిఫాకు చేరుకున్న వెంటనే; ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ఆచరణ. వారు ముజ్దలిఫాకు మగ్రిబ్ సమయం దాటక ముందే చేరుకున్నా గానీ, లేదా ఇషా సమయం వచ్చాక చేరుకున్నా గానీ, (ఇలానే చేయాలి).

కొంతమంది సామాన్యులు ముజ్దలిఫాకు చేరుకున్న వెంటనే జమరాత్ కొరకు రాళ్ళను వెదకడమూ, చాలామంది ఈ చర్యను షరీయత్‌ ప్రకారమే చేస్తున్నాము అనుకుంటూ చేయడమూ చూస్తుంటాము — అయితే ఇది పూర్తిగా తప్పు, దానికి ఎటువంటి ఆధారమూ లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనకు రాళ్లు తీసుకురావాలని ఆదేశించినది మష్‘అర్ హరామ్ నుండి మినా చేరుకన్న తరువాత మాత్రమే. రాళ్లు ఎక్కడి నుండి తీసుకున్నా పర్వాలేదు. వాటిని ముజ్దలిఫా నుండే తీసుకోవలసిన అవసరం లేదు; మినాలోనూ ఏరుకోవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం‌ సున్నతును అనుసరిస్తూ, ఆ రోజున ఏడు రాళ్లు తీసుకుని జమరతుల్ అక్బాపై విసరాలి. మిగతా మూడు రోజుల్లో, ప్రతి రోజూ మినాలో నుండి ఇరవై ఒక్క రాళ్లను తీసుకుని మూడు జమరాత్‌లపై విసరాలి.

రాళ్లను కడగడం ముస్తహబ్ కాదు, కడగకుండానే వాటితోనే రమీ చేయాలి; ఎందుకంటే ఇలా కడిగినట్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి మరియు ఆయన సహాబాల నుంచి ఎలాంటి ఆధారాలు లేవు. అలాగే, ముందే వాడిన (విసిరిన) రాళ్లతో మళ్లీ రమీ చేయకూడదు.

హాజీ ఈ రాత్రి ముజ్దలిఫాలో గడపాలి. అయితే స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరియు బలహీనులు, అర్ధరాత్రి తర్వాత మినాకు వెళ్లటానికి అనుమతి ఉన్నది — హదీథు: ఆయిషా, ఉమ్ము సలమా మరియు ఇతరుల ఉల్లేఖన ఆధారంగా. ఇతర యాత్రికుల విషయానికొస్తే, వారు ఫజ్ర్ నమాజు చేసే వరకు అక్కడే ఉండాలని నొక్కి చెప్పబడింది. తరువాత, వారు అల్-మష్'అర్ అల్-హరామ్ (ముజ్దలిఫా) వద్ద నిలబడి, ఖిబ్లా వైపు ముఖం పెట్టి, అల్లాహ్ గొప్పతనాన్ని ప్రకటిస్తూ, ఉదయం స్పష్టంగా సూర్యుడు ప్రకాశించే వరకు ప్రార్థనలు చేస్తూ, ఆయనను స్మరించుకోవడంలో ఎక్కువగా పాల్గొనాలి. ప్రార్థన సమయంలో ఇక్కడ చేతులు ఎత్తడం మంచిది, మరియు వారు ముజ్దలిఫాలో ఎక్కడ నిలబడినా అది వారికి సరిపోతుంది. మష్‘అర్ దగ్గరికి వెళ్లడం లేదా దానిపై ఎక్కడం వారికి తప్పనిసరి కాదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: «నేను ఇక్కడ నిలిచాను — అది: మష్‘అర్ అల్-హరామ్ వద్ద — మరియు జమ్'ఉన్ అంతా (ముజ్దలిఫా అంతా) నిలిచే స్థలమే» [79] ముస్లిం తన సహీహ్ లో దీనిని నమోదు చేసినారు. జమ్ఉన్ అంటే ముజ్దలిఫా అని అర్ధం. [79] దీనిని ముస్లిం జాబిర్ రదియల్లాహు అన్హు హదీథు నుండి (హదీథు సంఖ్య: 1218) నమోదు చేసినారు.

ఉదయం స్పష్టంగా, ప్రకాశవంతంగా ఉన్నప్పుడు, వారు సూర్యోదయానికి ముందే మినాకు బయలు దేరాలి, వారి ప్రయాణ సమయంలో తరచుగా తల్బియా చేయాలి. ముహస్సిర్ చేరుకున్న తర్వాత కొద్దిగా వేగంగా నడవడం ముస్తహబ్.

వారు మీనాకు వచ్చినప్పుడు జమరతుల్ అక్బా వద్ద తల్బియాను ఆపివేయాలి. అక్కడికి చేరిన వెంటనే ఏడు వరుస రాళ్లు దానిపై రువ్వుతారు. ప్రతి రాయి వేసేటప్పుడు చేతిని పైకి ఎత్తి తక్బీర్ పలుకుతారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసినట్లుగా దాని మధ్యభాగం నుంచి రువ్వడం ముస్తహబ్. కాబాను ఎడమవైపు, మినాను కుడివైపు ఉంచుకుని రువ్వాలి. ఇతర దిశల నుండి రువ్వినా పర్వాలేదు, రాయి జమరత్ స్థంభం వద్ద పడితే చాలు. రాయి ఆ గుంతలో ఉండటం తప్పనిసరి కాదు, కేవలం పడిందంటే సరిపోతుంది. రాయి గుంతలో పడిపోయి తర్వాత బయటకు వెళ్లినా సరే, అది సరిపోతుంది అని ఎక్కువమంది ఉలమాలు చెప్పినారు. దీనిని అష్-శరహుల్ ముహజ్జబ్ లో నవవీ రహిమహుల్లాహ్ పేర్కొన్నారు. జమరాత్‌కు ఉపయోగించే రాళ్లు ఖద్‌ఫ్ రాళ్లంత ఉండాలి, అంటే శెనగ గింజ కంటే కొంచెం పెద్దవిగా ఉండాలి.

రాళ్ళు విసిరిన తరువాత తన హదీను (ఖుర్బానీ పశువును) వధించాలి. దానిని జుబాహ్ చేసేటప్పుడు ఇలా పలకడం ముస్తహబ్: "బిస్మిల్లాహ్, వల్లాహు అక్బర్, అల్లాహుమ్మ హాథా మిన్ క వ లక" (అల్లాహ్ పేరుతో, అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు, ఓ అల్లాహ్‌! ఇది నీ నుంచే మరియు నీ కొరకే). దానిని ఖిబ్లా వైపు తిప్పి వధించాలి. సున్నత్ ఏమిటంటే – ఒంటెను నిలబెట్టి ఎడమ కాలి ముడిని కట్టిన స్థితిలో వధించాలి, మేకలు, గొర్రెలు, ఎద్దులను వాటి ఎడమ పక్క పడుకోబెట్టి వధించాలి. ఖిబ్లా వైపుకి తిప్పకుండా వధిస్తే సున్నతు వదిలివేసినవాడవుతాడు కానీ అతని ఖుర్బానీ చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే ఖిబ్లా వైపుకి తిప్పడం సున్నత్, ఫర్జ్ కాదు. తన హదీయ్ నుండి తినడం, దానిని ఇతరులకు బహూదానం చేయడం మరియు దాని వలన దాన ధర్మం చేయడం ముస్తహబ్. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: కావున దానిని (వాటి మాంసాన్ని) తినండి మరియు లేమికి గురి అయిన నిరుపేదలకు తినిపించండి. [అల్ హజ్జ్ 22:28] ఖుర్బానీ చేయు సమయం తష్రీఖ్ రోజులలో మూడవ రోజు సూర్యాస్తమయం వరకూ ఉంటుంది, ఇదే అహ్లుల్ ఇల్మ్ (జ్ఞానుల) ఉత్తమమైన అభిప్రాయములలో ఒకటి. అందువల్ల ఖుర్బానీ ఆచరణ వ్యవధి — యౌమున్-నహర్ (వధి రోజు) మరియు ఆ తరువాత మూడు రోజులైన తష్రీఖ్ రోజులు కలిపి నాలుగు రోజులు అవుతాయి.

ఖుర్బానీ చేసిన తరువాత, శిరోముండనం చేసుకోవాలి లేదా తలవెంట్రుకలు కత్తిరించుకోవాలి. శిరోముండనం చేసుకోవటం (హల్క్‌) ఉత్తమం; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శిరోముండనం చేసుకున్న వారికి (మూడు సార్లు) దయ మరియు క్షమ కోసం ప్రార్థించారు, మరియు తల వెంట్రుకలు కత్తిరించుకున్న వారి కొరకు ఒక్కసారి మాత్రమే ప్రార్థించారు. కేవలం తల యొక్క కొంత భాగం వెంట్రుకలు కత్తిరించటం సరిపోదు, మొత్తం తలవెంట్రుకలు శిరోముండనంలా కత్తిరించుకోవాలి. మహిళ అయితే, ఆమె ప్రతి జడ నుంచి ఒక అంగుళం అంత (అన్ములా) లేదా అంతకంటే తక్కువ కత్తిరించాలి.

జమరతుల్ అక్బాపై రాళ్ళు రువ్వి మరియు శిరోముండనం లేదా తల వెంట్రుకలు కత్తిరించడం తర్వాత, ముహ్రిమ్‌కి ఇహ్రామ్ వల్ల నిషిద్ధమైన ప్రతీది అనుమతించబడుతుంది — స్త్రీలు తప్ప. దీన్ని మొదటి తహల్లుల్ అని పిలుస్తారు. ఈ తహల్లుల్ తరువాత, సుగంధ ద్రవ్యం ఉపయోగించు కోవడం మరియు మక్కాకు వెళ్లి తవాఫ్ ఇఫాజా చేయడం సున్నతంగా ఉంటుంది. ఎందుకంటే, ఆయిషా (రదియల్లాహు అన్హా) హదీథు ఇలా ఉన్నది: నేను అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఇహ్రాంలో ప్రవేశించే ముందు మరియు హలాలయ్యే ముందు (హజ్ లేదా ఉమ్రహ్ పూర్తయినప్పుడు, కాబా ప్రదక్షిణం చేయడానికి ముందు) సుగంధ ద్రవ్యాలను పూసేదానిని [80]. దీనిని బుఖారీ, ముస్లిం నమోదు చేసినారు. [80] బుఖారీ, హదీథు సంఖ్య (1539) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1189).

ఈ తవాఫ్‌ను తవాఫ్ ఇఫాజా, తవాఫ్ జియారత్ అని పిలుస్తారు. ఇది హజ్‌కి ఒక రుక్న్ (అవిభాజ్య భాగం), ఇది లేకుండా హజ్ పూర్తికాదు. ఇదే అల్లాహ్ సుబ్హానహూ తఆలా తన ఈ వాక్యంలో ఉద్దేశించినది కూడాను: తరువాత వారు హజ్జ్ ఆచారాలు (తఫస్) మరియు మొక్కుబడులు (నుజుర్) పూర్తి చేసుకొనిన పిదప ఆ ప్రాచీన గృహం (కఅబహ్) యొక్క ప్రదక్షిణ చేయాలి. [అల్ హజ్జ్ 22:29]

తవాఫ్ చేసిన తరువాత మరియు మఖామె ఇబ్రాహీం వెనుక రెండు రకాతుల నమాజు ఆచరించిన తరువాత, ముతమత్తీ అయినవాడు సఫా మరియు మర్వా మధ్య సయీ చేస్తాడు. ఈ సయీ అతని హజ్‌కి సంబంధించింది, మరియు మొదటి సయీ అతని ఉమ్రహ్ కు సంబంధించినది.

ఒక సయీ మాత్రమే చాలు అని చెప్పడం సరైనది కాదు. పండితుల బలమైన అభిప్రాయం ప్రకారం, ఇది సరిపోదు. ఎందుకంటే ఆయిషా రదియల్లాహు అన్‌హా నుండి వచ్చిన హదీథులో ఇలా వర్ణించబడింది: «మేము అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కలిసి బయలుదేరాము» అంటూ ఆమె వర్ణించిన హదీథులో ఇలా ఉంది: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: ఎవరైతే హదీ (ఖుర్బానీ జంతువు) వెంట తీసుకొని ఉన్నారో వారు హజ్‌తో పాటు ఉమ్రహ్ నియ్యతు చేసుకొని ఇహ్రామ్‌లో ప్రవేశించాలి. అప్పుడు వారు ఆ రెండింటి నుండి కలిసి (ఒకేసారి) హలాల్ అయ్యే వరకు హలాల్ కాకూడదు... ఇంకా ఇలా సెలవిచ్చినారు: ఉమ్రహ్ కు ఇహ్రామ్ ధరించినవారు బైతుల్లాహ్ తవాఫ్ చేసారు, సఫా మరియు మర్వాను సయీ చేసారు, తరువాత వారు హలాల్ అయ్యారు. తరువాత మీనా నుండి తమ హజ్జ్ పూర్తయిన తరువాత, మరోసారి తవాఫ్ చేసారు ([81]) బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు. [81] దీనిని బుఖారీ (హదీథు సంఖ్య: 1556) మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 1211) నమోదు చేసినారు.

ఉమ్రహ్ కోసం తల్బియా పలికేవారి గురించి ఆమె రదియల్లాహు అన్హా ఇలా పలికారు: ‘వారు మీనా నుండి హజ్జ్‌కు తిరిగి వచ్చిన తర్వాత మరో తవాఫ్ చేస్తారు’ — అంటే అర్థం: సఫా మరియు మర్వా మధ్య సయీ చేయడం, ఇది ఈ హదీథు యొక్క అత్యంత సరైన వివరణ. ఇంకొందరు చెప్పినట్లు ఆమె దానితో తవాఫ్ ఇఫాదాను ఉద్దేశించింది అని చెప్పడం సరైనది కాదు; ఎందుకంటే తవాఫ్ ఇఫాదా అనేది ప్రతి ఒక్కరి విషయంలో ఒక రుక్న్ మరియు వారు దాన్ని ఇప్పటికే నిర్వహించారు. అసలు ఉద్దేశం: ముతమత్తీకి ప్రత్యేకమైనది, అంటే మినా నుండి తిరిగి వచ్చిన తర్వాత హజ్జ్‌ను పూర్తిచేయడానికి సఫా మరియు మర్వా మధ్య మళ్లీ ఒకసారి సయీ చేయడం. ఇది అల్లాహ్‌ అనుగ్రహంతో స్పష్టమైన విషయమే, మరియు ఇదే చాలా మంది పండితుల అభిప్రాయం.

ఇది (వివరణ) సరైనది అని నిర్ధారించే బుఖారీ సహీహ్‌లో వచ్చిన హదీథు కూడా ఉంది — ఇది తఆలీక్ రూపంలో ఖచ్చితంగా తెలుపబడినది — అంటే: ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హుమాను తమత్తు హజ్జ్ గురించి ప్రశ్నించగా, ఆయన ఇలా సమాధానమిచ్చారు: హిజ్రత్ చేసినవారు, అన్సార్‌లు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలు, మరియు మేము అందరం హజ్జతుల్ విదా సమయంలో ఇహ్రామ్ ధరించాం. మక్కాకు వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: 'మీ ఇహ్రామ్‌ను హజ్జ్ కొరకు కాకుండా ఉమ్రహ్‌గా మార్చండి — అయితే ఎవరైతే హదీ (ఖుర్బానీ పశువు)ని తీసుకువస్తూ ఉన్నారో వారు తప్ప.' కాబట్టి మేము బైతుల్లాహ్ తవాఫ్ చేసాము, సఫా మరియు మర్వా మధ్య సయీ చేసాము, భార్యలతో సహవాసం చేసాము (హలాల్ అయ్యాము), మరియు మామూలు వస్త్రాలు ధరించాము. తర్వాత ఆయన ఇలా అన్నారు: 'ఎవరైతే హదీ తీసుకుని వచ్చారో (గొంతుకు తాడుతో గుర్తు పెట్టినవారో) వారు హదీ తన గమ్యస్థానానికి చేరే వరకు హలాల్ కాకూడదు.' అనంతరం తర్వియ్యా దినం సాయంత్రం మాకు ఆదేశించబడింది: 'ఇప్పుడు హజ్జ్ కొరకు ఇహ్రామ్ ధరించండి.' తరువాత మేము మనాసిక్ (హజ్జ్ ఆచరణలు) పూర్తి చేసిన తర్వాత, తిరిగి వచ్చి బైతుల్లాహ్ తవాఫ్ చేసాము, మరియు సఫా మర్వా మధ్య సయీ చేసాము." ([82]). ఈ వివరాలు మా ఉద్దేశ్యాన్ని నెరవేర్చాయి, ఎందుకంటే తమత్తు హజ్ చేసేవారు రెండుసార్లు సయీ చేయాలని స్పష్టంగా పేర్కొంది. మరియు అల్లాహ్ అందరి కంటే బాగా ఎరుగును. [82] బుఖారీ, హదీథు సంఖ్య (1572).

జాబిర్ రదియల్లాహు అన్హు నుండి ముస్లిం నమోదు చేసిన హదీథు విషయానికొస్తే: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహాబాలు సఫా మరియు మర్వా మధ్య ఒక్కసారి మాత్రమే సయీ చేసారు, అంతేకాని అంతకన్నా ఎక్కువ చేయలేదు."([83]) వారి మొదటి తవాఫ్‌ (సయీతో కూడినదీ) — ఇది హదీ తీసుకువచ్చిన సహాబాల విషయానికి సంబంధించినదిగా భావించబడుతుంది. ఎందుకంటే వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కలిసి తమ ఇహ్రామ్‌లోనే ఉన్నారు, మరియు హజ్జ్, ఉమ్రహ్ రెండింటి నుండి ఒకేసారి హలాల్ అయ్యారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్జ్ మరియు ఉమ్రహ్ రెండింటికీ కలిపి ఇహ్రామ్ ధరించారు (ఖిరాన్ హజ్), అలాగే హదీ తీసుకువచ్చిన వారికి కూడా ఉమ్రహ్ తో పాటు హజ్జ్‌కు ఇహ్రామ్ ధరించాలని, మరియు ఈ రెండింటి నుండి పూర్తిగా పూర్తయ్యేంతవరకూ హలాల్ కాకూడదని ఆజ్ఞాపించారు. హజ్జ్ మరియు ఉమ్రహ్ లను కలిపి చేసే వ్యక్తి (అంటే ఖారిన్) ఒకసారి మాత్రమే సయీ చేయాలి — ఇది పైన పేర్కొన్న జాబిర్ రదియల్లాహు అన్హు యొక్క హదీథుతో పాటు ఇతర సహీహ్ హదీథుల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. [83] ముస్లిం, హదీథు సంఖ్య (1215)

అదే విధంగా, హజ్ కోసం ఇహ్రామ్ స్థితిలోకి ప్రవేశించి, బలి సమర్పించే రోజు వరకు తన ఇహ్రామ్ స్థితిలో ఉన్న వ్యక్తి కూడా ఒక సయీకి లోబడి ఉంటాడు. కాబట్టి, ఖారిన్ మరియు   ముఫ్రిద్  తవాఫ్ ఖుదూమ్ తర్వాత సయీ చేసినప్పుడు, తవాఫ్ ఇఫాద తర్వాత సయీకి అది సరిపోతుంది. ఇదే విషయంలో ఆయిషా, ఇబ్ను అబ్బాస్, మరియు జాబిర్ (రదియల్లాహు అన్హుమ్) వారి హదీథుల మధ్య సరైన సమన్వయం కనబడుతుంది. ఇలా చేస్తే హదీథుల మధ్య కనబడే విరుద్ధత తొలగిపోతుంది మరియు అన్ని హదీథుల ప్రకారం ఆమలుచేయడం సాధ్యమవుతుంది.

ఈ కలయిక మరియు అన్వయింపుకు ఆయిషా మరియు ఇబ్నె అబ్బాస్ యొక్క ప్రామాణిక హదీథులు ముతమత్తి అనుకూలంగా రెండవ సయీని ఋజువు చేస్తున్నాయి మరియు జాబిర్ హదీథు యొక్క స్పష్టమైన వచనం దానిని నిరాకరిస్తుంది మరియు హదీథు సూత్రాల శాస్త్రం మరియు హదీథుల పరిభాష ప్రకారం, సానుకూలమైనది ప్రతికూలత కంటే ప్రాధాన్యతనిస్తుంది మరియు అల్లాహ్ సుభానహు వ త'ఆలా హక్కును ఇచ్చేవాడు అనే వాస్తవం కూడా మద్దతు ఇస్తుంది. మరియు అల్లాహ్ సహాయం లేకుండా చెడు నుండి వైదొలగడానికి లేదా మంచి చేయడానికి ఎవరికీ అధికారం లేదు.

అధ్యాయం

నహర్ (బలిదానం) రోజున హాజీ చేయవలసిన పనులలో ఉత్తమమైన వాటి వివరణ.:

హాజీ నహర్ రోజున ఈ నాలుగు కార్యాలను (జమరాత్ రమీ, ఖుర్బానీ, తలకత్తిరింపు, తవాఫ్-సయీ) క్రింద పేర్కొన్న క్రమంలో చేయడం ఉత్తమం — జమరతుల్ఉక్బా వద్ద రమీ చేయడం (రాళ్లు విసరడం), ఖుర్బానీ చేయడం, తల గుండు చేయించుకోవడం లేదా జుట్టు కత్తిరించుకోవడం, బైతుల్లాహ్ తవాఫ్ చేయడం, ఆపై సయీ (ముతమత్తీకి తప్పనిసరి; అలాగే ముఫ్రిద్, ఖారిన్‌కు తవాఫ్ ఖుదూమ్‌తో పాటు సయీ చేయకపోతే వారు కూడా చేస్తారు). ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అమలు రాచేసిన క్రమం. అయితే, ఎవరైనా వీటిని ముందు వెనుక చేస్తే, అలాంటి వ్యక్తి హజ్జ్‌ సరైనదే అవుతుంది, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయంలో సడలింపు ఇచ్చారు. ఇది సయీను తవాఫ్‌కు ముందు చేయడానికి కూడా వర్తిస్తుంది, ఎందుకంటే ఇది నహర్ రోజున చేయవలసిన కార్యాలలో ఒకటి. కాబట్టి ఇది కూడా పై సడలింపు హద్దులోకి వస్తుంది. దీని గురించి ఒక సహాబీ (రదియల్లాహు అన్‌హు) ఇలా చెప్పారు: "నహర్ రోజు ఎవరైనా ఏదైనా పనిని ముందుగా చేశామని పలికిన ప్రతీసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: చేయండి మరియు ఎలాంటి దోషమూ లేదు [84], అంతేకాకుండా, పొరపాటు లేదా అజ్ఞానం ఉండే సందర్భాలలో ఇది ఒకటి కాబట్టి, ఇది ఈ సాధారణ మినహాయింపు పరిధిలోకి వస్తుంది. ఎందుకంటే తేలికపరిచే తత్వం మరియు సౌలభ్యం దానిలో ఉంచబడ్డాయి. [84] బుఖారీ, ఉల్లేఖించారు హదీథు సంఖ్య (83) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1306).

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఒక వ్యక్తి – తవాఫ్‌కు ముందే సయీ చేసినవారిని గురించి – అడిగినప్పుడు, ఆయన ఇలా జవాబిచ్చారు: «ఎటువంటి దోషం లేదు» [85] దీనిని అబూదావుద్ ప్రామాణిక సనదుతో ఉసామా బిన్ షరీక్ హదీథు నుండి నమోదు చేసినారు. కాబట్టి, ఇది సాధారణమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరియు అల్లాహ్ మాత్రమే భాగ్యమును కలిగించేవాడు. [85] అబూ దావుద్, హదీథు సంఖ్య (2015).

హజ్జ్‌లో హాజీకి పూర్తి పరిపూర్ణమైన హలాల్ (తహల్లుల్ తామ్) పొందించు మూడు కార్యాలు ఇవే: జమరతుల్-అక్బా వద్ద రమీ చేయడం (రాళ్లు వేయడం), తల గుండు చేయించుకోవడం లేదా జుట్టు కత్తిరించుకోవడం, తవాఫ్ ఇఫాదా చేయడం మరియు దానితో పాటు సయీ చేయడం (ఇంతకు ముందు వివరించిన ప్రకారం). ఈ మూడు పనులు పూర్తిగా చేసిన తర్వాత, ఇహ్రామ్ ద్వారా హరామైన ప్రతిదీ హలాల్ అవుతుంది — భార్యలతో కలవడం, సుగంధాలు వాడటం, వస్త్రధారణ, తదితర విషయాలన్నీ. అయితే ఈ మూడింటిలో రెండే చేసినవారికి, ఇహ్రామ్‌లో హరామైన ప్రతిదీ హలాల్ అవుతుంది — భార్యలతో సంబంధం తప్ప. ఈ స్థితిని "తహల్లుల్ అవ్వల్ (ప్రథమ విముక్తి)" అంటారు.

హజ్జ్ యాత్రికుడు జమ్ జమ్ నీటిని త్రాగాలని మరియు కడుపు నిండా త్రాగాలని మరియు ఆ సమయంలో ఏవైనా ప్రయోజనకరమైన ప్రార్థనలు చేయటం ముస్తహబ్, మరియు «జమ్ జమ్ నీరు దానిని ఏ ఉద్దేశ్యంతో తాగితే ఆ ఉద్దేశ్యం కోసం ఉపయోగకరమవుతుంది» [86]. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జమ్ జమ్ నీరు గురించి ఇలా సెలవిచ్చినట్లు సహీహ్ ముస్లిం హదీథులో హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) నుండి నమోదై ఉంది: ఇది తృప్తినిచ్చే పోషకం [87]. అబూ దావూద్ (రహిమహుల్లాహ్) అదనంగా ఇలా తెలిపారు: «మరియు వ్యాధులకు నివారణ» [88]. [86] దీనిని ఇబ్నె మాజా జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు నుండి నమోదు చేసినారు, హదీథు సంఖ్య (3062). [88] అర్థం: "అబూ దావూద్ అత్తయ్యాలసీ", ఈ హదీథ్‌ను "అబూ జర్ (రదియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరణ కథనం" లోనే నమోదు చేసినారు. చూడండి : ముస్నద్ అబీ దావూద్ అత్తయ్యాలసీ హదీథ్ నం. 459. [87] ముస్లిం, హదీథు సంఖ్య (2473).

తవాఫ్ అల్-ఇఫాదహ్ మరియు సయీ చేయవలసిన వారికి సయీ చేసిన తర్వాత, యాత్రికులు మినాకు తిరిగి వచ్చి అక్కడ మూడు రాత్రింబవళ్లు ఉంటారు. సూర్యుడు తన అత్యున్నత స్థాయిని దాటిన తర్వాత మూడు రోజులలో ప్రతిరోజూ వారు మూడు జమ్రాలను విసురుతారు మరియు వాటిని విసరడంలో క్రమాన్ని పాటించడం తప్పనిసరి.

ఖైఫ్ మస్జిదు దగ్గర ఉన్న మొదటి జమర నుండి విసరడం ప్రారంభించాలి. అతను వరుసగా ఏడు గులకరాళ్ళను విసిరి, ప్రతి గులకరాయితో తన చేతిని పైకి ఎత్తాలి. జమరాత్ నుండి కొంచెం ముందుకు వెళ్లి దానిని మీ ఎడమ వైపుకు తిప్పి, ఖిబ్లా వైపు తిరిగి, మీ రెండు చేతులను పైకెత్తి, ప్రార్థన చేయడం, విపరీతంగా దుఃఖించడం సున్నత్.

మునుపటిలాగే, రెండవ జమర గులకరాళ్లు విసరాలి. గులకరాళ్ళను విసిరిన తర్వాత కొంచెం ముందుకు వెళ్లి, జమరాత్‌ను కుడి వైపున ఉంచి, ఖిబ్లా వైపు తిరిగి, రెండు చేతులను పైకెత్తి, విస్తారంగా ప్రార్థన చేయడం సున్నత్.

తరువాత, అతను మూడవ జమ్రాను రాళ్ళు విసిరి, అక్కడ ఆగడు.

తర్వాత తష్రీక్ రెండవ రోజు, జవాల్ తరువాత, జమరాతులపై మొదటి రోజున రాళ్ళు విసరినట్లే రాళ్ళు విసురుతాడు. మరియు మొదటి, రెండవ జమరాల వద్ద కూడా మొదటి రోజున చేసినట్లే చేస్తాడు — ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరిస్తూ.

తష్రీక్ యొక్క మొదటి రెండు రోజులలో జమరాతులపై రాళ్ళు విసరడం హజ్జ్ యొక్క కర్తవ్యాల్లో ఒకటి. అలాగే మొదటి, రెండవ రాత్రులు మినా లో గడపడం కూడా ఒక కర్తవ్యమే; అయితే నీళ్లు అందించే వారు, పశువులను కాపాడేవారు మరియు వీరితో సమానమైన బాధ్యతలు గలవారిపై మాత్రం ఇది అనివార్యం కాదు.

పైన పేర్కొన్న రెండు రోజుల్లో గులకరాళ్ళను విసిరిన తర్వాత, మినా నుండి త్వరగా బయలుదేరాలనుకునే వారు సూర్యాస్తమయానికి ముందే వెళ్లిపోవచ్చు. అయితే, అతను ఆలస్యం చేయడం, మూడవ రాత్రి గడపడం మరియు మూడవ రోజు జమ్రాలపై రాళ్ళు విసరడం మంచిది మరియు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: మరియు నియమిత రోజులలో అల్లాహ్ ను స్మరించండి. ఎవడైనా త్వరగా రెండు రోజులలోనే వెళ్ళిపోయినా, అతనిపై ఎలాంటి దోషం లేదు. మరెవడైనా నిదానించి నిలిచి పోయినా, అతనిపై ఎలాంటి దోషం లేదు, వాడికి, ఎవడైతే దైవభీతి కలిగి ఉంటాడో! [అల్ బఖర 2:203] ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు త్వరగా బయలుదేరేందుకు అనుమతి ఇచ్చారు; అయితే తాను మాత్రం త్వరగా బయలుదేరలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మినాలో నిలిచారు, మరియు జుల్ హిజ్జా 13వ తేదీ (తష్రీక్ మూడవ రోజు) జవాల్ తర్వాత జమరాతులపై రాళ్ళు విసిరి, తదుపరి జుహర్ నమాజు చేయక ముందే అక్కడి నుండి బయలుదేరారు.

స్వయంగా రాళ్ళు విసరలేని చిన్నారులకు సంబంధించిన వారెవరో (వారి విలీ), వారు తమ తరఫున రాళ్ళు విసిరిన తరువాత, ఆ పిల్లవాడి తరఫున కూడా జమరతుల్ అక్బా మరియు మిగిలిన జమరాలకు రాళ్ళు విసరవచ్చు. ఇలాగే, రాళ్ళు విసరలేని చిన్నారి అమ్మాయికి బదులుగా కూడా ఆమె వలీ రాళ్ళు విసరవచ్చు. ఇది జాబిర్ రదియల్లాహు అన్హు వారి హదీథు ఆధారంగా ఉంది — ఆయన ఇలా చెప్పారు: మేము రసూలల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి హజ్జ్ చేసాము, మాతో స్త్రీలు మరియు పిల్లలు ఉన్నారు. మేము పిల్లల తరఫున తల్బియా చెప్పాము, మరియు వారి తరఫున రాళ్ళు కూడా విసిరినాము." [89] దీనిని ఇబ్నె మాజ నమోదు చేసినారు. [89] తిర్మిథీ, హదీథు సంఖ్య (927).

రోగం, వృద్ధాప్యం లేదా గర్భధారణ వంటి వాటి కారణంగా రాళ్ళు విసరలేని వ్యక్తికి, తన తరఫున రాళ్ళు విసిరేలా ఇంకొకరిని నియమించడం అనుమతించబడింది. ఎందుకంటే మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: కావున మీరు మీ శక్తి మేరకు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండి... [అత్తగాబున్ 64:16] ఈ ప్రజలు — అంటే రోగులు, వృద్ధులు, గర్భిణులు — జమరాత్ వద్ద జనసమూహాన్ని తట్టుకోవడం వీళ్లకు సాధ్యం కాదు. అలాగే, ఆ రద్దీలో రాళ్ళ విసిరివేతకు నిర్ణయించిన సమయం దాటి పోతుంది, మరియు ఈ రాళ్ళ విసిరివేతను తర్వాత చేయడం షరియత్‌లో నిర్వచించబడలేదు. అందువల్ల, వీళ్లకు తగినవారు తమ తరఫున రాళ్ళు విసిరి వేసేలా చేయడం అనుమతించ బడింది. ఇది ఇతర హజ్జ్ ఆచరణల మాదిరి కాదు — ఎందుకంటే, ఇతర మనాసికులు (మిగతా హజ్జ్ కార్యాల) గురించి మాట కలిగితే, ఇహ్రామ్‌లో ఉన్న వ్యక్తి తన పేరు మీద వేరే వారిని నియమించకూడదు, అతని హజ్జ్/ఉమ్రహ్ నఫిల్ అయినా సరే. ఎందుకంటే, ఎవడైతే హజ్జ్ లేదా ఉమ్రహ్ కోసం ఇహ్రామ్ కట్టాడో, అవి నఫిల్ అయినా, అతనిపై వాటిని పూర్తి చేయడం తప్పనిసరి (వాజిబ్) అవుతుంది: మరియు అల్లాహ్ (ప్రసన్నత) కొరకు హజ్జ్ మరియు ఉమ్రహ్ పూర్తి చేయండి... [అల్ బఖరహ్ 2:196] తవాఫ్ మరియు సయీ సమయం పరిమితం కానందున ఇది తప్పిపోదు, అయితే రాళ్ళు విసరడానికి సమయం పరిమితం అయినందున అది తప్పిపోవచ్చు.

అరఫాత్‌లో నిలబడటం, ముజ్దలిఫాలో మరియు మినాలో రాత్రి గడపడం — ఇవి అన్నీ నిర్దిష్టమైన సమయాలకు చెందిన ఆచరణలు, కాబట్టి వాటి సమయం తప్పిపోవచ్చు అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఆచరణకు అశక్తుడైనవాడు ఈ స్థలాల్లో కొంత కష్టం ఉన్నా సరే, అందరితో కూడా ఉండటం సాధ్యమే. ఇది రాళ్ళు విసిరే స్థితికి భిన్నంగా ఉంది — ఎందుకంటే రాళ్ళు విసిరటం కోసం శక్తి అవసరం, జనసమూహాన్ని తట్టుకోవాలి, కాబట్టి అది ప్రత్యక్షంగా చేయడం చాలా కష్టం అవుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం: రాళ్ళు విసరటంలో సలఫ్ సాలిహీన్ (ధర్మాత్ములైన పూర్వ తాబియీన్, సహాబాలు) వకీల్ నియమించడాన్ని అనుమతించినారు, కానీ ఇతర హజ్ ఆచరణల విషయంలో అలా వకీల్ నియమించడం గురించి ఏ ఆధారం లేదు. అందువలన, రాళ్ళు విసరడంలో మాత్రం వకీల్ నియమించడానికి షరీఅతులో ఆధారముంది, కానీ అరఫా, ముజ్దలిఫా, మినాలలోని ఇతర ఆచరణలకు వకీల్‌ను నియమించటం షరీఅతు పరంగా ఋజువుకాలేదు.

ఇబాదతులన్నీ (ఆరాధనలన్నీ) తౌకీఫీయ్య (అల్లాహ్ లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించిన విధంగానే ఉండాలి), వాటిలో ఎవరికైనా తానే చేసి కొత్తగా ఏ విధానాన్నీ ప్రవేశపెట్టే హక్కు లేదు, ఖచ్ఛితమైన దలీల్ లేకుండా ధర్మంలో ఏ నూతన ఆచరణ కూడా ప్రారంభించరాదు. వకీల్ (ప్రతినిధి) విసిరే రాళ్ళ విషయంలో: అతను తన తరపున మొదటగా రాళ్ళు విసిరిన తరువాత, వెంటనే అదే చోట నుంచే తనను నియమించినవాడి తరపున కూడా రాళ్ళు విసరవచ్చు. మూడు జమరాత్‌లకు (ఒకటి తర్వాత ఒకటి) తన తరపున మరియు తన తరపున నియమించినవాడి తరపున ఇలా వరుసగా రాళ్ళు విసరవచ్చు, ఒక్కో జమర దగ్గర నిలిచినపుడు ఇద్దరి తరపున రాళ్ళు విసరడం సరైనదే. ఈ విషయంలో: మొదట తన తరపున మొత్తం రాళ్ళు విసరాలి, తర్వాత తిరిగి ఆ జమరా వద్దకు వచ్చి మళ్లీ వకీల్‌గా రాళ్ళు వేయాలి అని దానికి షరీఅతు యొక్క ఏ ఆధారం లేదు. అంతే కాకుండా, అలా తిరిగి రావడం వల్ల అవసరము లేని కష్టం, బాధ (హరజ్) కలుగుతుంది. కాబట్టి, షరీఅతు ప్రకారం సరైనది — ఒక్కో జమరాతు దగ్గర ఉండగానే తన తరపున ఒకసారి, వెంటనే మరోసారి తన తరపున నియమించినవాడి కొరకు వేయడం. మరియు పరమ పవిత్రుడు మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ...మరియు ఆయన ధర్మం విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు... [హజ్జ్ 22:78] ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: (ప్రజల కొరకు) విషయాలను తేలిక చేయండి, కష్టతరం చేయకండి; [90]. దానిని వారు (అంటే సహాబా రదియల్లాహు అన్హుమ్) తమ పిల్లల కోసం మరియు శక్తిలేని వారి తరఫున రాళ్ళు విసరలేదు అనడం ఋజువు కాలేదు. వారు అలా చేసి ఉంటే, అది తప్పక ఉల్లేఖించబడి ఉండేది, ఎందుకంటే అలాంటి విషయాల్ని ప్రజలు తెలియజేయడంలో ఆసక్తి చూపుతారు. అల్లాహ్ యే ఎక్కువగా తెలిసినవాడు. [90] దీనిని బుఖారీ అనస్ రదియల్లాహు అన్హు హదీథు నుండి (హదీథు సంఖ్య: 69) ఉల్లేఖించారు.

అధ్యాయం

తమత్తు' మరియు 'ఖిరాన్' చేసేవారికి ఖుర్బానీ (దమ్) విధిగా ఉండటం గురించి.

హజ్ చేసే వ్యక్తి ముతమత్తె లేదా ఖారిన్ అయి ఉండి — మరియు మస్జిద్ హరామ్ పరిసర ప్రాంతాలవాడు కాకపోతే — అతనిపై ఖుర్బానీ దానం విధి అవుతుంది. అది: ఒక గొర్రె, లేదా ఒంటె ఏడు వాటాల్లో ఒక భాగం, లేదా ఆవు ఏడు వాటాల్లో ఒక భాగం అయి ఉండాలి. ఇది తప్పనిసరిగా హలాల్ సంపాదన నుండి, మరియు శుభ్రమైన ఆదాయం నుండి కొనబడినదై ఉండాలి; ఎందుకంటే అల్లాహ్ పరమ పవిత్రుడు మరియు పరిశుభ్రమైనదే స్వీకరిస్తాడు.

ముస్లిం వ్యక్తికి అల్లాహ్ అతని సంపదలో నుండి స్వయంగా అతనే ఖుర్బానీ ఇచ్చుకోగల శక్తిని అందించినట్లయితే, ఇతరుల వద్ద అడగవలసిన అవసరం రాకుండా, తన ఖర్చులకు సరిపడంత ధనం ఉంచుకుని ఖుర్బానీ ఇవ్వడం మంచిది. ప్రజలనైనా — రాజులైనా సరే, ఇతరులైనా సరే — హదీయా (ఖుర్బానీ జంతువు) లేదా ఇతర విషయాల కొరకు దానం అడగకుండా ఉండడం మంచిది. ఇది ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి వచ్చిన చాలా హదీథులలో ప్రజల్ని అడగడాన్ని నిందిస్తూ, మరియు అడగకుండా ఉండేవారిని ప్రశంసిస్తూ స్పష్టంగా తెలుపబడింది.

కాబట్టి ముతమత్తె మరియు ఖారిన్ హదీ (ఖుర్బానీ జంతువు) ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే, అతనిపై హజ్‌లో మూడు రోజులు మరియు తన ఇంటికి తిరిగి వెళ్ళిన తరువాత ఏడురోజులు ఉపవాసం ఉండటం తప్పనిసరి. ఆ మూడు రోజుల ఉపవాసాన్ని ఎప్పుడు ఉండాలో అతను తన ఇష్టానుసారం ఉండవచ్చు. అతను తలచుకుంటే యౌమున్ నహర్‌కు (ఖుర్బానీ ఇచ్చే రోజునకు) ముందే ఆ ఉపవాసాన్ని ఉండవచ్చు. లేదా అయ్యాము తష్రీఖ్ మూడు దినాలలో ఆ ఉపవాసాన్ని ఉండవచ్చు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ఎవరైనా హజ్జె తమత్తు చేయదలుచుకుంటే, అతడు తన శక్తిమేరకు బలి ఇవ్వాలి. కాని ఎవరైతే ఖుర్బానీ ఇవ్వలేడో, హజ్జ్ కాలంలో మూడు రోజులు మరియు (ఇంటికి) తిరిగి వచ్చిన పిమ్మట ఏడు రోజులు ఉపవాసం ఉండాలి. ఈ విధంగా మొత్తం పది రోజులు ఉపవాసాలు ఉండాలి. ఇది మస్జిద్ అల్ హరామ్ దగ్గర నివసించని వారికి మాత్రమే. [అల్ బఖరహ్ 2:196] ఆయతు.

సహీహ్ బుఖారీలో, ఆయిషా మరియు ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా నుండి ఉల్లేఖించబడిన హదీథులో, వారు ఇలా అన్నారు: తష్రీఖ్ రోజులలో ఉపవాసం ఉండటానికి అనుమతి ఇవ్వబడలేదు, కాకపోతే హదీ (ఖుర్బానీ జంతువు)ని పొందలేనివారికి మాత్రమే అనుమతి ఇవ్వబడింది.([91]) ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆపాదించబడినదిగా పరిగణించబడుతుంది. మూడు రోజుల ఉపవాసాన్ని యౌమె అరఫా(అరఫా రోజు)కు ముందే ఉండటం ఉత్తమం, ఎందుకంటే అరఫా రోజున ఉపవాసం పాటించకుండా ఉండటమే ఉత్తమం; ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అరఫా రోజున ఉపవాసం పాటించకుండానే అరఫా మైదానంలో నిలిచారు, మరియు అరఫా మైదానంలో అరఫా రోజున ఉపవాసం ఉండరాదని నిషేధించారు. ఇంతేకాకుండా, ఆ రోజున ఉపవాసం ఉండకపోవడం ద్వారా జిక్ర్ మరియు దుఆలు చేయుట కొరకు శక్తినిస్తుంది. పైన పేర్కొన్న మూడు రోజుల ఉపవాసాలను వరుసగా లేదా విడివిడిగా ఉంచవచ్చు. అలాగే, ఏడు రోజుల ఉపవాసలలోనూ వరుసగా ఉండటం తప్పనిసరి కాదు. అవి వరుసగా లేదా విడివిడిగా ఉండవచ్చు, ఎందుకంటే అల్లాహ్ సుబ్'హానహు వ తఅాలా ఇందులో వరుసగా ఉండాలనే షరతు పెట్టలేదు, మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కూడా షరతు పెట్టలేదు. ఏడురోజుల ఉపవాసాన్ని తన ఇంటికి తిరిగి వచ్చిన తరువాతే ఉండటం ఉత్తమం; ఎందుకంటే అల్లాహ్ సుబ్'హానహు తఆలా ఇలా సెలవిచ్చాడు: ...ఏడు రోజులు (ఇంటికి) తిరిగి వచ్చిన పిమ్మట... [అల్ బఖరహ్ 2:196]. [91] అల్ బుఖారీ, హదీథు సంఖ్య (1998).

హదీ (ఖుర్బానీ) చేయలేనివారికి ఉపవాసం ఉండటం, రాజులు లేదా ఇతరుల వద్దను తన తరఫున బలి చేయటానికి హదీని అడగడం కంటే ఉత్తమమైనది. కానీ ఎవడైనా అడగకుండానే లేదా మనసులో ఆశించకుండానే ఎవరైనా హదీ లేదా ఇతరది ఏదైనా ఇచ్చినపుడు, అతను అది తీసుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు – అతను తాను కాక, ఇతరుల తరఫున హజ్ చేస్తున్నవాడైనా సరే. అర్థం ఏమిటంటే: హజ్ కోసం పంపినవారు ఇచ్చిన ద్రవ్యంతో హదీ కొనాలని స్పష్టంగా షరతు పెట్టకపోతే, తీసుకోవడంలో తప్పేమీ లేదు. అయితే కొంతమంది ప్రజలు ప్రభుత్వాన్ని లేదా ఇతరులను అడిగి, తప్పుడు పేర్లు చెప్పి, అబద్దంగా కొంతమంది పేర్లతో హదీని తీసుకుని వచ్చే పని చేస్తారు. ఇలా చేయడం నిస్సందేహంగా హరాము; ఎందుకంటే ఇది అబద్ధంతో సంపాదించడంలో వస్తుంది. అల్లాహ్ మానవులందరినీ — మనలను మరియు ఇతర ముస్లింలను — ఇలాంటి దురాచారాలనుంచి రక్షించుగాక.

అధ్యాయం

హాజీలకు మరియు ఇతరులకు సన్మార్గం వైపు మార్గదర్శకం (అమర్ బిల్ మఅరూఫ్) చేయటం అనివార్యం:

హాజీలపై మరియు ఇతరులపై ఉన్న కర్తవ్యాలలో అత్యంత అవసరమైనది — మంచి పనులు చేయమని ఇతరులను ఆదేశించడం (మంచి వైపు మార్గదర్శకం) మరియు చెడు పనులు చేయవద్దని ఇతరులను నివారించడం (దుష్ట నిరోధం), మరియు ఐదు పూటల నమాజులను జమాతుతో కలిసి క్రమంగా ఆచరించడం. అల్లాహ్‌ తన గ్రంథంలో ఆదేశించినట్లుగా, మరియు తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఆదేశించినట్లుగా.

మక్కా నివాసులు మరియు ఇతర ప్రదేశాల వారు, ఇళ్లలోనే నమాజు చేయటం మరియు మసాజిద్‌ను నిర్లక్ష్యం చేయటం — ఇది షరీయత్‌కు విరుద్ధమైన తప్పు. ఈ పని చేయకూడదని వారిని నివారించడం, మరియు మస్జిద్‌లలో నమాజు ఆచరించమని వారిని ఆదేశించటం అవసరం. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అంధుడైన మరియు మస్జిద్‌కు దూరంగా నివసిస్తున్న ఇబ్ను ఉమ్మె మక్తూమ్ రదియల్లాహు అన్హు, ఇంటి వద్దనే నమాజు చేసే అనుమతి కోరినప్పుడు, ఆయనకు ఇలా తెలిపారు: నీవు నమాజు పిలుపు (అజాన్) వినలేదా?" అతను ఇలా పలికినాడు: "అవును." అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: "అయితే పిలుపుకు స్పందించు (నమాజుకు రా)." ([92]) ఇంకొక హదీథులో ఇలా ఉంది: నేను నీకు ఎలాంటి అనుమతిని కనుగొనలేకపోతున్నాను." ([93]) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “నిశ్చయంగా నేను సలాహ్ కొరకు ఆదేశించి, అది ప్రారంభించబడేలా చేసి, తరువాత ఒక వ్యక్తిని ప్రజలకు నమాజు చదివించమని ఆదేశించి, తరువాత సామూహిక నమాజులో పాల్గొనని వారి వద్దకు వెళ్లి, వారిని వారి ఇళ్ళతో సహా తగులబెట్టాలని భావించినాను.” ([94]). ఇబ్ను మాజా తదితరుల సునన్ గ్రంథాల్లో హసన్ శ్రేణికి చెందిన ఇస్నాద్‌తో, ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనను ఇలా నమోదు చేసినారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: అదాను విన్న తరువాత సముచితమైన కారణం గలవాడిని మినహాయించి నమాజుకు రాని వాడి కొరకు ఏ నమాజు లేదు. ([95]) సహీహ్ ముస్లింలో ఇబ్నె మస్ఊద్ రదిఅల్లాహు అన్హు ఉల్లేఖన, ఆయన ఇలా తెలిపారు: రేపు (ప్రళయ దినాన) తానొక ముస్లింగా అల్లాహ్ ని కలవాలనుకునే వ్యక్తి ఈ నమాజుల కొరకు అజాన్ (ప్రకటన) ఇవ్వబడినప్పుడల్లా వాటిని పరిరక్షించుకోవాలి, (అంటే వాటిని తప్పకుండా నెరవేర్చాలి.) ఎందుకంటే అల్లాహ్ మీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు మార్గదర్శక పద్ధతుల్ని నిర్ణయించాడు. అవి కూడా ఆ మార్గదర్శక పద్ధతుల్లోనివే. ఒకవేళ మీరు కూడా ఇలా వెనక ఉండేవాని మాదిరిగా ఇంట్లో నమాజ్ చేసుకుంటే మీరు మీ ప్రవక్త విధానాన్ని వదలి పెట్టినవారవుతారు. మీరు గనక మీ ప్రవక్త విధానాన్ని విడిచి పెట్టినట్లయితే తప్పకుండా భ్రష్ఠత్వానికి లోనవుతారు. మరియు ఎవరయితే తమ ఇంటి దగ్గర చక్కగా పరిశుద్ధతనొంది (ఉదూ లేదా గుసుల్ చేసి) అల్లాహ్ గృహాల్లో ఏదయినా ఒక గృహానికి (మస్జిదుకు) వెళ్తారో, వారు వేసే ప్రతి అడుగుకు బదులుగా ఒక పుణ్యం పొందుతారు, మరియు ఒక స్థాయిని పెంచబడతారు, మరియు ఒక పాపం తుడిచిపెట్టబడతారు. మా కాలంలో మేము గమనించేవాళ్లము సామూహిక నమాజ్ లో పాల్గొనకుండా వెనక ఉండిపోయేవారు  కపటులు మాత్రమే. (వ్యాధి మొదలగు కారణాల చేత) నడవలేక పోతున్నవారిని ఇద్దరు మనుషుల సాయంతో తీసుకొని వచ్చి పంక్తిలో నిలబెట్టడం జరిగేది. [96] [92] అల్ బుఖారీ, హదీథు సంఖ్య (2420); ముస్లిం, హదీథు సంఖ్య (651). [93] దీనిని ముస్లిం నమోదు చేసినారు, హదీథు సంఖ్య 653, అబూహురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖన. [94] దీనిని అబూ దావుద్ అబ్దుల్లాహ్ బిన్ ఉమ్మె మక్తూమ్ రదియల్లాహు అన్హు నుండి నమోదు చేసినారు, హదీథు సంఖ్య (552). [95] ముస్లిం, హదీథు సంఖ్య (654). [96] అబూ దావుద్, ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా నుండి నమోదు చేసినారు, హదీథు సంఖ్య (551).

హజ్‌యాత్రికులు మరియు ఇతరులందరూ అల్లాహ్ హరాముగా ప్రకటించిన విషయాలకు దూరంగా ఉండడం అవసరం. అవి చేయకుండా జాగ్రత్త పడాలి. ఉదాహరణకు: వ్యభిచారం, స్వలింగ సంపర్కం, దొంగతనం, వడ్డీ లావాదేవీలు, అనాథల సొమ్ము తినడం, లావాదేవీలలో మోసం చేయడం, నమ్మక ద్రోహం చేయడం, మత్తు పదార్థాలు మరియు సిగరెట్లు తాగడం, చీలమండలం క్రింద బట్టలు వేలాడదీయడం, అహంకారం, అసూయ, ప్రదర్శనాబుద్ది, నిందలు వేయడం, చాడీలు చెప్పటం, ముస్లింలను ఎగతాళి చేయడం, మరియు రికార్డులు, వీణ, రెబెక్, వేణువుల వంటి సంగీత వాయిద్యాలను ఉపయోగించడం మరియు రేడియో మరియు ఇతర వనరుల నుండి పాటలు మరియు సంగీత వాయిద్యాలను వినడం, పాచికలు, చదరంగం ఆడటం మరియు జూదంలో పాల్గొనడం, అంటే మైసిర్, మరియు మానవులైనా లేదా ఇతరులైనా జీవులను చిత్రీకరించడం మరియు దానితో సంతృప్తి చెందడం. ఇవన్నీ అల్లాహ్ తన దాసుల కోసం ప్రతి సమయంలో మరియు ప్రతి ప్రదేశంలో నిషేధించిన చెడు విషయాలు. అందువలన, యాత్రికులు మరియు హరమ్ నివాసితులు వాటి నుండి జాగ్రత్తపడటం వేరే వారి కంటే ఎక్కువ అవసరం. ఎందుకంటే ఈ ప్రశాంత భూమిలో, ఈ పాపాల పాపం మరింత తీవ్రమైనది మరియు వాటి శిక్ష ఎక్కువగా ఉంటుంది.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: మరియు ఎవరైనా అందులో(హరంలో) అపవిత్రత మరియు అన్యాయం చేయగోరుతారో, అలాంటి వారికి మేము బాధకరమైన శిక్షను రుచి చూపుతాము. [అల్ హజ్జ్22:25]، అల్లాహ్ హరములో అణచివేత ద్వారా నాస్తికత్వాన్ని పాటించాలని ఉద్దేశించిన వారిని గట్టిగా శిక్షిస్తానని హెచ్చరించినప్పుడు, ఇక ఆ అన్యాయాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చినవాడు ఎలాంటి శిక్షకు గురవుతాడో మీరు ఊహించండి! ఖచ్చితంగా అతని శిక్ష మరింత తీవ్రమైనదిగా, భయంకరమైనదిగా ఉంటుంది. కావున దీనినీ మరియు ఇతర అన్ని పాపాలనూ చాలా జాగ్రత్తతో నివారించాలి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లుగా, ఈ పాపాలను మరియు ఇతర నిషిద్ధ విషయాలను నివారించకుండా యాత్రికుడు హజ్ యొక్క ప్రతిఫలాన్ని మరియు పాప విముక్తిని పొందలేడు: ఎవరైతే హజ్జ్ ను అశ్లీల పనులకు మరియు పాపకార్యాలకు దూరంగా ఉంటూ పూర్తి చేస్తారో అతను తన తల్లి ప్రసవించిన రోజు మాదిరిగా (పవిత్రంగా) మరలుతాడు. ([97]) [97] అల్ బుఖారీ, అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన హదీథు సంఖ్య (1521), ముస్లిం హదీథు సంఖ్య (1350) నమోదు చేసినారు.

ఈ అసహ్యకరమైన పనులన్నిటి కంటే తీవ్రమైనది మరియు పెద్దది ఏమిటంటే, ఒక వ్యక్తి చనిపోయిన వారిని వేడుకోవడం, వారితో మొరపెట్టడం, వారికి ప్రమాణాలు చేయడం మరియు వారి కోసం జంతువుల ఖుర్బానీ చేయడం - వారు అతని కోసం అల్లాహ్ వద్ద సిఫార్సు చేస్తారనే ఆశతోనో, లేదా అతని రోగాన్ని స్వస్థపరుస్తారనే ఆశతోనో లేదా అతని తప్పిపోయిన వ్యక్తిని తిరిగి రప్పిస్తారనే ఆశతోనో.

కాబట్టి ఇది అల్లాహ్ నిషేధించిన అతి ఘోరమైన బహుదైవారాధన, మరియు ఇది ఇస్లాంకు పూర్వ కాలం నాటి బహుదైవారాధకుల ధర్మం, మరియు అల్లాహ్ దానిని తిరస్కరించడానికి మరియు నిరోధించడానికి ప్రవక్తలను పంపాడు మరియు గ్రంథాలను అవతరింపజేశాడు.

కావున హజ్ యాత్రికులు మరియు ఇతరులలో ప్రతి ఒక్కరూ దీని నుండి (షిర్క్ నుండి) అప్రమత్తంగా ఉండాలి. గతంలో అలాంటి పని తమ వల్ల జరిగి ఉంటే, వెంటనే అల్లాహ్ వద్ద తౌబా చేయాలి. మరియు తౌబా చేసిన తర్వాత కొత్తగా హజ్‌ను ప్రారంభించాలి. ఎందుకంటే పెద్ద షిర్క్ (షిర్క్ అల్-అక్బర్) ఆచరణలన్నింటినీ రద్దు చేసేస్తుంది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ఒకవేళ వారు అల్లాహ్ కు సాటి (భాగస్వాములను) కల్పిస్తే, వారు చేసిన సత్కార్యాన్నీ వృథా అయి పోతాయి! [అల్ అన్ఆమ్ 6:88 ]

చిన్న స్థాయి షిర్క్‌లలో ఒకటి: అల్లాహ్ యేతరులపై ప్రమాణం చేయడం. ఉదాహరణకు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరిట ప్రమాణం చేయడం, కాబా పేరిట ప్రమాణం చేయడం, అమానతు పేరిట ప్రమాణం చేయడం మరియు వీటితో సమానమైన ఇతర విషయాల పేరిట ప్రమాణం చేయడం.

అదేవిధంగా, గొప్పలు చెప్పు కోవడం, కీర్తిని ప్రదర్శించడం మరియు ఇలా చెప్పడం: "అల్లాహ్ కోరినది మరియు మీరు కోరినది" లేదా "అల్లాహ్ మరియు మీరు లేకపోతే" లేదా "ఇది అల్లాహ్ మరియు మీ అనుగ్రహం" మరియు ఇలాంటి ఇతర పదబంధాలు చిన్న షిర్క్ లోకి వస్తాయి.

కాబట్టి ఈ షిర్క్ సంబంధిత నష్టదాయకమైన విషయాల నుండి అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. వీటిని విడిచి పెట్టాలని పరస్పరం ఉద్బోధించుకోవాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఈ హదీథు నిరూపితమైనది. ఆయన ఇలా సెలవిచ్చారు: “ఎవరైతే అల్లాహ్ పేరున గాక మరింకెవరి పేరుతో ప్రమాణం చేస్తారో, నిశ్చయంగా వారు అవిశ్వాసానికి పాల్బడినట్లే లేదా అల్లాహ్ కు సాటి కల్పించినట్లే”. [98] ఈ హదీథును అహ్మద్, అబూ దావూద్ మరియు తిర్మిథి (రహిమహుముల్లాహ్) సహీహ్ సంశుద్ధ సనదుతో నమోదు చేసినారు. [98] అబూ దావుద్, హదీథు సంఖ్య (3251).

సహీహ్ లో ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: మీలో ఎవరైనా ప్రమాణం చేయదలచుకుంటే అల్లాహ్ మీద ప్రమాణం చేయాలి లేదా ఊరుకోవాలి. ([99]) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా ప్రవచించారు: “ఎవరైతే “అమానహ్” (నమ్మకం, విశ్వాసం మొదలైన విషయాల) పై ప్రమాణం చేస్తారో, అతడు మాలోని వాడు కాడు.” ([100]) దీనిని అబూదావుద్ నమోదు చేసినారు. [99] అబూ దావుద్, హదీథు సంఖ్య (3253). [100] దీనిని బుఖారీ అబ్దుల్లాహ్ నుండి (హదీథు సంఖ్య: 2679) మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 1646) నమోదు చేసినారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా సెలవిచ్చారు : మీ విషయంలో నన్ను ఎక్కువగా భయాందోళనలకు గురి చేస్తున్న విషయం ‘షిర్కె అస్గర్( చిన్న షిర్క్), దాని గురించి అడుగగా ‘ప్రవక్త అర్రియా ‘ప్రదర్శనాబుద్ది’ అని తెలియజేశారు. [101] ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “ ‘అల్లాహ్ కోరిన విధంగా మరియు ఫలాన ఆయన కోరిన విధంగా’ అని అనకండి; దానికి బదులు ‘అల్లాహ్ కోరిన విధంగా తరువాత ఫలాన ఆయన కోరిన విధంగా’ అని అనండి.” [102] నసాఈ (రహిమహుల్లాహ్) ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన నుంచి నమోదు చేసినారు: ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించి ఇలా అన్నాడు: “యా రసూలల్లాహ్! మాషా అల్లాహ్ వషిఇ్త” (అల్లాహ్ మరియు మీరు కోరినదే జరిగింది). వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ‘నీవు నన్ను అల్లాహ్ కు సాటి కల్పించావా? కేవలం అల్లాహ్ ఏకైకుడు కోరినట్లు మాత్రమే జరుగుతుంది’ [103]. [101] దీనిని అహ్మద్ నమోదు చేసినారు, హదీథు సంఖ్య (5/428). [102] అబూ దావుద్, హదీథు సంఖ్య (4980). [103] ఇబ్నె మాజహ్, హదీథు సంఖ్య (2117).

ఈ హదీథులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తౌహీద్ పరిమాణాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడారో స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆయన తన ఉమ్మత్‌ను పెద్ద షిర్క్ మరియు చిన్న షిర్క్ నుండి హెచ్చరించారు, వారి విశ్వాసం శుద్ధిగా ఉండాలని, వారు అల్లాహ్ యొక్క శిక్ష మరియు కోపానికి కారణమయ్యే విషయాల నుండి కాపాడబడాలని ఎంతటి శ్రద్ధ చూపారో తెలుపుతున్నాయి. దీనికి బదులుగా అల్లాహ్ ఆయనకు అత్యుత్తమమైన ప్రతిఫలం ప్రసాదించుగాక, ఎందుకంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మనకు బోధించారు, హెచ్చరించారు, అల్లాహ్‌ దాసులకు నిజంగా హితబోధన చేశారు. అల్లాహ్ ఆయనపై ఎల్లప్పుడూ ఉండే సలావాత్ మరియు సలాం పంపుగాక — దిన దినాంతం వరకు.

హజ్ యాత్రికులలోని మరియు అల్లాహ్‌ యొక్క సురక్షిత పట్టణం (మక్కా) మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నగరం (మదీనా) నివాసితులలోని పండితులపై అప్పగించబడిన బాధ్యత ఏమిటంటే: అల్లాహ్ తమ దాసుల కోసం ఏమి షరీఅతుగా చేసాడో, దానిని ప్రజలకు బోధించాలి. అల్లాహ్ హరాముగా చేసిన షిర్క్‌లను మరియు ఇతర పాపాలను గురించి వారిని హెచ్చరించాలి. ఈ విషయాలను స్పష్టమైన ఉదాహరణలతో విస్తృతంగా వివరించాలి, స్పష్టంగా మరియు సమర్థవంతంగా అవగాహన కలిగించేలా వివరించాలి. ఈ విధంగా వారు ప్రజలను అంధకారం నుండి వెలుతురులోకి తీసుకురాగలరు. అలాగే అల్లాహ్ వారిపై విధించిన సమాచారం పంపే బాధ్యతను మరియు స్పష్టమైన వివరణను పూర్తిగా నెరవేర్చగలరు. అల్లాహ్ సుభ్హానహూ వ తఆలా ఇలా అన్నారు: మరియు అల్లాహ్ గ్రంథ ప్రజలతో: "దీనిని ప్రజలకు తెలియజేయండి మరియు దానిని దాచకండి." అని చేయించిన ప్రమాణాన్ని , (జ్ఞాపకం చేసుకోండి). [ఆలే ఇమ్రాన్ 3:187]

ఇందులో ఉద్దేశించబడినది ఏమిటంటే: ఈ ఉమ్మత్‌కి చెందిన ఉలమా (పండితులు) అహ్లుల్ కితాబ్ (పూర్వ గ్రంథావళుల అనుసరించేవారు) అన్యాయపరుల మార్గాన్ని అనుసరించకుండా ఉండాలన్న హెచ్చరిక. వారు సత్యాన్ని దాచివేయడం ద్వారా తాత్కాలిక లాభాలను శాశ్వతమైన లాభాలపై ప్రాముఖ్యతనిచ్చారు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: నిశ్చయంగా, ఎవరైతే మేము అవతరింపజేసిన స్పష్టమైన బోధనలను, మార్గదర్శకత్వాలను - ప్రజల కొరకు దివ్యగ్రంథాలలో స్పష్టపరచిన పిదప కూడా - దాచుతారో! వారిని అల్లాహ్ తప్పక శపిస్తాడు (బహిష్కరిస్తాడు). మరియు శపించగలవారు కూడా వారిని శపిస్తారు. కాని ఎవరైతే పశ్చాత్తాప పడతారో మరియు తమ నడవడికను సంస్కరించుకుంటారో మరియు సత్యాన్ని వెల్లడిస్తారో, అలాంటి వారి పశ్చాత్తాపాన్ని నేను అంగీకరిస్తాను. మరియు నేను మాత్రమే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడను, అపార కరుణా ప్రదాతను. [అల్ బఖర 2:159-160] ఖుర్ఆనులోని ఆయాతులు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీథులు స్పష్టంగా దీనిని సూచిస్తున్నాయి: అల్లాహ్ సుబ్'హానహూ వ తా'ఆలా వైపు పిలిచే పని (దావతు ఇలల్లాహ్), మనుషులను అల్లాహ్ ఏకంగా ఏకోపాసన కోసం వారిని సృష్టించిన ధ్యేయానికి మార్గనిర్దేశం చేయడం— ఇవి అతి ఉత్తమమైన దైవారాధనలు మరియు అత్యంత ముఖ్యమైన ఫర్ద్‌లలో ఒకటి. ఇదే ప్రవక్తల మరియు వారిని అనుసరించే వారి మార్గం, ఖియామత్ దినం వరకు అదే మార్గం కొనసాగుతుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: మరియు (ప్రజలను) అల్లాహ్ వైపునకు పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ: "నేను అల్లాహ్ కే విధేయుడను (ముస్లింను)!" అని పలికేవాని మాట కంటే మంచి మాట మరెవరిది? [ఫుస్సిలత్ 41:33]، మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: (వారితో) అను: "ఇదే నా మార్గం. నేనూ మరియు నన్ను అనుసరించేవారూ, నిశ్చిత జ్ఞానంతో మిమ్మల్ని అల్లాహ్ వైపునకు పిలుస్తున్నాము. మరియు అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు మరియు నేను ఆయనకు సాటి కల్పించే వారిలోని వాడను కాను! [యూసుఫ్ 12:108]

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: ఎవరైతే మంచి వైపుకు దారి చూపుతారో అతనికి దానిని ఆచరించిన వానితో సమానంగా పుణ్యఫలం లభిస్తుంది.([104]) అల్లాహ్ నీ మూలంగా ఏ ఒక్క వ్యక్తికైనా సన్మార్గాన్ని చూపిస్తే, అది నీ పాలిట ఎరుపు ఒంటెల కంటే ఎంతో విలువైనది. [105] ఇలాంటి ఆయతులు మరియు హదీథులు చాలా ఉన్నాయి. [104] ముస్లిం, హదీథు సంఖ్య (1893) [105] అల్ బుఖారీ, హదీథు సంఖ్య (3009) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (2406).

కాబట్టి జ్ఞానం మరియు విశ్వాసం కలిగినవారు తప్పకుండా తమ శ్రమను మరియు కృషిని అల్లాహ్ సుబ్'హానహు వ తఆలా వైపు పిలిచే పనిని రెట్టింపుగా చేయాలి. ప్రజలకు సంరక్షణ వైపుకు దారి తీసే మార్గాలను సూచించాలి, నాశనానికి దారి తీసే కారణాల నుండి వారిని హెచ్చరించాలి. ప్రత్యేకంగా ఈ కాలంలో — ఎందుకంటే ఈ యుగంలో కోరికల ఆధిపత్యం పెరిగి పోయింది, విధ్వంసకర సిద్ధాంతాలు మరియు తప్పుడు దారి చూపించే నినాదాలు వ్యాపించి పోయాయి. మార్గం చూపించే సత్యధర్మ ప్రచారకుల సంఖ్య తక్కువై పోయింది, కానీ అథేయవాదం మరియు అనైతికత వైపుకు పిలిచే ప్రచారకులు మాత్రం అధికమయ్యారు. కాబట్టి సహాయం కోరదగినవాడు అల్లాహ్ మాత్రమే. అల్లాహ్ తప్ప మరెవరికి శక్తి లేదు, మరియు మరెవరికి బలము లేదు; ఆయన సర్వోన్నతుడూ, మహాశక్తిమంతుడూ.

అధ్యాయం

అల్లాహ్ కు విధేయత చూపడం (మంచి పనులు చేయడం) నుండి ఎక్కువ పుణ్యాన్ని సమకూర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి:

మక్కాలో ఉన్న సమయంలో హజ్ యాత్రికులు అల్లాహ్ యొక్క జిక్ర్, ఆయనకు విధేయత మరియు సత్కార్యాలలో నిరంతరం నిమగ్నమై ఉండాలని మరియు కాబా చుట్టూ తరచుగా ప్రార్థనలు మరియు ప్రదక్షిణలు చేయాలని సిఫార్సు చేయబడింది, ఎందుకంటే పవిత్ర స్థలంలో మంచి పనుల ప్రతిఫలం మరింత ఎక్కువగా పెరుగుతుంది, అలాగే అక్కడ చేసే పాపాలు చాలా తీవ్రమైన పాపాలుగా లెక్కించబడతాయి. అల్లాహ్ యొక్క ప్రవక్త (ﷺ) పై అధికముగా దరూద్ వసలాం పంపటం ముస్తహబ్.

కాబట్టి హజ్ యాత్రికులు మక్కా నుండి తిరుగు ప్రయాణం చేయాలని సంకల్పించినపుడు, వారు తవాఫుల్ వదా చేయటం తప్పనిసరి, వారి చివరి సంబంధం కాబా గృహంతోనే ఉండటానికి. కాని హైజ్‌ (ఋతుస్రావం) లో ఉన్న స్త్రీలు మరియు పురిటి రక్తస్రావం స్త్రీలపై తవాఫుల్ వదా బాధ్యత ఉండదు. ఎందుకంటే ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన హదీథులో ఇలా ఉన్నది: «ప్రజలకు చివరగా వెళ్ళేటప్పుడు (బైతుల్లాహ్) అల్లాహ్ గృహాన్ని సందర్శించి తవాఫ్ చేసి వెళ్ళమని ఆదేశించబడింది కానీ బహిష్టు స్త్రీల కొరకు మాత్రం మినహాయించబడింది.»[106] [106] అల్ బుఖారీ, హదీథు సంఖ్య (1755) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1328).

ఇంతటితో కాబా గృహాన్ని వదిలి వెళ్లే విదాయి తవాఫ్‌ను పూర్తి చేసి, మస్జిద్ నుంచి బయలుదేరాలనుకున్నప్పుడు, వెనుకతిరిగి, తలొంచి కొని నేరుగా ముందుకు సాగిపోవాలి; అంతేగానీ కాబానే చూస్తూ, వెనక్కి నడవకూడదు. ఎందుకంటే ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి, ఆయన సహాబాలు రదియల్లాహు అన్హుమ్ ల నుండి కూడా నమోదు చేయబడలేదు. నిజానికి ఇది ఇటీవల ప్రవేశించిన బిద్‌అ (నూతన కల్పిత ఆచారం). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఎవరైనా నా ఆదేశం లేని ఏదైన ఆచరణ (ధర్మం అనుకుని) చేస్తే అది తిరస్కరించబడుతుంది.[107] ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ధర్మంలో కొత్తగా ఆవిష్కరించబడిన (బిదఆతు) విషయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రతి కొత్త పోకడ ఒక బిద్అత్. ప్రతి బిద్అత్ మార్గవిహీనతకు నిదర్శనం". ([108]) [107] దీని ఉల్లేఖన ఇంతకు ముందు వచ్చి ఉన్నది. [108] దీనిని జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు నుండి ముస్లిం నమోదు చేసినారు, హదీథు సంఖ్య (867).

మనము అల్లాహ్‌ను ఆయన ధర్మముపై మనల్ని స్థిరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాము, మరియు దానికి విరుద్ధమైన వాటి నుండి అల్లాహ్ సంరక్షణను కోరుతున్నాము. నిశ్చయంగా ఆయన ఎంతో ఉదారమైనవాడు మరియు ఎంతో దయగలవాడు.

అధ్యాయం

మస్జిద్-ఎ-నబవీను సందర్శించే నియమాలు మరియు మర్యాదలు:

హజ్జ్‌కు ముందు అయినా, తరువాత అయినా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిద్‌ను సందర్శించడం సున్నత్‌గా నిర్ణయించబడింది. ఎందుకంటే సహీహైన్ బుఖారీ మరియు ముస్లింలో అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు నుండి ఇలా నమోదు చేయబడింది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “నా ఈ మస్జిదులో ఆచరించే ఒక నమాజు, (మక్కాలోని) ఒక్క మస్జిదె హరం లో తప్ప, మరెక్కడైనా ఆచరించే నమాజు కంటే పుణ్యఫలం (అజ్ర్) లో వెయ్యి రెట్లు ఉత్తమమైనది.” ([109]) అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “నా ఈ మస్జిదులో ఆచరించే ఒక నమాజు, (మక్కాలోని) ఒక్క మస్జిదె హరంలో తప్ప, మరెక్కడైనా ఆచరించే నమాజు కంటే పుణ్యఫలం (అజ్ర్) లో వెయ్యి రెట్లు ఉత్తమమైనది.” ([110]) దీనిని ముస్లిం నమోదు చేసినారు. అబ్దుల్లాహ్ ఇబ్న్ జుబైర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నా ఈ మస్జిదులో ఆచరించే ఒక నమాజు, (మక్కాలోని) ఒక్క మస్జిదె హరం లో తప్ప, మరెక్కడైనా ఆచరించే నమాజు కంటే పుణ్యఫలం (అజ్ర్) లో వెయ్యి రెట్లు ఉత్తమమైనది. ఈ నా మస్జిద్‌లో చేసే వంద నమాజుల కంటే మస్జిదుల్ హరామ్‌లో చేసే ఒక్క నమాజు ఎంతో ఉత్తమమైనది.” [111] దీనిని అహ్మద్, ఇబ్నె ఖుజైమ, ఇబ్నె హిబ్బాన్ నమోదు చేసినారు. [109] దీనిని అల్ బుఖారీ (హదీథు సంఖ్య: 1190) మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 1394) నమోదు చేసినారు. [110] ముస్లిం, హదీసు సంఖ్య (1395). [111] అహ్మద్, హదీథు సంఖ్య (4/5).

జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నా ఈ మస్జిదులో ఆచరించే ఒక నమాజు, (మక్కాలోని) ఒక్క మస్జిదె హరం లో తప్ప, మరెక్కడైనా ఆచరించే నమాజు కంటే పుణ్యఫలం (అజ్ర్) లో వెయ్యి రెట్లు ఉత్తమమైనది. మస్జిదె హరంలో ఆచరించే నమాజు, మిగతా మస్జిదులలో ఆచరించే నమాజు కంటే పుణ్యఫలం (అజ్ర్) లో ఒక లక్ష నమాజుల కంటే ఉత్తమమైనది.” ([112]) దీనిని అహ్మద్ మరియు ఇబ్నె మాజా నమోదు చేసినారు. ఇటువంటి అనేక హదీథులు ఉన్నాయి. [112] ఇబ్నె మాజహ్. హదీథు సంఖ్య (1406).

సందర్శకుడు మస్జిద్‌కు చేరుకున్న తర్వాత, అందులో ప్రవేశించేటప్పుడు కుడి కాలు ముందుకు వేసి ఈ దుఆ పఠించాలి: "బిస్మిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అఊదు బిల్లాహిల్ అజీమ్, వబివజ్'హిహిల్ కరీమ్, వ సుల్తానిహిల్ ఖదీమ్, మినష్ షైతానిర్రజీమ్. అల్లాహుమ్మ ఇఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక్.

ఇది ఇతర మస్జిదులలో ప్రవేశించేటప్పుడు పలికినట్లే పలకాలి; ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిద్‌లో ప్రవేశించడానికి ప్రత్యేకంగా పలకవలసిన ఎలాంటి జిక్ర్ లేదు. ఆ తర్వాత అతడు రెండు రకాతులు నమాజు చేయాలి, ఆ రెండు రకాతులలో ఈ లోకపు మరియు పరలోకపు మంచి విషయాలను అల్లాహ్ తో అర్ధించాలి. అయితే ఆ రెండు రకాతులను రౌదహ షరీఫాలో చేయడం మరింత ఉత్తమమైనదిగా ఉంటుంది; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “నా ఇంటి నుండి నా మింబర్‌ వరకూ ఉన్న ప్రదేశం స్వర్గంలోని తోటలలోని ఒక తోట.” [113] ఆ తర్వాత నమాజు ముగిశాక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని మరియు ఆయన ఇద్దరు సహచరులు అబూ బక్ర్ మరియు ఉమర్ రదియల్లాహు అన్హుమా సమాధుల జియారత్ చేయాలి. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి ఎదురుగా పద్దతితో నిలబడి, మృదువైన స్వరంతో ఇలా సలాం పలకాలి: "అస్సలాము అలైక యా రసూలల్లాహ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్." సునన్ అబూ దావుద్‌లో హసన్ సనద్‌తో ఉల్లేఖించ బడింది. అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: ఎవరైనా నాపై సలాం పంపినప్పుడు అల్లాహ్ తఆలా నా ఆత్మను నాలో తిరిగి పంపుతాడు అప్పుడు నేను వారి సలాంకు బదులిస్తాను. [114] యాత్రికుడు సలాం పలికే సమయంలో ఇలా చెప్పినా అందులో ఎలాంటి తప్పు లేదు: "అస్సలాము అలైక యా నబియ్యల్లాహ్, అస్సలాము అలైక యా ఖియరతల్లాహి మిన్ ఖల్కిహ్, అస్సలాము అలైక యా సయ్యిదల్ ముర్సలీన్ వ ఇమాముల్ ముత్తఖీన్, అష్‌హదు అన్నక కద్ బల్లగ్తర్రిసాలత వ అద్దైతల్ అమానత వ నసహ్తల్ ఉమ్మత వ జాహద్త ఫిల్లాహి హఖ్క జిహాదిహ్ (ఓ అల్లాహ్ ప్రవక్తా, నీకు శాంతి కలుగుగాక! అల్లాహ్ తన సృష్టిలో ఎన్నుకున్నవారిలో ఉత్తముడా, నీకు శాంతి కలుగుగాక! సందేశహరులకు నాయకుడా మరియు దైవభీతి గలవారికి ఇమామ్ (నాయకుడా), నీకు శాంతి కలుగుగాక! నిశ్చయంగా నీవు సందేశాన్ని అందించావని, అప్పగించిన బాధ్యతను నెరవేర్చావని, సమాజానికి ఉపదేశం చేశావని మరియు అల్లాహ్ మార్గంలో సరైన విధంగా పోరాడావని నేను సాక్ష్యమిస్తున్నాను)." ఇలా పలికినా ఎలాంటి అభ్యంతరం లేదు; ఎందుకంటే ఈ మాటలన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గుణవిశేషాల్లో భాగమే. ఆ పిదప ఆయనపై దురూద్ పంపించాలి (అల్లాహ్ ఆయనపై శాంతి, ఆశీర్వాదం వరించుగాక), ఆయన కోసం దుఆ చేయాలి. ఎందుకంటే షరీఅతులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై సలాం మరియు దురూద్‌ను కలిపి పలకడం నిర్ణయించబడింది, అల్లాహ్ యొక్క ఈ వాక్కుకుఆచరణపరంగా : నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్తపై దరూద్ లు పంపుతూ ఉంటారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ లు మరియు మీ హృదయ పూర్వక సలాంలు పంపుతూ ఉండండి. [అల్ అహ్'జాబ్ 33:56] ఆ తరువాత అబూ బక్ర్ మరియు ఉమర్ రదియల్లాహు అన్హుమా పై సలాం చెప్పాలి, వారి కోసం దుఆ చేయాలి, మరియు అల్లాహ్ వారి పట్ల సంతృప్తి చెందాలని వారిద్దరి కోసం అల్లాహ్‌ను ప్రార్థించాలి. [113] అల్ బుఖారీ, అబ్దుల్లాహ్ బిన్ జైద్ అల్ మాజినీ  (హదీథు సంఖ్య: 1195) మరియు ముస్లిం, (హదీథు సంఖ్య: 1390). [114] అబూ దావుద్, హదీథు సంఖ్య (2041).

ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హుమా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన ఇద్దరు సహచరులపై సలాం పలికినప్పుడు, ఎక్కువగా ఇలా చెప్పడానికే పరిమితమయ్యేవారు: అస్సలాము అలైక యా రసూలల్లాహ్, అస్సలాము అలైక యా అబాబకర్, అస్సలాము అలైక యా అబతాహ్ (అల్లాహ్ యొక్క ప్రవక్తా మీపై శాంతి కలుగుగాక, ఓ అబూ బకర్, మీపై శాంతి కలుగుగాక, ఓ నా తండ్రి మీపై శాంతి కలుగుగాక.) ఆ తరువాత మరలిపోయేవారు.

ఈ జియారత్ (సమాధుల సందర్శన) పురుషులకు మాత్రమే షరీఅతులో అనుమతించబడింది. మహిళలకు ఏ సమాధికైనా జియారత్ చేయడం అనుమతించబడలేదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి రూఢీ అయ్యి ఉంది, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమాధులను సందర్శించు మహిళలను మరియు వాటిపై ఆలయాలు నిర్మించువారిని, అక్కడ దీపాలు వెలిగించు వారిని శపించారు. ([115]) [115] అబూ దావుద్, హదీథు సంఖ్య (3236).

అయితే, మదీనా నగరానికి ప్రయాణించడం – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్‌లో నమాజు చేయడం, దుఆ చేయడం, మరియు ఇతర మస్జిదులలో అనుమతించబడిన అన్ని ఇతర కార్యాలను చేయడం – ఇవన్నీ పురుషులు మరియు స్త్రీలు అందరికీ షరీఅతులో అనుమతించబడినవే. ఎందుకంటే ఈ విషయంలో వచ్చిన హదీథులు అందరిపైనా వర్తిస్తాయి.

జియారత్‌ చేసినవాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిద్‌లో ఐదు ఫర్ద్‌ నమాజులను చేయడం సున్నత్‌. అలాగే ఆ మస్జిద్‌లో ఎక్కువగా అల్లాహ్‌ ను స్మరించడం, దుఆలు చేయడం మరియు నఫిల్‌ నమాజులను అధికంగా చేయడం కూడా సున్నత్‌. ఎందుకంటే ఈ పనులలో అనేక ప్రతిఫలాలు ఉన్నాయి, వాటిని పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

రౌదహ్ షరీఫాలో నఫిల్ నమాజులను ఎక్కువగా చేయడం అభిలషణీయం. ఎందుకంటే ఈ ప్రదేశానికి సంబంధించిన ప్రాధాన్యత గురించి సహీహ్ హదీథులో ఇప్పటికే పేర్కొనబడింది. ఆ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “నా ఇంటి నుండి నా మింబర్‌ వరకూ ఉన్న ప్రదేశం స్వర్గంలోని తోటలలోని ఒక తోట.” ([116]) [116] దీని ఉల్లేఖన ఇంతకు ముందు వచ్చి ఉన్నది.

ఫర్ద్‌ నమాజు విషయానికొస్తే — జియారత్‌ చేసినవాడే అయినా, ఇతరులైనా — ఆ నమాజుకు ముందుగానే వచ్చి, సాధ్యమైనంతగా మొదటి వరుసలో (సఫ్ఫె అవ్వల్‌) నిలవడం కోసం ప్రయత్నించాలి. మొదటి వరుస (పంక్తి) యొక్క ఘనత గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుంచి వచ్చిన సహీహ్ హదీథుల్లో ప్రోత్సాహం మరియు తాకీద్ ఉంది. ఉదాహరణకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఒకవేళ ప్రజలు అజాన్ చెప్పటానికి, తొలి పంక్తిలో చేరటానికి ఎంతటి ఘనత ఉందో  తెలిస్తే గనక, ఆ తర్వాత దాని కోసం లాటరీ వేయటం తప్ప వేరే మార్గం దొరకకపోతే, వారు తప్పకుండా లాటరీ వేస్తారు. [117] (బుఖారీ, ముస్లిం) అదే విధంగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులతో ఇలా అన్నారు: ముందుకు రండి, నన్ను అనుసరించండి, మీ వెనుకున్నవారు మిమ్మల్ని అనుసరిస్తారు, కొందరు ఎల్లప్పుడు వెనుకే ఉంటూ ఉంటారు చివరికి అల్లాహ్ అలాంటి వారిని వెనక్కి నెట్టి వేస్తాడు. ([118]) దీనిని ముస్లిం నమోదు చేసినారు. [117] దీనిని ముస్లిం అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు నుండి హదీథు సంఖ్య 438లో నమోదు చేసినారు. [118] దీనిని బుఖారీ (హదీథు సంఖ్య: 615) మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 437) నమోదు చేసినారు.

మరియు అబూ దావుద్, ఆయిషా రదియల్లాహు అన్హా నుండి హసన్ సనదుతో నమోదు చేసినారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఒక వ్యక్తి మొదటి పంక్తికి చేరక వెనుకకు తప్పుకుంటూ ఉంటే, అల్లాహ్ కూడా అతడిని నరకంలో వెనుకకు నెట్టి వేస్తాడు.([119]) ఆయన (ﷺ) తన సహచరులతో ఇలా అన్నట్లు నిర్ధారించబడింది: “దైవదూతలు తమ ప్రభువు దగ్గర ఏ విధంగా బారులు తీరి నిలబడతారో ఆ విధంగా మీరూ నిలబడరా?” అని అన్నారు. అందుకు వారు, “దైవప్రవక్తా! దైవదూతలు తమ ప్రభువు దగ్గర ఎలా బారులు తీరి నిలబడతారు?” అని అడిగారు. దానికి ఆయన, “వారు ముందుగా తొలి పంక్తుల్ని భర్తీ చేస్తారు. పంక్తిలో పోతపోసిన సీసపు గోడలాగా బాగా కలిసి నించుంటారు” అని చెప్పారు. ([120]) దీనిని ముస్లిం నమోదు చేసినారు. [119] దీనిని ముస్లిం, జాబిర్ బిన్ సమురహ్ రదియల్లాహు అన్హు నుండి నమోదు చేసినారు హదీథు సంఖ్య (430). [120] దీనిని అబూదావుద్ నమోదు చేసినారు, హదీథు సంఖ్య 679 మరియు ఆయన పదాలు : “కొంతమంది మొదటి పంక్తి నుండి వెనక్కి తగ్గుతూ ఉంటారు, చివరికి అల్లాహ్ కూడా వారిని నరకంలో వెనుకకు నెట్టివేస్తాడు.”

ఈ అర్థాన్ని స్పష్టంగా సూచించే హదీథులు అనేకం ఉన్నాయి. ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిద్‌కు కూడా వర్తిస్తాయి, విస్తరణల ముందు, విస్తరణల తరువాతనూ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలను వరుస పంక్తులలో, ముఖ్యంగా పంక్తుల యొక్క కుడివైపు భాగాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టమని ప్రోత్సహించినట్లు సహీహ్ హదీథులో ఉల్లేఖించబడింది. ఇది స్పష్టమైన విషయమే. అందరికీ తెలుసిన విషయమే – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మొదటి మస్జిద్‌లో వరుస పంక్తుల కుడివైపు భాగం రౌదహ్ షరీఫ్ వెలుపలే ఉంది. దాంతో మనకు ఈ విషయం స్పష్టమవుతుంది: ముందటి పంక్తులు మరియు పంక్తుల కుడివైపు భాగాలపై శ్రద్ధ పెట్టడం అనేది రౌదహ్ షరీఫ్‌లో నమాజు చేయడానికంటే ముందుగా దృష్టిలో ఉంచవలసినది. అవి రెండింటిపై (అంటే మొదటి పంక్తి,  కుడివైపు) ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, రౌదహ్ షరీఫ్‌లో నమాజు చేయడానికన్నా ప్రాధాన్యత కలిగి ఉంది. ఇది ఈ విషయంలో వచ్చిన హదీథులను లోతుగా పరిశీలించి చూసిన వారికి స్పష్టంగా తెలిసే అంశం. మరియు అల్లాహ్ భాగ్యమును కలిగించేవాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హుజ్రహ్ ను తడుముకోవడం, దానిని ముద్దుపెట్టడం లేదా దానిచుట్టూ తవాఫ్ చేయడం ఎవరికైనా అనుమతించబడలేదు. ఎందుకంటే ఇది సలఫ్ సాలిహీన్ నుండి ధృవీకరించబడలేదు. అలాంటి చర్యలు ఖండించదగిన బిద్‌అత్ లోకి వస్తాయి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఏ వ్యక్తీ తాను ఎదుర్కొంటున్న అవసరాల్ని తీర్చమని, కష్టాన్ని తొలగించమని, లేదా ఏ రోగినైనా ఆరోగ్యవంతుడిని చేయమని అడగడం అనుమతించబడలేదు. ఎందుకంటే ఈ విషయాలన్నీ కేవలం అల్లాహ్ సుబ్'హానహూ వతఆలాను మాత్రమే అడగవలసినవి. ఈ రకమైన కోరికలు మరణించినవారిని ఉద్దేశించి చేయబడినప్పుడు, అది అల్లాహ్‌తో షిర్క్ చేసినట్లు అవుతుంది మరియు అల్లాహ్ యేతరుల ఆరాధన క్రిందకి వస్తుంది. ఇస్లాం ధర్మం రెండు ప్రధాన మూలాధారాలపై ఆధారపడి ఉంది:

ఒకటి: కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలి.

రెండు : ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన షరీఅతులో ఏది నిర్దేశించారో, ఆ విధంగా మాత్రమే అల్లాహ్‌ యొక్క ఆరాధనలు చేయాలి.

మరియు ఇది అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమివ్వటం యొక్క భావార్థము

ఈ విధంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను షఫాఅత్ (శిఫారసు) కోసం అడగడం కూడా ఎవరికైనా అనుమతించబడలేదు. ఎందుకంటే షఫాఅత్ హక్కు అల్లాహ్ సుబ్'హానహూ వతఆలాకే చెందినది. కాబట్టి, దానిని కేవలం అల్లాహ్ నొద్దనే అడగాలి, ఇతరులెవరి వద్దనూ కాదు. అల్లాహ్ ఈ విషయంలో ఖుర్ఆన్‌లో ఇలా సెలవిచ్చాడు: ఇలా అను: "సిఫారసు కేవలం అల్లాహ్ అధీనంలోనే ఉంది... [అజ్జుమర్ 39:44] అందుకే (షఫాఅత్ కోసం) ఇలా దువా చెయ్యాలి: "ఓ అల్లాహ్‌! నా కొరకు మీ ప్రవక్త షఫాఅత్ ను ప్రసాదించు, ఓ అల్లాహ్‌! మీ దూతల, విశ్వాసులైన నీ దాసుల షఫాఅత్ ను నా కొరకు ప్రసాదించు, ఓ అల్లాహ్‌! నా పిల్లల (ఇస్లాం మీద మరణించిన చిన్నారుల) షఫాఅత్‌ను నాకు వరంగా ఇవ్వు" — వంటి దుఆలు చేయాలి. అయితే చనిపోయినవారి వద్ద ఏ విషయంలోనూ అడగకూడదు, అది షఫాఅత్‌ అయినా, వేరే సహాయం అయినా సరే. వారు ప్రవక్తలై ఉన్నా, లేక ఇతరులై ఉన్నా — అది అనుమతించబడలేదు. ఎందుకంటే: అది షరీఅతులో నిర్దేశించబడలేదు. చనిపోయినవారి కార్యములు అంతమై పోయాయి, షరీఅతు మినహాయించిన కొన్ని విషయాలు తప్ప. కాబట్టి, కేవలం అల్లాహ్‌ను మాత్రమే వేడుకోవాలి, ఆయనే షఫాఅత్ ఇవ్వగలవాడు, ఆయనే సహాయం చేయగలవాడు.

సహీహ్ ముస్లింలో అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: మనిషి చనిపోగానే అతని ఆచరణల పరంపర తెగి పోతుంది. అయితే మూడు మార్గాల ద్వారా (మాత్రం అతనికి పుణ్యప్రాప్తి జరుగుతూనే ఉంటుంది). అవి : సదఖయె జారియా (ఎడతెగని దానం), ప్రయోజనకరమయిన విద్య, మృతుని శ్రేయస్సు కొరకు ప్రార్థించే సదాచార సంపన్నులయిన అతని సంతానం.([121]) [121] ముస్లిం, హదీథు సంఖ్య 1631, అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన.

షఫాఅత్ వేడుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించి దుఆ చేయడం, ఆయన నుండి అర్థించడం అనేది కేవలం ఆయన జీవించి ఉన్న సమయంలో మరియు ప్రళయదినంలో మాత్రమే సమ్మతము; ఎందుకంటే ఆ సమయంలో ఆయనకు దాని శక్తి ఉంటుంది. ఆయన ముందడుగు వేసి ఆర్తిగా అడిగినవారి తరఫున తన ప్రభువును వేడుకోగలరు. ఇహలోకంలో ఇది స్పష్టమైన విషయం. ఇదీ కేవలం ప్రవక్తకు మాత్రమే పరిమితమైన విషయం కాదు, ఇతర ముస్లింలకు కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు: ఒక ముస్లిం తన తోటి ముస్లిం సహోదరునితో ఇలా చెప్పవచ్చు: "నీవు నా కొరకు నా ప్రభువును ప్రార్థించు — ఈ పని గురించి, ఆ పని గురించి," అంటే: "నా కొరకు అల్లాహ్‌ వద్ద దుఆ చేయి" అన్న అర్థంలో. అలాగే, ఆ వ్యక్తి కూడా అతని కొరకు దుఆ చేయడమూ, షఫాఅత్ చేయడమూ సమ్మతమే — ఒకవేళ అది అల్లాహ్ అనుమతించిన పని అయితే.

ప్రళయదినంలో ఎవరికీ షఫాఅత్ చేసే హక్కు ఉండదు — అల్లాహ్ సుబ్'హానహూ వతఆలా అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే షఫాఅత్ చేయగలుగుతారు. అల్లాహ్ ఖుర్ఆన్‌లో ఇలా సెలవిచ్చాడు: ఆయన సమ్ముఖంలో - ఆయన అనుజ్ఞ లేకుండా - సిఫారసు చేయగల వాడెవడు? [అల్ బఖరహ్ 2:255 ]

చనిపోయిన తరువాత సమయం (మృత్యు తరువాత సమయం) అనేది ఒక ప్రత్యేక స్థితి. ఈ స్థితిని మరణానికి ముందు జీవితంతోనూ, లేదా ప్రళయదినం తరువాత పునరుత్థానం సమయంలో జీవించే జీవితంతోనూ పోల్చలేము. ఎందుకంటే, మృతుడి ఆచరణలు ఆ సమయంలోనే ఆగిపోతాయి, అతను తన సంపాదన (ఆమాల్) పై ఆధారపడి ఉంటాడు — షరీఅతులో మినహాయించిన కొన్ని ఆచరణలు తప్ప. అయితే, మృతుల వద్ద షఫాఅత్‌ను వేడుకోవడం అల్లాహ్‌ షరీఅతులో మినహాయించబడ లేదు; అందువలన దాన్ని ఆ మినహాయింపులలో చేర్చడం సరైంది కాదు. నిస్సందేహంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణానంతరం “బర్జఖ్ జీవితం” గడుపుతున్నారు, ఇది షహీదుల జీవితం కంటే అత్యుత్తమమైనదే. అయితే, ఈ జీవితం మరణానికి ముందు ఉన్న జీవితంలాంటిది కాదు, ప్రళయదినం నాడు ఉండే జీవితంలాంటిదీ కాదు; దాని వాస్తవికత, రూపం ఎలా ఉందో అల్లాహ్ సుభ్హానహు తప్ప ఎవరికీ తెలియదు. అందుకే, ఇంతకు ముందు పేర్కొన్న ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు: ఎవరైనా నాపై సలాం పంపినప్పుడు అల్లాహ్ తఆలా నా ఆత్మను  నాలో తిరిగి పంపుతాడు అప్పుడు నేను వారి సలాంకు బదులిస్తాను. [122]

ఈ మాటల వల్ల ఇది స్పష్టమవుతుంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం పొందారు, మరియు ఆయన ఆత్మ ఆయన శరీరం నుండి విడిపోయింది. అయితే, సలామ్ పలికినపుడు ఆయన ఆత్మ ఆయన వద్దకు తిరిగి వస్తుంది – ఇది ఖుర్ఆన్, హదీథుల ద్వారా తెలియజేయ బడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం పొందిన విషయం ఖుర్ఆన్ మరియు సున్నతుల ఆధారంగా స్పష్టమైనది, మరియు ఇది ధార్మిక విధ్వాంసుల మధ్య ఏకాభిప్రాయం పొందిన విషయం. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క బర్‌జఖ్ జీవితాన్ని నిరాకరించదు. అలాగే, అమరగతి పొందే వారి మృతి కూడా వారికి బర్‌జఖ్ జీవితం ఉండటాన్ని ఆపలేదు — దీనిని అల్లాహ్ తఆలా తన వచనంలో స్పష్టంగా పేర్కొన్నాడు: మరియు అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవులై, తమ ప్రభువు వద్ద జీవనోపాధి పొందుతున్నారు. [ఆలె ఇమ్రాన్ 2:169] [122] అబూ దావుద్, హదీథు సంఖ్య (2041).

ఈ విషయంలో చాలామంది (సత్యాన్ని) గందరగోళానికి గురిచేయడం మరియు అల్లాహ్‌ను కాకుండా మృతులను పూజించడం, షిర్క్‌కు (బహుదైవారాధనకు) ఆహ్వానించడం వంటి వాటి కారణంగా, ఈ అంశంపై వివరంగా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి, మేము అల్లాహ్‌ను ప్రార్థించు చున్నాము — మాకు మరియు సమస్త ముస్లింలకు, తన షరీయత్‌కు విరుద్ధమైన ప్రతి విషయము నుండి రక్షణ ప్రసాదించుగాక. అల్లాహ్‌ మాత్రమే అన్నీ ఎరిగినవాడు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి వద్ద కొంతమంది సందర్శకులు చేస్తున్నట్లు గొంతు  పెంచడం మరియు అక్కడ ఎక్కువసేపు నిలబడటం అనేది ధర్మ విరుద్ధంగ; ఎందుకంటే  ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వరం కంటే ఎక్కువ స్థాయిలో తమ స్వరాలను పెంచవద్దని, మరియు పరస్పరం మాట్లాడుకున్నట్లు ఆయనతో బిగ్గరగా మాట్లాడవద్దని పరమ పవిత్రుడై అల్లాహ్ ప్రజలను ఆగ్నాపించాడు. అలాగే ఆయన దగ్గర స్వరాన్ని తగ్గించుకోమని ఈ వాక్యంలో ప్రోత్సహించాడు: ఓ విశ్వాసులారా! మీ కంఠస్వరాలను, ప్రవక్త కంఠస్వరాని కంటే హెచ్చుగా పెంచకండి మరియు మీరు పరస్పరం ఒకరితో నొకరు విచ్చలవిడిగా మాట్లాడుకునే విధంగా ఆయనతో మాట్లాడకండి, దాని వల్ల మీకు తెలియకుండానే, మీ కర్మలు వ్యర్థం కావచ్చు! నిశ్చయంగా, అల్లాహ్ యొక్క సందేశహరుని వద్ద తమ స్వరాలను తగ్గించుకునే వారే, అల్లాహ్ ఎవరి హృదయాలను దైవభీతి (తఖ్వా) కోసం పరీక్షించాడో (శుద్ధి చేశాడో) అవాంటి వారు. వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉన్నాయి. [అల్ హుజరాత్ 49:2-3]

ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి వద్ద ఎక్కువసేపు నిలబడటం, మరియు పదే పదే సలాం పలకడం, ఇవి జనసమూహాల గందరగోళానికి, శబ్దాలకు, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి వద్ద స్వరాల హెచ్చు స్థాయికి దారి తీస్తాయి. ఇది ముస్లిముల కొరకు అల్లాహ్ ఈ స్పష్టమైన ఆయతుల్లో షరీయత్ బద్ధంగా ఆదేశించిన విధానానికి విరుద్ధం. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జీవించి ఉన్నప్పుడూ, మరణించిన తరువాత కూడా గౌరవనీయులే. అందువల్ల, ఏ విశ్వాసి కూడా ఆయన సమాధి వద్ద షరీయత్ విధానానికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు.

ఈ విధంగా, కొంతమంది సందర్శకులు మరియు ఇతరులు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి వద్ద దానికి అభిముఖమై దుఆ చేయడానికి ప్రయత్నించడం, మరియు దుఆలో చేతులు పైకెత్తడం, ఇది అన్నీ రసూలల్లాహ్ యొక్క సహచరుల మరియు ఉత్తమంగా వారిని అనుసరించిన పూర్వీకుల ఆచరణకు విరుద్ధం. అంతేగాక, ఇది కొత్తగా ప్రవేశపెట్టిన ఆవిష్కరణలలో (బిదఆతులలో) ఒకటి అవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మీరు నా విధానాన్ని (సున్నతును), నా తర్వాత సన్మార్గగాములైన మార్గదర్శక ఖలీఫాల విధానాన్ని ఖచ్చితంగా అనుసరించండి. దానిని గట్టిగా పట్టుకుని ఉండండి, దానిని మీ దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకోండి. ధర్మంలో కొత్తగా ఆవిష్కరించబడిన విషయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రతి కొత్త పోకడ ఒక బిద్అత్. ప్రతి బిద్అత్ మార్గవిహీనతకు, మార్గభ్రష్టతకు నిదర్శనం." ([123]) [123] దీనిని అబూ దావుద్ ఇర్బాజ్ బిన్ సారియ రదియల్లాహు అన్హు నుండి (హదీథు సంఖ్య: 4607) నమోదు చేసినారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “ఎవడైనా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసి పుచ్చబడుతుంది”[124] ‘ఎవరైతే మా ఆదేశాలలో లేని వాటిని ఆచరిస్తాడో అవి తిరస్కరించబడుతాయి.[125]’ [124] దీని ఉల్లేఖనం ముందు వచ్చి ఉన్నది. [125] దీని ఉల్లేఖనం ముందు వచ్చి ఉన్నది.

అలీ ఇబ్ను ల్ హుసైన్ జైనుల ఆబిదీన్ రదియల్లాహు అన్హుమా ఒక వ్యక్తిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి వద్ద దువా చేస్తూండగా చూసి, ఆయన అతనిని దాని నుండి వారించారు. మరియు ఇలా అన్నారు: "నీవు వినాలనుకుంటే, నేను నీకు ఒక హదీథు చెబుతాను. అది నేను నా తండ్రి నుండి విన్నాను, ఆయన తన తాత నుండి విన్నారు, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి విన్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “నా సమాధిని ప్రజలు సమావేశమయ్యే ఆలయంగా మార్చకండి అలాగే మీ ఇళ్ళను శ్మశానాలుగా మార్చకండి నా పై దరూదు పంపండి అది మీరు ఎక్కడ నుండి పంపినా నాకు చేర్చబడుతుంది. [126]” [126] జైనుల్-అబిదీన్ కథనాన్ని షేక్ అల్-హఫీజ్ అల్-మక్దిసికి ఆపాదించారు, అతను కథ లేకుండా హదీథును నివేదించాడు మరియు "అల్-ముస్నద్"లో అహ్మద్ (2/367).

అదేవిధంగా, కొంతమంది సందర్శకులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సలాం చెప్పేటప్పుడు, నమాజు చేసే వ్యక్తి వలె తమ కుడి చేతిని ఎడమ చేతిపై ఛాతీపై లేదా దాని కింద ఉంచడం చేస్తారు; అయితే ఈ భంగిమ ప్రవక్తకు సలాం చెప్పేటప్పుడు లేదా రాజులు, నాయకులు మొదలైన ఇతరులకు సలాం చెప్పేటప్పుడు అనుమతించబడలేదు. ఎందుకంటే అది దైవానికి తప్ప మరెవరికీ చూపకూడని విధేయత, భక్తి మరియు ఆరాధన యొక్క భంగిమ. హాఫిజ్ ఇబ్న్ హజర్ (అల్లాహ్ అతనిపై కరుణ చూపుగాక) ఫతహ్ (పుస్తకంలో) పండితుల నుండి దీనిని ఉటంకించారు. మరియు ఈ విషయం, ఈ స్థానాన్ని పరిశీలించి, సలఫ్ సాలిహీనుల (ఉత్తమ పూర్వీకుల) మార్గాన్ని అనుసరించాలని లక్ష్యంగా పెట్టుకున్న వారికి స్పష్టంగా మరియు సులభంగా అర్థమవుతుంది.

మతోన్మాదం, మితిమీరిన కోరికలు, గుడ్డి అనుకరణ మరియు ,సలఫ్ సాలిహీనుల మార్గదర్శకత్వం కోసం పిలిచే వారి పట్ల చెడు ఆలోచనలు కలిగి ఉన్నవారి విషయానికి వస్తే, వారి వ్యవహారం అల్లాహ్ వద్ద ఉంది. మేము అల్లాహ్‌ను మాకు మరియు వారి కోసం మార్గదర్శకత్వం మరియు సాఫల్యం కోసం అర్థిస్తున్నాము, అన్నిటికంటే ఎక్కువగా సత్యాన్ని ఇష్టపడతాము. నిజానికి, ఆయనే, మహిమాన్వితుడు, సహాయం కోసం మొరపెట్టుకోవడానికి ఉత్తముడు.

అదేవిధంగా, కొంతమంది ప్రజలు దూరం నుండి పవిత్ర సమాధి వైపు తిరిగి, పెదవులు కదిలించడం ద్వారా సలాం చెప్పడం లేదా దుఆ (ప్రార్థన) చేయడం వంటివి చేస్తారు. ఇదంతా అంతకుముందు చెప్పబడిన కొత్త ఆచారాల (బిద్అత్) రకానికి చెందినదే. అల్లాహ్ అనుమతించని దానిని ముస్లిం తన ధర్మంలో కొత్తగా ప్రవేశపెట్టకూడదు. ఈ పని ద్వారా, అతను (ప్రవక్త పట్ల) విధేయత మరియు ప్రేమకు బదులు, వైముఖ్యం (అగౌరవం) వైపు మొగ్గు చూపుతాడు. ఇమామ్ మాలిక్ (అల్లాహ్ అతనిపై కరుణ చూపుగాక) ఈ పనిని మరియు ఇలాంటి వాటిని ఖండించారు మరియు ఇలా అన్నారు: ఈ ఉమ్మతు యొక్క తరువాత తరాలు దాని మొదటి తరాన్ని సంస్కరించిన దాని ద్వారా తప్ప సంస్కరించబడవు." [127]. [127] ఇఘాసతుల్లహ్'ఫాన్ ఫీ మసాయిదుష్ షైతాన్ (1/ 363).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన సరైన మార్గనిర్దేశం చేసిన ఖలీఫాలు, ఆయన గొప్ప సహచరులు మరియు వారి అనుచరుల ధర్మాన్ని అనుసరించడం ఈ ఉమ్మతు యొక్క మొదటి తరాన్ని సంస్కరించిన విషయం తెలిసిందే. ఈ ఉమ్మతు యొక్క తరువాత తరాలు దానిని గట్టిగా పట్టుకోవడం మరియు దానిని అనుసరించడం తప్ప సంస్కరించబడవు.

అల్లాహ్ ముస్లింలను వారి రక్షణ, సుఖసంతోషం, మరియు ఇహలోకములో మరియు పరలోకంలో ఘనత పొందే మార్గంలో దిశానిర్దేశించుగాక. నిశ్చయంగా ఆయన అత్యంత ఉదారుడు, అత్యంత గౌరవవంతుడు.

గమనిక:

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి సందర్శన యొక్క ఆదేశం:

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధిని సందర్శించడం విధి (వాజిబ్) కాదు, లేదా కొందరు సాధారణ ప్రజలు మరియు వారి లాంటి వారు భావించినట్లుగా హజ్‌లో ఒక షరతు (రుక్న్) కూడా కాదు. బదులుగా, ఇది మస్జిద్ అన్నబవీను సందర్శించిన వ్యక్తికి లేదా దానికి దగ్గరగా ఉన్న వ్యక్తికి (ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని సందర్శించడం) అభినందనీయం (ముస్తహబ్). అంటే అలా సమాధిని సందర్శించటం అభిలషణీయం మాత్రమే.

కానీ మదీనాకు దూరంగా ఉన్నవాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని దర్శించటానికి ప్రయాణం చేయకూడదు. అయితే పవిత్ర మస్జిద్ (మస్జిదున్ నబవీ) ను దర్శించటానికి ప్రయాణం చేయటం సున్నత్‌. అలా అతడు ఆ మస్జిద్‌కు వచ్చినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని మరియు ఆయన ఇద్దరు సహచరుల సమాధులను దర్శించగలడు. మస్జిద్ సందర్శనకి అనుబంధంగా ఈ సమాధుల దర్శనము జరగటంలో దోషం లేదు - ఇది సహీహైన్ లో నిరూపితమైనందున. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: «మూడు మస్జిదులకు మినహాయించి ఇతరత్రా వాటిని పుణ్యం సంపాదించాలనే సంకల్పంతో దర్శించకూడదు: మస్జిద్ అల్ హరామ్, నా ఈ మస్జిద్ (మస్జిదే నబవి) మరియు మస్జిద్ అల్ అఖ్సా»[128]. [128] అల్ బుఖారీ, అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, హదీథు సంఖ్య (1189) ఉల్లేఖించారు, మరియు ముస్లిం హదీథు సంఖ్య (1397).

అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని, లేదా ఇతరుల సమాధిని దర్శించటానికై ప్రయాణించటం షరీఅతుకు అనుగుణంగా అనుమతించబడిన పని అయి ఉంటే, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతును దాని వైపు మార్గనిర్దేశనం చేసేవారు, దాని ఘనత (మహత్త్వాన్ని) వారికి వివరించేవారు. ఎందుకంటే ఆయన అత్యంత సత్యదృష్టికలవారు, అల్లాహ్ గురించి గొప్పగా అవగాహన గలవారు మరియు అల్లాహ్ కు అత్యధికంగా భయపడేవారు. ఆయన తనకు పంపబడిన సందేశాన్ని పూర్తిగా అందజేశారు, తన ఉమ్మతుకు ప్రతీ మంచిపని గురించి మార్గనిర్దేశనం చేశారు మరియు ప్రతీ చెడ్డపని నుండి హెచ్చరించారు. అలాంటి వారు మూడింటికి తప్ప మరే మస్జిద్‌కైనా ప్రయాణం చేయరాదు అని  హెచ్చరిస్తూ, ఇలా పలికారు: “నా సమాధిని జనులు సమావేశమయ్యే ఆలయంగా మార్చకండి అలాగే మీ ఇళ్ళను శ్మశానాలుగా మార్చకండి నా పై దరూదు పంపండి అది మీరు ఎక్కడ నుండి పంపినా నాకు చేర్చబడుతుంది. [129]” [129] దీని ఉల్లేఖనం ముందు వచ్చి ఉన్నది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని దర్శించటానికై ప్రయాణం చేయటం షరీఅతుకు అనుగుణమైందని చెప్పటమే, ఆయన సమాధిని ఓ పండుగలా (ఈద్‌గా) భావించే అవకాశానికి దారి తీస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భయపడ్డ దానిలో అంటే అతిశయపరచటం (గులూ) మరియు అతిగా ప్రశంసించటం (ఇత్రా)లో పడిపోవటానికి ఇదే కారణమవుతుంది. ఎందుకంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని దర్శించటానికై ప్రయాణం చేయటం షరీఅతులో సమర్థించబడినదే అని అనుకుంటూ, చాలామంది ఈ అతిశయానికి లోనయ్యారు.

ఈ విషయంలో —అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని దర్శించటానికై ప్రయాణించటం షరీఅతులో సమర్థించబడిందని చెప్పేవారు ఆధారంగా చూపే హదీథులు —  బలహీనమైన సనదులతో ఉన్నవే గానీ, హదీథు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం వాటిలో కొన్ని అస్పష్టంగా కల్పించబడినవిగా కూడా ఉన్నాయి. దీని గురించి హదీథు పండితులు, ఉదాహరణకు దారుఖుత్నీ, బైహఖీ, హాఫిజ్ ఇబ్ను హజర్ మరియు ఇతరులు స్పష్టం చేసి ఉన్నారు, కాబట్టి ఈ బలహీన హదీథులను ఆధారంగా తీసుకొని, ఖచ్చితమైన హదీథులను అంటే మూడు మస్జిద్‌లకు తప్ప మరెక్కడికైనా ప్రయాణించకూడదని స్పష్టంగా తెలిపే సహీహ్ హదీథులను  వ్యతిరేకించటం ధర్మసమ్మతం కాదు.

ఓ పాఠకుడా! ఈ విషయంలో కల్పించబడిన హదీథులలో కొన్నిటిని నీకు ఉదాహరణగా అందిస్తున్నాను — నీవు వాటిని గురించి తెలుసుకున్నప్పుడు, అవి నిజమైనవని భావించి మోసపోకుండా జాగ్రత్తపడేలా ఉండేందుకు:

మొదటిది: «ఎవడయితే హజ్జ్ చేసిన తరువాత నన్ను దర్శించకుండా ఉంటాడో, అతడు నన్ను ఉపేక్షించినవాడవుతాడు (నాతో అసౌజన్యం చూపినవాడవుతాడు)».

రెండవది: ఎవరైతే నా మరణం తరువాత నన్ను దర్శించుకుంటాడో అతడు నేను జీవించి ఉన్నప్పుడు నన్ను దర్శించినట్లు.

మూడవది: «ఎవడయితే ఒకే సంవత్సరం లో నన్ను మరియు నా తండ్రి ఇబ్రాహీమ్‌ను అలైహిస్సలాం సందర్శిస్తాడో, నేను అతనికి అల్లాహ్ తరఫున జన్నతుకు హామీగా ఉంటాను» అనే హదీథు.

నాలుగవది: «ఎవడయితే నా సమాధిని దర్శిస్తాడో, అతనికి నా షఫాఅత్ ఖచ్చితంగా లభిస్తుంది» అనే హదీథు.

ఈ హదీథులు మరియు వాటిని పోలినవి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిజంగా నిర్ధారించబడినవి కావు.

హాఫిజ్ ఇబ్ను హజర్ (తల్‌ఖీస్) — ఎక్కువ కథనాలను ప్రస్తావించిన తర్వాత — ఈ హదీథు యొక్క అన్ని మార్గాలు బలహీనమైనవి అని తెలిపారు.

హాఫిజ్ అల్-అకీలి: ఈ అంశంలోని ఎలాంటి హదీథు కూడా సత్యమైనది కాదు అని అన్నారు.

షేఖుల్ ఇస్లాం ఇబ్న్ తైమియా (అల్లాహ్ అతనిపై కరుణ చూపుగాక) ఈ హదీథ్లన్నీ కల్పితమైనవి (మౌదూ') అని గట్టిగా నిర్ధారించారు. జ్ఞానంలో, జ్ఞాపకశక్తిలో మరియు పరిశీలనలో ఆయన మీకు (గట్టి) ఆధారం.

వీటిలో ఏవైనా నిజమైన హదీథులు ఉంటే, సహాబాలు రదియల్లాహు అన్హుమ్ వాటిపై మొదట అమలు చేసి ఉండేవారు మరియు వాటి గురించి ఉమ్మత్ కు తెలిపి,  వాటి వైపు పిలిచేవారు, ఎందుకంటే వారు ప్రవక్తల తర్వాత ప్రజలలో అత్యుత్తములు మరియు అల్లాహ్ ఆజ్ఞలు మరియు ఆయన షరియత్ గురించి బాగా తెలిసినవారు మరియు అల్లాహ్ మరియు ఆయన సృష్టి యొక్క గొప్ప శ్రేయోభిలాషులు. కాబట్టి వారు అలాంటిదేమీ ప్రస్తావించనప్పుడు, అవి షరియత్ (మతపరంగా) పరంగా ఆమోదయోగ్యం కావని స్పష్టమవుతుంది.

ఒకవేళ వాటిలో ఏమైనా (హదీథ్‌లు) ప్రామాణికమైనవైనా, హదీథ్‌లన్నింటినీ సమన్వయం చేయడానికి, కేవలం సమాధిని మాత్రమే ఉద్దేశించి ప్రయాణం చేయకుండా ఉండే ధర్మబద్ధమైన సందర్శనకు మాత్రమే వాటిని అన్వయించాలి. మరియు అల్లాహ్ సుభానహు వ తఆలాకే బాగా తెలుసు.

అధ్యాయం

మస్జిద్-ఎ-ఖుబా మరియు బఖీ సందర్శన అభిలషణీయం:

మదీనా సందర్శించినవారు మస్జిదల్-ఖుబాను సందర్శించి, అక్కడ నమాజు చేయడం ముస్తహబ్ (అభిలషణీయం). ఇందుకు సంబంధించినది - సహీహ్ హదీథులలోని ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హుమా హదీథు, ఆయన ఇలా తెలిపారు: మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఖుబా మస్జిద్ ను కాలినడకన మరియు స్వారీ చేస్తూ సందర్శించేవారు. అప్పుడు రెండు రకాతుల నమాజును అందులో చేసేవారు. ([130]) [130] అల్ బుఖారీ, హదీథు సంఖ్య (1193) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1399).

సహల్ బిన్ హునైఫ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం. ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: ఎవరైతే తన ఇంటి దగ్గర పరిశుద్ధత పొంది (ఉదూ చేసి) ఖుబా మస్జిదుకు వెళ్ళి అక్కడ రెండు రకాతుల నమాజు చేస్తాడో అతనికి ఉమ్రహ్ చేసినంత పుణ్యఫలం లభిస్తుంది.([131]) [131] ఇబ్నె మాజహ్, హదీథు సంఖ్య (1412).

బఖీ సమాధుల్ని, షహీదుల సమాధుల్ని, మరియు హమ్జా (రదియల్లాహు అన్హు) సమాధిని సందర్శించడం సున్నత్. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధులన్ని సందర్శించి, వారి కోసం దుఆ చేసేవారు. మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: మీరు సమాధులను సందర్శించండి, అవి మీకు పరలోకమును గుర్తుచేస్తాయి. [132] దీనిని ముస్లిం నమోదు చేసినారు. [132] ముస్లిం, హదీథు సంఖ్య (976)

మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరులకు మీరు సమాధులను సందర్శించినప్పుడు ఈ దుఆ చేయండి అని బోధించేవారు: అస్సలాము అలైకుమ్ అహ్లద్దియార్ మినల్ ముమినీన వల్ ముస్లిమీన్, వ ఇన్నా ఇన్ షా అల్లాహు బికుమ్ ల లాహిఖూన్, నస్ అలుల్లాహ లనా వలకుముల్ ఆఫియ (ఈ నివాసాల్లోని విశ్వాసులకు, ముస్లింలకు శాంతి కలుగుగాక. నిశ్చయంగా మేము అల్లాహ్ తలచినచో వాస్తవంగా మీతో చేరతాము. మేము మా కోసమూ, మీ కోసమూ అల్లాహ్ నుండి క్షేమం కోరుతున్నాము). [133]. ఈ హదీథును ఇమామ్ ముస్లిమ్ సులైమాన్ ఇబ్ను బురైదా, ఆయన తండ్రి బురైదా (రదియల్లాహు అన్హు) నుండి నమోదు చేసినారు. [133] ముస్లిం, హదీథు సంఖ్య (975).

ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) నుండి ఈ హదీథును తిర్మిథీ ఇలా నమోదు చేసినారు : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా సమాధుల వద్దకు పోయి, తన ముఖాన్ని వాటి వైపు తిప్పి, ఇలా అనేవారు: “అస్సలాము అలైకుమ్ యా అహ్లల్ ఖుబూర్ యగ్ఫిరుల్లాహు లనా వలకుమ్ అంతుమ్ సలఫునా వ నహ్ను బిల్ అస్రి. (ఓ సమాధి వాసులారా! మీకు శాంతి కలుగు గాక! అల్లాహ్ మమ్మల్ని, మిమ్మల్నందరినీ క్షమించాలి, మీరు మాకంటే ముందే వెళ్ళిపోయారు. మేము మీ వెనక రాబోతున్నాం.” [134] [134] తిర్మిథీ, హదీథు సంఖ్య  (1035).

ఈ హదీథుల నుండి మనకు తెలిసినది సమాధుల షరీఅతుకు అనుగుణమైన దర్శనము యొక్క ఉద్దేశ్యం —పరలోకాన్ని స్మరించుకోవడం, మరణించినవారికి ఉపకారం చేయడం, వారి కోసం దుఆ చేయడం మరియు అల్లాహ్ వారి మీద కరుణ చూపాలని దుఆ చేయడం.

అయితే సమాధుల వద్దే ప్రత్యేకంగా దుఆ చేయటానికి, లేదా అక్కడే నిలిచిపోయి ఉండటానికి, లేదా మృతులను తమ అవసరాలు నెరవేర్చమని అడగటానికి, లేదా రోగాలను నయం చేయమని షిఫా కోరటానికి, లేదా వారి పేరు లేదా వారి ప్రతిష్ఠను వసీలా చేసుకుని  అల్లాహ్‌ను మన్నించమని కోరడం వంటి ఉద్దేశాలతో చేసే దర్శనం — ఇవి బిద్అత్ (షరీఅతుకు విరుద్ధమైన నూతన ఆవిష్కరణలు) మరియు ఖండించదగిన కార్యాలు. ఇవి అల్లాహ్ గాని, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గాని నిర్దేశించలేదు. మరియు సలఫుస్సాలిహీన్ (ఉత్తమ పూర్వజులు, అల్లాహ్ వారందరితో ప్రసన్నుడవుగాక) కూడా ఇవి చేయలేదు. ఇలా చేయడం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించిన 'హిజ్ర్' (షరీఅతుకు విరుద్ధంగా సమాధుల చుట్టూ తిరుగడం)లో ఒక భాగమే. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: సమాధులను సందర్శించండి, (మృతుల గురించి) చెడుగా మాట్లాడకండి. [135] [135] దీనిని ముస్లిం ఇబ్నె బురైదహ్ మరియు ఆయన తండ్రి నుండి నమోదు చేసినారు, హదీథు సంఖ్య (977).

పైన పేర్కొన్న కార్యాలన్నీ బిద్‘అ (షరీఅతుకు విరుద్ధమైన ఆవిష్కరణలు) అయినప్పటికీ, అవి పరస్పరం స్థాయిలలో వేర్వేరుగా ఉంటాయి. వాటిలో కొన్ని కేవలం బిద్‘అ మాత్రమే కావచ్చు మరియు షిర్క్ (అల్లాహ్‌కు భాగస్వామ్యం కల్పించడం) కాకపోవచ్చు — ఉదాహరణకు: సమాధుల దగ్గర అల్లాహ్‌ను ప్రార్థించటం, అల్లాహ్‌ను మరణించినవారి హక్కుతో లేదా ప్రతిష్ఠతో అంటే వసీలాతో అడగడం వంటి విషయాలు. అయితే వాటిలో కొన్ని వ్యవహారాలు పెద్ద షిర్క్ (షిర్క్-ఎ-అక్బర్)కు చెందినవే — ఉదాహరణకు: మృతులను ప్రార్థించడం, వారికి సహాయం అందించాలని వేడుకోవడం వంటి చర్యలు.

ఈ విషయం ఇంతకు ముందు విపులంగా వివరించబడింది. కాబట్టి జాగ్రత్తగా గమనించు మరియు హెచ్చరికతో ఉండు. నిజమార్గం వైపు మార్గనిర్దేశనం మరియు ఆదేశం కోసం నీ ప్రభువైన అల్లాహ్‌ను వేడుకో. ఎందుకంటే ఆయనే భాగ్యమును అందించేవాడు, మార్గనిర్దేశకుడు. ఆయన తప్ప ఇంకెవ్వరూ ఇలాహ్ (ఆరాధనకు అర్హుడు) కాదు, ఆయన తప్ప ఇంకెవ్వరూ ప్రభువు (రబ్బ్) కాదు.

ఇది మేము లిఖించదలచిన చివరి భాగం. అన్నింటి కంటే ముందు మరియు చివరగా అల్లాహ్‌ కు ప్రశంసలు. ఆయన దాసుడు, ప్రవక్త మరియు తన సృష్టిలో అత్యుత్తముడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన అల్లాహ్ దయ మరియు శాంతి కురిపించుగాక. అలాగే ఆయన కుటుంబ సభ్యులపై, సహాబాలపై మరియు ధర్మబద్ధంగా వారికి అనుసరించే సజ్జనులపై దినదినాంతం వరకు శాంతి కురిపించుగాక.