صفة العمرة (للوزارة)
ఇస్లామీయ వ్యవహారాలు, దావహ్ మరియు మార్గదర్శకత్వ మంత్రిత్వ శాఖ
ఇస్లామీయ వ్యవహారాలు, దావహ్ మరియు మార్గదర్శకత్వ మంత్రిత్వ శాఖ
ఉమ్రహ్ విధానము
గౌరవనీయులైన షేఖ్
అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్)
(మహోన్నతుడైన అల్లాహ్ అతనిపై దయ చూపుగాక)
సకల కృతజ్ఞతలు, ప్రశంసలు కేవలం అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి మరియు ఆయన ఏకైకుడు. ఇక ఆ తరువాత,
ఇది ఉమ్రహ్ యొక్క సంక్షిప్త విధానాల గురించిన సారాంశము ఓ పాఠకులారా! ఉమ్రహ్ విధానము వివరణ ఇలా ఉన్నది:
ఉమ్రహ్ చేయాలని సంకల్పము (నియ్యత్) చేసుకున్న వ్యక్తి మీఖాత్ ప్రాంతానికి చేరుకున్నప్పుడు, గుసుల్ (ఇస్లామీయ పద్ధతిలో తలస్నానం) చేసి, శుద్ధి చేసుకోవడం మంచిది. స్త్రీలు ఋతుస్రావం స్థితిలో ఉన్నా లేదా ప్రసవానంతర రక్తస్రావం స్థితిలో ఉన్నా కూడా గుసుల్ చేయాలి. అయితే, ఆమె ఆ రక్తస్రావం నుండి శుద్ధి అయి స్నానం చేసే వరకు కాబాగృహం చుట్టూ ప్రదక్షిణ (తవాఫ్) చేయకూడదు.
ఇహ్రామ్ ధరించే వ్యక్తి తన శరీరానికి సుగంధ ద్రవ్యాలు (ఇత్తరు) పూసుకోవచ్చు, కానీ తన ఇహ్రామ్ వస్త్రాలకు సుగంధం పూయకూడదు. మీఖాత్ వద్ద గుసుల్ (ఇస్లామీయ పద్ధతిలో తలస్నానం) చేయడం సాధ్యం కాకపోతే, అందులో ఎలాంటి దోషమూ లేదు. అయితే, మక్కా చేరిన తర్వాత సాధ్యమైతే గుసుల్ చేసి, తవాఫ్ (కాబాగృహం యొక్క తవాఫ్ ప్రదక్షిణ) ప్రారంభించడం మంచిది.
పురుషుడు కుట్టబడిన బట్టలన్నీ (బనియన్, అండర్ వేర్ వంటి లో దుస్తులు కూడా) విడిచి, ఇజార్ (నడుము క్రింద ఒక వస్త్రం) మరియు రిదా (భుజం పైభాగం కప్పుకునే ఒక వస్త్రం) మాత్రమే ధరించాలి. ఇవి తెల్లగా మరియు శుభ్రంగా ఉండటం మంచిది.
ఇక స్త్రీ విషయానికి వస్తే, ఆమె తన సాధారణమైన అలంకరణ, ఆకర్షణ, ప్రదర్శన లేని వస్త్రాలను ఇహ్రాంగా ధరించాలి.
తర్వాత ఇహ్రామ్ కట్టుకునే వ్యక్తి తన మనస్సులో ఉమ్రహ్ సంకల్పం చేసుకుంటూ, తన నాలుకతో ఇలా పలుక వలెను: 'లబ్బైక ఉమ్రహ్' లేదా 'అల్లాహుమ్మ లబ్బైక ఉమ్రహ్' (ఓ అల్లాహ్! నేను ఉమ్రహ్ కోసం హాజరయ్యాను).' ఒకవేళ ఇహ్రామ్ కట్టుకున్న వ్యక్తి తన ఉమ్రహ్ పూర్తి చేయలేకపోవచ్చేమోనని భయపడుతున్నట్లయితే (ఉదాహరణకు, అనారోగ్యం, శత్రువుల భయం, యుద్ధభయం లేదా ఇతర ఆటంకాల కారణంగా), అప్పుడు ఇహ్రామ్ కట్టుకునే సమయంలో ఈ క్రింది షరతును పేర్కొనడం షరియత్ ప్రకారం అనుమతించబడింది. అలాంటి స్థితిలో అతను ఇలా పలుకవచ్చు: "(ఓ అల్లాహ్!) ఒకవేళ ఏదైనా ఆటంకం నన్ను ఆపితే, నీవు నన్ను ఆపిన స్థానమే నా ఇహ్రామ్ ముగింపు స్థానం అవుతుంది." దుబాఅహ్ బిన్తె అజ్జుబైర్ (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన ఆధారంగా.
తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతును అనుసరిస్తూ, ఇలా తల్బియా పలకాలి: «లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వన్నీమత లక వల్ ముల్క్, లా షరీక లక్.» (ఓ అల్లాహ్! నేను నీ సన్నిధిలో హాజరయ్యాను, నేను హాజరయ్యాను. నీకు సాటి ఎవ్వరూ లేరు, నేను నీ సన్నిధిలో హాజరయ్యాను. నిశ్చయంగా సర్వస్తోత్రాలు, సకల శుభాలు మరియు ఈ విశ్వ సామ్రాజ్యం నీకే చెందుతాయి. నీకు భాగస్వాములు ఎవ్వరూ లేరు.) అతను ఈ తల్బియాను ఎక్కువగా చదవాలి, మరియు కాబా గృహం చేరే వరకు అల్లాహ్ను జ్ఞాపకం చేసుకుంటూ మరియు దుఆ చేస్తూ ఉండాలి.
కాబాగృహం (బైతుల్లాహ్) చేరుకున్నప్పుడు, తల్బియా చదవడం ఆపివేసి, హజరె అస్వద్ (నల్లరాయి) వైపు వెళ్లాలి. దానికి ఎదురుగా నిలబడి, దానిని కుడి చేత్తో తాకి, సాధ్యమైతే దానిని ముద్దాడాలి (కానీ ఇతర ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా హడావిడి చేయకూడదు, తొక్కిసలాటలో పడకూడదు). నల్లరాయిని తాకినప్పుడు అతను ఇలా పలకాలి: 'బిస్మిల్లాహ్, అల్లాహు అక్బర్' (అల్లాహ్ పేరుతో, అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు). ఒకవేళ రద్దీ వలన దానిని ముద్దాడడం కష్టమైతే, చేతితో తాకవచ్చు లేదా కర్ర/ఇతర వస్తువుతో తాకి, దానిని ముద్దాడవచ్చు. అది కూడా సాధ్యం కాకపోతే, నల్లరాయి వైపు చేతితో సైగ చేసి 'అల్లాహు అక్బర్' అని పలకాలి (కానీ సైగ చేసిన చేతిని ముద్దాడకూడదు).
తవాఫ్ (కాబా ప్రదక్షిణ) సరిగ్గా చెల్లుబాటు కావడానికి, తవాఫ్ చేసే వ్యక్తి చిన్నఅపరిశుద్ధత (అల్-హదత్ అల్-అస్ఘర్) లేదా పెద్ద అపరిశుద్ధత (అల్-హదత్ అల్-అక్బర్) ల స్థితి నుండి పరిశుభ్రంగా ఉండాలి. ఎందుకంటే తవాఫ్ కూడా నమాజ్ లాంటిదే, అయితే ఇందులో మాట్లాడడానికి అనుమతి ఉంది.
తవాఫ్ సమయంలో కాబాగృహాన్ని తన ఎడమ వైపున ఉంచుకుని 7 ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణలో రుక్న్-ఎ-యమానీ (యమనీ మూల)ను దాటినప్పుడు, సాధ్యమైతే కుడి చేత్తో దాన్ని తాకి 'బిస్మిల్లాహి, అల్లాహు అక్బర్' అని పలకాలి (కానీ దాన్ని ముద్దాడకూడదు). ఒకవేళ తాకడం కష్టమైతే, దాన్ని తాకకుండానే తవాఫ్ కొనసాగించాలి (సైగ చేయకూడదు లేదా తక్బీర్ పలక కూడదు), ఎందుకంటే ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులలో లేదు.
ప్రతి ప్రదక్షిణలో హజరె-అస్వద్ (నల్లరాయి) వద్దకు వచ్చినప్పుడు, మునుపు వివరించినట్లుగానే దానిని తాకి ముద్దాడాలి. ఒకవేళ సాధ్యం కాకపోతే, దాని వైపు సైగ చేసి 'అల్లాహు అక్బర్' అని పలకాలి. పురుషులు ప్రత్యేకంగా తవాఫుల్-ఖుదూమ్ యొక్క మొదటి మూడు ప్రదక్షిణలలో రమల్ చేయడం ముస్తహబ్. రమల్ అనగా - అడుగులు దగ్గరగా, వడివడిగా వేస్తూ నడవడం అంటే త్వరత్వరగా, వేగంగా అడుగులు వేయడం.
అలాగే, పురుషులు తవాఫుల్-ఖుదూమ్ యొక్క అన్ని ప్రదక్షిణల్లోనూ ఇజ్తిబా చేయడం ముస్తహబ్. ఇజ్తిబా అంటే: తన రిదా (పై వస్తం) మధ్యభాగాన్ని కుడి భుజం క్రిందికి తీసి, దాని రెండు కొనలను ఎడమ భుజంపై వేయడం (కుడి భుజం స్పష్టంగా అందరికీ కనబడేలా). ఇజ్తిబా: అంటే కుడి భుజం అందరికి కనబడేలా తన ఇహ్రామ్ వస్త్రం మధ్య భాగాన్ని కుడి భుజం క్రింద నుంచి తీసుకొని, రెండు చివరల్ని ఎడమ భుజంపై వేయడం.
తవాఫ్ యొక్క ప్రదక్షిణలన్నింటిలోనూ సులభంగా, తేలిగ్గా స్మరించదగిన జిక్ర్లు (అల్లాహ్ స్మరణలు) మరియు దుఆలు (ప్రార్థనలు) ఎక్కువగా చేయడం ముస్తహబ్ (సిఫారసు చేయబడినది).
తవాఫ్ (కాబా ప్రదక్షిణ)లో నిర్దిష్టంగా చేయవలసిన ప్రత్యేక దుఆ లేదా ప్రత్యేక జిక్ర్ (అల్లాహ్ స్మరణ) అంటూ ఏదీ లేదు. మీకు ఇష్టమైన ఏదైనా దుఆ చేయవచ్చు మరియు అల్లాహ్ను మీకు ఇష్టమైన పదాలతో స్మరించవచ్చు. అయితే రుకున్ అల్ యమానీ మరియు హజ్రె అస్వద్ ల మధ్య ఈ దుఆ చేయమని చెప్పబడింది. రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతవ్, వ ఫిల్ ఆఖిరతి హసనతవ్ వఖినా అదాబన్నార్ (ఓ మా ప్రభూ! మాకు ఇహలోకంలో మంచిని మరియు పరలోకంలో కూడా మంచిని ప్రసాదించు మరియు మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు!) ప్రతి తవాఫ్ ప్రదక్షిణలో ఈ దుఆ పఠించడం మంచిది, ఎందుకంటే ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతు.
ఏడవ తవాఫ్ ప్రదక్షిణ ముగింపులో, సాధ్యమైతే హజర్-ఎ-అస్వద్ (నల్లరాయి)ని తాకి ముద్దాడాలి లేదా మునుపు వివరించిన విధంగా దాని వైపు సైగ చేస్తూ 'అల్లాహు అక్బర్' అనాలి. తవాఫ్ పూర్తి చేసిన తర్వాత, తన పై వస్త్రాన్ని (రిదా) తిరిగి ధరించాలి - దాని మధ్యభాగాన్ని భుజాలపై వేసి, రెండు కొనలను ఛాతీపై పడేలా సరి చేసుకోవాలి.
6. ఆ తరువాత, సాధ్యమైతే మఖామె ఇబ్రాహీం వెనుక రెండు రకాతులు నమాజు చేయాలి. అది సాధ్యం కాకపోతే, మస్జిద్లో ఎక్కడైనా చదవాలి. ఆ రెండు రకాతులలో సూరతుల్ ఫాతిహా పఠనం తర్వాత: ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ (ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా!) మొదటి రకాతులో, మరియు ఖుల్ హువల్లాహు అహద్ (ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు.) రెండవ రకాతులో పఠించాలి. ఇలా చేయడం ఉత్తమం. కానీ ఇవి కాక (ఇతర సూరాలు) చదివినా ఎలాంటి పాపమూ లేదు. అలా రెండు రకాతుల (నమాజ్) పూర్తి చేశాక, హజ్ర్ అస్వద్ వైపు వెళ్లి, సాధ్యమైతే, కుడి చేతితో దాన్ని తాకాలి.
తర్వాత సఫా కొండ వైపు వెళ్లి, దానిపై ఎక్కాలి లేదా దాని వద్ద నిలబడాలి. సాధ్యమైతే పైకి ఎక్కడం ఉత్తమం, మరియు ఈ ఆయతు పఠించాలి: ఇన్నస్సఫా వల్ మర్వత మిన్ షఆఇరిల్లాహ్ (నిశ్చయంగా, 'సఫా మరియు మర్వాలు అల్లాహ్ చూపిన చిహ్నాలు...) (సూరతుల్-బఖరహ్ 2:158)
ఖిబ్లా (కాబాగృహం) వైపు అభిముఖమై నిలబడటం మంచిది, అల్లాహ్ను స్తుతిస్తూ, ఆయన మహిమను కొనియాడుతూ, ఇలా పలకాలి: లా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీకలహు, లహుల్ ముల్'కు వ లహుల్ హమ్'దు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్, లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు, అంజజ వ'అదహు, వ నసర అబ్దహు, వ హజమల్ అహ్జాబ వహదహు. (అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు. అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే, సర్వ స్తోత్రములు, కృతజ్ఞతలు ఆయనకే శోభిస్తాయి. ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు. అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఆయన ఏకైకుడు. ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చాడు, తన దాసునికి విజయం ప్రసాదించాడు, ఆయన ఒక్కడే శత్రు వర్గాలను చిత్తుగా ఓడించాడు.) తరువాత తన రెండు చేతులను పైకి ఎత్తి, సులభంగా ఉండే దుఆ చేసుకోవలెను, మరియు ఈ స్మరణ మరియు దుఆను మూడు సార్లు పునరావృతం చేయాలి. తర్వాత సఫా నుండి దిగి మర్వా వైపు నడవాలి. మొదటి ఆకుపచ్చ సంకేత స్తంభం నుండి రెండవ ఆకుపచ్చ సంకేత స్తంభం వరకు, పురుషులు వడి వడిగా (రమల్) వేగంగా నడవాలి.
స్త్రీల విషయానికొస్తే, వారు వేగంగా నడవడానికి అనుమతి లేదు, ఎందుకంటే వారు 'ఔరాత్' (ముసుగు)లో ఉంటారు. తర్వాత మామూలుగా నడుస్తూ మర్వా కొండ పైకి ఎక్కాలి లేదా దాని పక్కన నిలబడాలి. సాధ్యమైతే, దానిపై ఎక్కడం ఉత్తమం. సఫాలో చేసిన జిక్ర్లు, దుఆలన్నీ మర్వాలో కూడా పునరావృతం చేయాలి. తర్వాత కొండ నుండి దిగి, నడవాల్సిన ప్రాంతంలో మామూలుగా నడిచి, వేగంగా నడవాల్సిన ప్రాంతంలో వేగంగా నడుస్తూ సఫా కొండను చేరుకోవాలి. ఇలా మొత్తం ఏడు సార్లు చేయాలి. వెళ్ళడం ఒక ప్రదక్షిణగా మరియు తిరిగి రావడం మరొక ప్రదక్షిణగా లెక్కించబడుతుంది. వాహనం మీద సయీ చేసినా ఎలాంటి దోషం లేదు, ముఖ్యంగా అవసరమైనప్పుడు. సయీలో వీలైనంత ఎక్కువగా జిక్ర్ (అల్లాహ్ స్మరణ) మరియు దుఆలు చేయడం, మరియు పెద్ద శుద్ధి (హదథ్ అక్బర్) మరియు చిన్న శుద్ధి (హదథ్ అల్ అస్గర్) లేకుండా పరిశుభ్రంగా ఉండటం ముస్తహబ్ (సిఫారసు చేయబడినది).
అయితే, అశుద్ధ స్థితిలో సఈ చేసినప్పటికీ అది చెల్లుబాటు అవుతుంది. సఈ పూర్తి చేసిన తరువాత, పురుషుడు తన తల గుండు చేయించుకోవాలి లేదా కత్తిరించుకోవాలి, అయితే గుండు చేయడం ఉత్తమం.
ఒకవేళ అతను హజ్ సమయానికి దగ్గరగా మక్కా వచ్చినట్లయితే, తలవెంట్రుకలు చిన్నగా కత్తిరించుకోవడం మంచిది, తద్వారా హజ్ సమయంలో మిగిలిన తలవెంట్రుకలను గొరిగించుకోవచ్చు. స్త్రీలు తమ తలవెంట్రుకలలో కొన్నింటి దగ్గరగా చేర్చి, అందులో నఖం పొడవు లేదా అంతకంటే తక్కువ కత్తిరించుకోవాలి. ఇహ్రామ్ ధరించిన వ్యక్తి ఈ పనులు చేసిన తర్వాత, అతని ఉమ్రహ్ పూర్తవుతుంది మరియు సకల కృతజ్ఞతలు అల్లాహ్ కే శోభిస్తాయి. ఇప్పుడు ఇహ్రామ్ స్థితి వలన నిషేధించబడినవన్నీ అతని కొరకు అనుమతించబడతాయి.
అల్లాహ్ మాకు మరియు మన ముస్లిం సోదరులందరికీ తన దీన్ ను (అంటే ఇస్లాంను) సరిగ్గా అర్థం చేసుకునే వివేకాన్ని, దానిపై స్థిరంగా నిలబడే ధైర్యాన్ని ప్రసాదించుగాక! మనందరి ఆరాధనలను ఆయన స్వీకరించుగాక. నిశ్చయంగా, ఆయన ఎలాంటి కొరతలు, బలహీనతలు లేని పరమ పవిత్రుడు,అత్యంత కరుణా ప్రదాత.
అల్లాహ్ తన దాసుడు మరియు ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబంపై, సహాబాలపై మరియు అనుచరులపై ప్రళయదినం వరకు కారుణ్యం, శాంతి మరియు అనుగ్రహాలు వర్షింపజేయుగాక.