رسالتان موجزتان في الزكاة والصيام
జకాతు విధిదానము మరియు రమదాను ఉపవాసాలపై రెండు సంక్షిప్త సందేశాలు
జకాతు విధిదానము మరియు రమదాను ఉపవాసాలపై రెండు సంక్షిప్త సందేశాలు
గౌరవనీయులైన షేఖ్
అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్
అల్లాహ్ ఆయన పై దయ చూపుగాక
మొదటి సందేశము
జకాతు విధిదానముపై ముఖ్యమైన కొన్ని ఇస్లామీయ పరిశోధనలు
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీడైన అల్లాహ్ పేరుతో,
అల్హమ్దులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాం అలా మన్లా నబియ్య బఅదహ్, వఅలా ఆలిహి వసహబిహి, అమ్మా బాద్ (సకల స్తోత్రములు, కృతజ్ఞతలు ఏకైకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి, అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబంపై, ఆయన సహచరులపై అల్లాహ్ అనేక దీవెనలు కురిపించుగాక, అమ్మా బాద్:
జకాతు విధి దానము చెల్లించుట గురించి ప్రోత్సహించడం మరియు జ్ఞాపకం చేయడమే ఈ సందేశం వ్రాయడానికి అసలు ప్రేరణ. ఎందుకంటే చాలా మంది ముస్లింలు దాని పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, దానిని సరైన విధంగా చెల్లించుట లేదు, దాని ఘనత మరియు అది ఇస్లాం యొక్క ఐదు ముూలస్థంభాలలో ఒకటిగా ఉండటం మొదలైన కారణాల వలన, దాని మీద ఇస్లాం ధర్మం నిలబడి ఉన్నది; ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఇస్లాం ఐదు విషయములపై నిర్మితమై ఉన్నది : అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమివ్వటం, నమాజు నెలకొల్పటం, జకాత్ ఇవ్వటం, రమజాన్ ఉపవాసములుండటం, దైవ గృహము హజ్ చేయటం[1], ఈ హదీథ్ ప్రామాణికత అంగీకరించబడింది. [1] దీనిని బుఖారీ (హదీథు సంఖ్య: 8) మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 16) లో ఉల్లేఖించారు.
ముస్లిములపై జకాతు విధి దానము విధించబడటం అనేది ఇస్లాం యొక్క అద్భుతమైన సుగుణాలలో ఒకటి, మరియు తన అనుచరుల అవసరాలను చూసుకోవటంలో ఇస్లాం ధర్మం యొక్క శ్రద్ధను ప్రతిబింబిస్తుంది; ఎందుకంటే జకాతు విధి దానము యొక్క ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి మరియు ముస్లిం పేదలకు దాని అవసరం ఎంతో ఉన్నది.
జకాతు ప్రయోజనాలలో ఒకటి: ధనవంతుల మరియు పేదల మధ్య ప్రేమానుబంధాలను స్థిరపరుచడం; ఎందుకంటే, మనసులు తమ పట్ల ఉపకారం చేసినవారిని ప్రేమించే స్వభావాన్ని కలిగి ఉంటాయి.
జకాతు ప్రయోజనాలలో మరొకటి: మనస్సును శుద్ధి చేయుట మరియు మనస్సును పిసినారితనం, ఇంకా అలాంటి ఇతర దుష్ట గుణాలకు దూరంగా ఉంచడం, అల్లాహ్ ఈ అర్థాన్ని తన పవిత్ర ఖుర్ఆన్లో ఇలా పేర్కొన్నాడు: (కావున ఓ ప్రవక్తా!) నీవు వారి సంపదల నుండి దానం (సదఖహ్) తీసుకొని, దానితో వారి పాపవిమోచనం చెయ్యి మరియు వారిని సంస్కరించు... [తౌబా: 103]
జకాతు ప్రయోజనాలలో మరొకటి: ముస్లింలో ఔదార్యం, ఉపకార భావన, మరియు అవసరమైనవారిపై దయా భావాన్ని అలవాటు చేయడం.
జకాతు ప్రయోజనాలలో మరొకటి: అల్లాహ్ నుండి శుభాలు, సంపదలో వృద్ధి మరియు ప్రతిఫలం పొందడం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: మరియు మీరు (ఆయన మార్గంలో) ఖర్చు పెట్టేదంతా ఆయన మీకు తిరిగి ఇస్తాడు. మరియు ఆయనే సర్వశ్రేష్ఠుడైన జీవనోపాధి ప్రదాత. [సబా: 39] ప్రామాణిక హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అల్లాహ్ ఇలా అంటున్నాడు: ఓ ఆదమ్ కుమారుడా! ఖర్చు చేయి (దానం చేయి), మేము నీపై ఖర్చు చేస్తాము...""[2]، ఇవే కాకుండా, లెక్కించలేనన్ని మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. [2] దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీసు నెంబరు (993).
మరియు జకాతు చెల్లించుటలో పిసినారితనం చూపే లేదా దానిని ఇవ్వటంలో నిర్లక్ష్యం వహించే వారి పట్ల కఠినమైన హెచ్చరిక కూడా ఉన్నది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: మరియు ఎవరైతే వెండి, బంగారాన్ని కూడ బెట్టి, దానిని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టరో వారికి బాధారకమైన శిక్ష గలదనే వార్తను వినిపించు. ఆ దినమున దానిని (జకాత్ ఇవ్వని ధనాన్ని /ఆ వెండి బంగారాన్ని) నరకాగ్నిలో కాల్చి దానితో వారి నుదురుల మీద, ప్రక్కల మీద మరియు వీపుల మీద వాతలు వేయబడతాయి. (అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): "ఇదంతా మీరు మీ కొరకు కూడ బెట్టుకున్నదే. కావున మీరు కూడ బెట్టుకున్న దానిని చవి చూడండి. 35 [తౌబా: 34-35] జకాతు విధి దానము చెల్లించబడని ప్రతిదీ ఒక నిధిగా పరిగణించబడుతుంది, దాని యజమాని ప్రళయదినాన దానితో శిక్షించబడతాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి తెలిపిన సహీహ్ హదీథు: «బంగారము మరియు వెండి కలిగి ఉన్న సొంతదారుడు ఎవరైనా వాటి హక్కును (జకాతును) చెల్లించనట్లయితే, తీర్పు దినమున అవి పలకలుగా మార్చబడి నరకాగ్నిలో బాగా కాల్చబడతాయి; వాటితో అతని పక్కలపై, నుదుటిపై, వీపుపై వాతలు పెట్టడం జరుగుతుంది. అవి చల్లారితే వాటిని తిరిగి ఎర్రగా కాల్చడం జరుగుతుంది. ఒక దినము యాభైవేల సంవత్సరాలంత సుదీర్ఘంగా ఉంటుంది. ఆ శిక్ష అల్లాహ్ తన దాసుల మధ్య తీర్పు చేసేటంత వరకూ కొనసాగుతూ ఉంటుంది. తరువాత అతడు అతని గమ్యస్థానమైన స్వర్గం వైపునకో లేక నరకం వైపునకో మార్గం చూసుకుంటాడు (చూపడం జరుగుతుంది).»[3] [3] దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీసు నెంబరు (987).
తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒంటెలు, ఆవులు మరియు మేకలు / గొర్రెలు కలిగి ఉన్న ఆసామి ఎవరైనా వాటిపై జకాతు విధి దానాన్ని చెల్లించకపోతే, పునరుత్థాన దినమున వాటి ద్వారా అతడు శిక్షించబడతాడని తెలియజేశారు.
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు అని విశ్వసనీయంగా నమోదు చేయబడింది: {అల్లాహ్ ఎవరికైతే సంపద ప్రసాదించాడో మరియు దానిపై వారు జకాతు చెల్లించలేదో, తీర్పు దినమున అది రెండు బొడిపెలు కలిగిన బట్టతల పాము రూపంలో వారి మెడ చుట్టు చుట్టబడుతుంది, ఆ తరువాత అది వారి బుగ్గలపై కాటువేస్తుంది, మరియు ఇలా చెబుతుంది: 'నేనే నీ సంపదను, నేనే నీ నిధిని'}, ఆ తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ఈ వాక్కు పఠించారు: "అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రసాదించిన దానిలో లోభం వహించే వారు, తమకదే (లోభమే) మేలైనదని భావించరాదు, వాస్తవానికి అది వారి కొరకు ఎంతో హానికరమైనది. వారు తమ లోభత్వంతో కూడబెట్టినదంతా, తీర్పు దినమున వారి మెడ చుట్టూ చుట్టబడుతుంది... [ఆలె ఇమ్రాన్: 180][4] [4] దీనిని బుఖారీ (హదీథు సంఖ్య: 1338) నమోదు చేసారు.
జకాతు విధి దానము నాలుగు రకాలుగా విభజించబడింది: భూమి నుండి ఉత్పత్తి అయ్యే ఆహార ధాన్యాలు మరియు పండ్లు, ఫలాలు, పశుసంపద, బంగారం మరియు వెండి, మరియు వ్యాపార లావాదేవీలు.
ఈ నాలుగు రకాల (ఆస్తులలో) ప్రతిదానికీ ఒక నిర్ణీత పరిమితి (నిసాబ్) ఉంది, దానికంటే తక్కువ ఉంటే జకాత్ చెల్లించాల్సిన అవసరం లేదు. ధాన్యాలు మరియు పండ్ల నిసాబ్: ఐదు వసఖ్లు, ఒక వసఖ్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాతో అరవై సాలు (ఒక సా అంటే ఒక మనిషి నాలుగు దోసెళ్ళు నిండి నంత). ఖర్జూరం, ద్రాక్ష, గోధుమలు, బియ్యం, బార్లీ మరియు అలాంటి వాటికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాతో మూడు వందల సాలు.
అందులో ఉష్ర్ (పది శాతం) విధిగావించబడింది, సాగు నీటి కొరకు ఖర్చు పెట్టే అవసరం లేకుండా (స్వాభావికంగా) వర్షం, నదులు, ప్రవహించే ఊటలు మొదలైనవాటి ద్వారా సాగు చేయబడిన ఖర్జూరం మరియు ఇతర పంటలపై ఇస్లామీయ నియమం ప్రకారం 'ఉష్ర్' (పది శాతం) జకాతు దానము విధిగావించబడింది.
ఒకవేళ నీటిని సవానీలు, నీటిని పైకి లేపే యంత్రాలు (పంపులు) మరియు ఇలాంటి ఇతర ఖర్చుతో కూడిన పద్ధతుల ద్వారా పండిస్తే, దానిపై వాజిబ్ అయిన జకాతు పది శాతంలో సగం అంటే ఐదు శాతం మాత్రమే. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీథుల ద్వారా స్పష్టం అవుతుంది.
సాయిమా (మేతమేసే) జంతువులైన ఒంటెలు, ఆవులు, గొర్రెల జకాతు పరిమాణం గురించి, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వచ్చిన సహీహ్ హదీథుల్లో స్పష్టమైన వివరణ ఉంది. దీని గురించి మరింతగా తెలుసు కోవాలనుకునే వారు పండితులను అడిగి తెలుసుకోవచ్చు. సంక్షిప్తత కోసం మేము దీన్ని ఇక్కడ పూర్తిగా ప్రస్తావించడం లేదు.
ఇక వెండి నిసాబ్ (కనీస పరిమితి) విషయానికొస్తే, నూట నలభై మిస్ఖాల్ (ఇది ఒక ఇస్లామీయ పరిమాణం), మరియు అది దాదాపు సౌదీ అరేబియా కరెన్సీలలో యాభై ఆరు రియాల్ (నేటి మార్కెటు రేటు ప్రకారం లెక్కించవలెను)
బంగారానికి నిసాబ్ (జకాత్ చెల్లించాల్సిన కనీస పరిమాణం) ఇరవై మిస్ఖాల్లు, మరియు సౌదీ గిన్నీలలో అది పదకొండు గిన్నీలు మరియు మూడు ఏడవ వంతుల గిన్నీ, మరియు గ్రాములలో తొంభై రెండు గ్రాములు, మరియు వాటిలో (బంగారం మరియు వెండి) లేదా వాటిలో ఒకదానిలో నిసాబ్ పరిమాణం కంటే ఎక్కువ కలిగి ఉన్నవారు, మరియు అది ఒక సంవత్సరం మొత్తం వారి వద్ద ఉంటే, దానిపై వారు నలభైవ భాగము అంటే 2.5% జకాతు విధి దానము చెల్లించ వలెను.
లాభం అనేది మూలధనానికి అనుబంధమైనదిగా ఉంటుంది. కాబట్టి దానిని లెక్కించుట కొరకు కొత్త సంవత్సర ఆరంభం యొక్క అవసరం లేదు, అలాగే పశువుల ఉత్పత్తి కూడా దాని మూలాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి దాని మూలం నిసాబ్ చేరుకుంటే కొత్త సంవత్సరం అవసరం లేదు.
నేటి ప్రజలు ఉపయోగించే కరెన్సీ నోట్లకు బంగారం మరియు వెండి యొక్క ఆదేశం వర్తిస్తుంది, అవి దిర్హమ్, దీనార్, డాలర్ లేదా ఇతర పేర్లతో పిలవబడినా. వాటి విలువ వెండి లేదా బంగారం యొక్క నిసాబ్కు చేరినప్పుడు మరియు వాటిపై వారి ఆధీనం ఒక సంవత్సరం గడిచినప్పుడు, వాటిపై జకాత్ విధిగా చెల్లించ వలెను.
మహిళల నగదు, బంగారం లేదా వెండి ఆభరణాలు, ముఖ్యంగా నిసాబ్ లెక్కకు చేరుకున్నప్పుడు మరియు సంవత్సరమంతా వారి వద్ద ఉన్నప్పుడు, వాటిపై జకాతు ఉంటుంది, అవి వినియోగం కోసం లేదా అప్పుగా ఉంచబడినప్పటికీ, విద్వాంసుల రెండు అభిప్రాయాలలో సరైన దాని ప్రకారం వాటిపై జకాత్ ఉంది. దీనికి కారణం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాధారణ హదీథు: «బంగారం లేదా వెండి కలిగి ఉన్న వారు ఎవరైనా వాటిపై జకాతు చెల్లించక పోతే, తీర్పు దినమున అతని కోసం అగ్ని పలకలు తయారు చేయబడతాయి»[5]. పైన పేర్కొన్న హదీథు చివరి వరకు. [5] దీనిని ముస్లిం నమోదు చేసారు, హదీథు సంఖ్య (987).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక స్త్రీ చేతిలో బంగారు గాజులు చూసినప్పుడు ఇలా అన్నారు: ‘దీనిపై జకాతు చెల్లిస్తున్నావా?’. ఆమె ‘లేదు’ అని చెప్పింది. ‘ప్రళయదినాన అల్లాహ్ నీకు ఈ రెండింటిని నిప్పు గాజులుగా చేయడం నిన్ను సంతోషపరుస్తుందా?’ అని అడిగారు. ఆమె వాటిని విసిరేసి, ‘ఇవి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు’ అని చెప్పింది.[6] [6] దీనిని అబూదావూద్, హదీసు నెంబరు (1563), మరియు నసాయీ, హదీసు నెంబరు (2270)లో హసన్ సనద్ తో ఉల్లేఖించారు.
ఉమ్మె సల్మా రదియల్లాహు అన్హా ఉల్లేఖనం: ఆమె బంగారు ఆభరణాలు ధరించేవారు. ఆమె వాటి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగారు: 'ఇది ధనసంపత్తి కింద వస్తుందా?' దానికి ఆయన ఇలా సమాధానమిచ్చారు: «ఏదైనా వస్తువు జకాతు ఇవ్వడానికి అర్హత పొందినప్పుడు దానిపై జకాతు ఇవ్వబడితే అది నిధి కాదు.»[7] ఇలాంటి అర్థాన్ని సూచించే ఇతర హదీసులు కూడా ఉన్నాయి. [7] దీనిని అబూదావుద్ నమోదు చేసారు, హదీథు సంఖ్య (1564).
అయితే అమ్మకానికి సిద్ధం చేసిన వస్తువులు (వాణిజ్య వస్తువులు), అవి సంవత్సరాంతంలో లెక్కించబడతాయి మరియు వాటి విలువలో రుబ్ఉల్ ఉష్ర్ (అంటే 2.5%) చెల్లించబడుతుంది, అవి వాటి ధరతో సమానమైనా, ఎక్కువైనా, తక్కువైనా; దీనికి సమురా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఈ హదీథు ఆధారం: «ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అమ్మకానికి ఉంచిన వస్తువుల నుండి సదఖా (జకాతు విధి దానం) ఇవ్వమని మాకు ఆదేశించేవారు»[8]. [8] దీనిని అబూదావుద్ నమోదు చేసారు, హదీథు సంఖ్య (1562).
అమ్మకానికి సిద్ధం చేసిన భూములు (రియల్ ఎస్టేట్లు), భవనాలు, కార్లు, నీటిని పైకి లేపే యంత్రాలు మరియు అమ్మకానికి సిద్ధం చేసిన ఇతర వస్తువులు ఇందులో వస్తాయి.
అమ్మకానికి కాకుండా అద్దెకు సిద్ధం చేసిన భవనాలపై, వాటి అద్దెపై సంవత్సర కాలం గడిస్తే జకాతు ఉంటుంది, కానీ వాటి మూలస్వరూపంపై జకాత్ ఉండదు; ఎందుకంటే అవి అమ్మకానికి సిద్ధం చేయబడలేదు. అలాగే, వ్యక్తిగత మరియు అద్దె కార్లపై కూడా జకాతు ఉండదు, అవి అమ్మకానికి సిద్ధం చేయబడకపోతే, వాటిని యజమాని ఉపయోగం కోసం కొనుగోలు చేశాడు.
ఒక టాక్సీ యజమాని వద్ద లేదా ఇతరుల వద్ద నిసాబ్ కు చేరుకున్న డబ్బు ఉంటే, అది ఒక సంవత్సరం గడిస్తే దానిపై జకాత్ విధి అవుతుంది, అది ఖర్చు కోసం, వివాహం కోసం, ఆస్తి కొనుగోలు కోసం, లేదా అప్పు తీర్చడానికి, లేదా ఇతర ఉద్దేశ్యాల కోసం సిద్ధం చేసినా సరే; ఇలాంటి వాటిపై జకాత్ విధి తప్పనిసరి అని ధర్మశాస్త్ర సాక్ష్యాలు సూచిస్తున్నాయి.
ఇంతకు ముందు పేర్కొన్నదాని ప్రకారం, ఉలమా అభిప్రాయాల్లో సరైనదిగా పరిగణించబడేది ఏమిటంటే — అప్పు ఉండటం జకాత్ ఇవ్వడాన్ని అడ్డుకోదు.
మరియు అదే విధంగా అనాథల మరియు మతిస్థిమితం లేని వారి డబ్బుపై కూడా జకాతు విధి అవుతుంది, ఇది నిసాబ్ కు చేరినప్పుడు మరియు సంవత్సరం గడిచినప్పుడు, వారి సంరక్షకులు వారి తరపున సంవత్సరం పూర్తయినప్పుడు దానిని జకాతు ఉద్దేశ్యంతో ఇవ్వటం తప్పనిసరి; సాధారణ ఆధారాల ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఆద్ రదియల్లాహు అన్హు ను యమన్ ప్రజల వద్దకు పంపినప్పుడు చెప్పిన హదీథులో ఇలా ఉంది: {అల్లాహ్ వారి సంపదలపై దానము విధించాడు; అది వారి సంపన్నుల నుండి తీసుకుని, వారి పేదవారికి తిరిగి ఇవ్వబడుతుంది.}[9] [9] దీనిని బుఖారీ (హదీథు సంఖ్య: 1395) మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 19)లో నమోదు చేసారు.
జకాత్ అనేది అల్లాహ్హక్కు. అందువల్ల దానిని అర్హులు కానివారికి సరదాగా ఇవ్వడం న్యాయంకాదు. తనకు ఏదైనా లాభం పొందేందుకు, లేదా ఏదైనా నష్టం నివారించేందుకు, లేదా తన ధనాన్ని రక్షించుకునేందుకు, లేదా ఇతరుల విమర్శలను దూరం చేయటానికి కూడా జకాత్ను ఉపయోగించకూడదు. ముస్లిం చేయవలసినది ఏమిటంటే: జకాత్ను కేవలం అర్హులైనవారికే, వారు అర్హులైనందువల్లే ఇవ్వాలి — ఇతర ఉద్దేశాలకోసం కాదు. ఇది చేస్తూ తన మనస్సు శుద్ధిగా ఉంచాలి, అల్లాహ్ కోసమే చిత్తశుద్ధితో ఇవ్వాలి — తద్వారా అతనికి బాధ్యత నుంచి విముక్తి కలుగుతుంది, మరియు అతను అల్లాహ్చే గొప్ప ప్రతిఫలాన్ని, బదులుగా వచ్చు వరాలను పొందగలుగుతాడు.
అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో జకాతు పొందేందుకు అర్హులైన ప్రజల గురించి స్పష్టంగా తెలియజేసినాడు, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: నిశ్చయంగా దానాలు (సదఖాత్) కేవలం యాచించు నిరుపేదలకు మరియు యాచించని పేదవారికి, (జకాత్) వ్యవహారాలపై నియుక్తులైన వారికి మరియు ఎవరి హృదయాలనైతే (ఇస్లాం వైపుకు) ఆకర్షించ వలసి ఉందో వారికి, బానిసల విముక్తి కొరకు, ఋణగ్రస్తులైన వారి కొరకు, అల్లాహ్ మార్గంలో (పోయేవారి) కొరకు మరియు బాటసారుల కొరకు. ఇది అల్లాహ్ నిర్ణయించిన ఒక విధి. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు. [తౌబా: 60]
ఈ పవిత్ర ఆయతు ముగింపులో ఈ రెండు మహానామాలతో (సర్వజ్ఞుడు మరియు మహా వివేకవంతుడు) అల్లాహ్ తన దాసులకు ఒక హెచ్చరికను అందిస్తున్నాడు. ఆయన తన దాసుల పరిస్థితి ఎరిగినవాడు - ఎవరు దానము తీసుకునేందుకు అర్హులో మరియు ఎవరు అర్హులు కారో బాగా ఎరిగినవాడు. ఆయన తన శాసనంలో మరియు నిర్ణయంలో మహావివేకవంతుడు, కాబట్టి ఆయన ప్రతిదానినీ వాటికి తగిన స్థలాల్లో మాత్రమే ఉంచుతాడు, అయినప్పటికీ కొంతమంది వ్యక్తులకు ఆయన విజ్ఞత యొక్క రహస్యాలు తెలియకపోవచ్చు; దాసులు ఆయన శాసనంపై నమ్మకాన్ని కలిగి ఉండటానికి మరియు ఆయన నిర్ణయానికి సమర్పించుకోవటానికి ఒక మార్గదర్శకము.
మరియు అల్లాహ్ మాకు మరియు ముస్లిములకు ఆయన ధర్మములో అవగాహన కల్పించమని, ఆయన పట్ల నిష్కపటతను, చిత్తశుద్ధిని కలిగించమని, ఆయన ప్రీతిప్రసన్నత కొరకు పనులు చేయుటలో ముందుకు సాగించమని మరియు ఆయన క్రోధానికి కారణమయ్యే వాటి నుండి రక్షించమని మేము వేడుకుంటున్నాము. నిస్సందేహంగా ఆయన వినేవాడును మరియు మనకు అతి సమీపంగా ఉండేవాడు!
అల్లాహ్ తన దాసుడైన, తన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై శుభాలను, శాంతిని కురిపించుగాక.
శాస్త్రీయ పరిశోధన విభాగాల ప్రధానాధికారి
సందేశప్రచారము, మార్గదర్శకత్వము మరియు ఫత్వా విభాగములు.
గౌరవనీయులైన షేఖ్: అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్
రెండవ సందేశము
రమదాన్ ఉపవాసం మరియు ఖియాముల్లైల్ ఘనత గురించి, అలాగే కొంతమందికి తెలియకపోవచ్చునని భావించే కొన్ని ముఖ్యమైన ఆదేశములను వివరణ.
అనంత కరుణాప్రధాత, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో,
అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ తరుపు నుండి, ఈ సందేశాన్ని చూస్తున్న ముస్లింలకు, అల్లాహ్ నన్ను మరియు మిమ్ములను విశ్వాసుల మార్గంలో నడిపించుగాక, మరియు నాకు మరియు మీకు ఖుర్ఆన్ మరియు సున్నతుల విషయాలలో మంచి అవగాహన కలిగించుగాక, ఆమీన్!
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యములు, శుభాలు కురియుగాక.
అమ్మా బాద్ (ఇక ఆ తరువాత): ఈ సంక్షిప్త రచన, రమదాన్ ఉపవాసాలు మరియు రమదాన్ మాసంలో ఖియాముల్ లైల్ యొక్క ఘనత, అలాగే సత్కార్యములలో ముందంజ వేయుటలోని ఘనతకు సంబంధించి ఉన్నది. కొందరికి తెలియని ముఖ్యమైన నియమాలు కూడా ఇక్కడ వివరించబడినాయి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇది ధృవీకరించబడింది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు రమదాన్ నెల రాబోతుందనే సంతోషవార్త నందించేవారు మరియు అది కరుణా ద్వారాలు మరియు స్వర్గద్వారాలు తెరిచి ఉంచబడే, నరక ద్వారాలు మూసివేయబడే మరియు షైతానులు బంధించబడే నెలగా వారికి తెలియపరచేవారు. ఇంకా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు: «రమదాన్ మొదటి రాత్రి మొదలు కాగానే స్వర్గపు ద్వారాలు తెరుచుకుంటాయి మరియు వాటిలో ఏ ద్వారమూ మూసివేయబడదు, నరకపు ద్వారాలు మూసివేయబడతాయి మరియు వాటిలో ఏ ద్వారమూ తెరవబడదు. షైతానులు సంకేళ్లలో ఖైదు చేయబడతారు. ఒక పిలిచే వాడు ఇలా పిలుస్తాడు: 'ఓ మంచి కోరువాడా! ముందుకు రా! ఓ చెడు కోరువాడా! వెనక్కు తగ్గు!' మరియు ప్రతి రాత్రి అల్లాహ్ నరకం నుండి అనేక మందిని విముక్తి చేస్తాడు.»[1]. [1] దీనిని తిర్మిజీ హదీథు నెంబరు (682), ఇబ్నె మాజ హదీథు నెంబరు (1642) లో ఉల్లేఖించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: «మీ వద్దకు రమదాన్ మాసము వచ్చింది, ఇది ఎన్నో శుభాలతో నిండిన మాసము, ఇందులో అల్లాహ్ మిమ్మల్ని తన కరుణ, దయలతో కప్పివేస్తాడు. ఆయన మీపై తన క్షమాభిక్షను అనుగ్రహించి, మీ పాపాలను మన్నిస్తాడు, మీ దుఆలను ఆమోదిస్తాడు. ఈ నెలలో మంచి పనుల కోసం మీరు పోటీ పడటాన్ని అల్లాహ్ చూసి తన దూతల (మలాయికల) ముందు మిమ్మల్ని గర్వంగా ప్రశంసిస్తాడు; కాబట్టి మీలోని మంచితనాన్ని అల్లాహ్ కు చూపించండి. ఎందుకంటే (ఈ పవిత్ర మాసంలో) అల్లాహ్ కరుణ పొందలేని వాడు నిజానికి ఎంతో దురదృష్టవంతుడు.»[2]. [2] దీనిని తబ్రానీ తన ముస్నద్ లో, హదీథు సంఖ్య (2238) ఉల్లేఖించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: «ఎవరైతే అల్లాహ్ యందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ రమదాన్ నెల ఉపవాసాలు పాటిస్తారో, అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి. మరియు ఎవరైతే అల్లాహ్ యందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ రమదాన్ నెలలో (తరావీహ్) నమాజులలో నిలబడతారో, అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి. మరియు ఎవరైతే అల్లాహ్ యందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ ‘లైలతుల్ ఖద్ర్’ రాత్రి నమాజులలో నిలబడతారో, అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి»[3]. [3] దీనిని బుఖారీ ఉల్లేఖించారు హదీథు సంఖ్య (2014) మరియు ముస్లిం ఉల్లేఖించారు హదీథు సంఖ్య (760).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: «అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ఆదమ్ సంతానం చేసే ప్రతి సత్కార్యానికి పది రెట్ల నుండి ఏడు వందల రెట్ల వరకు ప్రతిఫలం లభిస్తుంది - ఒక్క ఉపవాసం విషయంలో తప్ప. ఎందుకంటే అది కేవలం నా కోసం మాత్రమే మరియు దానికి నేనే ప్రతిఫలం ఇస్తాను; అతను తన మనోవాంఛలను, అన్నపానీయాలను నా కొరకు వదిలి వేశాడు. ఉపవాసి కొరకు రెండు సంతోష సందర్భాలు ఉంటాయి: మొదటిది ఉపవాసం విరమించేటప్పుడు, రెండోది తన ప్రభువును కలిసే టప్పుడు. ఉపవాసి నోటి వాసన అల్లాహ్ వద్ద ముష్క్ సుగంధం కంటే ఎక్కువ ప్రియమైన సువాసనగా పరిగణించబడుతుంది»[4]. [4] దీనిని ఇబ్నె మాజ నమోదు చేసారు, హదీథు సంఖ్య (1638).
రమదాన్ మాసపు ఉపవాసాలు మరియు రాత్రి నమాజులు, అలాగే ఉపవాసం యొక్క ఘనత తెలిపే ఇలాంటి హదీథులు అనేకం ఉన్నాయి.
మొమిన్ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి, అది: అల్లాహ్ అతనికి రమదాన్ మాసాన్ని అందించినాడు; కాబట్టి అల్లాహ్ కు విధేయత చూపటంలో త్వరపడాలి, పాపాల నుండి దూరంగా ఉండాలి, మరియు అల్లాహ్ అతనిపై విధించిన వాటిని ఆచరించటంలో శ్రద్ధ వహించాలి, ముఖ్యంగా ఐదు పూటల నమాజులను; ఎందుకంటే నమాజు ఇస్లాం యొక్క మూల స్తంభం, మరియు షహాదతైన్ తరువాత అతి గొప్ప విధి, కాబట్టి వాటిని సంరక్షించటం మరియు వాటిని సమయానికి, భక్తితో మరియు ప్రశాంతతతో ఆచరించటం ప్రతి ముస్లిం పురుషుని మరియు ముస్లిం స్త్రీ కర్తవ్యం.
పురుషుల ముఖ్యమైన కర్తవ్యాలలో ఒకటి, అల్లాహ్ గృహాలలో (మస్జిదులలో) సామూహికంగా నమాజులు చేయడం మరియు అల్లాహ్ నామాన్ని స్మరించడం (జిక్ర్ చేయడం}, అల్లాహ్ఇలా సెలవిచ్చాడు: మరియు నమాజ్ ను స్థాపించండి మరియు విధిదానం (జకాత్) ఇవ్వండి మరియు (నా సాన్నిధ్యంలో వినమ్రులై) వంగే (రుకూఉ చేసే) వారితో పాటు మీరూ (వినమ్రులై) వంగండి (రుకూఉ చేయండి). [అల్ బఖర: 43] మరియు మహోన్నతుడైన అల్లాహ్ యొక్క మరో ప్రకటన: మీరు మీ నమాజ్ లను కాపాడుకోండి మరియు ముఖ్యంగా మధ్య నమాజ్ ను మరియు అల్లాహ్ సన్నిధానంలో వినయవిధేయతలతో నిలబడండి. [అల్ బఖర: 238] మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {వాస్తవానికి విశ్వాసులు సాఫల్యం పొందుతారు; వారే! ఎవరైతే తమ నమాజ్ లో వినమ్రత పాటిస్తారో! 2﴾ [అల్ మూమినూన్: 1-2] ఇంకా అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: మరియు వారు ఎవరైతే తమ నమాజ్ లను కాపాడుకుంటారో! వారు వారసులు. వారు ఫిర్దౌస్ ను వారసత్వంగా పొందుతారు, అందులో శాశ్వతంగా ఉంటారు. [అల్ మూమినూన్: 9-11] ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: మనకు వారికి మధ్య ఉన్న ప్రమాణము సలాహ్ (నమాజు). దాన్ని వదిలిన వాడు అవిశ్వాసమునకు ఒడిగట్టాడు. [5] [5] దీనిని తిర్మిజీ హదీథు నెంబరు (2621), ఇబ్నె మాజ హదీథు నెంబరు (1079) లో ఉల్లేఖించారు.
నమాజు తరువాత ముఖ్యమైన విధికార్యాలలో ‘జకాతు’ చెల్లించడము వస్తుంది, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్ ను స్థాపించాలని మరియు జకాత్ ఇవ్వాలని. ఇదే సరైన ధర్మము. [అల్ బయ్యినహ్: 5] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: మరియు మీరు కరుణించబడాలి అంటే నమాజ్ స్థాపించండి, విధిదానం (జకాత్) ఇవ్వండి మరియు సందేశహరునికి విధేయులై ఉండండి! [అల్ నూర్: 56]
తమ సంపదపై జకాత్ చెల్లించని వారు తీర్పుదినమున ఆ సంపదతోనే శిక్షించబడతారని అల్లాహ్ యొక్క మహత్తర గ్రంథం ఖుర్ఆన్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీథులు సూచిస్తున్నాయి.
నమాజు మరియు జకాతు తరువాత ముఖ్యమైన కర్తవ్యం రమదాన్ మాసం ఉపవాసాలు పాటించుట. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనంలో ప్రస్తావించబడిన ఇస్లాం యొక్క ఐదు పునాదులలో, మూలస్థంభాలలో ఒకటి: ఇస్లాం ధర్మం ఐదు పునాదులపై ఆధారపడి ఉంది. 1) అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడనీ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవప్రవక్త అని సాక్ష్యం పలకటం, 2) నమాజ్ స్థాపించటం, 3) జకాత్ చెల్లించటం, 4) రమజాన్ నెలలో ఉపవాసాలు పాటించటం, 5) దైవగృహ యాత్ర చేయటం[6]. [6] దీనిని బుఖారీ (హదీథు సంఖ్య: 8) మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 16) లో ఉల్లేఖించారు.
ముస్లిం తన ఉపవాసం మరియు ఖియాముల్లైల్ (రాత్రి ప్రార్థన) ను అల్లాహ్ నిషిద్ధం చేసిన మాటలు మరియు క్రియల నుండి రక్షించుకోవాలి. ఎందుకంటే ఉపవాసం యొక్క అసలు ఉద్దేశ్యం అల్లాహ్ కు విధేయత చూపటం, ఆయన పవిత్ర నియమాలను గౌరవించటం, మరియు తన మనసు కోరికలకు వ్యతిరేకంగా తన ప్రభువు ఆజ్ఞలకు విధేయంగా ఉండటానికి కృషి చేయడం. అలాగే, అల్లాహ్ నిషిద్ధం చేసిన వాటి నుండి తనను తాను ఆపుకోవటానికి సహనం అలవాటు చేసుకోవడం. కేవలం ఆహార పానీయాలు మరియు ఇతర ఉపవాసాన్ని భంగం చేసే వాటిని వదిలిపెట్టడమే ఉపవాసం యొక్క ఉద్దేశ్యం కాదు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: «ఉపవాసము ఒక రక్షణ కవచం వంటిది. మీలో ఎవరైనా ఏ రోజైనా ఉపవాసం ఉన్నట్లయితే, అతను ఆ స్థితిలో అసభ్యకరంగా ప్రవర్తించరాదు మరియు పెద్ద స్వరంతో మాట్లాడరాదు. ఒకవేళ ఎవరైనా అతనిని అవమానించినా, అతనితో వాగ్వివాదానికి లేక జగడానికి దిగినా, అతను 'నేను ఉపవాసం పాటిస్తున్నాను' అని చెప్పాలి»[7], ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిరూపితమైనది. ఇంకా ఆయన ఇలా సెలవిచ్చారు: «ఎవరైనా (ఉపవాసం ఉండి కూడా) అబద్ధాలు చెప్పటం, వాటిని ఆచరించడం వంటి అజ్ఞానపు పనులు వదులుకోకపోతే ఆ వ్యక్తి అన్నపానీయాల్ని వదలిపెట్టడం పట్ల అల్లాహ్ కు ఎలాంటి ఆసక్తి ఉండదు»[8]. "ఈ వచనాలు మరియు ఇతర వాటి ద్వారా, ఉపవాసదారుడు అల్లాహ్ నిషిద్ధం చేసిన ప్రతీది నుండి జాగ్రత్తగా ఉండటం మరియు అల్లాహ్ విధించిన ప్రతిదానిని పాటించడం అతనిపై కచ్చితమైన బాధ్యతగా ఉండే విషయం అని తెలిసింది. దీనివల్ల అతనికి క్షమాపణ, నరకాగ్ని నుండి విమోచన, ఉపవాసం మరియు ఖియాయుల్లైల్ స్వీకరించబడుతాయని ఆశించవచ్చు." [7] దీనిని బుఖారీ (1904), నసాయి (2537) లో ఉల్లేఖించారు. [8] దీనిని బుఖారీ (హదీథు సంఖ్య: 1804) మరియు అబూ దావూద్ (హదీథు సంఖ్య: 2362) లో ఉల్లేఖించినారు.
కొన్ని విషయాలు కొంత మంది పై గోప్యంగా ఉండవచ్చు:
వాటిలో ఒకటి: ముస్లింకు ఉపవాసాన్ని విశ్వాసంతోను, పుణ్యఫల ఆశతోను ఆచరించడం కచ్చితంగా అవసరం — ప్రజలకు చూపించడానికీ, ఖ్యాతికోసమైయినా, ఇతరులను అనుకరించడానికైనా, లేదా తన కుటుంబ సభ్యులు గానీ పట్టణవాసులు గానీ చేస్తున్నారని చేయడం కాదు. ఉపవాసం చేయడానికి అతన్ని ప్రేరేపించేది ఈ విషయం అయి ఉండాలి — అంటే అల్లాహ్ అతనిపై దీన్ని విధిగావించినందునకు ఇతడు ఉపవాసం ఉంటున్నాడు, మరియు ఇందులో అల్లాహ్ వద్ద పుణ్యఫలాన్ని ఆశిస్తున్నాడు. ఇదే విధంగా రమజాన్ రాత్రిపూట ఖియాయుల్లైల్ (తరావీహ్) కూడా ముస్లిం విశ్వాసంతోను, పుణ్యఫల ఆశతోను ఆచరించాలి — వేరే ఎలాంటి కారణంతో కాదు. అందుకే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: «ఎవరైతే అల్లాహ్ యందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ రమదాన్ నెల ఉపవాసాలు పాటిస్తారో, అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి. మరియు ఎవరైతే అల్లాహ్ యందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ రమదాన్ నెలలో(తరావీహ్) నమాజులలో నిలబడతారో, అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి. మరియు ఎవరైతే అల్లాహ్ యందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ ‘లైలతుల్ ఖద్ర్’ రాత్రి నమాజులలో నిలబడతారో, అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి»[9]. [9] దీనిని బుఖారీ (హదీథు సంఖ్య: 2014) మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 760)లో నమోదు చేసారు.
కొందరిపై విషయాల ఆదేశాలు గోప్యంగా ఉంటాయి: ఉపవాసదారుడికి గాయాలు కలగడం, ముక్కు రక్తస్రావం (రఊఫ్), వాంతులు అవడం, లేదా నీరు లేదా పెట్రోల్ ఇతని ఎంపిక లేకుండానే గొంతులోకి వెళ్లిపోవడం వంటి విషయాలు జరిగితే, ఇవన్నీ ఉపవాసాన్ని భంగపరచవు. అయితే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వాంతి చేసుకుంటే, అతని ఉపవాసం భంగమవుతుంది. ఎందుకంటే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: : «ఎవరైతే అనుకోకుండా వాంతి చేసుకుంటాడో అతనిపై ఖజా లేదు, కానీ ఎవరైతే ఉద్దేశపూర్వకంగా వాంతి చేసుకుంటాడో అతనిపై ఖజా ఉంది»[10]. [10] దీనిని తిర్మిజీ (హదీథు సంఖ్య: 720) మరియు ఇబ్నె మాజ (హదీథు సంఖ్య: 1676) లో నమోదు చేసినారు.
అందులో ఒకటి: ఉపవాసదారుడికి జనాబత్ గుసుల్ చేయడం ఆలస్యమై పగటి వెలుగురేకలు కనిపించే వరకు వాయిదా పడటమవచ్చు. అలాగే, కొన్ని స్త్రీలకు ) రుతుస్రావం లేదా ప్రసవానంతర రక్తస్రావం తర్వాత శుభ్రత (తహారత్) వచ్చి ఉండి గుసుల్ చేయడం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ఆమెకు శుభ్రత పగటి వేళకు ముందే వచ్చి ఉంటే, ఆమెకు ఉపవాసం చేయవలసి ఉంటుంది. గుసుల్ చేయడాన్ని పగటి వెలుగు వెలిగిన తర్వాతకు వాయిదా వేయడంలో ఎలాంటి అపవిత్రత లేదు. అయితే, ఆమెకు గుసుల్ చేయడాన్ని సూర్యోదయం వరకు వాయిదా వేయటానికి అనుమతి లేదు. ఆమె తప్పకుండా సూర్యోదయానికి ముందే గుసుల్ చేసి ఫజ్ర్ నమాజు చదవాలి. అశుద్ధావస్థలోని వ్యక్తి సూర్యోదయం అయ్యే వరకు గుసుల్ ఆలస్యం చేయకూడదు, అతను గుసుల్ చేసి సూర్యోదయానికి ముందే ఫజ్ర్ నమాజు చేయడం అనేది అతనిపై విధిగా ఉంది, మరియు అతను ఫజ్ర్ నమాజు జమఅతుతో చేయడానికి త్వరపడాలి.
ఉపవాసాన్ని భంగం చేయని విషయాలలో: రక్త పరీక్ష, పోషకతను ఉద్దేశించని ఇంజక్షన్లు. అయితే, సాధ్యమైతే వీటిని రాత్రికి వాయిదా వేయడం ఉత్తమం మరియు సురక్షితం; ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీథు: «అనుమానాస్పద విషయాలను వదిలి నమ్మకంగలిగిన విషయాల వైపుకి మరలండి»[11]. [11] దీనిని తిర్మిజీ నమోదు చేసారు, హదీథు సంఖ్య (2518).
మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మరో హదీథు: «ఎవరైతే ఆ అనుమానాస్పద విషయాల నుండి భయబీతి కలిగి ఉంటారో, అలాంటి వారు తమ ధర్మం మరియు గౌరవం యొక్క రక్షణ పొందుతారు.»[12]. [12] దీనిని బుఖారీ (హదీథు సంఖ్య: 52) మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 1599) లో నమోదు చేసారు.
కొంతమందికి తెలియని విషయాలలో మరొకటి: నమాజులో ప్రశాంతత (ఖుషూ) లేక పోవడం - అది ఫర్ద్ అయినా లేదా సున్నతు/నఫిల్ అయినా. నమాజులో ప్రశాంతత అనేది ఒక మూల స్థంభం అని అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నమోదైన సహీహ్ హదీథులు తెలియజేస్తున్నాయి, అది లేకుండా నమాజు సరిగా ఉండదు. నమాజులో ప్రశాంతత పొందేందుకు వీలు కల్పించే ఆచరణలు - నమాజులో నిలకడగా ఉండటం, దానిని వినయంతో ఆచరించడం మరియు తొందరపడకుండా ప్రతి కీళ్లు వాటి స్థానంలోకి తిరిగి వచ్చే వరకు నెమ్మదిగా ఆచరించడం మొదలైనవి. చాలామంది రమదాన్లో తరావీహ్ నమాజులను అర్థం చేసుకోకుండా, ప్రశాంతంగా కాకుండా తొందర, తొందరగా పూర్తి చేస్తారు. ఈ విధంగా ఆచరించిన నమాజు చెల్లదు, మరియు అలా ఆచరించిన వ్యక్తి పాపిగా పరిగణించబడి, దాని నుండి ఎలాంటి ప్రతిఫలం పొందడు.
కొంతమందికి తెలియని విషయాలలో మరొకటి: కొందరు తరావీహ్ నమాజు ఇరవై రకాతుల కంటే తక్కువగా చేయకూడదని భావిస్తారు, మరికొందరు పదకొండు రకాతులు లేదా పదమూడు రకాతుల కంటే ఎక్కువ చేయకూడదని భావిస్తారు. కానీ ఇది సరైన భావన కాదు, ప్రామాణిక ఆధారాలకి విరుద్ధంగా ఉంది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహీహ్ హదీథులు రాత్రి నమాజు గురించి విస్తృతంగా తెలియజేస్తున్న దాన్ని బట్టి ఇందులో ఎటువంటి రకాతుల పరిమితి లేదు, దానికి విరుద్ధంగా ఇన్నే రకాతులు అని పరిమితి పెట్టుకోవడానికి అనుమతి లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్నిసార్లు రాత్రి నమాజులో పదకొండు రకాతులు చేసేవారని, కొన్నిసార్లు పదమూడు రకాతులు చేసేవారని, కొన్నిసార్లు రమదాన్ మాసంలోనూ మరియు ఇతర కాలాలలో అంతకంటే తక్కువ రకాతులు చేసేవారని హదీథులలో నమోదు చేయబడింది. రాత్రి నమాజు గురించి అడిగినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: «రెండు రెండు రకాతులుగా (నమాజ్) చేయండి. మీలో ఎవరైనా తెల్లవారుతుందని భయపడితే, అతను ఒక రకాతు నమాజ్ చేయాలి. అది అతను అంతకుముందు చేసిన నమాజును విత్ర్ (బేసి)గా చేస్తుంది»[13]. దాని ప్రామాణికత అంగీకరించబడింది. [13] దీనిని బుఖారీ (హదీథు సంఖ్య: 946) మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 749) లో నమోదు చేసారు.
రమదానులో కానీ ఇతర రోజుల్లో కానీ నిర్దిష్ట రకాతులు నిర్ణయించబడలేదు. అందువలన ఉమర్ రదియల్లాహు అన్హు కాలంలో సహాబాలు కొన్ని సందర్భాలలో ఇరవై మూడు రకాతులు, మరి కొన్ని సందర్భాలలో పదకొండు రకాతులు చేసేవారు. ఇది ఉమర్ రదియల్లాహు అన్హు మరియు ఆయన కాలంలోని సహాబాల నుండి ప్రామాణికంగా నమోదు చేయబడింది.
కొంతమంది సలఫ్, రమదానులో ముప్పై ఆరు రకాతులు చేసి మూడు రకాతుల విత్ర్ ఆచరించేవారని, మరికొందరు నలభై ఒక్క రకాతులు చేసేవారని, షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియ్యా మరియు ఇతర పండితులు ఉల్లేఖించారు. ఆయన -రహ్మతుల్లాహి అలైహి- ఈ విషయం విస్తృతమైనదని మరియు దీర్ఘంగా ఖుర్అన్ పఠనం, రుకూ, సజ్దా చేసేవారు రకాతుల సంఖ్యను తగ్గించుకోవడం ఉత్తమమని, మరియు పఠనం, రుకూ, సజ్దా త్వరగా చేసేవారు రకాతుల సంఖ్యను పెంచుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులను పరిశీలించినప్పుడు, రాత్రి నమాజులలో రమదాన్ లోనూ మరియు ఇతర దినాల్లోనూ పదకొండు రకాతులు లేదా పదమూడు రకాతులు నమాజు చేయడం ఉత్తమమని తెలుసుకోవచ్చు; ఎందుకంటే ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మామూలు ఆచరణకు అనుగుణంగా ఉంది, మరియు ఇది ఆరాధకులకు సౌకర్యవంతంగానూ ఉంటుంది, ఇది మరింత భక్తికి మరియు మనశ్శాంతికి దగ్గరగా ఉంటుంది. ఎవరైనా ఎక్కువ రకాతులు చేసినా, అందులో ఎలాంటి దోషము లేదు అభ్యంతరమూ లేదు.
రమదాన్ నెలలో ఇమాముతో కలిసి రాత్రి నమాజులు ఆచరించేవారు, ఇమాముతో పాటు ముగించుట ఉత్తమం (ఇమాం ఎన్ని రకాతుల తహజ్జుద్ లేదా ఖియాముల్ లైల్ చేస్తే, ఇమాంతో పాటు మీరు కూడా అన్ని రకాతులు చేయుట ఉత్తమం); ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: «ఒక వ్యక్తి ఇమామ్ తో కలిసి నిలబడి, ఇమామ్ (నమాజులు పూర్తి చేసి) తిరిగి వెళ్లే వరకు (ఇమాముతో) ఉంటే, అల్లాహ్ అతనికి ఆ రాత్రి మొత్తం నమాజు ఆచరించినట్లు లిఖిస్తాడు.»[14]. [14] దీనిని తిర్మిజీ (హదీథు సంఖ్య: 806) మరియు అబూ దావుద్ (హదీథు సంఖ్య: 1375) లో నమోదు చేసారు.
ఈ పవిత్ర మాసంలో ముస్లింలందరూ వివిధ రకాల ఆరాధనలలో శ్రద్ధ పెట్టాలి. ఉదాహరణకు నఫీల్ నమాజులు ఆచరించడం, దీర్ఘాలోచన చేస్తూ ఖుర్ఆన్ పఠించడం, తస్బీహ్ (సుబహానల్లాహ్), తహ్లీల్ (లా ఇలాహ ఇల్లల్లాహ్), తహ్మీద్ (అల్'హమ్'దు లిల్లాహ్), తక్బీర్ (అల్లాహు అక్బర్), ఇస్తిగ్ఫార్ మరియు షరియతును ప్రకారం దుఆలు చేయడం, మంచి పనులను ప్రోత్సహించడం మరియు చెడు పనులను నిరోధించడం, అల్లాహ్ ను వేడుకోవడం, అక్కరగలవారికి మరియు నిరుపేదలకు సహాయం చేయడం, తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా మెలగడం మరియు బంధుత్వాలను కొనసాగించడం, ఇరుగుపొరుగువారిని గౌరవించడం మరియు రోగులను పరామర్శించడం వంటి సత్కార్యాలలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి; ఎందుకంటే ఇంతకు పూర్వం ప్రస్తావించిన హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: «ఈ నెలలో మంచి పనుల కోసం మీరు పోటీ పడటాన్ని అల్లాహ్ చూసి తన దూతల (మలాయికల) ముందు మిమ్మల్ని గర్వంగా ప్రశంసిస్తాడు; కాబట్టి మీలోని మంచితనాన్ని అల్లాహ్ కు చూపించండి. ఎందుకంటే (ఈ పవిత్ర మాసంలో) అల్లాహ్ కరుణకు నోచుకోని వ్యక్తి ఎంతో దురదృష్టవంతుడు.»[15] [15] దీనిని తబ్రానీ ముస్నద్ లో ఉల్లేఖించారు హదీథు సంఖ్య (2238).
ఇంకా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినట్లు ఉల్లేఖించబడింది: «ఎవరైతే మంచి పనులలో ఏదైనా ఒక మంచి పనిని ఈ నెలలో చేస్తే, అది ఇతర నెలలలో ఒక ఫర్ద్ (తప్పనిసరి విధిగావించబడిన పని) చేసినట్లుగా లెక్కించబడుతుంది. మరియు ఎవరైతే ఈ నెలలో ఒక ఫర్ద్ (తప్పనిసరి విధిగావించబడిన పని) చేస్తే, అది ఇతర నెలలలో డెబ్బై ఫర్ద్ లు (తప్పనిసరి విధిగావించబడిన పనులు) చేసినట్లుగా లెక్కించబడుతుంది.»[16]. [16] దీనిని ఇబ్నె ఖుజైమ తన సహీహ్ లో ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (1887).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరొక ప్రామాణిక హదీథులో ఇలా పలికినారు: «రమదానులో చేయబడే ఉమ్రా ఒక హజ్జ్ కు సమానం, లేదా నాతో హజ్జ్ చేయడానికి సమానం»[17]. [17] దీనిని బుఖారీ నమోదు చేసారు, హదీథు సంఖ్య (1863)
ఈ పవిత్ర మాసంలో వివిధ రకాల సత్కార్యాలలో పోటీ పడటం గురించి షరియతు ధృవీకరణను సూచించే హదీథులు మరియు ఆథారాలు అనేకం ఉన్నాయి.
మేము అల్లాహ్’ను వేడుకుంటున్నాము - ఆయన మాకు మరియు సమస్త ముస్లిం సమాజానికి తన ప్రీతి, ప్రసన్నతలు పొందగలిగే పనులు చేయు శక్తిని ప్రసాదించుగాక! మా ఉపవాసాలు మరియు నమాజులను స్వీకరించు గాక! మా పరిస్థితులను సరిదిద్దు గాక! మమ్మల్ని మరియు ముస్లింలందరిని విపత్తుల నుండి రక్షించుగాక! మరియు మేము అల్లాహ్ సుబహానహు వతఆలాతో ముస్లిముల పరిపాలకులను సంస్కరించమని, వారి కలిమాను సత్యంపై మాత్రమే సమీకరించమని వేడుకుంటున్నాము. దీనిని ఆయన మాత్రమే నెరవేర్చువాడు, మరియు దాని సామర్ధ్యం ఆయనకు మాత్రమే గలదు.
మీపై శాంతి, అల్లాహ్ యొక్క కరుణ మరియు ఆశీర్వాదములు వుండును.