قاموس الكبائر
كتاب "كبائر الذنوب" يتناول أهم الذنوب الكبيرة التي حذر منها الإسلام وعواقبها الخطيرة على الأفراد والمجتمعات. يبدأ الكتاب بتعريف الكبائر وبيان الفرق بينها وبين الصغائر، ثم يعرض أمثلة على هذه الكبائر مثل الشرك بالله، والكذب على الله ورسوله، والبدعة، والرياء، وترك الصلاة. يوضح الكتاب الأدلة الشرعية على تحريم كل من هذه الكبائر وتأثيراتها السلبية في الدنيا والآخرة، بالإضافة إلى سبل الوقاية والعلاج من الوقوع فيها، محذراً من خطورة التساهل فيها وضرورة التوبة والابتعاد عنها.
మహాపాపాల నిఘంటువు
వివిధ భాషలలో ఇస్లామీయ సాహిత్య సేవా సంఘం యొక్క శాస్త్రీయ కమిటీ
అనంత కరుణామయుడు అపార కరుణా ప్రధాత అయిన అల్లాహ్ పేరుతో
తొలి పలుకులు
సర్వస్తోత్రాలు ఆ అల్లాహ్ కొరకే, ఆయన తన దాసులకు రుజుమార్గం చూపాడు మరియు దైవభీతిని తన బాధాకరమైన శిక్ష నుండి ఒక పటిష్టమైన కోటగా చేశాడు. మన ప్రవక్త ముహమ్మద్ పై, ఆయన కుటుంబము పై, ఆయన సహచరులందరి పై శుభాలు, శాంతి కురియుగాక. అమ్మా బాద్:
నిశ్చయంగా, హృదయానికి ప్రశాంతతను మరియు ఆత్మకు శాంతిని కలిగించే అత్యున్నతమైన విషయాలలో ఒకటి ఉన్నతమైన ఇస్లాం బోధనలను ధ్యానించడం, మరియు అల్లాహ్ ఆదేశాలు మరియు నిషేధాల వద్ద నిలబడటం. ముఖ్యంగా మహా పాపాలకు సంబంధించిన విషయాలు, అల్లాహ్ తన స్పష్టమైన గ్రంథంలో హెచ్చరించినవి, మరియు ఆయన ప్రవక్త పవిత్రమైన సున్నత్ లో హెచ్చరించినవి; ఎందుకంటే అవి వ్యక్తి మరియు సమాజంపై పెద్ద ప్రమాదాన్ని మరియు ప్రభావాన్ని చూపుతాయి. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: మరియు ఆకాశాలలో నున్నది మరియు భూమిలో నున్నది, అంతా అల్లాహ్ కే చెందుతుంది. దుష్టులకు వారి కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వటానికి మరియు సత్కార్యాలు చేసిన వారికి మంచి ప్రతిఫలం ఇవ్వటానికి. ఎవరైతే చిన్న చిన్న తప్పులు తప్ప, పెద్ద పాపాల నుండి మరియు అసహ్యకరమైన పనుల నుండి దూరంగా ఉంటారో వారి కొరకు, నిశ్చయంగా, నీ ప్రభువు క్షమాపణ పరిధి చాలా విశాలమైనది... [అన్-నజ్మ్: 31-32 ]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “వినాశకరమైన ఏడు పాపముల నుండి దూరంగా ఉండండి” [1]. [1] దీనిని బుఖారీ హదీథు సంఖ్య (2766); ముస్లిం హదీథు సంఖ్య (89) లో ఉల్లేఖించారు.
మహా పాపములు (అల్-కబాయిర్) అల్లాహ్ పట్ల లేదా ఆయన దాసుల పట్ల చేసే అన్ని మహా పాపములను కలిగి ఉంటాయి. పవిత్ర షరీయతు వాటికి పాల్పడకుండా హెచ్చరించింది మరియు ఇహ పరలోకాల్లో వాటి యొక్క తీవ్రమైన పరిణామాలను స్పష్టం చేసింది.
అయితే అల్లాహ్ యొక్క అపారమైన కారుణ్యం పశ్చాత్తాపపడి తిరిగి వచ్చిన ప్రతి ఒక్కరి కోసం తౌబా యొక్క ద్వారం తెరిచింది; అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "అయితే, ఎవడైతే పశ్చాత్తాపపడి విశ్వసించి మరియు సత్కార్యాలు చేస్తాడో, అలాంటి వాని పట్ల నేను అత్యంత క్షమాశీలుడను". [తాహా: 82]
ఈ కారణంగా; ఈ పుస్తకం, ఖుర్ఆన్ మరియు సున్నత్ యొక్క ప్రమాణాలను ఆధారం చేసుకుని, మహాపాపం యొక్క నిజస్వరూపాన్ని, దాని దుష్పరిణామాలను వివరించటాని వచ్చినది, మరియు దాని నుండి పశ్చాత్తాపం చెంది విముక్తి పొందే మార్గాన్ని కూడా స్పష్టం చేస్తుంది.
ఈ కార్యాన్ని, వివిధ భాషలలో ఇస్లామీయ సాహిత్య సేవా సంఘం యొక్క శాస్త్రీయ కమిటీ, రబ్వాలోని కమ్యూనిటీ అవేర్నెస్ అసోసియేషన్ సహకారంతో, ఈ విలువైన జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనే ఉత్సుకతతో, అరబియేతరుల కోసం అనువాదానికి దాని అనుకూలతను దృష్టిలో ఉంచుకుని, ఇస్లాం సందేశాన్ని అందరికీ అందించడం యొక్క ప్రాముఖ్యతపై గల విశ్వాసంతో సిద్ధం చేయడం జరిగింది.
మహోన్నతుడైన అల్లాహ్ ఈ ప్రయత్నాన్ని సత్కర్మల తూకంలో నమోదు చేయాలని, దీనితో సమస్త ప్రజలకు లాభం చేకూర్చాలని మేము అల్లాహ్ను ప్రార్థిస్తున్నాము.
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.
పరిచయం
సర్వస్తోత్రాలన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే చెందుతాయి. మరియు అల్లాహ్ మన ప్రవక్త ముహమ్మద్ పై, ఆయన కుటుంబము పై, ఆయన సహచరులపై శుభాలను, శాంతిని కురిపించుగాక. అమ్మాబద్:
నిశ్ఛయంగా ప్రపంచమంతటా ఉన్న చెడుకు మూలకారణం పాపాలే. అవే ప్రతి అవమానం, హీనత, అణచివేత, నష్టం మరియు విధ్వంసానికి కారణం.వాటి (పాపాల) కారణంగానే ఆదమ్ మరియు ఆయన సంతానం స్వర్గం నుండి పంపబడ్డారు. అల్లాహ్ పట్ల అవిధేయత కారణంగానే నూహ్ జాతి వారు జలప్రళయం ద్వారా నాశనం చేయబడ్డారు. మరియు అల్లాహ్ ఆద్ జాతిపై గాలిని, సమూద్ జాతిపై భయంకరమైన శబ్దాన్ని వారి పాపకార్యాలు మరియు వారి ప్రభువు యొక్క ప్రవక్తలను తిరస్కరించడం కారణంగానే పంపాడు. అందుకే అవే ప్రతి విపత్తుకు కారణం మరియు ప్రతి కష్టానికి మూలం. మరియు ఇది ప్రతి పాపానికి వర్తిస్తుంది, కానీ ఈ విషయంలో మహా పాపాల ప్రభావం ఇతర పాపాల కంటే చాలా తీవ్రమైనది.
పెద్ద పాపము మరియు చిన్న పాపము యొక్క నిర్వచనం:
పెద్ద పాపము(కబీరా): అనేది: అల్లాహ్ గ్రంథం లేదా దైవప్రవక్త ﷺ సున్నహ్లో స్పష్టంగా హెచ్చరిక (వయీద్), శాపం (లఆనత్) లేదా హద్దు శిక్షతో అనుసంధానించబడిన ప్రతి పాపం. లేదా దాని దుష్పరిణామం హెచ్చరిక, హద్దు శిక్ష లేదా శాపంతో అనుసంధానించబడిన పాపం దుష్పరిణామంతో సమానమని తెలిసినది, లేదా దానికన్నా ఎక్కువ దుష్పరిణామం కలిగినది, లేదా దాన్ని చేయువాడు తన ధర్మం పట్ల నిర్లక్ష్యాన్ని చూపినట్లు సూచించేదీ — ఇవన్నీ కబీరా పాపాలే.
అందువల్ల, చిన్న పాపము (సఘీర) అంటే: పైన పేర్కొనబడిన ఘోరమైన పాపము యొక్క నిర్వచనంలోకి రాని ప్రతి పాపము. దానికి శిక్షను గురించిన హెచ్చరిక, నిర్ధారిత శిక్ష, లేదా శాపము వంటివి ఉండవు, మరియు దానిని ఆచరించువాడు ధర్మశాస్త్ర (షరీఆత్) ఆదేశములను తేలికగా తీసుకుంటున్నట్లుగా అది సూచించదు.
పెద్ద పాపము మరియు చిన్న పాపము మధ్య వ్యత్యాసం:
1- పెద్ద పాపముతో హెచ్చరిక లేదా నిర్ణీత శిక్ష లేదా శాపం వంటివి ముడిపడి ఉంటాయి, చిన్న పాపముతో అలాంటివి ఏవీ ముడిపడి ఉండవు.
2- (కబీరా) పెద్ద పాపం దానిని చేసినవాడు షరీఅత్ (ధర్మ) ఆదేశాల పట్ల నిర్లక్ష్యాన్ని చూపుతున్నాడని సూచిస్తుంది; కాగా (సఘీరా) చిన్న పాపం అలా కాదు.
3- పెద్ద పాపాలను చేసినవారికి అవి క్షమించబడేందుకు తప్పనిసరిగా తౌబా అవసరం. అయితే చిన్న పాపాలు తౌబా ద్వారా, లేదా పెద్ద పాపాలను దూరంగా ఉంచడం ద్వారా, లేదా మనిషిని బాధించే కష్టాలు–పరీక్షల ద్వారా, లేదా సత్కార్యాల ద్వారా పరిహరించబడతాయి.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఒకవేళ మీకు నిషేధించబడి నటువంటి మహాపాపాలకు మీరు దూరంగా ఉంటే, మేము మీ చిన్నచిన్న దోషాలను మన్నించి, మిమ్మల్ని గౌరవస్థానాల్లోకి ప్రవేశింపజేస్తాము.31﴿ [నిసా: 31] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు దినపు చివరి రెండు భాగాల్లోనూ మరియు రాత్రిపూట కొంత భాగంలో కూడా నమాజ్ నెలకొల్పండి. నిశ్చయంగా, సత్కార్యాలు దుష్కార్యాలను దూరం చేస్తాయి. జ్ఞాపకం ఉంచుకునే వారికి ఇది ఒక ఉపదేశం (జ్ఞాపిక).114﴿ [హూద్: 114]
ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: «ముస్లింకు ఏ ఆపద సంభవించినా, చివరికి ముల్లు గుచ్చుకున్నా, దాని ద్వారా అల్లాహ్ అతని పాపాలను క్షమిస్తాడు» [2]. [2] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (5649) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (2572) లో ఉల్లేఖించారు.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చేవారు: «ఘోరపాపాలకు పాల్పడకుండా ఉంటే, ఐదు పూటల నమాజులు, ఒక జుమా నుండి మరో జుమా వరకు, ఒక రమదాన్ నుండి మరో రమదాన్ వరకు, వాటి మధ్య జరిగే (చిన్న) పాపాలకు పరిహారాలు.» [3]. [3] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (233) లో ఉల్లేఖించారు.
పెద్ద పాపాల యొక్క ధార్మిక, ఇహలోక ప్రమాదాలు మరియు నష్టాలు:
మహాపాపాలకు పాల్పడటం ఇహపరాల్లో అనేక ప్రమాదాలకు మరియు నష్టాలకు దారితీస్తుంది, వాటిలో:
- ఘోరమైన పాపాలకు (అల్ కబాయిర్) పాల్పడిన వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడని హెచ్చరించబడ్డాడు; జుబైర్ బిన్ ముత్’ఇం రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా విన్నారు: “బందుత్వాలను తెగత్రెంపులు చేసుకునేవాడు స్వర్గంలో ముమ్మాటికి ప్రవేశించలేడు”[4]. అంటే: రక్తసంబంధాలను తెగత్రెంపు చేసుకునేవాడు. [4] దీనిని బుఖారీ, హదీథు సంఖ్య (5984), మరియు ముస్లిం, హదీథు సంఖ్య (2556) లో ఉల్లేఖించారు.
హుజైఫహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను: “అపోహలను కల్పించేవాడు స్వర్గం లోనికి ప్రవేశించడు” [5]. అనగా చాడీలు చెప్పేవాడు అని అర్ధం [5] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (6056) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (105) లో ఉల్లేఖించారు.
- వాటిలో కొన్ని సమాధి శిక్షకు కారణమవుతాయి; ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఇలా సెలవిచ్చారు: ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు సమాధుల ప్రక్క నుండి వెళ్ళడం జరిగింది. ఆయన ఇలా అన్నారు: “వీటిలో ఉన్నవారు శిక్షించబడుచున్నారు, కానీ పెద్ద పాపము చేసినందుకు కాదు. వారిలో ఒకడు తనను మూత్రబిందువుల నుండి కాపాడుకునేవాడు కాదు, మరొకడు చాడీలు చెప్పేవాడు”[6]. [6] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (218) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (292) లో ఉల్లేఖించారు.
- అది పరలోకంలో కఠిన శిక్షకు గల కారణాలలో ఒకటి; ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ‘పరలోక దినాన ప్రజల్లో అత్యంత కఠినంగా శిక్షించబడేవాడు’ అల్లాహ్ సృష్టించిన ప్రకారంగా సృష్టించ దలిచినవాడు’[7]. యుదాహూన్ : సామ్యపరుస్తారు, అంటే దాని అర్ధం: రూపకల్పన చేసేవారు. [7] ఈ హదీసుు బుఖారీ, హదీథు సంఖ్య (5954) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (2107) లో ఉల్లేఖించారు.
- ఇది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తరఫున శాపానికి కారణమవుతుంది. ఎందుకంటే ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం: స్త్రీలను అనుకరించే పురుషుల్ని, పురుషుల్ని అనుకరించే స్త్రీలను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు[8]. [8] ఈ హదీసును బుఖారీ ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (5885)
మరియు అబ్దుల్లాహ్ ఇబ్నె మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం: వడ్డీ తినేవారిని, తినిపించేవారిని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు. [9] [9] దీనిని ముస్లిం, హదీథు సంఖ్య (1597) లో ఉల్లేఖించారు.
- అది ఆచరణలు నశించిపోవడానికి మరియు అవి వ్యర్థమవడానికి గల కారణాలలో ఒకటి; బురైదహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే అసర్ నమాజు ను వదిలేస్తారో అతని సత్కార్యాలు వ్యర్ధమవుతాయి.” [10] [10] ఈ హదీసును బుఖారీ హదీసు సంఖ్య (553) లో ఉల్లేఖించారు.
- ఆ పాపానికి హద్దు (శిక్ష) ఉంటే, దానికి పాల్పడిన వారిపై ధర్మబద్ధమైన హద్దులు విధించబడతాయి, మహోన్నతుడై అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు పురుషుడు దొంగ అయినా, లేదా స్త్రీ దొంగ అయినా, వారి చేతులను నరికి వేయండి. ఇది వారి కర్మలకు గుణపాఠంగా అల్లాహ్ నిర్ణయించిన ప్రతిఫలం (శిక్ష). మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.38﴿ [అల్ మాయిదా: 38] మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾వ్యభిచారిణి మరియు వ్యభిచారుడు, ఈ ఇద్దరిలో ప్రతి ఒక్కరికి నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి...﴿ [అన్-నూర్: 2] మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు ఎవరైనా శీలవతులైన స్త్రీలపై అపనింద మోపిన తరువాత నలుగురు సాక్షులను తీసుకొని రాలేరో, వారికి ఎనభై కొరడా దెబ్బలు కొట్టండి మరియు వారి సాక్ష్యాన్ని ఎన్నటికీ స్వీకరించకండి. అలాంటి వారు పరమ దుష్టులు (ఫాసిఖూన్).﴿ [అన్నూర్ : 4]
- ఇది అనుగ్రహాలు తొలగిపోవడానికి, మారిపోవడానికి కారణం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఇది ఎందుకంటే! వాస్తవానికి, ఒక జాతి వారు, తమ నడవడికను తాము మార్చుకోనంత వరకు, అల్లాహ్ వారికి ప్రసాదించిన తన అనుగ్రహాన్ని ఉపసంహరించుకోడు...﴿ [అన్ఫాల్: 53]
షైఖ్ స'అదీ' రహిమహుల్లాహ్ చెప్పారు: ﴾ఇది﴿ ఈ శిక్ష ఏదైతే అల్లాహ్ తిరస్కరించే జాతులపై విధించి, వారు ఉన్న అనుగ్రహాలను మరియు సౌభాగ్యాలను వారి నుండి తొలగించాడో, అది వారి పాపాల వలన మరియు వారు తమ స్వయాన్ని మార్చుకోవటం వలన. ఎందుకంటే నిశ్చయంగా అల్లాహ్ ఒక జాతి వారికి తాను ప్రసాదించిన ధార్మిక మరియు ప్రాపంచిక అనుగ్రహాన్ని, ﴿వారు తమ నడవడికను తాము మార్చుకోనంత వరకు﴾ మార్చడు. దానికి బదులుగా, వారు ఆయన పట్ల కృతజ్ఞతలో వృద్ధి చెందితే, ఆయన దానిని మిగిల్చి ఉంచి, వారికి దానిని అధికం చేస్తాడు. వారు విధేయత నుండి అవిధేయత వైపునకు మారి, అల్లాహ్ అనుగ్రహం పట్ల కృతఘ్నత చూపి, దానిని తిరస్కారంగా మార్చుకున్నప్పుడు, ఆయన దానిని వారి నుండి లాక్కుంటాడు మరియు వారు తమ స్వయాన్ని మార్చుకున్న విధంగానే దానిని వారికి వ్యతిరేకంగా మార్చివేస్తాడు. మరియు ఇందులో అల్లాహ్ కొరకు వివేకం, న్యాయం మరియు తన దాసుల పట్ల మేలు ఉన్నది, ఎందుకంటే ఆయన వారి దుర్మార్గం వలన తప్ప వారిని శిక్షించలేదు. [11] తఫ్సీర్ అస్-సాదీ (పేజి: 324).
- అవి భూమిపై అల్సకల్లోలాలు వ్యాపించడానికి కారణమవుతాయి; ఎందుకంటే పాపాల కారణంగానే అల్లకల్లోలాలు వెలుగులోకి వస్తాయి. మరి వాటిలో మహాపాపాలైతే మరింత స్పష్టంగా అల్లకల్లోలాలు ప్రబలుతాయి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మానవులు తమ చేజేతులా సంపాదించుకున్న దాని ఫలితంగా భూమిలో మరియు సముద్రంలో కల్లోలం వ్యాపించింది. ఇది వారిలో కొందరు చేసిన దుష్కర్మల ఫలితాన్ని రుచి చూపటానికి, బహుశా ఇలాగైనా వారు (అల్లాహ్ వైపునకు) మరలుతారేమోనని!41﴿ [అర్రూమ్: 41]
- అవి జ్ఞానమును కోల్పోవడానికి ఒక కారణము, ఎందుకంటే జ్ఞానము హృదయంలో అల్లాహ్ ప్రసాదించే ఒక కాంతి, మరియు పాపము ఆ కాంతిని ఆర్పివేస్తుంది. ఇమామ్ షాఫియీ ఇమామ్ మాలిక్ ఎదుట కూర్చొని ఆయనకు చదివి వినిపించినప్పుడు, ఆయనలో కనిపించిన అపారమైన తెలివి, ప్రకాశించే మేధస్సు, సంపూర్ణమైన అవగాహనను చూసి ఇమామ్ మాలిక్కు అది ఎంతో నచ్చింది. అప్పుడు ఆయన ఇలా అన్నారు: నిశ్చయంగా అల్లాహ్ నీ హృదయంలో ఒక వెలుగును ప్రసాదించాడు, కావున దానిని పాపం అనే చీకటితో ఆర్పవద్దు." [12] [12] చూడండి: మనాఖిబుష్-షాఫియీ-రచన అల్-బైహఖీ (1/ 104).
పాపాలకు పాల్పడటం అనేది, ఆ వ్యక్తి యొక్క వ్యవహారాలు కష్టతరం కావడానికి గల కారణాలలో ఒకటి, తద్వారా అతను ఏ పని వైపుకు వెళ్ళినా, అది తన ముందు మూసుకుపోయినట్లుగా లేదా కష్టతరంగా ఉన్నట్లుగా పొందుతాడు. ఇది ఎలాగంటే, ఎవరైతే అల్లాహ్కు భయపడతాడో, అల్లాహ్ అతని వ్యవహారాన్ని సులభతరం చేస్తాడు. కాబట్టి ఎవరైతే దైవభీతిని విస్మరించి ఘోర పాపాలకు పాల్పడతాడో, అల్లాహ్ అతని వ్యవహారాన్ని కష్టతరం చేస్తాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾యూదులకు వారు చేసిన ఘోర దుర్మార్గాలకు ఫలితంగానూ మరియు వారు, అనేకులను అల్లాహ్ మార్గంపై నడువకుండా ఆటంక పరుస్తూ ఉన్నందు వలననూ, మేము ధర్మసమ్మతమైన అనేక పరిశుద్ధ వస్తువులను వారికి నిషేధించాము; 160 మరియు వాస్తవానికి, వారికి నిషేధింపబడినా; వారు వడ్డీ తీసుకోవటం వలననూ మరియు వారు అధర్మంగా ఇతరుల సొమ్మును తినటం వలననూ, మరియు వారిలో అవిశ్వాసులైన వారి కొరకు మేము బాధాకరమైన శిక్షను సిద్ధ పరచి ఉంచాము.161﴿ [అన్ నిసా: 160-161]
- అవి వాటిని చేసేవాని హృదయంలో చీకటికి కారణమవుతాయి, రాత్రి చీకటిని అనుభూతి చెందినట్లే అతను వాటిని అనుభూతి చెందుతాడు. తద్వారా పాపము యొక్క చీకటి అతని హృదయానికి, అతని దృష్టికి ఇంద్రియగోచరమైన చీకటి వలె అవుతుంది. నిశ్చయంగా విధేయత కాంతి, మరియు పాపము చీకటి. ఆ చీకటి ఎంత బలపడితే, అతని సంక్షోభము అంతగా పెరుగుతుంది, చివరికి అతనికి తెలియకుండానే అతను బిద్అత్ (ధర్మంలో నూతన కల్పనలు), మార్గభ్రష్టత్వాలు మరియు వినాశకరమైన విషయాలలో పడిపోతాడు. హుదైఫహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: “మేము ఉమర్ (రదియల్లాహు అన్హు) వద్ద కూర్చుని ఉన్నాము. ఆయన ఇలా అన్నారు: మీలో ఎవరు రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) (హఠాత్తుగా వచ్చిపడే) విపత్తు, ఆపద (అల్’ఫిత్నా) గురించి ప్రస్తావించడం విన్నారు? కొంతమంది “మేము విన్నాము” అన్నారు. దానికి ఆయన ఇలా అన్నారు: “బహుశా మీరు ఒక వ్యక్తికి తన కుటుంబములోని సమస్యలు, మరియు అతని పొరుగువారితో సమస్యలు గురించి అనుకుంటున్నారు, అవునా?” వారు “అవును” అన్నారు. అప్పుడు ఆయన ఇలా అన్నారు: “అవి నమాజు, ఉపవాసం మరియు దానధర్మాల ద్వారా ప్రాయశ్చిత్తం చేయబడతాయి. కానీ మీలో ఎవరు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సముద్రపు అలల వలె ఎగసిపడే ‘అల్-ఫిత్నా’ గురించి ప్రస్తావించగా విన్నారు?”. హుదైఫహ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “అక్కడున్న ప్రజలు మౌనంగా ఉండిపోయారు”. ఆయన ఇంకా ఇలా అన్నారు “నేను విన్నాను”. ఉమర్ రదియల్లాహు అన్హు “మీ తండ్రి నీ కొరకు త్యాగం చేయబడుగాక (మీ తండ్రి గొప్ప ధర్మపరుడు)”. హుదైఫహ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా పలుకగా నేను విన్నాను: “రెల్లు చాపను రెల్లు పుల్లలతో ఒకదాని తరువాత ఒకటి కలిపి నేసినట్లుగా, “అల్-ఫితన్” (ఆకర్షణలు, ప్రలోభాలు, వాంఛలు, కోరికలు, సంకటములు, పరీక్షలు మొ.) మనుషుల హృదయాలకు ప్రస్తుతపరచబడతాయి. ఏ హృదయమైతే వాటితో నిండిపోతుందో దానిపై ఒక నల్లటి మచ్చ వేయబడుతుంది. మరియు ఏ హృదయమైతే వాటిని తిరస్కరిస్తుందో దానిపై ఒక తెల్లని మచ్చ వేయబడుతుంది; అలా హృదయాలు రెండు రకాలుగా తయారవుతాయి. ఒకటి శ్వేత వర్ణములో, దానిపై ఏది పడినా దానికి అంటకుండా జారిపోయేటంతటి అతి నున్నటి ఉపరితలం కలిగిన రాయిలాగా, ఆకాశాలూ మరియు భూమి మిగిలి ఉన్నంత కాలం ఏ ప్రలోభాలూ, ఆకర్షణలూ తాకకుండా ఉంటుంది. మరియు మరొకటి నలుపు మరియు ధూళి రంగులో బోర్లించి ఉన్న పాత్రలాగా, మంచిని గుర్తించకుండా లేదా చెడును, కీడును తిరస్కరించకుండా, తాను నింపుకున్న వాంఛలు, మోహము, కోరికలతో నిండి ఉంటుంది.” [13]. [13] సహీహ్ ముస్లిం, హదీథు సంఖ్య (144).
- అవి ద్వేషము, శత్రుత్వము మరియు శత్రువు ఆధిపత్యానికి ఒక కారణం, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మేము క్రైస్తవులము." అని అనే వారి నుంచి కూడా మేము దృఢమైన ప్రమాణం తీసుకున్నాము; కాని వారు తమకు ఇవ్వబడిన బోధనలలో అధిక భాగాన్ని మరచి పోయారు; కావున తీర్పుదినం వరకు వారి మధ్య విరోధాన్ని మరియు ద్వేషాన్ని కల్గించాము. మరియు త్వరలోనే అల్లాహ్ వారు చేస్తూ వచ్చిన కర్మలను గురించి వారికి తెలియజేస్తాడు. 14﴿ [అల్ మాయిదా: 14]، ఎప్పుడైతే ప్రజలు అల్లాహ్ ఆజ్ఞాపించిన వాటిలో కొన్నింటిని వదిలివేసి, ఆయన నిషేధించిన వాటికి పాల్పడతారో, అప్పుడు వారి మధ్య శతృత్వము మరియు ద్వేషము ఏర్పడుతుంది మరియు వారిపై శతృవులు ఆధిక్యతను పొందుతారు [14]. [14] చూడండి: మజ్మూఉల్ ఫతావా (3/421).
- సమాజం భ్రష్టుపడటానికి కూడా ఇవి కారణమవుతాయి. ఎందుకంటే వీటివల్ల అబద్ధం, అపవాదం, పరనింద, చాడీలు చెప్పడం, మోసం, వంచన, అహంకారం, గర్వం, అన్యాయంగా ఒకరి ధనాన్ని మరొకరు తినడం వంటి నీచమైన నైతిక లోపాలు వ్యాపిస్తాయి. జీవన వ్యవస్థ చెడిపోతుంది, మంత్రవిద్య వంటి వాటి ద్వారా ప్రజల మధ్య హానీ విస్తరిస్తుంది. అలాగే వ్యభిచారం, సమలైంగికత్వం, స్త్రీల వేషధారణను పురుషులు అవలంబించడం, పురుషుల వేషధారణను స్త్రీలు అవలంబించడం వంటి అశ్లీల చర్యలు కూడా విస్తరిస్తాయి.[15] [15] చూడండి: ఇబ్నుల్ ఖయ్యిం గారి అద్దాఉ వద్దవాఉ, (1/132).
మహాపాపం చేసినవారి పట్ల అహ్లుస్సున్నత్ వల్జమాఅత్ వైఖరి మరియు వాగ్దానం–హెచ్చరికలకు సంబంధించిన హదీస్లు:
అహ్లుస్సున్నహ్ వల్జమాఅహ్ అభిప్రాయం ప్రకారం, షిర్క్ మరియు మహాకుఫ్ర్కు తక్కువగా ఉండే మహాపాపాన్ని చేసిన వ్యక్తి పూర్తి విశ్వాసం కలిగినవాడు కాదు. అలాగే విశ్వాసం లేనివాడిగా కూడా పరిగణించబడడు. అతడు చేసిన పాప పరిమాణానికి అనుగుణంగా అతని విశ్వాసం తగ్గిపోతుంది. కాబట్టి అతనికి పూర్తిగా విశ్వాసం పేరు తీసివేయబడదు, అలాగే సంపూర్ణంగా విశ్వాసం ఉందని కూడా చెప్పబడదు. అతడు విశ్వాసం ఉన్నవాడే కాని, విశ్వాసం లోపించినవాడు, లేదా తన విశ్వాసం కారణంగా ముమిన్, తన పెద్దపాపం కారణంగా ఫాసిక్ అని చెప్పబడతాడు. పరలోకంలో అతని తీర్పు అల్లాహ్ ఇచ్చకు లోబడి ఉంటుంది. ఆయన కోరుకుంటే, అతడిని క్షమించి, ఎటువంటి ముందస్తు శిక్ష లేకుండా స్వర్గంలోకి ప్రవేశింపజేస్తాడు. లేదా ఆయన కోరుకుంటే, అతని నేరానికి తగినంత శిక్షించి, ఆ తర్వాత అతడిని (నరకం నుండి) బయటకు తీసి విశ్వాసులతో పాటు స్వర్గంలోకి ప్రవేశింపజేస్తాడు. మరియు అతను పరలోకానికి ముందే ఈ లోకంలోనే తన మహాపాపాల నుండి శుద్ధి పొందవచ్చు. అది నిష్కల్మషమైన పశ్చాత్తాపం (తౌబతున్ నసూహా) ద్వారా, లేదా అతనిపై ఇస్లామీయ శిక్షను అమలు చేయడం ద్వారా, లేదా కష్టనష్టాల ద్వారా, లేదా సత్కార్యాలు అధికంగా చేయడం ద్వారా కావచ్చు. తద్వారా అతను పునరుత్థాన దినమున వచ్చినప్పుడు, అతనిపై ఎటువంటి శిక్ష ఉండదు.
ఇక మహాపాపులకు హెచ్చరికగా వచ్చిన హదీసుల విషయానికొస్తే, ఉదాహరణకు అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఒక వ్యభిచారి వ్యభిచరించేటప్పుడు విశ్వాసి కాజాలడు,మద్యపానసేవకుడు మద్యం త్రాగేటప్పుడు విశ్వాసిగా ఉండడు,దొంగ దొంగిలించేటప్పుడు విశ్వాస స్థితిలో ఉండడు[16]. దీని భావమేమిటంటే, అతని నుండి పరిపూర్ణ విశ్వాసం తొలగిపోయి, ఇస్లాం మాత్రమే మిగిలి ఉంటుంది. అతడు ఆ పాపాన్ని విడిచిపెట్టి, దాని నుండి పశ్చాత్తాపపడినప్పుడు, అతని విశ్వాసం తిరిగి వస్తుంది. కాబట్టి, అతడు ఈ పెద్ద పాపాలకు పాల్పడినప్పుడు మాత్రమే అతని నుండి పరిపూర్ణ విశ్వాసం తొలగించబడుతుంది, కానీ అతనిలో విశ్వాసం యొక్క మూలం మిగిలి ఉంటుంది; ఎందుకంటే, అల్లాహ్కు దేనినీ సాటి కల్పించకుండా మరణించిన వ్యక్తి, అతను వ్యభిచరించినా, దొంగతనం చేసినా సరే, స్వర్గంలో ప్రవేశిస్తాడని వాగ్దానం చేసే ఇతర హదీసులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ఆయన ఇలా అన్నారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: «నా ప్రభువు తరఫు నుండి ఒకరు నా వద్దకు వచ్చి, నాకు ఈ శుభవార్త వినిపించారు: 'నా సమాజం నుండి ఎవరైతే అల్లాహ్ కు దేనినీ సాటి కల్పించకుండా మరణిస్తాడో, అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు'». నేను, 'అతను వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా కూడానా?' అని అడిగాను. దానికి ఆయన, «అవును, అతను వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా సరే» అని అన్నారు [17]. [16] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (2475) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (57) లో ఉల్లేఖించారు. [17] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (1237) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (94) లో ఉల్లేఖించారు.
మహాపాపాలను ఎదుర్కొనే విధానం మరియు వాటి చికిత్స:
- అవిధేయత, ముఖ్యంగా ఘోర పాపాల ఆధిక్యత, పూర్తి సమాజంపై శిక్షలు మరియు విపత్తులు రావడానికి కారణమవుతుందనే విషయం గురించి సమాజంలో అవగాహన కల్పించడం, అందుకు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు మీలోని దుర్మార్గులకు మాత్రమే గాక (అందరికీ) సంభవించబోయే ఆ విపత్తు గురించి భీతిపరులై ఉండండి. మరియు అల్లాహ్ శిక్ష విధించటంలో చాలా కఠినుడని తెలుసుకోండి.25﴿ [అల్ అన్ఫాల్: 25]
- ధార్మిక జ్ఞానమును నేర్చుకొనుట; ఎందుకంటే దానిని నేర్చుకోవడం ఆత్మను పాపాల నుండి హెచ్చరిస్తుంది. ఏ విధంగానంటే, ఎవరైతే ఈ పాపాలపై విధించబడిన శిక్షల గురించి తెలుసుకుంటారో, అతని ఆత్మ వాటిలో పడకుండా నిరోధించబడుతుంది.
- చెడును అడ్డుకొనే విధిని నిర్వర్తించడం; పాపాత్ములను మహా పాపాల నుండి వారించడం, వారిని గద్దించడం. నుఅమాన్ బిన్ బషీర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అల్లాహ్ నిర్దేశించిన హద్దులలో నిలిచి ఉండేవారి, మరియు వాటిని ఉల్లంఘించేవారి ఉపమానం, ఓడపై చీట్లు వేసుకున్న ఒక సమూహం వంటిది. దాని ఫలితంగా కొందరికి ఓడ పై అంతస్థులో, మరికొందరికి క్రింది అంతస్థులో చోటు లభించింది. క్రింది అంతస్థులోని వారు త్రాగు నీటి కొరకు పై అంతస్థుకు వెళ్ళినపుడు, అక్కడ ఉన్నవారిని దాటుకుంటూ వెళ్ళవలసి వచ్చేది. దానితో వారు ఇలా అన్నారు: “మనం ఉంటున్న భాగములోనే ఒక రంధ్రము చేస్తే, మన పైనున్న వారికి ఇబ్బంది కలిగించము కదా”. ఒకవేళ వారు కోరిన విధంగా చేయడానికి వారిని వదిలేస్తే, అందరూ నాశనమైపోతారు. ఒకవేళ వారిని ఆ పని నుండి ఆపితే, వారు రక్షింపబడతారు, మరియు వారితో పాటు అందరూ రక్షింపబడతారు [18]. [18] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (2493) లో ఉల్లేఖించారు.
ఆయన ప్రవచనం: «అల్లాహ్ యొక్క హద్దులపై నిలబడేవాడు» అనగా: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ఆదేశాలపై స్థిరంగా ఉండేవాడు, ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉండేవాడు, మంచిని చేయమని ఆదేశించేవాడు మరియు చెడు నుండి వారించేవాడు. «అందులో పడిపోయినవాడు» మంచిని వదిలివేసేవాడు, చెడు చేసేవాడు. «ఇస్తహమూ» అనగా వారిలో ప్రతి ఒక్కరూ ఒక వాటాను, అంటే ఒక భాగాన్ని, పొందేందుకు చీట్లు వేశారు. «వారి చేతులను పట్టుకున్నారు», పడవకు రంధ్రం చేయకుండా వారిని వారించారు.
- కుటుంబం నుండి లభించే సరియైన విశ్వాస సంస్కరణ, మరియు తల్లిదండ్రులు తమ పిల్లలను, ప్రత్యేకంగా కౌమారదశలో పర్యవేక్షించడం, విశ్వాసపు రంగుతో నిండి, ఉన్నతమైన నడవడిక కలిగిన నీతిమంతులైన యువకుల తరం నిర్మాణానికి దారితీస్తుంది.
- పాపాలకు ధర్మసమ్మతమైన ప్రత్యామ్నాయాన్ని కల్పించడం, ఎందుకంటే మహోన్నతుడైన అల్లాహ్ దేనినైనా నిషేధించినప్పుడు, దానికి బదులుగా తాను ధర్మసమ్మతం చేసిన వాటిలో సరిపడినంత కల్పించాడు, ఉదాహరణకు, యువకులకు త్వరగా వివాహం చేయడమే వ్యభిచారానికి నివారణ, దొంగతనాన్ని వ్యక్తులకు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా నివారించవచ్చు. అలాగే గీబత్ చేయడం, ప్రజల గౌరవంపై దాడి చేయడం వంటి వాటిని ఖాళీ సమయాన్ని విధేయతతో గడపడం ద్వారా లేదా అల్లాహ్ అనుమతించిన హలాల్ కార్యాలలో నిమగ్నం కావడం ద్వారా నివారించవచ్చు. ఇదే విధంగా ప్రతి పాపం లేదా ప్రతి మహాపాపం విషయంలో కూడా పరిష్కారం ఉంటుంది.
- యువత యొక్క శక్తులను వినియోగించుకొని, వాటిని ఉమ్మత్ కు ధార్మిక మరియు ప్రాపంచిక విషయాలలో ప్రయోజనం చేకూర్చే కార్యాల వైపు మళ్ళించాలి; అవి ధార్మిక జ్ఞానాన్ని నేర్చుకోవడం, ఇస్లామీయ ప్రచారాన్ని వ్యాప్తి చేయడం, ప్రాపంచిక విషయాలలో ఉపయోగపడే వైద్యం, ఇంజనీరింగ్, వాణిజ్యం వంటి సిద్ధాంత మరియు అనువర్తిత శాస్త్రాలను నేర్చుకోవడం, అలాగే వడ్రంగం, కమ్మరం వంటి ఉపయోగకరమైన పరిశ్రమలు మరియు చేతివృత్తులను నేర్చుకోవడం. ఎందుకంటే, మనస్సు విధేయతతో నిమగ్నం కాకపోతే, అది పాపంలో నిమగ్నమవుతుంది.
- ముస్లిం తన విశ్వాసమును నిరంతరం పరిరక్షించుకోవాలి. ఎందుకంటే వస్త్రము క్షీణించినట్లుగా విశ్వాసం కూడా హృదయంలో క్షీణిస్తుంది, కావున హృదయంలో విశ్వాసమును అధికం చేసే విధేయత కార్యాలను అధికంగా చేయడం ద్వారా దానిని పరిరక్షించుకోవాలి.
- ఒక ముస్లిం పాపానికి దారితీసే ప్రతి విషయం నుండి దూరంగా ఉండాలి, ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు మరియు వెబ్సైట్లు అశ్లీలత, నాస్తికత్వం మరియు అల్లాహ్కు కోపం తెప్పించే ప్రతి విషయాన్ని వ్యాప్తి చేస్తున్న ఈ కాలంలో. కాబట్టి ఒక ముస్లిం తనపై తాను చెడు యొక్క ఏ ద్వారాన్ని తెరుచుకోకూడదు, ఎందుకంటే దానిని తెరిచినవాడు దానిలో ప్రవేశిస్తాడు. నవ్వాస్ బిన్ సమ్ఆన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: «అల్లాహ్ ఒక ఉపమానాన్ని ఇలా ఇచ్చినాడు: ఒక రాచమార్గము, ఆ రాచమార్గానికి ఇరువైపులా రెండు గోడలు, ఆ గోడలలో పరదాలు వేయబడి ఉన్న అనేక తెరిచి ఉన్న ద్వారాలు ఉన్నాయి. ఆ రాచమార్గపు ప్రవేశ ద్వారం వద్ద ఒక దాయీ (పిలిచేవాడు) ఇలా పిలుస్తూ ఉంటాడు: ‘ఓ ప్రజలారా! మీరందరూ ఈ రాచమార్గములోనికి ప్రవేశించండి, వంకరగా పోకండి.’ మరియు ఆ మార్గం పై నుండి పిలిచే మరొక దాయీ ఉన్నాడు. ఎవరైనా ఆ ద్వారాలలో దేనినైనా తెరవాలని ప్రయత్నిస్తే, అతను ఇలా అంటాడు: ‘నీ పాడుగాను! దానిని తెరువకు. ఎందుకంటే, నీవు దానిని తెరిస్తే, దానిలో ప్రవేశిస్తావు (అనగా: దానిలోనికి వెళ్ళిపోతావు).’ ఆ రాచమార్గము: ఇస్లాం; ఆ రెండు గోడలు: అల్లాహ్ విధించిన హద్దులు; ఆ తెరిచి ఉన్న ద్వారాలు: అల్లాహ్ నిషేధాలు; ఆ రాచమార్గపు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న దాయీ: అల్లాహ్ యొక్క దివ్య గ్రంథము; మరియు మార్గం పై నుండి పిలిచే దాయీ: ప్రతి ముస్లిం హృదయములో ఉండే అల్లాహ్ యొక్క ఉపదేశకుడు» [19]. [19] ఈ హదీసును అహ్మద్ హదీథు సంఖ్య (17634) లో ఉల్లేఖించారు.
- ముస్లింలపై అధికార బాధ్యత ఉన్న పాలకులు మరియు అధికారులందరూ ధర్మాన్ని పరిరక్షించే విధిని నిర్వర్తించడం; అంటే మంచి గురించి ఆజ్ఞాపించడం, చెడు నుండి వారించటం మరియు దానిని తొలగించడం, హద్దులను అమలుపరచడం, మొదలైనవి. ఈ విషయములో మఅఖిల్ బిన్ యసార్ రదియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఉల్లేఖిస్తున్నారు: “అల్లాహ్ అధికార పదవిలో నియమించిన ఏ దాసుడైనా సరే, తాను చనిపోయే దినమున, తన పాలితులను మోసం చేస్తున్న స్థితిలో చనిపోతే, అటువంటి వారిపై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించినాడు” [20]. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “మీలో ఎవరైనా చెడును చూసినట్లయితే, దానిని అతడు చేతితో ఆపాలి, ఒకవేళ అలా చేయగలిగే సమర్థత లేనట్లయితే, దానిని అతడు నోటితో ఆపాలి, ఒకవేళ అలా ఆపగలిగే సమర్థత కూడా లేనట్లైయితే దానిని అతడు తన మనసుతో ఆపని చేయాలి; అది విశ్వాసము యొక్క అత్యంత బలహీన స్థాయి.” [21] ఈ స్థాయి బలం,అధికారము లేదా పాలనా బాధ్యత ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. [20] ఈ హదీసును బుఖారీ (7150) మరియు ముస్లిం (142) ఉల్లేఖించారు. మరియు పదాలు ముస్లింవి. [21] ఈ హదీసును ముస్లిం హదీథు సంఖ్య (49) లో ఉల్లేఖించారు.
చివరగా, మహోన్నతుడైన అల్లాహ్ ను ఆయన మన హృదయాలను మరియు అవయవాలను ఆయన విధేయతపై స్థిరంగా ఉంచాలని, బహిరంగమైనవైనా, గోప్యమైనవైనా, చిన్నవైనా, పెద్దవైనా అన్ని పాపాల నుండి మనలను రక్షించాలని మేము ప్రార్థిస్తున్నాము.
అష్-షిర్కు బిల్లాహ్ (అల్లాహ్ కు భాగస్వాములను కల్పించటం)
అల్లాహ్ కు సాటి కల్పించడం (షిర్క్) అనేది అల్లాహ్ పట్ల అవిధేయతకు పాల్పడిన పాపాలన్నింటిలోనూ అత్యంత ఘోరమైన పాపము. అది అల్లాహ్ పై విశ్వాసానికి మరియు ఆయన ఏకత్వానికి (తౌహీద్ కు) విరుద్ధమైనది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾నిశ్చయంగా, అల్లాహ్ కు భాగస్వాములను కల్పించటం (బహుదైవారాధన) మహా దుర్మార్గము.13﴿ [లుఖ్మాన్: 13]. మరియు అబ్దుల్లాహ్ ఇబ్నె మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “అల్లాహ్ వద్ద అన్నింటికన్నా ఘోరమైన పాపము ఏది?”; దానికి ఆయన, “అల్లాహ్’యే నిన్ను సృష్టించినప్పటికీ, అల్లాహ్ కు సాటిగా నీవు మరొకరిని తీసుకు రావడం,” అన్నారు. [22] అల్-నిద్: భాగస్వామి. [22] ఈ హదీసును బుఖారీ హదీథు సంఖ్య (4477) మరియు ముస్లిం హదీథు సంఖ్యలో (86) ఉల్లేఖించారు.
షిర్క్ యొక్క యదార్థం: రుబూబియత్ లో గానీ, ఆరాధనలో గానీ, లేదా అస్మా వ సిఫాత్ లో గానీ మహోన్నతుడైన అల్లాహ్ తో పాటు భాగస్వామిని లేదా సమానుడిని కల్పించడం, మరియు దాసుడు అల్లాహ్ యొక్క హక్కులలో నుండి ఒక హక్కును లేదా ఒక రకమైన ఆరాధనను అల్లాహేతరులకు కేటాయించటం. షరిఅత్ ద్వారా ఆదేశించబడినదిగా ధృవీకరించబడిన ప్రతీ విశ్వాసం, పలుకు లేదా అమలును అల్లాహ్ ఒక్కడి కొరకు మాత్రమే చేయడం తౌహీద్, ఈమాన్ మరియు ఇఖ్లాస్ అవుతుంది; మరియు దానిని ఆయనకు కాక మరెవరికైనా అర్పించడం షిర్క్ మరియు కుఫ్ర్ అవుతుంది.
కాబట్టి మృతులను వేడుకోవటం, వారి నుండి తమ అవసరాలు తీర్చమని కోరటం, వారి కొరకు మొక్కుకోవటం, వారి సహాయాన్ని అర్థించటం, అదేవిధంగా అల్లాహ్కు కాకుండా ఇతరులకు సాష్టాంగం చేయటం, అల్లాహ్కు కాకుండా ఇతరులకు బలి ఇవ్వటం మరియు ఇలాంటి ఇతర కార్యాలు షిర్క్ అవుతాయి.
షిర్క్ నిషిద్ధం (హరామ్) అని, మరియు అది ఎంత ఘోరమైన, హేయమైన అపరాధమో తెలిపే ఆధారాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾నిశ్చయంగా, అల్లాహ్ తనకు భాగస్వామిని (సాటిని) కల్పించటాన్ని ఏ మాత్రమూ క్షమించడు. మరియు అది తప్ప దేనిని (ఏ పాపాన్ని) అయినా, ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ కు భాగస్వాములను కల్పించినవాడే, వాస్తవానికి మహాపాపం చేసిన వాడు!48﴿ [అన్ నిసా: 48] పరిశుద్ధుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾వాస్తవానికి, ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసే వారికి, నిశ్చయంగా, అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు. మరియు వారి ఆశ్రయం నరకాగ్నియే! మరియు దుర్మార్గులకు సహాయం చేసే వారు ఎవ్వరూ ఉండరు.72﴿ [అల్-మాయిదా: 72] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు వాస్తవానికి! నీకూ మరియు నీకంటే ముందు వచ్చిన (ప్రతి ప్రవక్తకూ) దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలుపబడింది: "ఒకవేళ నీవు బహుదైవారాధన (షిర్కు) చేసినట్లైతే నీ కర్మలన్నీ వ్యర్థమై పోతాయి మరియు నిశ్చయంగా, నీవు నష్టానికి గురి అయిన వారిలో చేరిపోతావు.65 అలా కాదు! నీవు కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించు మరియు కృతజ్ఞులలో చేరిపో! 66﴿ [జుమర్: 65 - 66]
అబూ బక్రహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “మహాపాపాల్లో ఘోరమైనవాటి గురించి నేను మీకు తెలియజేయనా?” అని మూడు సార్లు పలికారు. దానికి వారు, “తప్పకుండా చెప్పండి ఓ రసూలుల్లాహ్” అని బదులిచ్చారు. అప్పుడు ఆయన ఇలా సెలవిచ్చారు: “అల్లాహ్ కు సాటి కల్పించుట, తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపుట, హత్య చేయుట మరియు అబద్ధపు సాక్ష్యము చెప్పుట” [23]. [23] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (4477); ముస్లిం, హదీథు సంఖ్య (86) లో ఉల్లేఖించారు.
షిర్కు వలన అనేక నష్టాలు ఉన్నాయి, వాటిలో కొన్ని:
- షిర్కు ఆచరణలన్నిటిని వృధా చేస్తుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఒకవేళ వారు అల్లాహ్ కు సాటి (భాగస్వాములను) కల్పిస్తే, వారు చేసిన సత్కార్యాన్నీ వృథా అయి పోయేవి!88﴿ [అల్ అన్ఆమ్: 88]
- దానిపై మరణించి, దాని నుండి తౌబా చేసుకోనివాడు నరకంలో శాశ్వతంగా, ఎల్లప్పుడూ ఉంటాడు. జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం: ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా ప్రశ్నించినాడు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఆ రెండు అనివార్యమైన విషయాలు ఏమిటి?” ఆయన ఇలా పలికినారు “అల్లాహ్ కు ఎవరినీ లేక దేనినీ సాటి కల్పించని స్థితిలో ఎవరైతే మరణిస్తారో వారు స్వర్గములోనికి ప్రవేశిస్తారు, మరియు ఎవరైతే ఆయనకు సాటి కల్పిస్తున్న స్థితిలో మరణిస్తారో వారు నరకం లోనికి ప్రవేశిస్తారు” [24]. [24] ఈ హదీసును ముస్లిం హదీథు సంఖ్య (93) లో ఉల్లేఖించారు.
ముష్రిక్ యొక్క రక్తము మరియు సంపదకు రక్షణ లేదు; అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: జనులు ‘అల్లాహ్ తప్ప మరొక వాస్తవ ఆరాధ్యుడు లేడు, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ అల్లాహ్ తరుపు నుండి పంపబడిన ప్రవక్త’ అని సాక్ష్యమిచ్చి, నమాజులు పాటిస్తూ, జకాతులు చెల్లించనంత వరకు వారితో పోరాడమని నాకు ఆదేశమివ్వబడింది. ఒకవేళ వారు అలా చేసినట్లైతే, ఇస్లాం హక్కు ప్రకారం తప్ప, నా నుండి వారి ప్రాణాలను మరియు సంపదను రక్షించుకుంటారు. మరియు వారు అల్లాహ్ వద్ద జవాబుదారులుగా ఉంటారు. [25] [25] ఈ హదీసును బుఖారీ హదీథు సంఖ్య (25) మరియు ముస్లిం హదీథు సంఖ్య (22) లో ఉల్లేఖించారు.
- ముష్రిక్ ఇహలోకంలో తాను ఎదుర్కొనే విపత్తుల విషయంలో అల్లాహ్ నుండి సహాయం గానీ, మద్దతు గానీ పొందలేడు, షైతానులు అన్ని వైపుల నుండి అతనిపై ఆధిపత్యం చెలాయిస్తాయి, అతను ఆందోళన, అశాంతి, నిరంతర భయం మరియు శాశ్వతమైన దుఃఖంలో జీవిస్తాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾అల్లాహ్ కు సాటి కల్పించిన వాని గతి ఆకాశం నుండి క్రింద పడిపోయే దాని వంటిదే! దానిని పక్షులైనా ఎత్తుకొని పోవచ్చు, లేదా గాలి అయినా దూర ప్రదేశాలకు ఎగుర గొట్టుకు పోవచ్చు!﴿ [అల్ హజ్జ్: 31 ]
స'అది' రహిమహుల్లాహ్ ఈ ఆయతు వ్యాఖ్యానంలో ఇలా పలికారు: ...అదే విధంగా ముష్రిక్ కూడా. విశ్వాసము ఆకాశము స్థానములో ఉన్నది, అది భద్రపరచబడినది మరియు ఉన్నతమైనది. విశ్వాసమును వదిలివేసిన వాడు ఆకాశము నుండి పడిపోయే వాని వంటివాడు, అతడు ఆపదలకు, విపత్తులకు గురవుతాడు. పక్షులు అతనిని ఎత్తుకుపోయి అతని అవయవాలను ముక్కలు ముక్కలుగా చేయవచ్చు. అదే విధంగా ముష్రిక్ కూడా విశ్వాసమును గట్టిగా పట్టుకోవటాన్ని వదిలివేసినప్పుడు, షైతానులు అతనిని అన్ని వైపుల నుండి ఎత్తుకుపోతాయి, మరియు అతనిని ముక్కలు ముక్కలుగా చేస్తాయి, మరియు అతని ధర్మాన్ని, ప్రాపంచిక జీవితాన్ని నాశనం చేస్తాయి" [26]. [26] తఫ్సీరుస్ సాదీ (పేజి: 538).
- ముష్రిక్కు గుసుల్ చేయబడదు, కఫన్ చేయబడదు, అతని జనాజా నమాజు చదవబడదు, మరియు అతడు ముస్లింల ఖనన వాటికలో ఖననం చేయబడడు.
షిర్కు నుండి రక్షణ మార్గాలు:
ఒక ముస్లిం ‘షిర్క్’కు పాల్పడకుండా తనను తాను రక్షించుకోవటానికి ఇలా చేయాలి:
- తౌహీద్ మరియు సరైన అఖీదాను నేర్చుకోవాలి, మరియు తాను నేర్చుకున్న దాని ప్రకారం ఆచరించాలి, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾కావున తెలుసుకో! నిశ్చయంగా, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు.﴿ [ముహమ్మద్: 19] ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని తెలుసుకో...﴿, కాబట్టి సర్వశక్తిమంతుడైన ఆయన ఏకత్వం గురించి మరియు ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడనే విషయం గురించి తెలుసుకోవడం స్వయంగా ఆశించబడినది. అయినప్పటికీ అది మాత్రమే సరిపోదు, దానికి బదులుగా, ఆయనకు ఏ సాటి లేకుండా ఆయనను మాత్రమే ఆరాధించడం కూడా తప్పనిసరి. కాబట్టి అవి రెండూ స్వయంగా ఆశించబడిన విషయాలు: మహోన్నతుడైన ప్రభువును ఆయన నామములు, గుణములు, చర్యలు మరియు ఆయన ఆదేశాల ద్వారా తెలుసుకోవడం, మరియు వాటికి అనుగుణంగా మరియు వాటి ఆవశ్యకత ప్రకారం ఆయనను ఆరాధించడం. ఎలాగైతే ఆయన ఆరాధన స్వయంగా ఆశించబడినదో మరియు ఉద్దేశించబడినదో, అలాగే ఆయన గురించిన జ్ఞానం మరియు ఆయనను తెలుసుకోవడం కూడా ఆశించబడినది. అంతేకాక, నిశ్చయంగా జ్ఞానం ఆరాధనలలో ఉత్తమమైన రకాల్లో ఒకటి" [27]. [27]మిఫ్తాహు దారుస్సఆదతి (1/ 178).
- షిర్కె అస్గర్ (చిన్న షిర్కు) కు దూరంగా ఉండాలి; ఉదాహరణకు సులభమైన ప్రదర్శనా బుద్ది, అల్లాహేతరులపై ప్రమాణం చేయటం, మరియు ఒక వ్యక్తి మరొక వ్యక్తితో: "అల్లాహ్ తలచుకున్నాడు మరియు నీవు తలచుకున్నావు", "ఇది అల్లాహ్ మరియు నీ నుండి", "నేను అల్లాహ్ మరియు నీపై ఆధారపడి ఉన్నాను", "నేను అల్లాహ్ పై మరియు నీపై భారం మోపాను" అని పలకటం మరియు అటువంటి ఇతర కార్యాలు. ఎందుకంటే షిర్కె అస్గర్ (చిన్న షిర్కు), షిర్కె అక్బర్ (పెద్ద షిర్కు) కు దారితీస్తుంది.
- ప్రజలలో వ్యాపించి ఉన్న షిర్కు యొక్క రూపాలు మరియు రకాలను తెలుసుకోవాలి, తద్వారా వాటికి దూరంగా ఉండి, వాటిలో పడకుండా ఉండవచ్చు.
- అల్లాహ్ తనను తౌహీద్ పై స్థిరంగా ఉంచమని, షిర్కు నుండి దూరంగా ఉంచమని ప్రార్థించాలి. మహోన్నతుడైన అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి ఇలా తెలియపరచాడు: ﴾మరియు ఇబ్రాహీమ్ ఇలా ప్రార్థించిన విషయం (జ్ఞాపకం చేసుకోండి): "ఓ నా ప్రభూ! ఈ నగరాన్ని (మక్కాను) శాంతినిలయంగా ఉంచు! మరియు నన్నూ నా సంతానాన్నీ విగ్రహారాధన నుండి తప్పించు!35﴿ [ఇబ్రాహీం: 35] మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరచుగా ఇలా ప్రవచించేవారు:- ((యా ముఖల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ ఖల్బీ అలా దీనిక్)) “ఓ హృదయాలను మలిచే ప్రభువా ! నా హృదయాన్ని నీ ధర్మం పై స్థిరంగా ఉంచు” [28]. [28] ఈ హదీసును తిర్మిథీ, హదీథు సంఖ్య (2140) లో ఉల్లేఖించారు.
అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై అసత్యాన్ని ఆపాదించడం
సాధారణంగా అబద్ధం పలకడం మహాఘోరమైన పాపములలో ఒకటి, మరియు అబద్ధాలలో అత్యంత ఘోరమైన మరియు నీచమైనది: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ పై అబద్ధం పలకడం, అస్-సఅదీ ఇలా అన్నారు: మహోన్నతుడైన అల్లాహ్ పవిత్రుడై ఉన్న ఒక మాటను లేదా ఒక తీర్పును ఆయనకు ఆపాదించి, ఆయనపై అబద్ధం పలికిన వాడి కన్నా పెద్ద దుర్మార్గుడు, మరియు పెద్ద అపరాధి మరొకడు ఉండడు. అతడు సృష్టిలోకెల్లా పెద్ద దుర్మార్గుడు కావటానికి కారణం, అందులో అబద్ధం, ధర్మముల యొక్క మూలాలను మరియు శాఖలను మార్చటం, మరియు అతి పెద్ద అనర్థాలలో ఒకటైన దానిని అల్లాహ్ కు ఆపాదించటం వంటివి ఉండటమే. [29] సఅదీ వ్యాఖ్యానం (265).
అబద్ధపు రకాల్లో ఒకటి: అల్లాహ్ వాక్కుకు అల్లాహ్ ఉద్దేశించిన దానికి విరుద్ధంగా వ్యాఖ్యానం చేయటం; ఎందుకంటే వాక్కు యొక్క ఉద్దేశ్యం దాని అర్థమే. కనుక ఒకడు, 'అల్లాహ్ దీని ద్వారా ఫలానా ఫలానా ఉద్దేశించినాడు' అని పలికితే, అతడు అల్లాహ్ పై అబద్ధం పలికిన వాడు, మహోన్నతుడైన అల్లాహ్ ఉద్దేశించని దాని గురించి ఆయనపై సాక్ష్యం పలికిన వాడు అవుతాడు. అదే విధంగా ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాక్కుకు, ఆయన ఉద్దేశించిన దానికి విరుద్ధంగా వ్యాఖ్యానం చేయటం కూడా అబద్ధమే.
అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై అసత్యం ఆపాదించడం నిషిద్ధమని, మరియు అది ఎంత ఘోరమైన, తీవ్రమైన పాపమో తెలియజేసే ఆధారాలు చాలా ఉన్నాయి, వాటిలో:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾అల్లాహ్ (ఒకడ్ని) కొడుకుగా చేసుకున్నాడు." అని వారు (యూదులు మరియు క్రైస్తవులు) అంటారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. ఆయన స్వయం సమృద్ధుడు. ఆకాశాలలోను మరియు భూమిలోనూ ఉన్నదంతా ఆయనకే చెందుతుంది! ఇలా అనటానికి మీ దగ్గర ఏదైనా నిదర్శనం ఉందా? ఏమీ? అల్లాహ్ గురించి మీకు తెలియని మాటలు అంటారా? ఇలా అను: "నిశ్చయంగా, అల్లాహ్ కు అబద్ధం అంటగట్టేవారు ఎన్నటికీ సాఫల్యం పొందరు." 69 ఇహలోకంలో వారు కొంతకాలం సుఖాలు అనుభవించవచ్చు! కాని తరువాత మా వైపునకే, వారికి మరలి రావలసి ఉంది. అప్పుడు మేము వారి సత్యతిరస్కారానికి ఫలితంగా, వారికి కఠినశిక్షను రుచి చూపుతాము.70﴿ [యూనుస్: 68 - 70]
కాబట్టి ఎవరయితే అల్లాహ్ పై అబద్ధమును కల్పించి, ఆయనకు భార్య లేదా కుమారుడు లేదా భాగస్వామి ఉన్నాడని వాదిస్తాడో, అతడు అల్లాహ్ పట్ల అవిశ్వాసానికి పాల్పడినట్లే.
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు పునరుత్థాన దినమున అల్లాహ్ పై అబద్ధాలు పలికిన వారి ముఖాలను నల్లగా మారిపోవటాన్ని నీవు గమనిస్తావు. ఏమీ? ఈ గర్విష్టుల నివాసం నరకంలోనే ఉండదా?60﴿ [అజ్ జుమర్: 60].
ఇమామ్ సమ్ఆనీ రహిమహుల్లాహ్ ఇలా తెలిపారు: వారు అల్లాహ్ పై అబద్దమాడారు" అనేదాని అర్థం: అల్లాహ్ ఒక సంతానాన్ని లేదా భాగస్వామిని చేసుకున్నాడని వారు వాదించడం. మరియు ఇది అల్లాహ్ పై చెప్పబడే ప్రతి అబద్దానికి వర్తిస్తుంది అని కూడా చెప్పబడింది [30]. [30] తఫ్సీరు సమ్ఆనీ (4/478).
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు అల్లాహ్ కు అబద్ధం అంటగట్టే వాడి కంటే ఎక్కువ దుర్మార్గుడు ఎవడు? అలాంటి వారు తమ ప్రభువు ముందు ప్రవేశ పెట్టబడతారు. అప్పుడు: "వీరే, తమ ప్రభువుకు అబద్ధాన్ని అంటగట్టిన వారు." అని సాక్షులు పలుకుతారు. నిస్సందేహంగా, అల్లాహ్ శాపం (బహిష్కారం) దుర్మార్గులపై ఉంటుంది.18﴿ [హూద్: 18]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾అల్లాహ్ మీద అబద్ధాలు కల్పిస్తూ: "ఇది ధర్మసమ్మతం, ఇది నిషిద్ధం." అని మీ నోటికొచ్చినట్లు (మనస్సులకు తోచినట్లు) అబద్ధాలు పలక కండి. నిశ్చయంగా, అల్లాహ్ పై అబద్ధాలు కల్పించేవారు ఎన్నడూ సాఫల్యం పొందరు.116 దీనితో కొంత వరకు సుఖసంతోషాలు కలుగవచ్చు, కాని వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.117﴿ [అన్నహ్ల్:116-117].
ఇబ్నె హజర్ అల్-హైతమీ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు: నిస్సందేహంగా, హరామును హలాల్ గా లేదా హలాల్ ను హరాముగా నిర్ణయించే విషయంలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారిపై ఉద్దేశపూర్వకంగా అసత్యాన్ని ఆపాదించడం నిఖార్సైన అవిశ్వాసం" [31]. [31] అజ్జవాజిరు అన్ ఇఖ్తిరాఫిల్ కబాయిర్ (1/162).
ముగైరహ్ బిన్ షుఅబహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా నేను విన్నాను: “నిశ్చయంగా నా గురించి అసత్యం పలకడం, ఇతరుల గురించి అసత్యం పలికినట్లు కాదు. ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నా గురించి అసత్యాలు పలుకుతాడో, అతడు తన నివాస స్థానాన్ని నరకాగ్నిలో ఏర్పాటు చేసుకోవాలి” [32] [32] ఈ హదీసును బుఖారీ హదీథు సంఖ్య (1291) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (933) లో ఉల్లేఖించారు.
ఇమామ్ నవవీ రహిమహుల్లాహ్ ఇలా తెలిపారు: ఇందులో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అసత్యం పలకడం తీవ్రంగా నిషేధించబడినదని, మరియు అది ఒక మహాఘోరమైన పాపము మరియు నాశనానికి గురిచేసే పెద్ద పాపమని స్పష్టం చేయబడింది. అయితే, ఈ అసత్యం పలకడం ద్వారా అతను అవిశ్వాసిగా మారడు, దానిని అతను ధర్మసమ్మతం అని భావిస్తే తప్ప. ఇదే ఉలమా అభిప్రాయాల్లో ప్రసిద్ధమైన అభిప్రాయం [33]. [33] షరహు ముస్లిం (1/ 69).
ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ చెప్పారు: "దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అసత్యం పలకడం అనేది, నరకాగ్నిలో ప్రవేశించడాన్ని మరియు అందులో ఒక నివాస స్థానాన్ని ఏఏర్పరచుకోవటాన్ని తప్పనిసరి చేస్తుంది; అది ఒక శాశ్వతమైన నివాసం, దాని యజమాని దానిని ఎప్పటికీ విడిచిపెట్టలేడు" [34]. [34] మదారిజుస్సాలికీన్ (1/ 379).
మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై అసత్యం పలకడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి, వాటిలో:
- అల్లాహ్ పై అసత్యం పలకడం ముష్రికుల మార్గము, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾అల్లాహ్ మీద అబద్ధాలు కల్పిస్తూ: "ఇది ధర్మసమ్మతం, ఇది నిషిద్ధం." అని మీ నోటికొచ్చినట్లు (మనస్సులకు తోచినట్లు) అబద్ధాలు పలకకండి. నిశ్చయంగా, అల్లాహ్ పై అబద్ధాలు కల్పించేవారు ఎన్నడూ సాఫల్యం పొందరు.116 దీనితో కొంత వరకు సుఖసంతోషాలు కలుగవచ్చు, కాని వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.117﴿ [అన్నహ్ల్: 116-117].
ఇబ్నె కసీర్ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు: “మహోన్నతుడైన అల్లాహ్, తమ అభిప్రాయాల ఆధారంగా వారు పెట్టుకున్న పేర్లతోనే హలాల్-హరామ్లు నిర్ణయించుకున్న ముష్రికుల మార్గాన్ని అనుసరించడాన్ని నిషేధించాడు. వారు బహీరా, సాయిబా, వసీలా, హామ్ మొదలైనవాటిని (హలాల్-హరామ్లుగా) చేసుకున్నారు. ఇలాంటివి మరియు మరెన్నో, వారు తమ అజ్ఞానకాలంలో తామే కల్పించుకున్న, తమకు తామే శాసనంగా చేసుకున్న ఆచారాలే.” [35] [35] తఫ్సీర్ ఇబ్నె కసీర్ (4/609).
- అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై అసత్యాన్ని ఆపాదించటం, అల్లాహ్ ధర్మసమ్మతం చేసిన దానిని నిషేధించటం, లేదా అల్లాహ్ నిషేధించిన దానిని ధర్మసమ్మతం చేయటం రూపంలో దైవిక శాసనాన్ని మార్చడానికి కారణం.
- ఇది బిద్అతులు మరియు కొత్త పోకడలకు దారితీస్తుంది, ఇబ్నె కసీర్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: ఇందులో - అంటే అల్లాహ్ యొక్క ఈ వాక్యంలో: ﴾మీ నాలుకలు అబద్ధాలు పలికినంత మాత్రాన ఇది ధర్మసమ్మతం (హలాల్), ఇది నిషిద్ధం (హరామ్) అని చెప్పకండి﴿ - పరిధిలోకి, కేవలం తన అభిప్రాయం మరియు మనోవాంఛల ఆధారంగా ఈ క్రింది పనులు చేసేవారు కూడా వస్తారు: షరీయత్లో ఎలాంటి ప్రామాణికం లేని బిద్అత్ను కల్పించినవాడు, లేదా అల్లాహ్ నిషిద్ధం చేసిన దానిని ధర్మసమ్మతం చేసినవాడు, లేదా అల్లాహ్ అనుమతించిన దానిని నిషిద్ధం చేసినవాడు [36]. [36] తఫ్సీర్ ఇబ్నె కసీర్ (4/609).
అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై అసత్యాలు పలికే నేరం నుండి రక్షణ పొందే మార్గాలు:
- మాట కన్న ముందు,ఆచరణ కన్న ముందు జ్ఞానముండాలి.
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్’ను అనుసరించడం, మరియు బిద్అతులకు దూరంగా ఉండటం; ఇర్బాద్ బిన్ సారియ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: "మీరు నా విధానాన్ని (సున్నతును), సన్మార్గగాములైన మార్గదర్శక ఖలీఫాల విధానాన్ని ఖచ్చితంగా అనుసరించండి. దానిని గట్టిగా పట్టుకుని ఉండండి, దానిని మీ దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకోండి. ధర్మంలో కొత్తగా ఆవిష్కరించబడిన విషయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రతి కొత్త పోకడ ఒక బిద్అత్. ప్రతి బిద్అత్ మార్గవిహీనతకు నిదర్శనం" ([37]) [37] ఈ హదీసును అబూ దావుద్ హదీథు సంఖ్య (4607) లో ఉల్లేఖించారు.
- సత్యాన్ని అనుసరించడం, అబ్దుల్లాహ్ ఇబ్నె మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: «సత్యసంధతకు కట్టుబడి ఉండండి; నిశ్చయంగా సత్యసంధత సత్కార్యాల వైపు దారితీస్తుంది, మరియు సత్కార్యాలు స్వర్గానికి దారితీస్తాయి. ఒక మనిషి ఎల్లప్పుడూ సత్యమే పలుకుతూ, సత్యాన్నే అన్వేషిస్తూ ఉంటే, చివరకు అతడు అల్లాహ్ వద్దసత్యసంధులలో నమోదు చేయబడతాడు. అబద్ధం నుండి జాగ్రత్తగా ఉండండి; ఎందుకంటే అబద్ధం పాపాచారానికి దారితీస్తుంది, మరియు పాపాచారం నరకానికి దారితీస్తుంది. ఒక మనిషి ఎల్లప్పుడూ అబద్ధమే పలుకుతూ, అబద్ధాన్నే అన్వేషిస్తూ ఉంటే, చివరకు అల్లాహ్ వద్ద అబద్ధాలకోరుగా నమోదు చేయబడతాడు» [38]. [38] ఈ హదీసును బుఖారీ హదీథు సంఖ్య (6094) లో మరియు ముస్లిం, హదీథు సంఖ్య (2607) లో ఉల్లేఖించారు.
- అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై అబద్ధమాడటం యొక్క ఇహపరలోకాల పరిణామం గురించి ఆలోచించడం.
- అల్లాహ్పై మరియు ఆయన ప్రవక్త ﷺపై చెప్పబడే అబద్ధాలను ఖండించి, వాటిని తొలగించే పండితులు ఉండటం.
కొత్తపోకడ (బిద్అత్)
ధర్మంలో బిద్అత్ (నూతన ఆచరణలను ప్రవేశపెట్టడం) మహా పాపాలలో ఒకటి. షిర్క్ తర్వాత అల్లాహ్కు అవిధేయత చేయబడే పాపాలలో బిద్అత్ ఇబ్లీస్కు అత్యంత ప్రియమైనది. ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: "ఒకదానికంటే మరొకటి కఠినమైన ఏడు అడ్డంకులలో ఏదో ఒకదానిలో దాసుడిపై విజయం సాధించాలని షైతాను కోరుకుంటాడు. వాటిలో కొన్ని మరికొన్నింటికంటే కఠినమైనవిగా ఉంటాయి. అతను కఠినమైన అడ్డంకిలో దాసుడిపై విజయం సాధించకపోతేనే, ఆ స్థాయి నుండి దాని కంటే తక్కువ స్థాయికి దిగుతాడు:
మొదటి అడ్డంకి: అల్లాహ్పై, ఆయన ధర్మంపై, ఆయనతో సమావేశంపై, ఆయన సంపూర్ణ గుణగణాలపై, మరియు ఆయన ప్రవక్తలు ఆయన గురించి తెలియజేసిన విషయాలపై అవిశ్వాసం అనే అడ్డంకి. ఈ అడ్డంకిలో గనక అతను విజయం సాధిస్తే, అతని శత్రుత్వపు అగ్ని చల్లారిపోయి, అతను విశ్రాంతి తీసుకుంటాడు. ఒకవేళ అతను మార్గదర్శకత్వపు అంతర్దృష్టితో ఈ అడ్డంకిని అధిగమించి, దాని నుండి రక్షణ పొంది, ఈమాన్ (విశ్వాసం) యొక్క జ్యోతి అతనితో పాటు సురక్షితంగా ఉంటే, అప్పుడు అతన్ని రెండవ అడ్డంకి వద్ద వెంబడిస్తాడు: అది బిద్అత్ అనే అడ్డంకి; అల్లాహ్ తన ప్రవక్తకు ఇచ్చి పంపిన మరియు తన గ్రంథంలో అవతరింపజేసిన సత్యానికి విరుద్ధంగా విశ్వసించడం ద్వారా గానీ, లేదా ధర్మంలో కొత్తగా కల్పించబడిన, అల్లాహ్ అనుమతించని పద్ధతులు మరియు విధానాల ద్వారా ఆరాధించడం ద్వారా గానీ ఇది ఏర్పడుతుంది, అల్లాహ్ వాటిలో దేనినీ స్వీకరించడు" [39]. [39] మదారిజుస్సాలికీన్ (1/ 237).
బిద్అత్ యొక్క వాస్తవికత: ఇది ధర్మంలో షరీఅతుకు సమానంగా కల్పించబడిన ఒక నూతన విధానం, దానిపై అతిశయిల్లుతూ మహోన్నతుడైన అల్లాహ్ ను ఆరాధించే ఉద్దేశ్యంతో చేయబడుతుంది [40]. [40] షాతిబీ గారి పుస్తకం అల్-ఇ’తిసామ్ (1/50).
నిషేధించబడిన బిద్’అత్ అంటే అది ధర్మానికి సంబంధించిన విషయాలలో ఉంటుంది. ఇక ప్రపంచానికి సంబంధించిన విషయాలైతే, ఉదాహరణకు ప్రజలు కనిపెట్టిన కార్లు, విమానాలు, కంప్యూటర్లు, ఫోన్లు లేదా అలాంటి ఇతర వస్తువులు - వీటన్నింటినీ బిద్’అత్ అని అనరు, ఒకవేళ భాషాపరంగా వీటిని బిద్’అత్ అని పిలిచినప్పటికీ.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని స్పష్టమైన మార్గంలో విడిచిపెట్టి వెళ్ళారు, దేని రాత్రి అయితే దాని పగలంత స్పష్టంగా ఉంటుందో, దాని నుండి నాశనానికి గురైన వ్యక్తి తప్ప ఎవరూ దారితప్పరు. ఆయన మనల్ని సన్మార్గాలన్నింటి వైపు ప్రోత్సహించారు మరియు చెడులన్నింటి నుండి మనల్ని హెచ్చరించారు. కాబట్టి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఏ ఒక్కరికీ మాట్లాడటానికి ఏ అవకాశమూ వదల్లేదు. అందువల్ల, ఎవరైనా మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ధర్మంలో, అల్లాహ్ అనుమతించని మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మబద్ధం చేయని ఏదైనా కొత్త విషయాన్ని ప్రవేశపెడితే, దానిలో ఎలాంటి మేలు లేదు, పైగా అది దానిని ఆచరించిన వ్యక్తి నుండి తిరస్కరించబడుతుంది, కాబట్టి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన సన్మార్గగాములైన ఖలీఫాలు మరియు ఆయన ప్రసన్నత పొందిన సహచరులు ఆచరించని ఏ కార్యంతోనైనా అల్లాహ్ ను ఆరాధించడం సరైనది కాదు; వారు తమ కొరకు దేనినైతే ఇష్టపడ్డారో, దానినే మన కొరకు మనం కూడా ఇష్టపడదాం. ఎందుకంటే వారు జ్ఞానం ఆధారంగానే నిలిచారు మరియు లోతైన అవగాహనతోనే విరమించుకున్నారు.
తెలుసుకోండి, ధర్మంలో ప్రతి బిద్అత్ నిషిద్ధమే, మార్గభ్రష్టతే. మార్గభ్రష్టత మరియు దానిని అవలంబించేవారు నరకంలో ఉంటారు. దాని నిషేధానికి ఆధారాలు అనేకం ఉన్నాయి, వాటిలో కొన్ని:
మహోన్నతుడైన అల్లాహ్ తన గ్రంథం మరియు తన ప్రవక్త యొక్క సున్నత్ కాకుండా ఇతరులను అనుసరించడం గురించి హెచ్చరిస్తూ ఇలా సెలవిచ్చాడు: ﴾(ప్రజలారా!) మీ ప్రభువు తరఫు నుండి మీ కొరకు అవతరింప జేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) అనుసరించండి. మరియు ఆయన (అల్లాహ్)ను కాదని ఇతర స్నేహితులను (సహాయకులను) అనుసరించకండి. మీరు ఎంతో తక్కువగా ఈ హితబోధను స్వీకరిస్తున్నారు!3﴿ [అల్ ఆరాఫ్: 3]
పరిశుద్ధుడైన అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾ఏమీ? అల్లాహ్ అనుమతించని ధర్మాన్ని వారి కొరకు విధించగల, ఆయన భాగస్వాములు ఎవరైనా వారి దగ్గర ఉన్నారా?﴿ [అష్'షూరా: 21]
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవడయినా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసిపుచ్చబడుతుంది” [41]. [41] ఈ హదీసును బుఖారీ హదీథు సంఖ్య (2697) లో మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1718) లో ఉల్లేఖించారు.
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చేవారు: "అమ్మా బాద్, నిశ్చయంగా అన్నింటి కంటే మంచి మాట అల్లాహ్ గ్రంథము, మంచి మార్గదర్శకత్వము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వము, వ్యవహారాలన్నింటిలో అతి చెడ్డవి కొత్తపోకడలు, ప్రతి కొత్తపోకడ మార్గభ్రష్టత అవుతుంది". [42] [42] ఈ హదీసును ముస్లిం హదీథు సంఖ్య (867) లో ఉల్లేఖించారు.
హుదైఫహ్ బిన్ యమాన్ రదియల్లాహు అన్హుమా కథనం: "దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు ఆరాధించని ఏ ఆరాధనను అయినా మీరు ఆరాధించకండి, ఎందుకంటే పూర్వీకులు తర్వాతి వారికి చెప్పడానికి ఏమీ మిగల్చలేదు. కావున కాబట్టి ఓ ఖుర్ఆన్ పాఠకులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు మీకు ముందు గతించిన వారి మార్గాన్ని అనుసరించండి" [43]. [43] అల్ బాయిసు అలా ఇన్కారిల్ బిద్అ వల్ హవాదిస్ (పుట: 16).
సుఫ్యాన్ అస్సౌరి రహిమహుల్లాహ్ కథనం: "ఇబ్లీస్ కు పాపకార్యం కన్నా బిద్అత్ ఎక్కువ ప్రియమైనది, పాపకార్యం నుండి పశ్చాత్తాపం స్వీకరించబడుతుంది, కానీ బిద్అత్ నుండి స్వీకరించబడదు" [44]. [44] దీనిని అల్-లాల్కాయ్ షర్హె ఉసూలె ఈతిఖాద్ లో (పుట 238) ఉల్లేఖించారు.
బిద్అత్ యొక్క అనేక ప్రమాదాలు మరియు నష్టాలు ఉన్నాయి, వాటిలో కొన్ని:
- ప్రపంచం ఆరంభం నుండి నేటి వరకు ఉన్న అనుభవాలు మరియు జ్ఞానం ద్వారా తెలిసినదేమిటంటే, మేధస్సులు తమ ప్రయోజనాల విషయంలో స్వతంత్రంగా లేవు. అందువల్ల, తన ప్రభువు సృష్టించిన మానవుడు అనుసరించడానికి ఒక ధర్మశాస్త్రం (షరీఅత్) తప్పనిసరి. మరియు ఆ ప్రభువుకే అతని ప్రయోజనాలు మరియు నష్టాల గురించి బాగా తెలుసు. కాబట్టి అతను తన ప్రభువు యొక్క ఉద్దేశ్యం ప్రకారం నడవకపోతే, అతను తనకే హాని చేసుకుంటాడు మరియు తనను తాను వినాశకరమైన ప్రదేశాలకు గురిచేసుకుంటాడు.
- బిద్అత్ చేసేవాడు మనోవాంఛలను అనుసరించేవాడు; ఎందుకంటే వివేకం ఇస్లామీయ చట్టాన్ని అనుసరించనప్పుడు, దానికి మనోవాంఛలు మరియు కోరికలు తప్ప మరేమీ మిగలదు. పరమ ప్రభువు తన దాసుడైన దావూద్ అలైహిస్సలాంతో ఇలా సెలవిచ్చాడు: ﴾నీ మనోకాంక్షలను అనుసరించకు, ఎందుకంటే అవి నిన్ను అల్లాహ్ మార్గం నుండి తప్పిస్తాయి." నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ మార్గం నుండి తప్పిపోతారో, వారికి లెక్క దినమున మరచి పోయిన దాని ఫలితంగా, కఠినమైన శిక్ష పడుతుంది.﴿ [సాద్: 26]
-షరీఅతు పరిపూర్ణమైనదిగా అవతరించింది, అది ఎలాంటి హెచ్చుతగ్గులను అంగీకరించదు. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు అల్లాహ్ కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను.﴿ [అల్ మాయిదా: 3] కాబట్టి ఎవరైతే ధర్మంలో కొత్త విషయాన్ని ప్రవేశపెడతారో, అతను షరియత్ అసంపూర్ణమైనదని మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వహీ నుండి కొంత భాగాన్ని దాచిపెట్టారని వాదించినట్లే.
- బిద్అతీ షరియా పట్ల మొండి వైఖరిని అవలంబిస్తాడు, దానితో విభేదిస్తాడు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రధాత (అల్లాహ్) ఆరాధన కొరకు ప్రత్యేక మార్గాలను, ప్రత్యేక పద్ధతులను నిర్దేశించాడు. మరియు ఆజ్ఞ-నిషేధాల ద్వారా, వాగ్దానం-హెచ్చరికల ద్వారా సృష్టిని వాటికే పరిమితం చేశాడు. వాటిలోనే మేలు ఉందని, వాటిని అతిక్రమించడంలో కీడు ఉందని కూడా తెలియజేశాడు. ఎందుకంటే అల్లాహ్కు తెలుసు, మనకు తెలియదు. మరియు నిశ్చయంగా ఆయన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను సకల లోకాలకు కారుణ్యంగా పంపాడు. అందువల్ల బిద్అతీ వీటన్నింటినీ తిరస్కరిస్తాడు; ఎందుకంటే అతడు ఇంకా వేరే మార్గాలు కూడా ఉన్నాయని, షరీఅతుకర్త పరిమితం చేసినది పరిమితం కాదని, మరియు ఆయన నిర్దేశించినది నిర్దిష్టమైనది కాదని వాదిస్తాడు. షరీఅతుకర్తకు తెలిసినట్లే మాకు కూడా తెలుసు అన్నట్లుగా. అంతేకాదు, షరీఅతుకర్త యొక్క మార్గాలను అతను సరిదిద్దడం ద్వారా, షరీఅతుకర్తకు తెలియనిది అతనికి తెలుసని కూడా అర్థం కావచ్చు. ఒకవేళ నూతన కల్పన చేసేవాడి ఉద్దేశ్యం ఇదే అయితే, అది షరీఅత్ మరియు షరీఅతుకర్త పట్ల అవిశ్వాసం (కుఫ్ర్) అవుతుంది. ఒకవేళ అది ఉద్దేశపూర్వకం కాకపోతే, అది స్పష్టమైన మార్గభ్రష్టత్వం.
రక్షణ:
ఈ గొప్ప మహాపరాధంలో పడకుండా రక్షణ పొందే మార్గములలో నుంచి:
- దైవగ్రంథం మరియు దైవప్రవక్త సున్నతును అంటిపెట్టుకుని ఉండటంతో పాటు, దానిని సాధ్యమైనంత ఎక్కువగా ప్రజలకు వ్యాప్తి చేయటం మరియు అందజేయడం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మీరందరూ కలసి అల్లాహ్ త్రాడు (ఖుర్ఆన్) ను గట్టిగా పట్టుకోండి. మరియు విభేదాలలో పడకండి...﴿ [ఆలె ఇమ్రాన్: 103], అల్లాహ్ యొక్క తాడు: ఇస్లాం, ఖుర్ఆన్ మరియు సున్నత్.
- ఇజ్తిహాద్, ఇస్తిహ్సాన్ మరియు ఖియాస్లకు ఆస్కారం లేని అఖీదా (విశ్వాస) సంబంధిత విషయాలలో కేవలం ఖుర్ఆన్ మరియు సున్నత్ను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. ముతషాబిహాత్ (అస్పష్టమైన విషయాల) లో లోతుగా చర్చించకుండా ఉండాలి. ఎందుకంటే అలా చేయడం మార్గభ్రష్టులు మరియు బిద్అత్ చేసేవారికి గుర్తు. అంతేకాక, ముస్లింలపై వచ్చిపడిన ప్రతి విపత్తు మరియు ఆపదకు అదే కారణం.
- వ్యక్తిగత మరియు సామాజిక ప్రవర్తనలో సున్నత్ ను అమలుపరచడం, అనగా మానవుడు సున్నత్ నుండి నేర్చుకున్న దానిని తన జీవితంలోని అన్ని రంగాలలో తన ప్రవర్తనలో ఆచరించడం. సున్నత్ ను ఆచరించడం సమాజంలో బిద్అత్ ను ఒక చెడు విషయంగా చేస్తుంది, దాని వికారమైన లక్షణాలు మరియు చెడు స్వరూపం బయటపడతాయి, మరియు అది ఇస్లాం మరియు ముస్లింలకు కలిగించే వికారాన్ని మరియు ముప్పును స్వయంగా తెలియజేస్తుంది.
- మంచిని ఆజ్ఞాపించడం మరియు చెడును వారించడం, ఎందుకంటే బిద్’అతులు వాటి ప్రారంభంలో చిన్నవిగా ఉండి, ఆ తర్వాత పెద్దవిగా అవుతాయి. దానిని ఒక వ్యక్తి ప్రారంభిస్తాడు మరియు వెంటనే అతని చుట్టూ దుష్ట కోరికలు గలవారు చేరతారు. ఒకవేళ సమాజంలో మంచిని ఆజ్ఞాపించేవారు మరియు చెడును వారించేవారు తమ పాత్రను పోషిస్తే, వారు బిద్’అతులను అంతం చేసి, సున్నతులను పునరుజ్జీవింపజేస్తారు.
- ధర్మంపై జరిగే బహిరంగ లేదా రహస్య దాడులకు ప్రతిస్పందించటం, కొత్తపోకడల వ్యక్తీకరణలను బహిరంగపరచటం, అవి చొచ్చుకుపోవటం మరియు వ్యాప్తి చెందటాన్ని నిరోధించడానికి ఖుర్ఆన్ మరియు సున్నత్ ద్వారా వాటిపై వెలుగు ప్రసరింపజేయటం, మరియు దాని ప్రభావం ఎంత తక్కువగా ఉన్నా లేదా దాని విషయం ఎంత చిన్నదిగా ఉన్నా సున్నత్ హద్దులను దాటిపోయే ప్రతి విషయం నుండి జాగ్రత్త వహించటం.
- ధర్మవిషయాలలో జ్ఞానం లేకుండా సామాన్య ప్రజలు మాట్లాడటాన్ని నివారించడం, మరియు వారి పదవులు ఏవైనప్పటికీ ధర్మశాస్త్రానికి విరుద్ధమైన వారి అభిప్రాయాలను పరిగణించకపోవడం.
అర్రియావు ప్రదర్శనబుద్ది
ప్రదర్శన (రియా) అనేది ఆచరణను వ్యర్థం చేసే మహాపరాధాల్లో ఒకటి; ఎందుకంటే ఇది షరిఅత్ హెచ్చరించిన షిర్క్ యొక్క రకాల్లో ఒకటి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: "నిశ్చయంగా, మీ విషయంలో నేను ఎక్కువగా భయపడే విషయం షిర్కె అస్గర్ (చిన్న షిర్క్). వారు, ఓ ప్రవక్తా! చిన్న షిర్క్ అంటే ఏమిటి? అని అడిగారు. దానికి ఆయన, ప్రదర్శన..." అని సమాధానమిచ్చారు. [45]. [45] దీనిని అహ్మద్ హదీథు సంఖ్య (23630) లో ఉల్లేఖించారు.
రియా యొక్క వాస్తవికత: ఒక దాసుడు కేవలం అల్లాహ్ ప్రసన్నతను ఆశించకుండా ఒక కార్యం చేయడం, అతని కార్యం కేవలం ప్రజల కొరకు అయినా, లేదా అల్లాహ్ కొరకు చేస్తూ దానితో పాటు ప్రజల దృష్టిని కూడా ఆశించినా, ఈ రెండూ రియానే.
రియా ప్రాథమిక విశ్వాసంలో ఉన్నప్పుడు అది కుఫ్ర్ మరియు కపటత్వం అవుతుంది, మరియు అది ప్రాథమిక విశ్వాసానికి చెందని కొన్ని కార్యాలలో ఉన్నప్పుడు చిన్న షిర్క్ అవుతుంది.
ఆధారాలు:
రియా నిషేధమని సూచించే ఆధారాలు కూడా ఉన్నాయి, అవి:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ﴾ఓ విశ్వాసులారా! (కేవలం) పరులకు చూపటానికి, తన ధనం ఖర్చు చేస్తూ అల్లాహ్ ను, అంతిమదినాన్ని విశ్వసించని వాని మాదిరిగా! మీరూ చేసిన మేలును చెప్పుకొని (ఉపకారం పొందిన వారిని) కష్టపెట్టి, మీ దానధర్మాలను వ్యర్థ పరచుకోకండి.﴿ [అల్ బఖర: 264]
పరిశుద్ధుడైన అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾నిశ్చయంగా, ఈ కపట విశ్వాసులు అల్లాహ్ ను మోసగించగోరుతున్నారు. కాని ఆయనే వారిని మోసంలో పడవేశాడు. మరియు ఒకవేళ వారు నమాజ్ కొరకు నిలిచినా శ్రద్ధాహీనులై కేవలం ప్రజలకు చూపటానికే నిలుస్తారు...﴿ [నిసా: 142]
మరియు శుభకరుడు,మహోన్నతుడు ఇలా సెలవిచ్చాడు: ﴾కావున తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ భాగస్వాములుగా (షరీక్ లుగా) కల్పించుకోరాదు.110﴿ [కహఫ్: 110] అంటే: తన కర్మతో ఎవరినీ సాటి కల్పించడు, మరియు ఎవరికీ ప్రదర్శన చేయడు.
అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు!4 ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో!5 ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)!6﴿ [అల్ మాఊన్: 4-6]
నష్టాలు:
రియా యొక్క నష్టాలు:
-ప్రదర్శన అనేది విశ్వాసం యొక్క మూలంలో కలిస్తే నరకంలో శాశ్వత నివాసానికి కారణమవుతుంది; ఎందుకంటే అప్పుడు అది కుఫ్ర్ మరియు కపటత్వం అవుతుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు విశ్వాసులను కలిసి నపుడు, వారు: "మేము విశ్వసించాము." అని అంటారు. కానీ, తమ షైతానుల (దుష్ట నాయకుల) దగ్గర ఏకాంతంలో ఉన్నప్పుడు వారు: "నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నాము. కేవలం (వారి) ఎగతాళి చేస్తున్నాము." అని అంటారు.14﴿ [బఖర: 14] పరిశుద్ధుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾నిశ్చయంగా కపట విశ్వాసులు నరకంలో, అట్టడుగు స్థానంలో పడి ఉంటారు. మరియు వారికి సహాయం చేయగల వాడిని ఎవ్వడినీ నీవు పొందజాలవు.145﴿ [అన్నిసా: 145]
- ప్రదర్శన ప్రదర్శన చేసేవాడి ఆచరణ నిష్ఫలమవడానికి కారణమవుతుంది. అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “పరమ శుభదాయకుడు, పరమోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా తెలిపాడు: ‘సాటి కల్పించబడే వారందరికన్నా నేను అత్యంత స్వయం సమృధ్ధుడను. సహాయకునిగా, సహ్యోగిగా ఎవరినీ కలిగి ఉండవలసిన అవసరం లేని వాడను. కనుక ఎవరైనా ఏదైనా ఆచరణ ఆచరించి, అందులో ఇతరులతో నాకు సాటి కల్పించినట్లయితే , అతడిని,అతడు సాటి కల్పించిన వాటిని నేను వదిలి వేస్తాను’ [46].” [46] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (2985) లో ఉల్లేఖించారు.
కావున ప్రజల కోసం ఆచరించే కపటునికి పరలోకంలో అతని ఆచరణలకు ఎలాంటి ప్రతిఫలం లభించదు. మహమూద్ బిన్ లబీద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "నిశ్చయంగా మీ విషయంలో నేను భయపడే విషయం ఏమిటంటే మీరు చిన్న షిర్క్ కు పాల్పడతారేమోనని.” వారు ప్రశ్నించారు: “ఓ అల్లాహ్ ప్రవక్తా! చిన్న షిర్క్ అంటే ఏమిటి?” ఆయన పలికారు: “ప్రదర్శనా తత్వము (రియా). తీర్పు దినము నాడు ప్రజలకు వారి వారి ప్రతిఫలం ఇవ్వబడుతున్నపుడు, సర్వ శక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ వారితో ఇలా అంటాడు: “ప్రపంచ జీవితంలో ఎవరినైతే మీరు ప్రదర్శన కోసం ఆరాధించేవారో వారి వద్దకు వెళ్ళండి, వెళ్ళి వారి వద్ద చూడండి, వారి వద్ద ఏమైనా ప్రతిఫలం ఉన్నదేమో.” [47] [47] ఈ హదీసును అహ్మద్ హదీథు సంఖ్య (23630) లో ఉల్లేఖించారు.
- ప్రదర్శన నరకములో ప్రవేశమునకు కారణం అవుతుంది, అబూ హురైర రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: నిశ్చయంగా ప్రళయదినాన మొట్టమొదటగా తీర్పుచేయబడే వ్యక్తి అల్లాహ్ మార్గంలో అమరగతి అయి ఉంటాడు, అతన్ని హాజరు చేయబడుతుంది, అతనికి చెందాల్సిన అనుగ్రహాలు చూపించబడతాయి వాటిని అతను గుర్తుపడతాడు, అల్లాహ్ అతనితో “నీవు ఈ అనుగ్రహాలు పొందటానికి ఏం చేశావు?” అని ప్రశ్నిస్తాడు. దానికి ఆ వ్యక్తి ‘నేను నీ కోసం పోరాటం చేసి చివరికి అమరుడినయ్యాను’ అని చెప్తాడు. అప్పుడు అల్లాహ్ అతనితో ‘నువ్వు అబద్దం చెప్తున్నావు, నిన్ను జనులు పరాక్రమవంతుడిగా ప్రశంసించాలనే ఉద్దేశ్యంతో నువ్వు పోరాడావు, నిన్ను అలాగే ప్రశంసించబడింది,’ ఆపై ఆదేశించబడుతుంది అతన్ని ముఖభాగాన ఈడ్చుకుంటూ తీసుకెళ్లి నరకాగ్నిలో విసిరివేయడం జరుగుతుంది. మరొక వ్యక్తి ధర్మ జ్ఞానాన్ని ఆర్జించి ప్రజలకు బోధిస్తూ ఉంటాడు, ఖుర్ఆన్ పారాయనం పటిస్తాడు, అతన్ని హాజరు పర్చడం జరుగుతుంది, అతనికి చెందాల్సిన అనుగ్రహలు చూపించబడతాయి అతను కూడా వాటిని గుర్తిస్తాడు, ఆపై అతనితో అల్లాహ్ ప్రశ్నిస్తాడు: “ఈ అనుగ్రహాల కోసం నువ్వు ఏ విధంగా కష్ట పడ్డావు?” దానికి అతను ‘ధార్మిక జ్ఞానాన్ని ఆర్జించి ఇతరులకు నేర్పించాను, పవిత్ర ఖుర్ఆన్ గ్రంధ పారాయణాన్ని నీ ప్రసన్నతకై చేశాను’ అని చెప్తాడు. అప్పుడు అల్లాహ్ అతనితో’ నువ్వు అబద్దం చెప్తున్నావు, నువ్వు ధర్మ జ్ఞానం నేర్చుకున్నది ఒక గొప్ప ధార్మిక పండితునిగా పేరు సంపాదించడం కోసం, ఖుర్ఆన్ పటించినది ఒక గొప్ప ఖారీగా ప్రశంసలు పొందడం కోసం, నిశ్చయంగా అది నువ్వు సంపాదించుకున్నావు,’ ఆ పిదప ఆదేశించబడుతుంది అతన్ని ముఖభాగాన ఈడ్చుకుంటూ తీసుకెళ్లి నరకాగ్నిలో విసిరివేయడం జరుగుతుంది. మూడవ వ్యక్తి, అల్లాహ్ అతన్ని ధనికుడిగా చేశాడు, ప్రతీ రకమైన ధనరాశిని అతనికి నొసగాడు, అతన్ని అల్లాహ్ ముందు హాజరుచేయబడుతుంది, అతనికి సంభందించిన అనుగ్రహాలను చూపించడం జరుగుతుంది, అతడు వాటిని గుర్తిస్తాడు, ఆ పిదప అతన్ని “ఈ అనుగ్రహాలకోసం నువ్వు ఏ విధంగా కష్టించావు?” అని ప్రశ్నించడం జరుగుతుంది. దానికి అతను సమాధానం చెప్తూ ‘నేను డబ్బు ఖర్చు చేయబడే ఏ మార్గాన్ని ఏ సందర్భాన్ని వదలలేదు, ఇష్టంగా నీ ప్రసన్నత కొరకు ఖర్చుచేశాను’ అని చెప్తాడు. అల్లాహ్ అతనితో –‘నువ్వు అబద్దం చెప్తున్నావు, నువ్వు ‘ఒక గొప్ప దాత’గా ప్రశంసలు పొందుటకు అలా ఖర్చు చేశావు, నిన్ను అలాగే ప్రశంసించడం జరిగింది,’ ఆపై ఆదేశించబడుతుంది, అప్పుడు అతన్ని ముఖభాగాన ఈడ్చుకుంటూ తీసుకెళ్లి నరకాగ్నిలో విసిరివేయడం జరుగుతుంది» [48]. [48] ఈ హదీసును ముస్లిం హదీథు సంఖ్య (1905) లో ఉల్లేఖించారు.
- రియా (ప్రదర్శనాబుద్ది) ప్రళయదినమున సమస్త సృష్టి ఎదుట అవమానానికి కారణమవుతుంది. జుందుబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “ఎవడు (తన పనులను) ప్రజలకు వినిపించాలనే ఉద్దేశంతో చేస్తాడో, అల్లాహ్ పునరుత్థాన దినంలో అతడిని ప్రజలకు వినిపిస్తాడు; మరియు ఎవడు చూపించడానికి (రీయా కోసం) చేస్తాడో, అల్లాహ్ పునరుత్థాన దినంలో అతడిని చూపింపజేస్తాడు” [49]. అల్లాహ్ అతనితో ప్రదర్శన చేస్తాడు అనగా, పునరుత్థానం రోజున అతను ప్రచారం కోరేవాడు మరియు ప్రదర్శనాబుద్ధి కలవాడు అని అతని గురించి ప్రకటించబడుతుంది. [49] దీనిని బుఖారీ ఉల్లేఖించారు,, హదీథు సంఖ్య (6499)
రక్షణ:
రియా' నుండి రక్షణ పొందే మార్గములు:
- అల్లాహ్ తన రహస్యాన్ని తెలుసుకుంటాడని, మరియు అతని హృదయంలో దాగి ఉన్నది ఆయనకు తెలుసునని తెలుసుకోవటం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు: ﴾ఏమీ? వారి గుప్త రహస్యాలు మరియు వారి రహస్య సమాలోచనలు , అల్లాహ్ కు తెలుసని వారికి తెలియదా? మరియు నిశ్చయంగా, అల్లాహ్ అగోచర విషయాలన్నీ తెలిసి వున్నవాడు.7 [తౌబా: 78]
- మహోన్నతుడైన అల్లాహ్ తన దాసుడిని ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తున్నాడనే భావనను హృదయంలో నిలుపుకోవడం;, ఇది "ఇహ్సాన్" యొక్క స్థాయి, దీనిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జిబ్రయీల్ హదీసులో ప్రస్తావించారు, అది «నీవు అల్లాహ్ ను చూస్తున్నట్లుగా భావిస్తూ ఆయనను ఆరాధించటం. ఒకవేళ నీవు ఆయనను చూస్తున్నట్లు భావించలేకపోతే, ఆయన నిన్ను చూస్తున్నాడు అని భావిస్తూ ఆయనను ఆరాధించటం» [50]. [50] ఈ హదీసును ముస్లిం హదీథు సంఖ్య (97) లో ఉల్లేఖించారు.
- తన మాటలలో మరియు కర్మలన్నింటిలో చిత్తశుద్ధిని పాటించాలి, మరియు వాటి ద్వారా కేవలం మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ప్రసన్నతను ఆశించాలి.
- ప్రజలు తనకు ఎలాంటి లాభం గానీ, నష్టం గానీ కలిగించలేరని, అతను అల్లాహ్ కొరకు చిత్తశుద్ధితో ఆచరిస్తే, అల్లాహ్ అతని పట్ల ప్రసన్నుడై అతన్ని ప్రేమిస్తాడని తెలుసుకోవాలి. దాని ఫలితంగా అతనికి ప్రజల ఆమోదం లభిస్తుంది మరియు వారి మెప్పు కోసం ప్రదర్శించాల్సిన అవసరం లేకుండానే ప్రజలు అతన్ని ప్రేమిస్తారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “నిశ్చయంగా అల్లాహ్ (తన దాసులలో) ఒక దాసుని ప్రేమించినపుడు జిబ్రయీల్ అలైహిస్సలాంను పిలిచి ఇలా అంటాడు: “నేను ఫలానా దాసుడిని ప్రేమిస్తున్నాను, కనుక అతడిని ప్రేమించు”. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం అతడిని ప్రేమిస్తాడు. మరియు అతడు (జిబ్రయీల్) ఆకాశాలలో పిలుపునిస్తాడు; అతడు ఇలా అంటాడు: “నిశ్చయంగా అల్లాహ్ ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, కనుక అతడిని ప్రేమించండి”, అప్పుడు ఆకాశ నివాసులందరూ అతడిని ప్రేమిస్తారు. అప్పుడు అతనికి భూమిపై ఆమోదం లభిస్తుంది. అలాగే ఒకవేళ అల్లాహ్ (తన దాసులలో) ఒకరిని ద్వేషించినట్లయితే, జిబ్రయీల్ అలైహిస్సలాంను పిలిచి ఇలా అంటాడు: “నిశ్చయంగా నేను ఫలానా వ్యక్తిని ద్వేషిస్తున్నాను. కనుక అతడిని ద్వేషించు. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం అతడిని ద్వేషిస్తాడు. అప్పుడు జిబ్రయీల్ ఆకాశావాసులలో పిలుపునిస్తాడు, అతడు (జిబ్రయీల్) ఇలా అంటాడు: “నిశ్చయంగా అల్లాహ్ ఫలానా వ్యక్తిని ద్వేషిస్తున్నాడు, కనుక అతడిని ద్వేషించండి”. అప్పుడు వారందరూ అతడిని ద్వేషిస్తారు. మరియు అతని పట్ల భూమిలో ద్వేషం స్థిరపడుతుంది” [51]. [51] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (3209) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (2637) లో ఉల్లేఖించారు.
- దాసుడు అల్లాహ్ తో రియా నుండి శరణు వేడుకోవాలి, మరియు హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: «ఓ ప్రజలారా, ఈ షిర్కు నుండి మీరు జాగ్రత్తపడండి; నిశ్ఛయంగా అది చీమల పాకులాటకంటే గోప్యమైనది», అప్పుడు ఆయనతో ఒకరు, "ఓ అల్లాహ్ ప్రవక్తా! మనం దాని నుండి ఎలా జాగ్రత్తపడగలం, అది చీమల పాకులాటకంటే గోప్యమైనది కదా?" అని అడిగారు. దానికి ప్రవక్త ఇలా అన్నారు: «మీరు ఇలా పలకండి: అల్లాహుమ్మ ఇన్నా నఊదు బిక మిన్ అన్ నుష్రిక బిక షయ్'అన్ నఅ్'లముహు, వ నస్'తగ్'ఫిరుక లిమా లా నఅ్'లము» (ఓ అల్లాహ్! మేము తెలిసి నీతో ఏదైనా భాగస్వామ్యాన్ని కలపడం నుంచి నీ శరణు కోరుతున్నాము. అలాగే మాకు తెలియకుండా జరిగిన వాటికి నీ క్షమాపణను కోరుతున్నాము.) [52]. [52] ఈ హదీసును అహ్మద్ హదీథు సంఖ్య (19606) లో ఉల్లేఖించారు.
ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రజియల్లాహు అన్హు తన దుఆలో (ప్రార్థనలో) ఇలా వేడుకునేవారు: అల్లాహుమ్మజ్'అల్ అమలీ కుల్లహూ సాలిహన్, వజ్'అల్హు లివజ్హిక ఖాలిసన్, వలా తజ్'అల్ లిఅహదిన్ ఫీహి షైఆ ((ఓ అల్లాహ్, నా పనులన్నింటినీ సత్కార్యాలుగా చేయి, మరియు వాటిని కేవలం నీ ప్రసన్నత కొరకు నిష్కల్మషమైనవిగా చేయి, మరియు వాటిలో మరెవరికీ ఎలాంటి భాగం లేకుండా చేయి)) [53]. అలీ బిన్ అబూ తాలిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: ఆయన అల్లాహ్ తో ఇలా దుఆ చేసేవారు: ఓ అల్లాహ్! నా హృదయాన్ని కపటత్వం నుండి, నా మనస్సును ద్వేషం నుండి, మరియు నా ఆచరణలను ప్రదర్శన బుద్ధి నుండి పరిశుద్ధపరచు. [54] [54] ఈ హదీసును ఇబ్ను అబీ షైబా ముసన్నఫ్ లో హదీథు సంఖ్య (2951) లో ఉల్లేఖించారు. [53] ఇబ్నె తైమియా గారి మజ్మూఉల్ ఫతావా (1/99).
- ప్రదర్శన బుద్ధి నుండి విముక్తి కొరకు అల్లాహ్ సహాయం అర్థించటం, అల్లాహ్ విశ్వాసపరుల గురించి ఇలా సెలవిచ్చాడు: ﴾మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము.5﴿ [అల్ ఫాతిహ: 5]
- ఆరాధనను దాచి ఉంచాలి, దానిని బహిర్గతం చేయకూడదు; అయితే, ధర్మశాస్త్రం ప్రకారం బహిర్గతం చేయవలసిన ఆరాధనలైన అజాన్, సామూహిక నమాజు, మరియు వాటిని పోలిన, దాచడం సాధ్యం కాని మరియు ధర్మసమ్మతం కాని ఇతర ఆరాధనలు మినహా.
నమాజు విడిచిపెట్టడం.
నమాజుకు ఇస్లాంలో ఉన్నతమైన స్థానం ఉంది, అది ధర్మం యొక్క స్తంభము, మరియు అది షహాదతైన్ తరువాత మొదటి ఆరాధన. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, రసూలుల్లాహ్ ﷺ ఇలా సెలవిచ్చారు: "ఇస్లాం ధర్మం ఐదు పునాదులపై ఆధారపడి ఉంది. 1) అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడనీ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవప్రవక్త అని సాక్ష్యం పలకటం, 2) నమాజ్ స్థాపించటం, 3) జకాత్ చెల్లించటం, 4) దైవగృహ యాత్ర చేయటం, 5) రమజాన్ నెలలో ఉపవాసాలు పాటించటం" [55]. [55] ఈ హదీసును బుఖారీ (హదీథు సంఖ్య: 8) మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 21) లో ఉల్లేఖించారు.
నమాజును వదిలివేయటం మహా పాపాలలో ఒకటి, మరియు దానిని చేసేవాడు అవిశ్వాసానికి పాల్పడతాడనే భయం ఉంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పగా తాను విన్నానని హజ్రత్ జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “(ముస్లిం) మనిషికి మరియు బహుదైవారాధన, అవిశ్వాసములకు మధ్య వ్యత్యాసము ఏమిటంటే – నమాజును వదిలివేయుట”. [56] [56] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (134) లో ఉల్లేఖించారు.
ఆధారాలు:
నమాజును వదిలివేయడం నిషిద్ధమని, మరియు అది ఎంత ఘోరమైన, తీవ్రమైన అపరాధమో స్పష్టం చేసే ఆధారాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని:
పరిశుద్ధుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾కాని వారి తరువాత వచ్చిన, వారి సంతతి వారు కొందరు, నమాజ్ లను విడిచి పెట్టి తమ (దుష్ట) మనోవాంఛలను అనుసరించారు. కావున త్వరలోనే వారు అధోగతి (నరకంలో)కి చేరగలరు.59﴿ [మర్యం: 59] అంటే: వారు రెట్టింపు, తీవ్రమైన శిక్షను పొందుతారు, మరియు వ్యాఖ్యాతలు తెలుపుతున్నారు ఏమనగా, నమాజును నిర్లక్ష్యము చేయుట అంటే దానిని పూర్తిగా వదిలివేయడం, లేదా దాని సమయాల నుండి ఆలస్యం చేయడం [57]. [57] చూడండి: తఫ్సీర్ ఇబ్నె కసీర్ (5/243).
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మిమ్మల్ని ఏ విషయం నరకంలోకి ప్రవేశింపజేసింది? 42 వారు (నరకవాసులు) ఇలా జవాబిస్తారు: "మేము నమాజ్ చేసే వాళ్ళం కాము.43﴿ [అల్ ముద్దస్సిర్: 42 - 43] నమాజును వదిలివేయటం నరకం ప్రవేశించటానికి ఒక కారణం, అల్లాహ్ మనల్ని దాని నుండి రక్షించుగాక.
మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు!4 ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో!5﴿ [అల్ మాఊన్: 4 - 5]
సాదీ రహిమహుల్లాహ్ ఇలా తెలిపారు: ﴾ఫవయ్లున్ లిల్ ముసల్లీన్﴿ అంటే: నమాజ్ను నిలబెట్టడానికి నిబద్ధులై ఉండి కూడా, వారు ﴾అన్ సలాతిహిమ్ సాహూన్﴿ అంటే: దానిని వ్యర్థం చేస్తారు, దాని సమయాన్ని జారవిడుస్తారు, దాని మూలస్తంభాలను వదిలివేస్తారు. వారు అల్లాహ్ ఆజ్ఞ పట్ల శ్రద్ధ వహించనందువల్లే, విధేయతలలోకెల్లా అత్యంత ముఖ్యమైనది మరియు (అల్లాహ్) సాన్నిధ్యాన్ని ప్రసాదించే వాటిలో అత్యుత్తమమైనదైన నమాజ్ను పాడుచేశారు" [58]. [58] తఫ్సీర్ అస్సాదీ: ( పేజి: 935)
బురైదహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మనకు వారికి మధ్య ఉన్న ప్రమాణము నమాజు. దాన్ని వదిలిన వాడు అవిశ్వాసమునకు ఒడిగట్టాడు. [59] [59] ఈ హదీసును తిర్మిథీ, హదీథు సంఖ్య (261) లో ఉల్లేఖించారు.
మరియు తాబియీ తరానికి చెందిన షఖీఖ్ బిన్ అబ్దుల్లాహ్ ఉల్లేఖన: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు ఆచరణల్లో దేనిని విడిచి పెట్టినా ‘కుఫ్ర్’గా తలపోసే వారు కాదు, ఒక్క నమాజును తప్ప. [60] [60] ఈ హదీసును తిర్మిథీ, హదీథు సంఖ్య (2622) లో ఉల్లేఖించారు.
నష్టాలు:
నమాజు వదిలివేయడం వలన అనేక నష్టాలు ఉన్నాయి, అవి :
- ఇస్లాం యొక్క బహిర్గతమైన ఆచారాలలో ఒక గొప్ప ఆచారం వృధా అవ్వటం.
- నమాజు విడిచిపెట్టే వాడు కుఫ్ర్ లో పడిపోయే ప్రమాదంలో ఉన్నాడు – అల్లాహ్ తో దీని నుండి ఆశ్రయం కోరుతున్నాము –. ఈ విషయంలో ధర్మశాస్త్రవేత్తల మధ్య భేదాభిప్రాయం ఉంది: అతను తిరస్కారా, అతనిపై తిరస్కారులకు వర్తించే నిబంధనలు వర్తిస్తాయా? లేక అతను ఘోరమైన పాపాలలో ఒక పెద్ద పాపానికి పాల్పడినవాడా?
- నమాజు వదిలిన వానికి ఇస్లాం లో భాగం లేదు, మిస్వర్ ఇబ్నె మఖ్రమా ఉల్లేఖనం ప్రకారం: హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు కత్తిపోట్లకు గురైన రాత్రి, ఆయన (మిస్వర్) ఉమర్ వద్దకు వెళ్ళి ఫజర్ నమాజు కోసం నిద్రలేపారు. దానికి ఉమర్ (రజియల్లాహు అన్హు) ఇలా అన్నారు: "అవును, నమాజును వదిలిపెట్టిన వానికి ఇస్లాంలో ఎలాంటి భాగం లేదు". ఆ తర్వాత, ఆయన గాయం నుండి రక్తం ప్రవహిస్తున్నప్పటికీ నమాజు ఆచరించారు. యస్'అబు దమన్: ప్రవహించడం మరియు ఉప్పొంగడం. [61] దీనిని మువత్తా మాలిక్ నమోదు చేసినారు, హదీథు సంఖ్య (51).
ఇమామ్ బాజీ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు: "ఉమర్ రదియల్లాహు అన్హు యొక్క ప్రవచనం: (నమాజు వదిలిన వానికి ఇస్లాం లో భాగం లేదు) దీని అర్థం: ఇస్లాంలో అతనికి ఎలాంటి భాగం లేదు, మరియు అతని కర్మలు స్వీకరించబడవు; ఎందుకంటే ఇస్లామీయ కర్మలలో నమాజు మొట్టమొదటగా స్వీకరించబడేది మరియు అత్యంత ఉన్నతమైనది. కాబట్టి, నమాజును వదిలిన వాని మిగతా ఇస్లామీయ కర్మల భాగం రద్దు చేయబడుతుంది, అతను వాటి ద్వారా ప్రయోజనం పొందలేడు, మరియు వాటిలో అతనికి ఎలాంటి భాగం ఉండదు" [62]. [62] అల్ మున్తఖా షరహుల్ మువత్తా (1/86).
- నమాజును వదిలివేయడం పరలోకదినాన నిరాశ మరియు నష్టం కలిగించును; అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా నేను విన్నాను: నిశ్చయంగా ప్రళయదినాన దాసుని ఆచరణల్లో మొట్టమొదటగా విచారణ జరిగేది నమాజ్ గురించే. అది సరిగా ఉంటే అతడు విజయాన్ని సాధించాడు మరియు సఫలీకృతుడయ్యాడు; అది చెడిపోయి ఉంటే అతడు విఫలుడయ్యాడు మరియు నష్టపోయాడు.[63] [63]ఈ హదీసును తిర్మిథీ, హదీథు సంఖ్య (413) లో ఉల్లేఖించారు.
ఔన్ ఇబ్నె అబ్దుల్లాహ్ రహిమహుల్లాహ్ ఇలా సెలవిచ్చారు: నిశ్చయంగా దాసుడిని అతని సమాధిలో ప్రవేశపెట్టినప్పుడు, మొట్టమొదటగా నమాజు గురించి ప్రశ్నించబడును. ఒకవేళ అది ఆమోదించబడితే, అతని మిగతా కర్మలను పరిశీలించబడును. ఒకవేళ అది ఆమోదించబడకపోతే, ఆ తర్వాత అతని ఇతర కర్మలలో దేనినీ పరిశీలించబడదు [64]. [64] ఇమామ్ జహబీ గారి అల్ కబాయిర్ (సంపుటము: 20)
- ఎవరైతే ఏ ఒక్క నమాజును వదిలేస్తారో అతనిపై అల్లాహ్ ఆగ్రహిస్తాడు, ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఇలా అన్నారు: "ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఒక్క నమాజును వదిలివేస్తారో, అల్లాహ్ అతనిపై కోపంగా ఉండగా అతను ఆయనను కలుసుకుంటాడు" [65]. [65] ఇమామ్ జహబీ గారి అల్ కబాయిర్ (సంపుటము: 20).
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు విడిచిపెట్టే వారితో పోరాడమని ఆదేశించబడ్డారు, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "జనులతో వారు‘అల్లాహ్ తప్ప మరొక వాస్తవ ఆరాధ్యుడు లేడు,మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ అల్లాహ్ తరుపు నుండి పంపబడిన ప్రవక్త’అని సాక్ష్యమిచ్చి నమాజులు పాటిస్తూ జకాతులు చెల్లించనంత వరకు”నాకు వారితో పోరాడమని యుద్ధం చేయమని ఆదేశమివ్వబడింది,ఒకవేళ వారు అలా చేసినట్లైతే నా నుండి వారి ప్రాణాలను,సంపదను ఇస్లాం వలన రక్షించుకుంటారు మరియు వారు అల్లాహ్ వద్ద జవాబుదారులుగా ఉంటారు" [66]. [66] ఈ హదీసును బుఖారీ హదీథు సంఖ్య (25) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (22) లో ఉల్లేఖించారు.
- దైవప్రవక్త ﷺ తెలియజేసిన కాంతిని కోల్పోవడం; ఆయన ఇలా సెలవిచ్చారు: ‘నమాజు (నూర్) కాంతి’ [67]. [67] ఈ హదీసును ముస్లిం హదీథు సంఖ్య (223) లో ఉల్లేఖించారు.
- నమాజును వదిలివేయడం ముస్లిం సమాజంలో అశ్లీలతను మరియు దుష్ట కార్యాలను వ్యాపింపజేస్తుంది; ఎందుకంటే ముస్లింలు నమాజును కాపాడుకోవడం వారిని మరియు సమాజాన్ని అశ్లీలత మరియు దుష్ట కార్యాల నుండి రక్షిస్తుంది, అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ﴾..నమాజ్ ను స్థాపించు. నిశ్చయంగా, నమాజ్ అసహ్యకరమైన పనుల నుండి మరియు అధర్మమైన పనుల నుండి నిషేధిస్తుంది...﴿ [అల్-అన్'కబూత్: 45]
రక్షణ:
నమాజును వదిలివేయుట అనే మహా పాపములో పడిపోకుండా కాపాడుకొనే మార్గాలు:
- ఇస్లాంలో నమాజు యొక్క గొప్ప స్థానమును తెలుసుకోవడం, మరియు దానిని పవిత్ర ఖుర్ఆన్ మరియు పవిత్రమైన సున్నత్ నుండి నేర్చుకోవడం.
- దైవప్రవక్త ﷺ నమాజు చేసే విధానాన్ని నేర్చుకోవడం; మాలిక్ బిన్ హువైరిస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "మీరు నన్ను ఏవిధంగా నమాజ్ పాటిస్తుండగ చూశారో ఆవిధంగా నమాజ్ పాటించండి" [67]. [67] ఈ హదీసును బుఖారీ హదీథు సంఖ్య (631) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (674) లో ఉల్లేఖించారు.
- ఫర్జ్ నమాజులను మస్జిదులో ముస్లింల జమాఅత్ తో పాటు ఆచరించడంను పరిరక్షించటం, మరియు ముస్లిం మసమయానికి నమాజు చేయకుండా తన దృష్టి మరల్చడానికి దేనినీ అనుమతించకూడదు.మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఓ విశ్వాసులారా! మీ సంపదలు, మీ సంతానం మిమ్మల్ని అల్లాహ్ స్మరణ నుండి నిర్లక్ష్యంలో పడవేయరాదు సుమా! ఎవరైతే ఇలా నిర్లక్ష్యంలో పడతారో అలాంటి వారే నష్టపడేవారు.9﴿ [మునాఫిఖూన్: 9] ఇబ్నె హజర్ అల్-హైతమీ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు: "కొంతమంది వ్యాఖ్యాతలు ఇలా అన్నారు: ఇక్కడ అల్లాహ్ స్మరణ అంటే ఐదు పూటల నమాజులు, కాబట్టి ఎవరైతే తన అమ్మకం లేదా తన వృత్తి వంటి తన సంపదతో లేదా తన సంతానంతో నిమగ్నమై దాని సమయంలో నమాజును విస్మరిస్తాడో, అతను నష్టపోయేవారిలో చేరిపోతాడు" [68]. [68] అజ్జవాజిరు అనిఖ్తిరాఫిల్ కబాయిరి (1/220).
- చెడు స్నేహితులకు మరియు నమాజులను వృధా చేసే ఆవిధేయులకు దూరంగా ఉండాలి.
- చిన్నతనం నుండే పిల్లలకు నమాజు అలవాటు చేయడం, అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ బిన్ ఆస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “మీ సంతానం ఏడు సంవత్సరాల వయసులో ఉన్నపుడు సలాహ్ (నమాజు) ఆచరించమని ఆదేశించండి; పది సంవత్సరాల వయసులో (నమాజు ఆచరించకపోతే) వారిని దండించండి.” [69] [69] ఈ హదీసును అబూ దావుద్, హదీథు సంఖ్య (495) లో ఉల్లేఖించారు.
- నఫిల్ నమాజులను అధికంగా చేయడం; ఎందుకంటే అవి ఫర్జ్ (విధి) నమాజులలో ఉన్న లోటుపాట్లను భర్తీ చేస్తాయి. అబూ హురైరా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవివ్వగా విన్నాను: నిశ్చయంగా ప్రళయదినాన దాసుని ఆచరణల్లో మొట్టమొదటగా లెక్కతీసుకోబడేది నమాజ్ గురించే. ఒకవేళ అది సరిగా ఉంటే అతడు సాఫల్యం చెందుతాడు మరియు బ్రతికి బయటపడుతాడు. ఒకవేళ అది చెడితే అతడు నిజంగా విఫలుడై నష్టపోయినవాడవుతాడు. ఒకవేళ అతని ఫర్జ్ నమాజుల్లో ఏదయినా వెలితి ఉంటే, అప్పుడు అల్లాహ్, “నా దాసుని కర్మపత్రంలో నఫిల్ నమాజులేవైనా ఉన్నాయేమో చూడండి. వాటి ద్వారా ఫర్జ్ నమాజుల వెలితిని పూరించవచ్చు” అని అంటాడు. తర్వాత అతని ఆచరణలన్నిటిని అలాగే లెక్కతీసుకోవటం జరుగుతుంది. [70] [70] ఈ హదీసును తిర్మిథీ, హదీథు సంఖ్య (413) లో ఉల్లేఖించారు.
- నమాజును నెరవేర్చినప్పుడు లభించే గొప్ప ప్రతిఫలాన్ని తెలుసుకోవడం; ఎందుకంటే అది అల్లాహ్కు విధేయత చూపుతూ ఒక ముస్లిం చేసే అత్యంత ప్రియమైన కార్యం. అంతేకాకుండా, దాని ద్వారానే దాసుడు తన సృష్టికర్తతో అనుసంధానమై, ఆయనను వేడుకుంటాడు మరియు ఆయన సహాయాన్ని అర్థిస్తాడు.
- నమాజును దాని ప్రారంభ సమయములోనే ఆచరించడానికి ఆసక్తి చూపాలి మరియు దాని ఆవశ్యకత పట్ల జాగరూకతతో ఉండాలి. ఇందుకోసం అలారం పెట్టుకోవడం, లేదా స్నేహితుడిని గుర్తు చేయమని కోరడం, లేదా నమాజు సమయాలను ఖచ్చితంగా తెలియజేసే దానిని అనుసరించడం వంటి సహాయపడే సాధనాలను ఉపయోగించుకోవచ్చు.
జకాతు చెల్లించకపోవడం
జకాత్ ఇస్లాం యొక్క మూలస్థంభాలలో ఒకటి, మరియు అది ధనవంతుల నుండి తీసుకొని పేదలకు ఇవ్వబడే విధి దానం. దానిని ఇవ్వకపోవడం మహా పాపాలలో ఒకటి, దానిని చేసే వారిలో విశ్వాసం (ఈమాన్) లేదని అల్లాహ్ స్పష్టం చేశాడు. మరియు ఇహలోకంలో వినాశనం, పరలోకంలో దురదృష్టం మరియు నష్టంతో కూడిన తీవ్రమైన శిక్షలు ఈ జీవితంలో మరియు మరణానంతరం ఉంటాయని వారిని తీవ్రంగా హెచ్చరించాడు. జకాతు చెల్లించకుండా నిలిపి ఉంచుకోవడం అనేది, దాని విషయంలో పిసినారితనం చేసే వ్యక్తికీ, ఇంకా అతని ఈ చెడు పనిని సమర్థించి, దానిని ఖండించకుండా ఉండే సమాజానికీ కూడా ఒక అరిష్టం.
మరియు జకాత్ విధి అని తిరస్కరిస్తూ దానిని చెల్లించనివాడు అవిశ్వాసానికి పాల్పడి ఇస్లాం ధర్మం నుండి బహిష్కరించబడ్డాడనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి విరుద్ధంగా, పిసినారితనంతో మరియు లోభంతో దానిని చెల్లించనివాడి పాపం చాలా పెద్దది మరియు తీవ్రమైనది; ఎందుకంటే, దానిని చెల్లించకపోవడం గొప్ప పాపాలలో ఒకటి అని, మరియు దానిపై మహోన్నతుడైన అల్లాహ్ ఇహలోక మరియు పరలోక శిక్షలను నిర్ధారించాడని తెలిపే ఖుర్ఆన్ ఆయతులు మరియు హదీసులు ఉన్నాయి.
ఆధారాలు:
ఖుర్ఆన్ మరియు హదీథులలో జకాతు చెల్లించని వారిని హెచ్చరిస్తూ అనేక ఆధారాలు వచ్చాయి, వాటిలో:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ﴾మరియు ఎవరైతే వెండి, బంగారాన్ని కూడ బెట్టి, దానిని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టరో వారికి బాధారకమైన శిక్ష గలదనే వార్తను వినిపించు.34 ఆ దినమున దానిని (జకాత్ ఇవ్వని ధనాన్ని /ఆ వెండి బంగారాన్ని) నరకాగ్నిలో కాల్చి దానితో వారి నుదురుల మీద, ప్రక్కల మీద మరియు వీపుల మీద వాతలు వేయబడతాయి. (అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): "ఇదంతా మీరు మీ కొరకు కూడ బెట్టుకున్నదే. కావున మీరు కూడ బెట్టుకున్న దానిని చవి చూడండి." 35﴿ [తౌబా: 34-35]
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "అల్లాహ్ ఎవరికైతే సంపదను ప్రసాదించి, వారు దాని జకాత్ను చెల్లించరో, ప్రళయ దినమున వారి సంపద రెండు బొడిపెలు కలిగిన బట్టతల పాముగా మార్చబడి, వారి మెడ చుట్టూ చుట్టుకుంటుంది. ఆ తరువాత అది వారి దవడలను పట్టుకొని ఇలా చెబుతుంది: 'నేనే నీ సంపదను, నేనే నీ నిధిని'}, ఆ తరువాత ఆయన పఠించారు: ﴾ అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రసాదించిన దానిలో లోభం వహించే వారు, తమకది (లోభమే) మేలైనదని భావించ రాదు, వాస్తవానికి అది వారి కొరకు ఎంతో హానికరమైనది. వారు తమ లోభత్వంతో కూడబెట్టినదంతా, తీర్పు దినమున వారి మెడల చుట్టు కట్టబడుతుంది. మరియు భూమ్యాకాశాల వారసత్వం అల్లాహ్ కే చెందుతుంది. మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్ ఎరుగును"180﴿ [71]. [ఆలె ఇమ్రాన్: 180] [71] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (1403) లో ఉల్లేఖించారు.
అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: «బంగారము మరియు వెండి కలిగి ఉన్న సొంతదారుడు ఎవరైనా వాటి హక్కును (జకాతును) చెల్లించనట్లయితే, తీర్పు దినమున అవి పలకలుగా మార్చబడి నరకాగ్నిలో బాగా కాల్చబడతాయి; వాటితో అతని పక్కలపై, నుదుటిపై, వీపుపై వాతలు పెట్టడం జరుగుతుంది. అవి చల్లారితే వాటిని తిరిగి ఎర్రగా కాల్చడం జరుగుతుంది. ఒక దినము యాభైవేల సంవత్సరాలంత సుదీర్ఘంగా ఉంటుంది. ఆ శిక్ష అల్లాహ్ తన దాసుల మధ్య తీర్పు చేసేటంత వరకూ కొనసాగుతూ ఉంటుంది. తరువాత అతడు అతని గమ్యస్థానమైన స్వర్గం వైపునకో లేక నరకం వైపునకో మార్గం చూసుకుంటాడు (చూపడం జరుగుతుంది).» [72] [72] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (987) లో ఉల్లేఖించారు.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానంతరం జకాతును నిరాకరించిన వారి పట్ల అబూ బకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు యొక్క ప్రవర్తన ఇదిగో. ఆయన వారితో, వారు పశ్చాత్తాపపడి తమ సంపద యొక్క జకాతును చెల్లించే వరకు పోరాడారు. ఈ విషయంలో హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానంతరం, హజ్రత్ అబూబక్ర్ ఖలీఫా అయ్యారు, మరియు అరబ్బులలో కొందరు ధర్మ తిరస్కారానికి పాల్పడ్డారు. అప్పుడు హజ్రత్ ఉమర్ అన్నారు: ఓ అబూబక్ర్! మీరు ప్రజలతో ఎలా యుద్ధం చేస్తారు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు కదా: “ప్రజలు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అని పలికేంత వరకు వారితో యుద్ధం చేయమని నాకు ఆదేశమయింది. కనుక ఎవరయితే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అని పలుకుతారో, వారు తమ ధనప్రాణాలను నా నుండి కాపాడుకుంటారు, కాకపోతే దానిపై ఉన్న ధర్మహక్కు ప్రకారం తప్ప. వారి లెక్క అల్లాహ్ వద్ద ఉంటుంది?” దానికి అబూబక్ర్ అన్నారు: అల్లాహ్ సాక్షిగా! నమాజ్-జకాత్ల మధ్య భేదం చూపే వారితో నేను తప్పకుండా యుద్ధం చేస్తాను. నిశ్చయంగా జకాత్ సంపద యొక్క హక్కు. అల్లాహ్ సాక్షి! ఒకవేళ వారు గనక దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇస్తూ వచ్చిన ఒక మేక పిల్లను (సంవత్సరం నిండని ఆడ మేక పిల్లను) అయినా సరే, ఇవ్వటానికి నిరాకరిస్తే, దానిని నిరాకరించినందుకు నేను వారితో తప్పకుండా పోరాడతాను. అప్పుడు హజ్రత్ ఉమర్ అన్నారు: అల్లాహ్ సాక్షి! యుద్ధం కోసం అల్లాహ్ అబూబక్ర్ హృదయ కవాటాలను తెరిచాడని నేను గ్రహించాను, అప్పుడు ఆయనదే సత్యమని నేను తెలుసుకున్నాను [73]. [73] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (1399) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (20) లో ఉల్లేఖించారు.
నష్టాలు:
జకాతు చెల్లించకపోవడంలోని నష్టాల నుండి:
- జకాతును నిరోధించడం ముష్రికుల లక్షణాలలో ఒకటి, కావున జకాతును నిరోధించేవాడు వారిని అనుకరించినవాడు, మరియు ఎవరైతే ఇతర జాతులను అనుకరిస్తారో నిస్సందేహంగా వారు అందులో ఒకరవుతారు; అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾...మరియు విధిదానం (జకాత్) ఇవ్వని ముష్రికులకు శాపము...﴿ [ఫుస్సిలత్: 6 - 7]
- జకాత్ విషయంలో పిసినారితనం కపటత్వము యొక్క లక్షణాలలో మరియు దాని కారణాలలో ఒకటి. కపట విశ్వాసులను వర్ణిస్తూ మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు అయిష్టంతో (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టడమే!54﴿ [తౌబా: 54]
- వర్షం నిలిపివేయబడే పరీక్షకు గురికావడం: అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: «...ఎప్పుడైతే వారు తమ సంపద యొక్క జకాత్ను ఇవ్వకుండా నిలిపివేస్తారో, అప్పుడు ఆకాశం నుండి వర్షం కూడా వారి కొరకు నిలిపివేయబడుతుంది, మరియు పశువులు గనక లేకపోతే, వారిపై వర్షం కురిసేది కాదు» [74]. [74] ఈ హదీసును ఇబ్నె మాజహ్, హదీథు సంఖ్య (4019) లో ఉల్లేఖించారు.
– అది వివిధ రకాల నాశనకారణాలు మరియు ధ్వంసానికి దారితీసే కారణాల ద్వారా. సంపద నశించడానికి, పూర్తిగా చెరిగిపోవడానికి దారితీస్తుంది.
– జకాత్ను ఆపివేయడం వల్ల పేదలూ ధనవంతుల మధ్య సమాజంలో ద్వేషం మరియు శత్రుత్వం వ్యాపించడానికి దారితీస్తుంది.
రక్షణ:
ఈ మహా పాపంలో పడిపోకుండా ఉండేందుకు తీసుకోవలసిన నివారణ మార్గాలు:
- ధనము అల్లాహ్ ధనమని, మరియు అనుగ్రహము అల్లాహ్ చేతిలో ఉన్నదని, ఆయన తాను తలచుకున్న వారికి దానిని ప్రసాదిస్తాడని ముస్లిం తెలుసుకోవాలి. మహోన్నతుడైన అల్లాహ్ యే దానిని ప్రసాదించినవాడు మరియు ఆయన ప్రసాదించినదంతా ఆయనదే. ఆయనే ఆ విధిని దాని అవసరమున్న అర్హులకు చెల్లించమని ఆదేశించినవాడు. నీవు ఆ ధనముపై కేవలం ఒక అధికారివి (ఖలీఫావు) మాత్రమే. కావున, మహోన్నతుడైన అల్లాహ్ తలచుకుంటే నీకు ప్రసాదిస్తాడు, మరియు ఆయన తలచుకుంటే నివారిస్తాడు.
- దానిని చెల్లించేవాడు దాని చెల్లింపు యొక్క ఘనతను, మరియు దానిని నిరాకరించడం యొక్క శిక్షను గుర్తుంచుకోవాలి, అతను నిశ్చయంగా అల్లాహ్ దానికి బదులుగా అతనికి ప్రసాదిస్తాడని, ఆయనే ఉత్తమ ఉపాధి ప్రధాత అని, మరియు ఆయన దానిని అతని కొరకు పెంచి, అది పుణ్యాల ఉహద్ పర్వతంలా అయ్యేంత వరకు వృద్ధి చేస్తాడని తెలుసుకున్నప్పుడు, మరియు దానిని నిర్వర్తించే వానికి, అతనికి ఈ ప్రపంచంలో ఎలాంటి భయం ఉండదని, పరలోకంలో అతను దుఃఖించడని అల్లాహ్ శుభవార్త ఇవ్వడంతో, అతను దాని వైపు పరుగెత్తుతాడు మరియు సత్కార్యాల కోసం పోటీపడతాడు. మరియు దానిని అడ్డుకునే వాని శిక్ష గురించి తెలుసుకున్నప్పుడు, అతను అల్లాహ్ యొక్క ఇహపరలోకాల శిక్షకు భయపడి, ఆయన ప్రతిఫలమును ఆశిస్తూ మరియు ఆయన శిక్షకు భయపడుతూ అల్లాహ్ ఆదేశమును పాటిస్తాడు.
- పిసినారితనం నుండి మహోన్నతుడైన అల్లాహ్ శరణు వేడుకోవాలి, నిశ్చయంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని నుండి శరణు వేడుకోమని ఆదేశించేవారు. ముస్అబ్ బిన్ సాద్ ఉల్లేఖించారు: హజ్రత్ సాద్ బిన్ అబూ వఖాస్ రజియల్లాహు అన్హు ఐదు విషయములను ఆదేశించేవారు, మరియు వాటిని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఆదేశించేవారని ఉల్లేఖించేవారు: "ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను పిసినారితనం నుండి నీతో శరణం వేడుకుంటున్నాను. మరియు పిరికితనం నుండి నీతో శరణం వేడుకుంటున్నాను. మరియు నేను నిష్ప్రయోజనమైన వయస్సుకు మరలించబడటం నుండి నీతో శరణు వేడుకుంటున్నాను. మరియు ఇహలోక పరీక్ష నుండి, సమాధి శిక్ష నుండి నీతో శరణు వేడుకుంటున్నాను". [75] [75] ఈ హదీసును బుఖారీ ఉల్లేఖించారు,, హదీథు సంఖ్య (6365)
వ్యభిచారం (జినా).
వ్యభిచారం ధర్మం మరియు నైతిక విలువల భ్రష్టత్వాన్ని సూచించే ఒక ఘోరమైన మహాపాపం, మరియు దాని హాని ప్రజలను మరియు సమాజాలను బలహీనత, నాశనం మరియు వినాశనానికి గురిచేస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, వ్యభిచారం అధికమవడం మరియు వ్యాప్తి చెందడం ప్రళయ దినపు సూచనలలో ఒకటి; అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: «ప్రళయదినపు సంకేతాలలో – జ్ఞానము (భూమి నుండి) లేపుకోబడుతుంది, అజ్ఞానము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది,మద్యం సేవించడం సర్వసాధారణం అవుతుంది, వ్యభిచారము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది» [76]. [76] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (80) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (2671) లో ఉల్లేఖించారు.
ఆధారాలు:
జినా నిషేధించబడిందని, అలాగే దాని అసహ్యకరతను మరియు దాని ఘోరమైన నేర స్వభావాన్ని వివరించే ఆధారాలు అనేకం ఉన్నాయి; వాటిలో కొన్ని ఇవి:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు వ్యభిచారాన్ని సమీపించకండి. అది నిశ్చయంగా, అశ్లీలమైనది మరియు బహు చెడ్డ మార్గము.32﴿ [అల్ ఇస్రా: 32]
పరిశుద్ధుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾వ్యభిచారిణి మరియు వ్యభిచారుడు, ఈ ఇద్దరిలో ప్రతి ఒక్కరికి నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి. మరియు మీకు అల్లాహ్ యందు మరియు అంతిమ దినమునందు విశ్వాసముంటే - అల్లాహ్ విధించిన ధర్మవిషయంలో - వారిద్దరి యెడల మీకు జాలి కలుగకూడదు. మరియు వారిద్దరి శిక్షను, విశ్వాసులలో కొందరు చూడాలి.2﴿ [నూర్: 2]
మరియు శుభకరుడు,మహోన్నతుడు ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు ఎవరైతే, అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను ఆరాధించరో! మరియు అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడ న్యాయానికి తప్ప చంపరో! మరియు వ్యభిచారానికి పాల్పబడరో. మరియు ఈ విధంగా చేసేవాడు (అవిధేయుడిగా ప్రవర్తించేవాడు) దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు.68 పునరుత్థాన దినం నాడు, అతనికి రెట్టింపు శిక్ష పడుతుంది మరియు అతడు అందులోనే అవమానంతో శాశ్వతంగా పడి ఉంటాడు 69. కాని, ఇక ఎవరైతే (తాము చేసిన పాపాలకు) పశ్చాత్తాప పడి, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చుతాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రధాత.70﴿ [అల్ ఫుర్ఖాన్: 68-70]
అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: "ఒక వ్యభిచారి వ్యభిచరించేటప్పుడు విశ్వాసి కాజాలడు" [77]. [77] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (2475); ముస్లిం, హదీథు సంఖ్య (100) లో ఉల్లేఖించారు.
మరియు అబ్దుల్లాహ్ ఇబ్నె మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “అల్లాహ్ వద్ద అన్నింటికన్నా ఘోరమైన పాపము ఏది?”; దానికి ఆయన “అల్లాహ్’యే నిన్ను సృష్టించినప్పటికీ, అల్లాహ్ కు సాటిగా నీవు మరొకరిని తీసుకు రావడం, ” అన్నారు. దానిని నేను “నిశ్చయంగా అది ఘోరమైనదే” అన్నాను. తరువాత అడిగాను: “(దాని) తరువాత ఏది?”; దానికి ఆయన “(నీవు తినే దానిలో) నీతో పాటు తింటాడు అనే భయంతో నీ బిడ్డను నీవు చంపడం” అన్నారు; నేను మళ్ళి అడిగాను: “దాని తరువాత ఏది?” అని. దానికి ఆయన “నీ పొరుగు వాని భార్యతో నీవు వ్యభిచరించడం” అన్నారు [78]. [78] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (4477); ముస్లిం, హదీథు సంఖ్య (86) లో ఉల్లేఖించారు.
మరియు ఉబాదహ్ బిన్ సామిత్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: «నా తో నేర్చుకోండి, నా తో నేర్చుకోండి, ఒక అవివాహితుడు మరొక అవివాహితతో వ్యభిచరిస్తే వంద కొరడాలు జులిపించాలి, మరియు ఒక సంవత్సరం పాటు నగరం నుండి బహిష్కరించబడాలి, మరియు వివాహితుడు వివాహితురాలైన స్త్రీతో వ్యభిచారం చేస్తే,వంద కొరడా దెబ్బలు మరియు రాళ్ళతో రజం చేయబడతాడు» [79]. [79] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (1690) లో ఉల్లేఖించారు.
వ్యభిచారము అంతా హరాము మరియు అది ఘోరమైన పాపాలలో ఒకటి, అయితే కొన్ని రకాల వ్యభిచారం ఇతర వాటి కంటే అల్లాహ్ కు తీవ్ర ఆగ్రహాన్ని, అసహ్యాన్ని కలిగిస్తాయి. వ్యభిచారంలోని అత్యంత తీవ్రమైన మరియు అల్లాహ్ కు అత్యంత అసహ్యకరమైన రకాలలో కొన్ని:
– మహరిములతో వ్యభిచరించటం: బరా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: «నేను మా పినతండ్రిని కలిశాను, ఆయనతో పాటు ఒక జెండా ఉంది. నేను ఆయనను, 'మీరు ఎక్కడికి వెళ్తున్నారు?' అని అడిగాను. ఆయన ఇలా అన్నారు: 'దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఒక వ్యక్తి వద్దకు పంపారు. అతను తన తండ్రి భార్యను (సవతి తల్లిని) వివాహం చేసుకున్నాడు. అతని శిరచ్ఛేదం చేయమని మరియు అతని ఆస్తిని స్వాధీనం చేసుకోమని (ప్రవక్త) నన్ను ఆజ్ఞాపించారు'» [80]. [80] ఈ హదీసును అబూ దావుద్, హదీథు సంఖ్య (4457) లో ఉల్లేఖించారు.
- పొరుగువారి భార్యతో వ్యభిచారం: మిఖ్దాద్ బిన్ అల్-అస్వద్ రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలను వ్యభిచారం గురించి అడిగారు. వారు, "అది హరామ్, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త దానిని నిషేధించారు" అని బదులిచ్చారు. అప్పుడు ఆయన ఇలా ప్రవచించారు: «ఒక వ్యక్తి పది మంది స్త్రీలతో వ్యభిచరించడం, తన పొరుగువాని భార్యతో వ్యభిచరించడం కంటే అతనికి తేలికైనది» [81]. [81] ఈ హదీసును బుఖారీ అదబుల్ ముఫ్రద్ హదీసు నెంబరు (103) లో ఉల్లేఖించారు.
- ముజాహిదుల స్త్రీలతో వ్యభిచారం: సులైమాన్ బిన్ బురైద తన తండ్రి రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: «దైవపోరాటం కొరకు వెళ్ళిన మహిళల పవిత్రత మరియు గౌరవ రక్షణ, వెనుకుండిపోయినవారిపై తమ తల్లుల పవిత్రత మరియు గౌరవ రక్షణ వలె విధిగా ఉంది. వెనుకుండిపోయినవారిలో ఏ వ్యక్తి అయినా ఒక ముజాహిద్ కుటుంబానికి సంరక్షకుడిగా ఉండి, వారి పట్ల ద్రోహానికి పాల్పడితే, ప్రళయదినాన అతడిని ఆ ముజాహిద్ ముందు నిలబెట్టడం జరుగుతుంది, అప్పుడు అతను అతని సత్కర్మల నుండి తాను కోరుకున్నంత తీసుకుంటాడు. మరి మీ అభిప్రాయం ఏమిటి?» [82]. [82] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (1897) లో ఉల్లేఖించారు.
- వృద్ధుల వ్యభిచారం: అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ప్రళయదినాన అల్లాహ్ ముగ్గురు వ్యక్తుల్ని పలకరించడు, వారిని ప్రక్షాళనం చేయడు, అసలు వారివైపు చూడనయినా చూడడు, మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది: వృద్ధ వ్యభిచారి, అబద్ధం చెప్పే రాజు, అహంకారపడే పేదవాడు.” [83] [83] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (172) లో ఉల్లేఖించారు
నష్టాలు:
జినా వల్ల చాలా నష్టాలు ఉన్నాయి, వాటిలో కొన్ని:
- దాసుడు వ్యభిచారానికి పాల్పడుతున్న స్థితిలో అతని నుండి విశ్వాసం తొలగిపోతుంది, అతను పశ్చాత్తాప పడినప్పుడు, విశ్వాసం అతని వద్దకు తిరిగి వస్తుంది. అబూ హురైర రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: “మనిషి వ్యభిచరించినప్పుడు, అతని నుండి విశ్వాసము వెళ్ళిపోయి, అతనిపై ఒక మేఘం వలె ఉంటుంది. అతను ఆ పాపం నుండి విరమించుకున్నప్పుడు, విశ్వాసము అతని వైపుకు తిరిగి వస్తుంది.” [84] [84] ఈ హదీసును అబూ దావుద్, హదీథు సంఖ్య (4690) లో ఉల్లేఖించారు.
- వ్యభిచారం అల్లాహ్ ఆగ్రహమునకు, ఆయన అసహ్యమునకు మరియు ఆయన శిక్షకు కారణం అవుతుంది.
- దీనికి ఈ లోకంలో ధర్మబద్ధమైన శిక్ష తప్పనిసరి: వివాహితుడైతే మరణించే వరకు రాళ్ళతో కొట్టి చంపడం, లేదా బ్రహ్మచారి అయితే వంద కొరడా దెబ్బలు కొట్టడం.
- వ్యభిచారం వంశావళులు కలగలిసిపోవడానికి దారితీస్తుంది; ఫలితంగా కుటుంబాలు చెదిరిపోతాయి, వారి మధ్య పరాయితనం ఏర్పడుతుంది, సమాజం కూలిపోతుంది.
- పూర్వ యుగాలలో లేని వ్యాధులు పుట్టుకురావడం, ఉదాహరణకు ఎయిడ్స్ వ్యాధి.
- వ్యభిచారం లజ్జను, విశ్వసనీయతను పోగొడుతుంది.
రక్షణ:
వ్యభిచారం అనే నేరంలో పడిపోకుండా ఉండేందుకు నివారణ మార్గాలు:
- వ్యభిచారం నుండి కాపాడే అత్యంత శక్తివంతమైన మార్గాలలో వివాహం ఒకటి. ఎవరికైతే వివాహం చేసుకునే స్థోమత ఉండదో, వారు ఉపవాసాలు పాటించాలి; అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు, ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నుండి ఉల్లేఖించారు, ఆయన ఇలా అన్నారు: “మీలో వివాహం చేసుకోగల స్థోమత కలిగిన వారు వివాహం చేసుకోవాలి. ఎందుకంటే (ఇది ఇతర మహిళలను చూడకుండా) చూపులను నిగ్రహిస్తుంది, మరియు (చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలలో పడకుండా) మర్మాంగాలను రక్షిస్తుంది. మరియు ఎవరైనా అలా చేయలేకపోతే (వివాహం చేసుకునే స్థోమత లేకపోయినట్లైతే), అతడు ఉపవాసం ఉండాలి, ఎందుకంటే అది అతనికి రక్షణగా ఉంటుంది.” [85]. [85] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (1905) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1400) లో ఉల్లేఖించారు.
- శరీరంలోని అంగాలను సంరక్షించుకోవడం, మరియు చూపును క్రిందికి దించుకోవడం, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾విశ్వసించిన పురుషులతో, వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. ఇది వారికి ఎంతో శ్రేష్ఠమైనది. నిశ్చయంగా, అల్లాహ్ వారి చేష్టలను బాగా ఎరుగును.30 మరియు విశ్వసించిన స్త్రీలతో కూడా వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు...31﴿ [అన్-నూర్: 30-31] అబూ హురైర రజియల్లాహు అన్హు మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ద్వారా ఉల్లేఖిస్తున్నారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: "నిశ్చయంగా అల్లాహ్ ఆదం పుత్రునిపై అతని వ్యభిచారపు భాగాన్ని వ్రాసాడు. అతను ఎలాగైనా దాన్ని పొంది తీరుతాడు. కళ్ళ వ్యభిచారం చూడటం, నాలుక వ్యభిచారం మాట్లాడటం, మనసు వాంఛిస్తుంది, కోరుకుంటుంది. మర్మాంగము దానిని దృవీకరిస్తుంది లేదా తిరస్కరిస్తుంది." [86] [86] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (6612) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (2657) లో ఉల్లేఖించారు.
- అపరిచిత స్త్రీతో ఏకాంతంగా ఉండరాదు; ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఇలా ఉల్లేఖించారు: నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పగా విన్నాను: «పురుషుడు మహ్రమ్ లేకుండా పరస్త్రీతో ఏకాంతంగా ఉండరాదు.» [87]. [87] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (3006) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1341) లో ఉల్లేఖించారు.
- ముస్లిం మహిళ, సూరహ్ నూర్ మరియు అహ్జాబ్లో అల్లాహ్ ఆదేశించిన పరదా (హిజాబ్)కు కట్టుబడి ఉండటం, మరియు షరిఅత్ వారింపు చేసిన అలంకరణను ప్రదర్శించటం నుండి దూరంగా ఉండటం.
- అశ్లీల వెబ్సైట్లలోకి ప్రవేశించకూడదు, లేదా చెడు స్నేహితులైన పురుషులు మరియు స్త్రీలతో సంబంధాలు పెట్టుకోకూడదు.
- దాని మూడు షరతులతో తౌబాను ప్రోత్సహించడం (వ్యభిచారాన్ని విడిచిపెట్టడం - సిగ్గుపడటం - దానికి తిరిగి పాల్పడనని దృఢంగా నిశ్చయించుకోవడం), అనంత కరుణామయుని దాసుల వర్ణనలో మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾...మరియు వ్యభిచారానికి పాల్పబడరో. మరియు ఈ విధంగా చేసేవాడు (అవిధేయుడిగా ప్రవర్తించేవాడు) దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు.68 పునరుత్థాన దినం నాడు, అతనికి రెట్టింపు శిక్ష పడుతుంది మరియు అతడు అందులోనే అవమానంతో శాశ్వతంగా పడి ఉంటాడు 69. కాని, ఇక ఎవరైతే (తాము చేసిన పాపాలకు) పశ్చాత్తాప పడి, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చుతాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రధాత.70﴿ [అల్ ఫుర్ఖాన్: 68-70]
దొంగతనం.
దొంగతనం, మనిషి యొక్క విశ్వసనీయతకు మరియు ధర్మానికి భంగం కలిగించే మహా పాపాలలో ఒకటి. మహోన్నతుడైన అల్లాహ్, దాని షరతులు నెరవేరినప్పుడు చెయ్యి నరకడమనే హద్ద్ (శిక్ష)ను దీనికి విధిగావించాడు. మరియు ఈ మహా పాపానికి పాల్పడినప్పుడు అతని నుండి ఈమాన్ (విశ్వాసం)ను తొలగించి, అతనిపై శాపాన్ని విధిగావించాడు.
దొంగతనానికి సంబంధించిన ఇతర రకాలు కూడా ఉన్నాయి, వాటిపై తీర్పు భిన్నంగా ఉన్నప్పటికీ. వాటిలో అపహరణ, దోపిడీ, మరియు జేబుదొంగతనం ఉన్నాయి. ఈ నీచమైన పనులలో ప్రతి ఒక్కదానికి దాని ప్రత్యేక తీర్పు మరియు శిక్ష ఉంది.
ఆధారాలు:
దొంగతనం యొక్క నిషేధం మరియు దాని ఘోరత్వం మరియు దాని నేరం యొక్క తీవ్రతను గూర్చిన ఆధారాలు చాలా ఉన్నాయి, వాటిలో కొన్ని:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు పురుషుడు దొంగ అయినా, లేదా స్త్రీ దొంగ అయినా, వారి చేతులను నరికి వేయండి. ఇది వారి కర్మలకు గుణపాఠంగా అల్లాహ్ నిర్ణయించిన ప్రతిఫలం (శిక్ష). మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.38﴿ [అల్ మాయిదా: 38]
ఇమామ్ ఇబ్నె షిహాబ్ అజ్-జుహ్రీ రహిమహుల్లాహ్ ఇలా తెలిపారు: ప్రజల సొమ్మును దొంగిలించినందుకు అల్లాహ్ చెయ్యి నరకడమనే గుణపాఠ శిక్షను విధించాడు. మరియు అల్లాహ్ దొంగ నుండి తన ప్రతీకారం తీర్చుకోవడంలో సర్వాధిక్యుడు, అతని చెయ్యి నరకాలని శాసించడంలో వివేకవంతుడు. [88] [88] జహబి గారి కబాయిర్ (పేజీ: 97)
అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: «వ్యభిచారం చేసే వాడు వ్యభిచారం చేస్తున్న సమయంలో విశ్వాసి (ముమిన్)గా ఉండడు; అలాగే దొంగతనం చేసే వాడు దొంగతనం చేస్తున్న సమయంలో విశ్వాసి (ముమిన్)గా ఉండడు» [89]. [89] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (2475) ముస్లిం, హదీథు సంఖ్య (75) లో ఉల్లేఖించారు.
అబూ హురైర రజియల్లాహు అన్హు మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ద్వారా ఉల్లేఖిస్తున్నారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: «అల్లాహ్ దొంగను శపించాడు’అతను గృడ్డును దొంగిలిస్తాడు బదులుగా చెయ్యి ఖండించబడుతుంది,ఒక త్రాడును దొంగిలిస్తాడు తద్వారా అతని చెయ్యి ఖండించబడుతుంది» [90]. [90] ఈ హదీసును బుఖారీ హదీథు సంఖ్య (6810)లో ముస్లిం, హదీథు సంఖ్య (1687)లో ఉల్లేఖించారు.
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: «దీనార్ లో కనీసం నాలుగవ వంతు లేదా అంతకంటే ఎక్కువ విలువైనదాన్ని దొంగతనం చేసిన వారి చేయి నరకాలి.»[91]. [91] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (6789); ముస్లిం, హదీథు సంఖ్య (1684) లో ఉల్లేఖించారు.
హజ్రత్ ఉర్వా బిన్ జుబైర్ రజియల్లాహు అన్హు కథనం: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో మక్కా విజయం సందర్భంగా ఒక స్త్రీ దొంగతనం చేసింది. దాంతో ఆమె జాతివారు ఆందోళన చెంది, సిఫారసు చేయించటానికి ఉసామా బిన్ జైద్ వద్దకు వెళ్ళారు. ఉర్వా రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు: ఉసామా ఆమె విషయం గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడగానే, ఆయన మొహం రంగు మారిపోయింది. అప్పుడాయన ఇలా అన్నారు: ఏమిటి, అల్లాహ్ నిర్ణయించిన శిక్షలలో ఒకదాని గురించి నాతో మాట్లాడుతున్నావా?" దానికి ఉసామా, "దైవప్రవక్తా! నా క్షమాపణ కోసం ప్రార్థించండి" అని అన్నారు. సాయంకాలం కాగానే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగించడానికి లేచి నిలబడ్డారు. ఆయన అల్లాహ్’కు తగిన ప్రశంసలు పలికిన తర్వాత ఇలా అన్నారు: "ఇక విషయానికొస్తే, మీకు పూర్వం గతించిన ప్రజలను ఈ విషయమే నాశనం చేసింది: వారు తమలో పలుకుబడి గల వ్యక్తి దొంగతనం చేస్తే అతడ్ని వదిలిపెట్టేవారు, అదే బలహీనుడు దొంగతనం చేస్తే అతనికి శిక్ష విధించేవారు. అల్లాహ్ సాక్షి! ఒకవేళ ముహమ్మద్ కూతురు ఫాతిమా దొంగతనం చేసినా నేను ఆమె చేతిని నరికివేస్తాను". ఆ తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ స్త్రీ విషయంలో ఆజ్ఞ జారీ చేయగా, ఆమె చేతిని నరికివేయడం జరిగింది. ఆ తర్వాత ఆమె పశ్చాత్తాపం ఉత్తమమైనదిగా ఉండేది మరియు ఆమె వివాహం కూడా చేసుకుంది. ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా అన్నారు: "ఆ తర్వాత ఆమె (నా వద్దకు) వస్తూ ఉండేది, నేను ఆమె అవసరాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేసేదాన్ని". [92] [92] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (4304); ముస్లిం, హదీథు సంఖ్య (1688) లో ఉల్లేఖించారు.
చేతిని నరకడం అనే ఈ కఠినమైన శిక్షకు కారణం ఇతరుల ఆస్తిపై అక్రమంగా పాల్పడటం. ఇది ప్రజల ఆస్తులను దొంగిలించాలని ఆలోచించే వారికి గుణపాఠంగా నిలిచే ఒక నిరోధక శిక్ష. అంతేకాకుండా, ఇది దొంగకు తన పాపాల నుండి ప్రక్షాళన, సమాజంలో భద్రత మరియు శాంతి స్థాపన, మరియు ప్రజల ఆస్తుల పరిరక్షణ కూడా.
నష్టాలు:
దొంగతనం వలన అనేక నష్టాలు ఉన్నాయి, వాటిలో కొన్ని:
-దొంగతనం సంపూర్ణ విశ్వాసానికి విరుద్ధమైనది, గత హదీథ్ ప్రకారం: «దొంగ దొంగిలించేటప్పుడు విశ్వాస స్థితిలో ఉండడు».
- దొంగ పశ్చాత్తాపపడకపోతే పరలోకంలో శిక్షించబడతాడు, దానికి తోడు ఈ ప్రపంచంలో అతను అవమానాన్ని కూడా ఎదుర్కొంటాడు.
- ఇది దొంగ చెయ్యి నరకటానికి ఒక కారణం.
- దొంగ ప్రార్థన స్వీకరించబడే భాగ్యానికి దూరమవుతాడు, అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు: «దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సుదూర ప్రయాణీకుడి గురించి ప్రస్తావించినారు, అతడి తలవెంట్రుకలు చిందరవందరగా ఉన్నాయి, అతడి శరీరమంతా మట్టికొట్టుకుని ఉంది, అతడు తన రెండు చేతులు ఆకాశం వైపునకు చాచి “ఓ నా ప్రభూ! ఓ నా ప్రభూ!” అంటూ వేడుకుంటున్నాడు. మరి చూడబోతే అతని ఆహారం హరాం, అతని పానీయం హరాం, అతని దుస్తులు హరాం, మరియు అతని పోషణ పూర్తిగా హరాం. మరి అది (అతని దుఆ, వేడుకోలు) ఎలా స్వీకరించబడుతుంది?» [93]. [93] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (1015) లో ఉల్లేఖించారు.
- ఇది నీచమైన స్వభావానికి మరియు హీనమైన స్థాయికి నిదర్శనం.
- ప్రజలు దొంగను ఏ విషయంలోనూ నమ్మరు, అది ఎంత అల్పమైనదైనా సరే.
రక్షణ:
దొంగతనంలో పడకుండా నివారించే మార్గాలు:
- దొంగ చేతిని నరికే శిక్షను అమలు పరచటం సమాజంలో దొంగతనాన్ని అరికట్టడానికి అత్యంత శక్తివంతమైన మార్గాలలో ఒకటి.
- అమానతును కాపాడమని ప్రోత్సహించడం మరియు దొంగతనం మొదలైన వాటి ద్వారా ద్రోహం చేయవద్దని హెచ్చరించడం.
- ధర్మసమ్మతమైన జీవనోపాధి యొక్క సమృద్ది (బర్కత్) కుటుంబం అంతటిపై, మరియు దొంగతనం యొక్క దుష్పరిణామం, దాని ప్రభావం కూడా కుటుంబం అంతటిపై ఉంటుందని జ్ఞాపకం చేసుకోవడం.
పిల్లలను పవిత్రంగా, ఇతరుల హక్కులు మరియు ఆస్తులపై అతిక్రమించకుండా పెంచడం, దొంగతనం వైపు షైతాను ప్రేరేపించకుండా ఉండేందుకు వారి ప్రాథమిక అవసరాలను తీర్చడం, మరియు అటువంటి ప్రవర్తనలను వారికి ఆకర్షణీయంగా చేసే చెడ్డ స్నేహితుల నుండి వారిని దూరం చేయడం.
- జీవనోపాధి మరియు దాని మార్గాలలో హరాంను విడిచి హలాల్ తో సరిపెట్టుకోవడం, దాని కొరకు కృషి చేయడం, మరియు అల్లాహ్ ను దుఆ చేయడం. ఈ విషయంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో ఈ విధంగా వచ్చినది: «ఓ అల్లాహ్! నీవు హలాల్ (ధర్మసమ్మతం) చేసిన వాటి ద్వారా నీవు హరాం చేసిన వాటి నుండి నన్ను విముక్తి కలిగించు, నీ కరుణా కటాక్షాల ద్వారా నీవు తప్ప అందరి నుండి నన్ను నిరుపేక్షాపరున్ని చేయుము» [94]. [94] ఈ హదీసును తిర్మిథీ, హదీథు సంఖ్య (3563) లో ఉల్లేఖించారు.
మద్యం సేవించడం
మద్యం షరిఅత్ నిషేధించిన అపవిత్రమైన వాటిలో ఒకటి, మరియు దానిని సేవించేవారిని లేదా దాని తయారీ, అమ్మకం, రవాణా, అందించడం వంటి వాటిలో పాలుపంచుకునేవారిని అది శపిస్తుంది; కావున, మద్యం సేవించడం ఘోరమైన పాపాలలో ఒకటి, అది దానిని సేవించే వ్యక్తిని పరలోకంలో తీవ్రమైన హెచ్చరికకు మరియు ఈ లోకంలో చెడు పరిణామాలకు గురిచేస్తుంది.
మద్యపానం విస్తృతంగా వ్యాపించడం మరియు అది సాధారణంగా మారడం ప్రళయ దినం యొక్క చిహ్నాలలో ఒకటి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు; రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినట్లు అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు: «ప్రళయదినపు సంకేతాలలో – జ్ఞానము (భూమి నుండి) లేపుకోబడుతుంది, అజ్ఞానము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది, మద్యం త్రాగుట సర్వసాధారణం అవుతుంది, వ్యభిచారము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది» [95]. [95] ఈ హదీసును బుఖారీ హదీథు సంఖ్య (80) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (2671) లో ఉల్లేఖించారు.
మద్యం యొక్క ఆదేశములో మత్తు కలిగించి, బుద్ధిని మాయమయ్యేలా చేసే ప్రతిదీ వస్తుంది; ఉదాహరణకు అన్ని రకాల మత్తుపదార్థాలు మరియు హషీష్ వంటివి. అవన్నీ హరాం, వాటిలో దేనినీ తీసుకోవడం అనుమతించబడదు. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ప్రతీ మత్తు పదార్ధం మద్యం’గా భావించబడుతుంది. ప్రతీ మత్తుపదార్ధం హరాము చేయబడింది. ఈ ప్రపంచంలో మద్యాన్ని సేవించి తౌబా చేసుకోకుండా ఆ వ్యసనంతో చనిపోయిన వ్యక్తి పరలోకంలో దాన్నిత్రాగటాన్నికోల్పోతాడు కోల్పోతాడు.” [96]. [96] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (2003) లో ఉల్లేఖించారు.
ఆధారాలు:
మద్యపానం యొక్క నిషేధం మరియు దాని ఘోరత్వం, దాని నేరం యొక్క తీవ్రతను తెలియజేసే ఆధారాలు అనేకం. వాటిలో కొన్ని:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ﴾ఓ విశ్వాసులారా! నిశ్చయంగా మధ్యపానం, జూదం, బలిపీఠం మీద బలి ఇవ్వటం (అన్సాబ్) మరియు శకునానికై బాణాల ప్రయోగం (అజ్లామ్) ఇవన్నీ కేవలం అసహ్యకరమైన షైతాన్ చేష్టలు, కావున మీరు సాఫల్యం పొందాలంటే వీటిని త్యజించండి.90 నిశ్చయంగా, షైతాన్ మధ్యపానం మరియు జూదం ద్వారా మీ మధ్య విరోధాలు మరియు విద్వేషాలు రేకెత్తించాలని మరియు మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం నుండి మరియు నమాజ్ నుండి తొలగించాలని కోరుతున్నాడు. అయితే మీరిప్పుడైనా మానుకోరా?﴿ [అల్ మాయిదా: 90-91]
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: "మద్యం నిషేధించబడిన రోజు నేను అబూ తల్హా (రదియల్లాహు అన్హు) గారి ఇంట్లో ఉన్న వారికి పానీయాలు పోస్తుండగా, ఒక ప్రకటన చేసేవాడి శబ్దం వినిపించింది. అబూ తల్హా, 'బయటికి వెళ్లి చూడు' అన్నారు. నేను బయటికి వెళ్ళగా, ఒక ప్రకటన చేసేవాడు, 'జాగ్రత్త! మద్యం నిషేధించబడింది' అని ప్రకటిస్తున్నాడు. అప్పుడు అబూ తల్హా నాతో, 'బయటికి వెళ్లి దాన్ని పారబోయి' అన్నారు. నేను దాన్ని పారబోయగా, అది మదీనా వీధుల్లో ప్రవహించింది." [97] [97] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (2464) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1980) లో ఉల్లేఖించారు.
హజ్రత్ అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "ఒక వ్యభిచారి వ్యభిచరించేటప్పుడు విశ్వాసి కాజాలడు,మద్యపానసేవకుడు మద్యం త్రాగేటప్పుడు విశ్వాసిగా ఉండడు". [98] [98] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (2475); ముస్లిం, హదీథు సంఖ్య (100) లో ఉల్లేఖించారు.
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: «అల్లాహ్ మద్యాన్ని, దానిని త్రాగేవానిని, దానిని ఇతరులకు త్రాగించేవానిని, దానిని అమ్మేవానిని, దానిని కొనుగోలు చేసేవానిని, దాని రసం తీసేవానిని, దాని రసం తీయించేవానిని, దానిని రవాణా చేసేవానిని, మరియు ఎవరికైతే అది రవాణా చేయబడుతుందో వానిని శపించాడు» [99]. [99] ఈ హదీసును అబూ దావుద్, హదీథు సంఖ్య (3674) లో ఉల్లేఖించారు.
అబూ దర్దా రదియల్లాహు అన్హు ఉల్లేఖన: నా ఆప్త మిత్రుడు సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఇలా వసియ్యత్ చేశారు: «మద్యము త్రాగవద్దు, ఎందుకనగా అది సకల చెడులకు తాళం చెవి» [100]. [100] ఈ హదీసును ఇబ్నె మాజహ్, హదీథు సంఖ్య (3371) లో ఉల్లేఖించారు.
అబూ దర్దా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మద్యపాన వ్యసనపరుడు స్వర్గంలో ప్రవేశించలేడు” [101]. [101] ఈ హదీసును ఇబ్నె మాజహ్, హదీథు సంఖ్య (3376) లో ఉల్లేఖించారు.
నష్టాలు:
ఆ పెద్ద పాపము వలన కలిగే శిక్షలు మరియు ప్రమాదాలు:
- మద్యం సేవించటం వలన సేవించిన వారి నమాజ్ నలభై రోజుల వరకు అంగీకరించబడదు, ఈ విషయం అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ద్వారా ఉల్లేఖించబడింది, ఆయన ఇలా అన్నారు: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: «ఎవరైతే మద్యం సేవిస్తాడో, అతని నలభై ఉదయాల ప్రార్థన స్వీకరించబడదు. అతడు పశ్చాత్తాపపడితే అల్లాహ్ అతనిపై క్షమ చూపుతాడు. మళ్లీ (మద్యం) తాగితే, అల్లాహ్ నలభై ఉదయాల వరకు అతని నమాజును స్వీకరించడు. అతడు పశ్చాత్తాపపడితే అల్లాహ్ అతనిపై క్షమ చూపుతాడు. మళ్లీ (మద్యం) తాగితే, అల్లాహ్ నలభై ఉదయాల వరకు అతని నమాజును స్వీకరించడు. అతడు పశ్చాత్తాపపడితే అల్లాహ్ అతనిపై క్షమ చూపుతాడు. నాలుగోసారి మళ్లీ తాగితే, అల్లాహ్ నలభై ఉదయాల వరకు అతని నమాజును స్వీకరించడు. ఆపై అతడు పశ్చాత్తాపపడినా అల్లాహ్ అతనిపై క్షమ చూపడు, మరియు అతనికి 'నహ్రె ఖబాల్' నుండి త్రాగిస్తాడు». అప్పుడు, "ఓ అబూ అబ్దుర్రహ్మాన్! ఈ 'నహ్రె ఖబాల్' అంటే ఏమిటి?" అని అడగబడింది. దానికి అతను, "అది నరకవాసుల చీము నుండి ప్రవహించే ఒక నది" అని సమాధానమిచ్చారు» [102]. [102] ఈ హదీసును తిర్మిథీ, హదీథు సంఖ్య (1862) లో ఉల్లేఖించారు.
- దానిని త్రాగేవాడు పశ్చాత్తాపం చెందకుండా మరణిస్తే, పరలోకంలో అది అతనికి నిషేధించబడుతుంది. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమ కథనం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఇలా తెలిపారు: ««ఈ లోకంలో మద్యం తాగి, ఆపై దానినుంచి పశ్చాత్తాపం చేయని వాడు పరలోకంలో దాని నుండి వంచించబడతాడు» [103]. [103] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (5575) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (2003) లో ఉల్లేఖించారు.
- అది ముస్లింల మధ్య శత్రుత్వం మరియు ద్వేషాన్ని సృష్టిస్తుంది, మరియు అనేక కుటుంబాలను నాశనం చేస్తుంది. అనేక విడాకుల కేసులు మరియు పిల్లల జీవితాలు చిన్నాభిన్నం అవ్వడానికి మద్యపాన వ్యసనమే కారణం. మద్యం సేవించేవాడు తన బుద్ధిని కోల్పోయి స్పృహ లేకుండా పోతాడు; అతను శరీరం గగుర్పాటుకు గురయ్యేంతటి ఘోరమైన పాపాలకు పాల్పడవచ్చు, కావున మద్యం సమస్త దుర్మార్గాలకు మూలం, ప్రతి చెడుకూ తాళం చెవి.
- అది దానిని సేవించేవారి సంపదను, ప్రయోజనం లేకుండా హాని కలిగించే విషయాలలో వృధా చేస్తుంది. మరియు మనిషి తన సంపదను ఎక్కడి నుంచి సంపాదించాడు, దేనిలో ఖర్చు చేశాడు అనే విషయాలపై ప్రశ్నించబడతాడు. అబూ బర్జా అల్-అస్లమీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “పునరుత్థాన దినము నాడు, కొన్ని విషయాలను గురించి ప్రశ్నించనంత వరకు, మానవుడి కాళ్ళు అతడు నిలుచుని ఉన్నచోటు నుండి ఏమాత్రమూ కదలవు – అతడి జీవితాన్ని గురించి – అతడు దానిని ఎందులో గడిపినాడు అని; అతడి జ్ఞానాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా ఉపయోగించినాడు అని; అతడి సంపదను గురించి – ఎక్కడి నుండి సంపాదించినాడు అని, మరియు దానిని ఎక్కడ ఖర్చు చేసినాడు అని; మరియు అతడి శరీరాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా పరిసమాప్తి గావించినాడు (ఏ విధంగా ఉపయోగించినాడు) అని.” [104]. [104] ఈ హదీసును తిర్మిథీ, హదీథు సంఖ్య (2417) లో ఉల్లేఖించారు.
- మద్యం చింతలను మరింత పెంచుతుంది, సమస్యలను జటిలం చేస్తుంది. పనికిమాలినవారు చెప్పినట్లుగా అది ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకురాదు. ఒకవేళ అలా జరిగినా, అది నకిలీ, కల్తీ చేయబడిన ఆనందం మరియు అబద్ధపు సంతోషం. అది త్వరగా వెళ్ళిపోతుంది, దాని తర్వాత దీర్ఘకాలం పాటు పశ్చాత్తాపం, విచారం, చింత మరియు దుఃఖం అనుసరిస్తాయి.
- మత్తు పదార్థాలను సేవించడం వల్ల అనేక భౌతిక మరియు నైతిక హానులు కలుగుతాయి. దాని హానిని నిరూపించడానికి, అల్లాహ్ తఆలా మానవునికి గౌరవంగా ప్రసాదించిన బుద్ధిని అది కోల్పోయేలా చేస్తుందన్న ఒక్క విషయం చాలు.
రక్షణ:
మరియు వాటిని వినియోగించడం, వాటికి బానిస కావడం నుంచి రక్షించుకునే నివారణ మార్గాలు ఇవి:
- అల్లాహ్ యొక్క ఆదేశమును మరియు ఆయన వారింపును గౌరవించడం, ఆదేశమును వెంటనే పాటించడం, మరియు వారింపు నుండి దూరంగా ఉండటం. ఎందుకంటే, మనిషి అల్లాహ్ సృష్టించిన మరియు నిర్దేశించిన వాటిలో, మరియు ఆయన ఆదేశించి మరియు వారించిన వాటిలో ఉన్న ఆయన పరిపూర్ణ కారుణ్యాన్ని మరియు వివేకాన్ని విశ్వసించినప్పుడు, అతను తన ప్రభువు యొక్క అన్ని బోధనలు మరియు తీర్పులతో సంతృప్తి చెందుతాడు, వాటిని సంతోషంగా అంగీకరిస్తాడు, మరియు ఎటువంటి విసుగు లేదా ఇబ్బంది లేకుండా వాటిని అమలు చేయడానికి తొందరపడతాడు.
- మత్తుపదార్థాల సేవనం వల్ల కలిగే దుష్పరిణామాలు, అవమానకరమైన ప్రవర్తన, అవమానం మరియు పరాభవం, సిగ్గు మరియు పశ్చాత్తాపం గురించి తెలుసుకోవడం.
- మార్పు కోసం సంకల్పం మరియు పట్టుదల, దానికోసం దృఢ నిశ్చయం మరియు పూర్తి ప్రయత్నం తప్పనిసరి.
- చెడు స్నేహితుల సహవాసానికి దూరంగా ఉండాలి, మరియు మంచివారైన సజ్జనులతో సహవాసం చేయాలి. అల్లాహ్ అనుమతితో వారి నుండి ఎంతో సహాయాన్ని పొందుతాడు.
– మద్యం లేదా మాదకద్రవ్యాలకు బానిసైన వారిని చికిత్స చేయడంలో సహాయపడే కొన్ని వైద్య చికిత్సలు ఉన్నాయి. వాటి ద్వారా లాభం పొందవచ్చు; ఇందుకోసం వైద్యులను మరియు ప్రత్యేక చికిత్స కేంద్రాలను ఆశ్రయించవచ్చు.
అర్రిబా-వడ్డీ.
వడ్డీ అత్యంత ఘోరమైన పాపాలలో ఒకటి. అది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో యుద్ధం చేయడం. అది దానిని చేసేవాడిని ఇహలోకంలో మరియు పరలోకంలో తీవ్రమైన నష్టాలకు గురిచేస్తుంది, అంతేకాక అది ఆర్థిక జీవితాన్ని పాడు చేసి, వ్యక్తి మరియు సమాజంపై ప్రభావం చూపుతుంది.
రిబా అనగా గడువుకు బదులుగా అప్పుపై విధించే అదనపు మొత్తం, మరియు రిబా వర్తించే రెండు వస్తువుల మార్పిడిలో ఉండే అదనపు మొత్తాన్ని కూడా రిబా అంటారు, దీనిని రిబాఉల్-ఫద్ల్ అని పిలుస్తారు. ఇక రిబా అన్-నసీయా అనగా, రిబాఉల్-ఫద్ల్ యొక్క ఇల్లతు (కారణం)లో ఏకీభవించిన ప్రతీ రెండు రకాల వస్తువుల విక్రయంలో, వాటి స్వాధీనాన్ని (చెల్లింపును) ఆలస్యం చేయడం.
అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: «బంగారానికి బంగారం, వెండికి వెండి, గోధుమలకు గోధుమలు, జొన్నలకు జొన్నలు, ఖర్జూరాలకు ఖర్జూరాలు, ఉప్పుకు ఉప్పు — సరిసమానంగా, చేతికి చేయి (అక్కడికక్కడే) మార్పిడి జరగాలి. ఎవరైతే ఎక్కువ ఇచ్చినా లేదా అదనంగా తీసుకున్నా, అది వడ్డీ అవుతుంది. ఇందులో తీసుకునేవాడు మరియు ఇచ్చేవాడు ఇద్దరూ సమానులే». [105] [105] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (2177) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1584) లో ఉల్లేఖించారు.
వడ్డీకి సంబంధించిన వ్యవహారాలు మరియు పద్ధతులు చాలా ఉన్నాయి, కాబట్టి ఒక ముస్లిం వాటిని తెలుసుకొని, వాటి పట్ల జాగ్రత్త వహించి, వాటికి దూరంగా ఉండాలి, మరియు ఏ లావాదేవీలోనైనా దాని ధార్మిక తీర్పును తెలుసుకునే వరకు దానిలో ప్రవేశించకూడదు.
ఆధారాలు:
వడ్డీ గురించి హెచ్చరిస్తూ ఖుర్ఆన్ మరియు సున్నత్ లలో అనేక ప్రామాణికి ఆధరాలు వచ్చాయి, వాటిలో:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ﴾ఎవరైతే వడ్డీ తింటారో! వారి స్థితి (పునరుత్థాన దినమున) షైతాన్ తాకడం వల్ల భ్రమపరచబడిన వ్యక్తి స్థితి వలె ఉంటుంది. ఇది ఎందుకంటే! వారు: "వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే!" అని చెప్పడం. కాని అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మ సమ్మతం (హలాల్) చేశాడు మరియు వడ్డీని నిషిద్ధం (హరామ్) చేశాడు. కనుక తన ప్రభువు చేసిన ఈ హితబోధ అందిన వ్యక్తి మున్ముందు వడ్డీ తినటం త్యజిస్తే, అతడు పూర్వం తిన్నదేదో తిన్నాడు. అతడి వ్యవహారమంతా అల్లాహ్ కే చెందుతుంది. (ఈ ఆదేశం తరువాత ఈ దుర్వ్యవహారానికి) పాల్పడేవారు నరకవాసులవుతారు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు.275﴿ [అల్ బఖర: 275]
మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు మీరు (నిజంగా) విశ్వాసులే అయితే, మీకు రావలసిన వడ్డీని విడిచి పెట్టండి.278 కాని, ఒకవేళ మీరు అలా చేయకపోతే! అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని తరఫు నుండి యుద్ధ ప్రకటన ఉందని తెలుసుకోండి...279﴿ [అల్ బఖర: 278-279 ]
అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾ఓ విశ్వాసులారా! ఇబ్బడిముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినకండి. మరియు మీరు సాఫల్యం పొందటానికి అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి.130﴿ [ఆలె ఇమ్రాన్:130]
అబూ హురైర రజియల్లాహు అన్హు మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ద్వారా ఉల్లేఖిస్తున్నారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: «వినాశకరమైన (అనగా నాశనం చేసే) ఏడు పాపముల నుండి దూరంగా ఉండండి». దానికి వారు, “ఓ అల్లాహ్ ప్రవక్తా! అవి ఏమిటి?” అని అడిగారు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: «అల్లాహ్ కు సాటి కల్పించుట; చేతబడి; అల్లాహ్ నిషిద్ధం చేసిన ప్రాణిని అన్యాయంగా చంపటం; వడ్డీ తినుట; అనాథల సొమ్ము తినుట; యుధ్ధభూమి నుండి వెనుదిరిగి పారిపోవుట; శీలవంతులు, అమాయకులు మరియు విశ్వాసులైన స్త్రీలపై అపనిందలు వేయుట» [106]. [106] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (2766) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (89) లో ఉల్లేఖించారు.
సమురా బిన్ జుందుబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: «నిన్న రాత్రి నేను ఇద్దరు వ్యక్తులను చూశాను. వారు నా వద్దకు వచ్చి నన్ను ఒక పవిత్రమైన భూమికి తీసుకెళ్లారు. మేము వెళ్లుతూ రక్తంతో నిండిన ఒక నదికి వచ్చాము. అందులో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. నది మధ్యలో మరో వ్యక్తి ఉండి, అతని చేతిలో రాళ్లు ఉన్నాయి. నదిలో ఉన్న వ్యక్తి బయటకు రావాలని ప్రయత్నించినప్పుడు, మధ్యలో ఉన్న వ్యక్తి ఒక రాయిని అతని నోటిలో విసిరాడు; అలా అతడిని మళ్లీ ఉన్న చోటికే తిరిగి పంపాడు. ప్రతిసారి అతడు బయటకు రావడానికి ప్రయత్నించినప్పుడల్లా, అతని నోటిలో రాయిని విసిరి మళ్లీ అలాగే తిరిగి పంపుతున్నాడు. నేను అడిగాను: ‘ఇది ఏమిటి?’ అప్పుడు ఆయన చెప్పారు: ‘నువ్వు నదిలో చూసిన వాడు వడ్డీ తినేవాడు» [107]. [107] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (2085) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (2275) లో ఉల్లేఖించారు.
నష్టాలు:
వడ్డీతో లావాదేవీలు చేయడంలో చాలా హానులు ఉన్నాయి, వాటిలో కొన్ని:
– వడ్డీ తినేవాడు పరలోకంలో తీవ్రమైన హెచ్చరికకు మరియు బాధాకరమైన శిక్షకు గురవుతాడు. మహోన్నతుడైన అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ﷺ అతనితో యుద్ధం ప్రకటించారు; మహోన్నతుడైన అల్లాహ్ సెలవిస్తున్నాడు: ﴾కాని, ఒకవేళ మీరు అలా చేయకపోతే! అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని తరఫు నుండి యుద్ధ ప్రకటన ఉందని తెలుసుకోండి...﴿ [అల్ బఖర: 279]
- అతను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం శాపానికి గురయ్యాడు; ఎందుకంటే జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమ ఉల్లేఖనం: «దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వడ్డీ తినేవారిని, తినిపించేవారిని, దానిని రాసేవాడిని, దానికి సాక్షులుగా ఉండే ఇద్దరినీ శపించి, వారందరూ సమానులే అని అన్నారు» [108] [108] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (1598) లో ఉల్లేఖించారు
- అతడు ప్రజల సొమ్మును దుర్మార్గంతో తినేవాడు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఓ విశ్వాసులారా! మీరు ఒకరి సొమ్ము నొకరు అన్యాయంగా తినకండి, పరస్పర అంగీకారంతో చేసే వ్యాపారం వల్ల వచ్చేది (లాభం) తప్ప...﴿ [అన్ నిసా: 29] మరియు ఇమామ్ అత్తబరీ దీని భావాన్ని ఇలా తెలిపారు: "మీలో ఒకరు మరొకరి సొమ్మును వడ్డీ, జూదం మరియు అల్లాహ్ మీకు నిషేధించిన ఇతర విషయాల ద్వారా తినకండి, అది వ్యాపారం అయితే తప్ప" [109]. [109] తబ్రీ వ్యాఖ్యానము (6/625).
- వడ్డీ ద్వారా సంపాదించిన ధనంలో శుభం తుడిచిపెట్టుకుపోతుంది, మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾అల్లాహ్ వడ్డీ (ఆదాయాన్ని) నశింపజేస్తాడు మరియు దానధర్మాలు (చేసేవారికి) వృద్ధినొసంగుతాడు. మరియు సత్యతిరస్కారుడు (కృతఘ్నుడు), పాపిష్టుడు అయిన వ్యక్తిని అల్లాహ్ ప్రేమించడు.276﴿ [అల్ బఖర: 276], షైఖ్ సాదీ రహిమహుల్లాహ్ తెలిపారు : ﴾అల్లాహ్ వడ్డీ (ఆదాయాన్ని) నశింపజేస్తాడు﴿ అనగా: ఆయన దానిని మరియు దానిలోని దీవెనలను తొలగిస్తాడు, ఫలితంగా అది విపత్తులకు గురవడానికి మరియు దాని నుండి దీవెనలు తొలగించబడటానికి ఒక కారణంగా మారుతుంది. ఒకవేళ దాని నుండి ఖర్చు చేసినా, అతనికి దానిపై ప్రతిఫలం లభించదు, అంతేకాక, అది అతడిని నరకానికి చేర్చే సాధనంగా మారుతుంది [110]. [110] తఫ్సీర్ అస్-సఅదీ (117).
ఇబ్నె మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే రిబా (వడ్డీ) ద్వారా ఎక్కువగా సంపాదిస్తాడో, అతని వ్యవహారం యొక్క పర్యవసానం తగ్గుదలే అవుతుంది.” [111]. [111] ఈ హదీసును ఇబ్నె మాజహ్, హదీథు సంఖ్య (2279) లో ఉల్లేఖించారు.
- వడ్డీ హృదయాలలో ద్వేషాలను నాటుతుంది, దయ మరియు కరుణను దూరం చేస్తుంది, అందువలన సోదరభావం అంతం అవుతుంది, సమాజ నిర్మాణం చెదిరిపోతుంది.
- వడ్డీ ఒక సామాజిక నేరం, అది ఏ సమాజంలోనైనా వ్యాపిస్తే, ఆ సమాజాన్ని నాశనం చేసి దాని పునాదులను కూల్చివేస్తుంది.
రక్షణ:
వడ్డీ లావాదేవీల నుండి నివారణ మార్గాలు:
- విశ్వాసమును బలపరచడం, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఓ విశ్వాసులారా! ఇబ్బడిముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినకండి...﴿ [ఆలె ఇమ్రాన్: 130]، మరియు దీనిని బట్టి తెలిసేదేమిటంటే, ఆ ఆదేశాన్ని పాటించడానికి మరియు ఆ నిషేధాన్ని విడనాడటానికి విశ్వాసమే ప్రేరేపించే మరియు తప్పనిసరి చేసే కారణం; ఎందుకంటే విశ్వాసం అనేది అవయవాల ఆచరణలను ఆవశ్యకపరిచే, విశ్వసించవలసిన వాటి యొక్క సంపూర్ణ దృవీకరణ [112]. [112]చూడండి తఫ్సీర్ అస్సఅదీ (పేజీ 148).
- తఖ్వాను సాధించడం: మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఓ విశ్వాసులారా! ఇబ్బడిముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినకండి. మరియు మీరు సాఫల్యం పొందటానికి అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి.130﴿ [ఆలె ఇమ్రాన్: 130]
- అల్లాహ్ కారుణ్యం పొందేందుకు ఆకాంక్షించడం, వడ్డీని నిషేధించిన తరువాత అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు మీరు కరుణింపబడటానికి అల్లాహ్ కు మరియు సందేశహరునికి విధేయులై ఉండండి.132﴿ [ ఆలె ఇమ్రాన్: 132]
- మరణాన్ని, మరియు ప్రళయదినాన సంభవించే భయానక పరిస్థితులను గుర్తుచేసుకోవడం, వడ్డీ ఆయతుల తరువాత అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు మీరు తిరిగి అల్లాహ్ సమక్షానికి చేరుకోబోయే ఆ దినానికి భయపడండి. అప్పుడు ప్రతి వ్యక్తికి తన కర్మల ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారి కెలాంటి అన్యాయం జరుగదు.281﴿ [అల్ బఖర: 281]
- నరకాగ్ని భయం, వడ్డీని నిషేధించిన తర్వాత సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ﴾మరియు సత్యతిరస్కారుల కొరకు సిద్ధం చేయబడిన నరకాగ్నికి భీతిపరులై ఉండండి.131﴿ [ఆలి ఇమ్రాన్: 131]
- షరియా నియమాలను, వాటిలో అమ్మకాల నియమాలు మరియు వడ్డీ నియమాలను నేర్చుకోవాలని, ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు చెప్పారు: "ధర్మంలో అవగాహన ఉన్న వ్యక్తి తప్ప మరెవరూ మన మార్కెట్లలో అమ్మకాలు చేయకూడదు" [113]. ఇంకో పదాలలో: "లేనిచో, ఇష్టమున్నా లేకపోయినా వడ్డీ సొమ్ము తిన్నట్లేV [114]. [113] ఈ హదీసును తిర్మిథీ, హదీథు సంఖ్య (487) లో ఉల్లేఖించారు. [114] ఇమామ్ అస్బహానీ గారి అత్-తర్గీబ్ వత్-తర్హీబ్ (810).
- జీవనోపాధి మరియు దాని మార్గాలలో హరామ్ ను విడిచి హలాల్ తో సరిపెట్టుకోవడం, మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను దుఆ చేయడం. దానికి ఉదాహరణగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి హదీసులో వచ్చిన విషయం: “ఓ అల్లాహ్! నీవు హలాల్ (ధర్మసమ్మతం) చేసిన వస్తువుల ద్వారా నీవు హరాం చేసిన వస్తువుల నుండి నన్ను విముక్తి కలిగించు, నీ కరుణా కటాక్షాల ద్వారా నీవు తప్ప అందరి నుండి నన్ను నిరుపేక్షాపరున్ని చేయుము” [115]. [115] ఈ హదీసును తిర్మిథీ, హదీథు సంఖ్య (3563) లో ఉల్లేఖించారు.
తల్లిదండ్రుల పట్ల అవిధేయత
తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపడం మహాపాపాలలో అత్యంత పెద్దదైనదీ, మరియు మహోన్నతుడైన అల్లాహ్కు భాగస్వామ్యం కల్పించడానంతరం అత్యంత ప్రమాదకరమైన పాపాలలో ఒకటిగా ఉంది; అందుకే అల్లాహ్ తన హక్కును మరియు తల్లిదండ్రుల హక్కును అనేక ఆయాత్లలో కలిపి పేర్కొన్నాడు. వాటిలో మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ వాక్కు: ﴾మరియు మీరు అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఎవ్వరినీ ఆయనకు భాగస్వాములుగా సాటి కల్పించకండి. మరియు తల్లిదండ్రులతో...36﴿ [అన్-నిసా: 36] మరియు శుభకరుడు,మహోన్నతుడు ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు (అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు): "మేము మానవునకు తన తల్లిదండ్రుల యెడల మంచితనంతో మెలగటం విధిగా జేశాము. అతని తల్లి అతనిని బలహీనతపై బలహీనతను సహిస్తూ (తన గర్భంలో) భరిస్తుంది మరియు ఆ బిడ్డ చనుపాలు మాన్పించే గడువు రెండు సంవత్సరాలు. నీవు నాకు మరియు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞుడవై ఉండు. నీకు నా వైపునకే మరలి రావలసి ఉన్నది.14﴿ [లుఖ్మాన్: 14]
తల్లిదండ్రుల పట్ల అవిధేయత యొక్క నిజస్వరూపం ఏమనగా: మనిషి యొక్క మాటల ద్వారా గానీ, చేతల ద్వారా గానీ తల్లిదండ్రులకు బాధ కలిగించడం, లేదా వారి పట్ల దయతో, ప్రేమతో మెలగడాన్ని వదిలివేయడం. మరియు అందులో వారు ఆజ్ఞాపించిన విషయాలలో వారికి అవిధేయత చూపడం కూడా చేరుతుంది; అయితే వారు అల్లాహ్కు భాగస్వామిని చేయమని లేదా మహోన్నతుడైన అల్లాహ్కు అవిధేయతగా ఉండే పనిని ఆజ్ఞాపిస్తే, ఆ రెండు సందర్భాలలో వారికి విధేయత చూపకూడదు; ఎందుకంటే సృష్టికర్తకు అవిధేయతలో సృష్టికి విధేయత లేదు. అయినప్పటికీ వారితో మృదుత్వంగా ప్రవర్తించాలి మరియు వారికి ఉపకారం చేయాలి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు ఒకవేళ వారిరువురు - నీవు ఎరగని దానిని - నాకు (అల్లాహ్ కు) భాగస్వామిగా చేర్చమని, నిన్ను బలవంతం చేస్తే, వారి మాటను నీవు ఏ మాత్రం వినకు. మరియు ఇహలోక విషయాలలో ధర్మసమ్మతమైన వాటిలో వారికి తోడుగా ఉండు...15﴿ [లుఖ్మాన్: 15]
కఅబ్ అల్-అహ్బార్ రహిమహుల్లాహ్ ను ‘తల్లిదండ్రుల పట్ల అవిధేయత అంటే ఏమిటి?’ అని అడగగా, ఆయన ఇలా అన్నారు: "అతని తండ్రి లేదా తల్లి ప్రమాణం చేసినప్పుడు, వారి ప్రమాణాన్ని నెరవేర్చడు, వారు ఆజ్ఞాపించినప్పుడు, వారి ఆజ్ఞకు విధేయత చూపడు, వారు ఏదైనా అడిగినప్పుడు, వారికి ఇవ్వడు, వారు అతనిపై నమ్మకం ఉంచినప్పుడు, వారికి ద్రోహం చేస్తాడు" [116]. [116] అల్ కబాయిర్, జహబీ (పు: 41)
ఆధారాలు:
తల్లిదండ్రుల పట్ల అవిధేయత నిషిద్ధం అని, అది ఎంత హేయమైనదో, ఎంత ఘోరమైన నేరమో స్పష్టం చేసే ఆధారాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు నీ ప్రభువు: తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదనీ మరియు తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలనీ, ఆజ్ఞాపించి ఉన్నాడు. ఒకవేళ వారిలో ఏ ఒక్కరు గానీ, లేదా వారిరువురు గానీ ముసలివారైతే, వారితో విసుక్కుంటూ: "ఛీ! (ఉఫ్)" అని కూడా అనకు మరియు వారిని గద్దించకు మరియు వారితో మర్యాదగా మాట్లాడు.23 మరియు వారి మీద కరుణ మరియు వినయవిధేయతల రెక్కలను చాపు మరియు వారి కొరకు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! వారు ఏ విధంగా నన్ను బాల్యంలో పెంచారో అదే విధంగా నీవు వారి యెడల కరుణను చూపు!" 24﴿ [అల్ ఇస్రా: 23 - 24]
అబూ బక్రహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మహాపాపాల్లోకెల్లా ఘోరమైన పాపాల గురించి మీకు తెలుపనా?”, దానికి మేము, “తప్పకుండా చెప్పండి ఓ దైవప్రవక్తా” అని అన్నాము. అప్పుడు ఆయన ఇలా అన్నారు: “అల్లాహ్ కు సాటి కల్పించడం, తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపటం, మరియు అబద్ధపు సాక్ష్యం ఇవ్వడం లేదా అసత్యం పలకడం” [117] [117] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (2654) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (87) లో ఉల్లేఖించ.
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మహా పాపాల గురించి ప్రశ్నించగా, ఆయన ఇలా సెలవిచ్చారు: “అల్లాహ్ కు సాటి కల్పించుట, తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపుట, హత్య చేయుట మరియు అబద్ధపు సాక్ష్యము చెప్పుట” [118]. [118] ఈ హదీసును బుఖారీ (హదీసు సంఖ్య: 2653) మరియు ముస్లిం (హదీసు సంఖ్య: 144) లో నమోదు చేసినారు.
ముగైరహ్ బిన్ షుఅబహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: «నిశ్చయంగా అల్లాహ్ మీపై మాతృ మూర్తులకు అవిధేయతను నిషేధించాడు...» [119]. [119] ఈ హదీసును బుఖారీ (హదీసు సంఖ్య: 2408) మరియు ముస్లిం (హదీసు సంఖ్య: 593) లో ఉల్లేఖించారు.
నష్టాలు:
తల్లిదండ్రుల పట్ల అవిధేయత వలన అనేక దుష్పరిణామాలు ఉన్నాయి, వాటిలో కొన్ని:
- తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపటం, ప్రళయదినాన దాసుడు అల్లాహ్ యొక్క దృష్టికి మరియు స్వర్గ ప్రవేశానికి దూరమవడానికి ఒక కారణం; అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు, అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: «పునరుత్థాన దినమున అల్లాహ్ అజ్జ వ జల్ల ముగ్గురి వైపు చూడడు: తల్లిదండ్రుల అవిధేయుడు, పురుషుల వేషధారణ చేసే స్త్రీ, మరియు తన కుటుంబ స్త్రీల పట్ల పౌరుషం లేనివాడు. మరియు ముగ్గురు స్వర్గంలో ప్రవేశించరు: తల్లిదండ్రుల అవిధేయుడు, మద్యపానానికి బానిసైనవాడు, మరియు ఇచ్చి ఎత్తిచూపేవాడు» [120]. [120] ఈ హదీసును నసాయీ, హదీసు సంఖ్య (2562) లో
- తల్లిదండ్రులకు అవిధేయుడైన వాడు పరిశుద్ధుడైన అల్లాహ్ యొక్క అనుగ్రహమును మరియు తన తల్లిదండ్రుల ఉపకారమును తిరస్కరించినవాడు. శుభకరుడైన, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾నీవు నాకు మరియు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞుడవై ఉండు. నీకు నా వైపునకే మరలి రావలసి ఉన్నది.14﴿ [లుఖ్మాన్: 14]
- తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపడం మహోన్నతుడైన అల్లాహ్ కోపానికి ఒక కారణం, ఈ విషయంలో అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా కధనం: "అల్లాహ్ యొక్క ప్రసన్నత తండ్రి ప్రసన్నతలో ఉంది, అలాగే అల్లాహ్ యొక్క కోపం తండ్రి కోపం తో ముడిపడి ఉంది" [121]. [121] ఈ హదీసును బుఖారీ అదబుల్ ముఫ్రద్ లో ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (2).
- తల్లిదండ్రుల పట్ల అవిధేయత కుటుంబంలో అస్థిరతను కలిగిస్తుంది; ఫలితంగా మొత్తం సమాజానికే ప్రభావం పడుతుంది. ఎవరైతే తన తల్లిదండ్రుల పట్ల విధేయత చూపడో, అతని సంతానం అతని పట్ల విధేయత చూపదు, మరియు అతను తన పొరుగువారి పట్ల, సమాజం పట్ల కూడా విధేయత చూపడు.
రక్షణ:
తల్లిదండ్రుల పట్ల అవిధేయత నుండి రక్షణ పొందే మార్గాలు:
- తల్లిదండ్రులను ఏమాత్రం బాధపెట్టకుండా ఉండటం: మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾వారితో విసుక్కుంటూ: 'ఛీ! (ఉఫ్)' అని కూడా అనకు﴿ ఇది బాధ యొక్క అత్యల్ప స్థాయి, దీనిని ప్రస్తావించడం ద్వారా అంతకంటే తీవ్రమైన వాటి గురించి కూడా హెచ్చరించబడింది. దీని భావం ఏమిటంటే, వారికి కనీస బాధ కూడా కలిగించకూడదు. ﴾వారిని గద్దించకు﴿ అంటే: వారిని గద్దించకూడదు, వారితో కఠినమైన మాటలు మాట్లాడకూడదు. ﴾వారితో మర్యాదగా మాట్లాడు.﴿ వారు ఇష్టపడే పదాలతో, మర్యాద మరియు దయతో, వారి హృదయాలకు ఆహ్లాదాన్ని, వారి మనస్సులకు ప్రశాంతతను కలిగించే మృదువైన, మంచి మాటలతో మాట్లాడాలి. మరియు ఇది పరిస్థితులు, ఆచారాలు మరియు కాలాలను బట్టి మారుతూ ఉంటుంది [122]. [122] చూడండి తఫ్సీర్ సాదీ (పే: 5).
- తల్లిదండ్రులే ఉత్తమ సహవాసం మరియు సత్ప్రవర్తనకు ప్రజలందరిలో అత్యంత హక్కుదారులు, అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: ఒక వ్యక్తి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి, “దైవప్రవక్తా! నా సత్ప్రవర్తనకు అందరికన్నా ఎక్కువ హక్కుదారులెవరు?" అని అడిగాడు. దానికి ఆయన “నీ తల్లి” అని చెప్పారు. “ఆ తరువాత ఎవరు?" అని అడిగాడా వ్యక్తి. దానికి ఆయన 'నీ తల్లి' అనే చెప్పారు. ఆ వ్యక్తి మళ్ళీ, “ఆ తరువాత ఎవరు?” అని అడిగాడు. అప్పుడు కూడా “నీ తల్లి” అనే చెప్పారు. ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు “ఆ తరువాత ఎవరు?” అని. అప్పుడు ఆయన 'నీ తండ్రి' అని చెప్పారు. [123] [123] ఈ హదీసును బుఖారీ, హదీసు సంఖ్య (5971) లో మరియు ముస్లిం, హదీసు సంఖ్య (2548) లో ఉల్లేఖించారు.
- ఒక వ్యక్తి తన తల్లిదండ్రులకు ఎంత సేవ చేసినా వారి హక్కును తీర్చలేడు, అతను చేసే సేవ కంటే వారి హక్కు చాలా గొప్పది. అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "బానిసత్వంలో మగ్గుతున్న తండ్రిని కొని ఆయనకు విముక్తి ప్రసాదిస్తేనే తప్ప సంతానం ఆయన రుణం తీర్చుకోలేదు". [124] అంటే: ఒక కొడుకు తన తండ్రి హక్కును, ఆయన చేసిన మేలుకు ప్రతిఫలాన్ని తీర్చలేడు, అతను తన తండ్రిని బానిసగా కనుగొని, అతనికి విముక్తి ప్రసాదిస్తే తప్ప. [124] ఈ హదీసును ముస్లిం, హదీసు సంఖ్య (1510) లో ఉల్లేఖించారు.
"ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఒక వ్యక్తిని చూశారు, అతను తన తల్లిని తన మెడపై మోసుకుని కఅబ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, 'ఓ ఇబ్నె ఉమర్! నేను ఆమె రుణం తీర్చుకున్నానని మీరు భావిస్తున్నారా?' అని అడిగాడు. దానికి ఆయన (ఇబ్ను ఉమర్) ఇలా సమాధానమిచ్చారు: 'లేదు, ఆమె ప్రసవ వేదనలోని ఒక్క పోటుకు కూడా ఇది సరితూగదు. కానీ నీవు చాలా మంచి పని చేశావు. అల్లాహ్ నీ ఈ కొద్దిపాటి సత్కార్యానికి బదులుగా గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు" [125]. [125] చూడండి: అల్ కబాయిర్ లిద్దహబీ. (పుటము: 42).
- తల్లిదండ్రులను సంతృప్తిపరచడానికి స్వీయనియంత్రణతో శ్రమించడం; ఇది అల్లాహ్ మార్గంలో చేసే జిహాద్లలో ఒక రకం. అబ్దుల్లాహ్ బిన్ అమర్ రజియల్లాహు అన్హుమా కధనం: ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, జిహాద్ కోసం అనుమతి కోరాడు. అప్పుడు ఆయన, «నీ తల్లిదండ్రులు ప్రాణాలతో ఉన్నారా?» అని ప్రశ్నించారు. అతను, 'అవును' అని బదులిచ్చాడు. దానికి ఆయన, «అయితే వారిరువురిలోనే జిహాద్ చేయి» అని పలికారు. [126] [126] ఈ హదీసును బుఖారీ, హదీసు సంఖ్య (3004); ముస్లిం, హదీసు సంఖ్య (2549) లో ఉల్లేఖించారు.
- ఒక వ్యక్తి తాను గొడవపడే వ్యక్తి తల్లిదండ్రులను దూషించకుండా ఉండటం; అది అతని ప్రత్యర్థిని తన తల్లిదండ్రులను దూషించేలా చేస్తుంది. అబ్దుల్లాహ్ బిన్ ఆమ్ర్ రజియల్లాహు అన్హుమ ఉల్లేఖనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: «అతిపెద్ద మహాపరాధాలలో ఒకటి, ఒక వ్యక్తి తన తల్లిదండ్రులను శపించడం». అప్పుడు, “ఓ దైవ ప్రవక్తా! ఒక వ్యక్తి తన తల్లిదండ్రులను ఎలా శపించగలడు?” అని ప్రశ్నించబడింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: «ఒక వ్యక్తి వేరొకరి తండ్రిని దూషిస్తే, ఆ వ్యక్తి ఇతని తండ్రిని దూషిస్తాడు. మరియు అతను వేరొకరి తల్లిని దూషిస్తే, ఆ వ్యక్తి ఇతని తల్లిని దూషిస్తాడు» [127]. [127] ఈ హదీసును బుఖారీ (హదీసు సంఖ్య: 5973) మరియు ముస్లిం (హదీసు సంఖ్య: 90) లో ఉల్లేఖించారు.
- తల్లిదండ్రులను దుఃఖ పెట్టకుండా జాగ్రత్త వహించడం. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం: ఒక వ్యక్తి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, 'నేను నా తల్లిదండ్రులను ఏడుస్తూ విడిచిపెట్టి, హిజ్రత్ కోసం మీతో ప్రమాణం చేయడానికి వచ్చాను' అని అన్నాడు. అప్పుడు ప్రవక్త ఇలా అన్నారు: «వారి వద్దకు తిరిగి వెళ్లి, వారిని ఎలా నువ్వు కన్నీళ్లు పెట్టించావో అలాగే తిరిగి నవ్వించు» [128]. [128] ఈ హదీసును అబూ దావుద్, హదీసు సంఖ్య (2528) లో ఉల్లేఖించారు.
- చిన్నతనం నుండే పిల్లలకు తల్లిదండ్రుల పట్ల విధేయతను బోధించడం.
రక్తసంబంధాల తెగత్రెంపు చేసుకోవటం
బంధుత్వాన్ని త్రెంచుకోవడం, బంధువులతో చెడుగా ప్రవర్తించడం, లేదా వారి హక్కులను నెరవేర్చకుండా తప్పించుకోవడం; ఇవి అల్లాహ్ కలపమని ఆజ్ఞాపించిన దానిని త్రెంచివేసే నష్టపోయిన వారి లక్షణాలు. అంతేకాదు, నిశ్చయంగా ఇది ఒక నేరం మరియు ఘోరమైన పాపాలలో (కబాయిర్ లలో) ఒకటి. ఎవరి హృదయం కఠినంగా మారిపోయిందో, ఎవరిలో మానవత్వం తగ్గిపోయిందో మరియు బాధ్యత అనే భావన లేకుండా పోయిందో, అటువంటి వాడు తప్ప మరెవరూ ఈ నేరానికి పాల్పడరు.
బంధువులు అంటే తండ్రి వైపు నుండి మరియు తల్లి వైపు నుండి ఉండేవారు. బంధుత్వాన్ని తెంచుకోవడం అంటే వారిని వదిలివేయడం, వారిని కలవగలిగే అవకాశం ఉన్నప్పటికీ కలవకుండా ఉండటం, వారి సంతోషాలలో పాలుపంచుకోకపోవడం, వారి దుఃఖాలలో వారిని ఓదార్చకపోవడం. అలాగే, ఇతరుల కంటే వారే ఎక్కువ హక్కుదారులైనప్పటికీ, ప్రత్యేక కానుకలు మరియు బహుమతుల విషయంలో వారిపై ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా బంధుత్వాన్ని తెంచుకోవడమే అవుతుంది.
ఆధారాలు:
రక్త సంబంధాలను తెంచుకోవటం నిషేధం అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి, వాటిలో కొన్ని:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ﴾(వారితో ఇలా అను): "ఏమీ? మీరు (అల్లాహ్) ఆజ్ఞాపాలనకు విముఖులై, మరల భూమిలో సంక్షోభం రేకెత్తిస్తూ మీ బంధుత్వాలను తెంపుకుంటారా?22 ఇలాంటి వారినే అల్లాహ్ శపించాడు (బహిష్కరించాడు). వారిని చెవిటి వారిగా చేశాడు మరియు వారి కండ్లను గ్రుడ్డి చేశాడు. 23﴿ [ముహమ్మద్: 22-23]
మరియు శుభకరుడు,మహోన్నతుడు ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు అల్లాహ్ తో ఒడంబడిక చేసుకున్న తరువాత తమ వాగ్దానాన్ని భంగం చేసేవారు మరియు అల్లాహ్ కలపండి అని ఆదేశించిన వాటిని త్రెంచేవారు మరియు భూమిలో కల్లోలం రేకెత్తిచేవారు! ఇలాంటి వారందరికీ ఆయన శాపం (బహిష్కారం) ఉంటుంది మరియు వారికి (పరలోకంలో) బహుచెడ్డ నివాసముంటుంది.25﴿ [రఅద్: 25]
﴾...అల్లాహ్ కలపండి అని ఆదేశించిన వాటిని వారు త్రెంచేవారు...﴿
అనగా: అల్లాహ్ కలిపి ఉంచమని ఆజ్ఞాపించిన బంధుత్వ సంబంధాలను వారు తెంచుకుంటారు [129]. [129] తబరీ వ్యాఖ్యానం (13/514).
జుబైర్ బిన్ ముత్’ఇం రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా విన్నారు: “తెగత్రెంపులు చేసుకునేవాడు స్వర్గంలో ముమ్మాటికి ప్రవేశించలేడు” [130]. అంటే రక్తసంబంధాలను తెగత్రెంపు చేసుకునేవాడు. [130] ఈ హదీసును ముస్లిం, హదీసు సంఖ్య (5984) లో ఉల్లేఖించారు.
అబూ హురైర రజియల్లాహు అన్హు మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ద్వారా ఉల్లేఖిస్తున్నారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: అల్లాహ్ సమస్త జీవులను సృష్టించాడు. ఆ కార్యం పూర్తయ్యాక, బంధుత్వం లేచి, అల్లాహ్ శరణులోకి చేరింది (నడుముకు వస్త్రం కట్టే ప్రదేశాన్ని పట్టుకుంది). అప్పుడు ఆయన ‘ఆగు’ అన్నాడు. అప్పుడు అది, ‘ఇది బంధుత్వాల తెగత్రెంపుల నుండి నీ శరణు కోరుకునే స్థానం’ అని పలికింది. అప్పుడు ఆయన, ‘నీకిది ఇష్టమే కదా? ఎవరైతే నిన్ను కలుపుకుంటాడో, నేను అతన్ని కలుపుకుంటాను. ఎవరైతే నిన్ను త్రెంచుకుంటాడో, నేను అతన్ని త్రెంచుతాను’ అని అన్నాడు. అప్పుడు అది, ‘అవును నా ప్రభూ, ఇష్టమే’ అని పలికింది. అప్పుడు ఆయన, ‘అది నీకే’ అని అన్నాడు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: మీకు ఇష్టమైతే ఈ వాక్యాన్ని పఠించండి: ﴾ فَهَلۡ عَسَيۡتُمۡ إِن تَوَلَّيۡتُمۡ أَن تُفۡسِدُواْ فِي ٱلۡأَرۡضِ وَتُقَطِّعُوٓاْ أَرۡحَامَكُمۡ 22﴿. (వారితో ఇలా అను): "ఏమీ? మీరు (అల్లాహ్) ఆజ్ఞాపాలనకు విముఖులై, మరల భూమిలో సంక్షోభం రేకెత్తిస్తూ మీ బంధుత్వాలను తెంపుకుంటారా?" [ముహమ్మద్: 22] [131] ఈ హదీసును బుఖారీ (హదీసు సంఖ్య: 4830) మరియు ముస్లిం (హదీసు సంఖ్య: 2554) లో ఉల్లేఖించారు.
ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "బంధుత్వం దైవ పీఠానికి వ్రేలాడబడి, “నాతో సత్సంబంధాలు పెట్టుకున్నవాడితో అల్లాహ్ కూడా సత్సంబంధాలు పెట్టుకొనుగాక! నన్ను విచ్ఛిన్నం చేసినవాడిని అల్లాహ్ కూడా విచ్ఛిన్నం చేయుగాక” అని ప్రార్థిస్తూ ఉంటుంది". [132] [132] ఈ హదీసును బుఖారీ హదీసు సంఖ్య (5989) మరియు ముస్లిం, హదీసు సంఖ్య (2555) లో ఉల్లేఖించారు.
నష్టాలు:
మరియు ఈ పెద్ద పాపము యొక్క దుష్పరిణామాలు మరియు శిక్షలు:
- బంధుత్వ సంబంధాలను తెంచుకునేవాడు మహోన్నతుడైన అల్లాహ్ గ్రంథంలో శపించబడినవాడు, గత ఆయతులలో ఉన్నట్లుగా.
- మరియు అల్లాహ్, పాపాత్ములైన నష్టపోయేవారి లక్షణాలలో ఒకటిగా, అల్లాహ్ కలపమని ఆజ్ఞాపించిన దానిని త్రెంచటాన్ని చేసాడు, మరియు వాటిలో రక్తసంబంధాలు కూడా ఉన్నాయి, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఎవరైతే అల్లాహ్ తో స్థిరమైన ఒడంబడిక చేసుకున్న పిదప దానిని భంగ పరుస్తారో మరియు అల్లాహ్ స్థిరపరచమని ఆజ్ఞాపించిన దానిని త్రెంచుతారో మరియు భువిలో కల్లోలం రేకెత్తిస్తారో! ఇలాంటి వారే, వాస్తవంగా నష్టపడేవారు.27﴿ [బఖర: 27]
- బంధుత్వం త్రెంచుకునేవాడికి, పరలోకంలో అతని కొరకు దాచి ఉంచబడిన శిక్షతో పాటు, ఇహలోకంలో కూడా శిక్ష త్వరగా విధించబడుతుంది; అబూ బక్రహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "దాని యజమానికి అల్లాహ్ ఇహలోకములో శిక్షను త్వరితం చేయుటకు, పరలోకములో అతని కొరకు ఆదా చేసి ఉంచిన దానితో పాటు, దౌర్జన్యం మరియు బంధుత్వ సంబంధాలను త్రెంచుకోవడం కంటే ఎక్కువ అర్హమైన పాపం మరొకటి లేదు". [133]. [133] ఈ హదీసును అబూ దావుద్ హదీథు సంఖ్య (4902) లో ఉల్లేఖించారు.
- బంధుత్వాన్ని తెంచుకునే వానికి విధించబడే అతి గొప్ప శిక్షలలో ఒకటి, అతడు స్వర్గ ప్రవేశం నుండి నిరోధించబడతాడు. జూబైర్ బిన్ ముత్ఇమ్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “తెగత్రెంపులు చేసుకునేవాడు స్వర్గంలో ముమ్మాటికి కీ ప్రవేశించలేడు” [134]. [134] ఈ హదీసును బుఖారీ హదీసు సంఖ్య (5984) లో మరియు ముస్లిం హదీసు సంఖ్య (2556) లో ఉల్లేఖించారు.
- బంధుత్వాలను త్రెంచుకునే వాని ఆచరణ పైకి ఎత్తబడదు మరియు అల్లాహ్ దానిని అంగీకరించడు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పగా విన్నాను: "నిశ్ఛయంగా ఆదం సంతతి యొక్క కర్మలు ప్రతి గురువారం సాయంత్రం, శుక్రవారం రాత్రి సర్వోన్నతుడైన అల్లాహ్ ముందు ప్రవేశపెట్టబడతాయి, కానీ బంధుత్వ సంబంధాలను తెంచుకునే వాని కర్మ స్వీకరించబడదు". [135] [135] ఈ హదీసును అహ్మద్ హదీసు సంఖ్య (10272) లో ఉల్లేఖించారు.
రక్షణ:
ఈ మహాపరాదం యొక్క ప్రమాదాలలో పడకుండా రక్షించుకునే మార్గాలు:
- ముస్లిం బంధువర్గాలను కలుపుకుపోవడం యొక్క గొప్పతనాన్ని గుర్తుంచుకోవడం అతనికి వాటిని కాపాడుకోవడానికి ప్రేరణగా నిలుస్తుంది, దీనికి నిదర్శనంగా అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పగా విన్నాను: «ఎవరైతే తన ఉపాధిలో సమృద్ధిని, లేదా తన ఆయుష్షులో పెరుగుదలను (అనగా: అతని జీవన కాలము పొడిగించ బడాలని) కోరుకుంటాడో, అతను తన బంధువులతో సత్సంబంధాలు పెట్టుకోవాలి» [136]. [136] ఈ హదీసును బుఖారీ హదీసు సంఖ్య (2067) మరియు ముస్లిం, హదీసు సంఖ్య (2557) లో ఉల్లేఖించారు.
-అపకారానికి ఉపకారంతో బదులు ఇవ్వడం, మరియు తెగిపోయిన సంబంధాలను కలపడం; అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “బంధుత్వపు సంబంధాలను నిలబెట్టేవాడు అంటే తన బంధువులు చేసిన మేలుకు ప్రతిఫలం ఇచ్చేవాడని కాదు; కానీ, తనతో బంధుత్వపు బంధాన్ని తెంచుకున్న బంధువులతో సత్సంబంధాలు కొనసాగించేవాడు” [137]. [137] ఈ హదీసును బుఖారీ, హదీసు సంఖ్య (5991) లో ఉల్లేఖించారు.
- క్షమాపణలను స్వీకరించటం మరియు అపరాధాన్ని క్షమించటం, ఇవి దైవప్రవక్తలు మరియు సందేశహరుల (వారిపై అల్లాహ్ శాంతి మరియు శుభాలు కలుగుగాక) యొక్క నైతిక లక్షణాలలో ఒకటి. దీనికి యూసుఫ్ అలైహిస్సలాం ఒక గొప్ప ఉదాహరణ; తన సోదరులు తనకు అపకారం చేసినప్పటికీ, వారి మధ్య ప్రేమ బంధం నిలిచి ఉండేలా అతను వారిని మన్నించి, వారి చర్యను విస్మరించారు.
- బంధువుల నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా, వారి కోసం ధనప్రాణాలతో ఉదారంగా వ్యవహరించడం, వారికి చేసిన మేలును ఎత్తిచూపడం మరియు వారి శక్తికి మించిన భారాన్ని వారిపై మోపడం వంటి వాటిని మానుకోవడం, వారితో వినయంతో, సత్ప్రవర్తనతో మెలగడం, వారి తప్పులు మరియు పొరపాట్ల విషయంలో సహనం వహించడం, వాటిని పట్టించుకోకుండా వదిలివేయడం, వారి పట్ల సదభిప్రాయం కలిగి ఉండటం, వారిని అతిగా నిందించకుండా మరియు గద్దించకుండా ఉండటం.
- బంధువులను ఒకచోట చేర్చడం పట్ల శ్రద్ధ చూపడం: శుభకార్యాలకు మరియు విందులకు వారిని ఆహ్వానించడం, వారిని దర్శించడం, మరియు ఫోను ద్వారా వారితో సంభాషిస్తూ ఉండటం.
- పిల్లలకు బంధుత్వ సంబంధాల ప్రాముఖ్యతను అలవాటు చేయించాలి మరియు దానికి అనుగుణంగా వారిని పెంచడం జరగాలి, తద్వారా వారు పెద్దయ్యాక దానిని అనుసరించి ఆచరిస్తారు.
- కుటుంబ సమస్యలను సంప్రదింపులు మరియు దయతో పరిష్కరించటం, ముఖ్యంగా వారసత్వానికి సంబంధించిన విషయాలలో.
- బంధువులతో సంబంధాలు తెగిపోవడానికి దారితీసే మొహమాటమును వదిలివేయడం.
సోది, శకునాలను తెలపటం, జ్యోతిష్కం మరియు ఈ నిషిద్ధ కార్యాలను చేసేవారిని సంప్రదించడం.
సోది, జ్యోతిష్యం మరియు జ్యోతిష్య శాస్త్రం, వాటిని ఆచరించేవారి అకీదాను పాడుచేసే గొప్ప పాపాలు; ఎందుకంటే అతను అగోచర జ్ఞానం తెలుసునని దావా చేస్తాడు, లేదా విషయాలను నక్షత్రాలకు ఆపాదిస్తాడు, మరియు ఇవన్నీ తౌహీద్కు వ్యతిరేకమైనవి.
కాహిన్ అంటే భవిష్యత్తులోని అగోచర విషయాల గురించి తెలియజేసేవాడు. మనసులోని విషయాలను తెలియజేసేవాడని కూడా చెప్పబడింది.
అర్రాఫ్ అనేవాడు, కొన్ని ఆధారాల ద్వారా దొంగిలించబడిన వస్తువు, తప్పిపోయిన వస్తువు యొక్క ఆచూకీ మరియు అలాంటి ఇతర విషయాల గురించి తెలుపగలనని దావా చేసేవాడు.
జ్యోతిష్కుడు అంటే జ్యోతిశ్శాస్త్రాన్ని, గ్రహాల ప్రభావాన్ని ఉపయోగించేవాడు. ఉదాహరణకు: ఫలానా నక్షత్రం ఉదయించి, మరో ఫలానా నక్షత్రంతో కలిస్తే, ఫలానా ఫలానా సంఘటనలు జరుగుతాయని; లేదా ఫలానా వ్యక్తికి ఫలానా రాశిలో ఒక బిడ్డ జన్మిస్తే, అతనికి ధనము, పేదరికము లేదా సౌభాగ్యము, దౌర్భాగ్యము మొదలైనవి కలుగుతాయని చెబుతాడు. ఈ విధంగా వారు నక్షత్రాల గమనాన్ని భూమి యొక్క మరియు అందులోని ప్రజల యొక్క స్థితిగతులకు ఆధారంగా చేసుకుంటారు [138]. [138] చూడండి తైసీరుల్ అజీజిల్ హమీద్ (పేజీ351).
దీనిలో అగోచర విషయాల గురించి తెలియజేసేవారు, లేదా మరుగున పడిన విషయాల జ్ఞానం ఉందని వాదించేవారు, లేదా తారాబలం, ఇసుకపై గీతలు గీయడం, కంకరు రాళ్ళు, ఫంజానను చూడటం, హస్త సాముద్రికం మొదలైన వాటి ద్వారా అగోచర విషయాలను గ్రహించేవారు చేరి ఉంటారు, కాబట్టి, పేర్కొనబడిన లేదా ఇతర ఏ మార్గాల ద్వారా అయినా అగోచర జ్ఞానం ఉందని ఎవరైతే దావా చేస్తాడో, అతను అసత్యవాది, కాఫిర్ అవుతాడు [139]. [139]చూడండి ఫౌజాన్ అఖీదతుత్తౌహీద్ (పేజీ: 97).
జ్యోతిష్కులు, పూజారులు మరియు వారి వంటి ఇతర మోసగాళ్ల వద్దకు వెళ్ళటం అనేది తీవ్రంగా హెచ్చరించబడిన మహా పాపాలలో ఒకటి అని గమనించడం తప్పనిసరి. మరియు ఈ పాపంలో పడటం వలన ధార్మిక మరియు ప్రాపంచిక విషయాలలో అనేక అనర్థాలు మరియు చెడు పరిణామాలు సంభవిస్తాయి.
ఆధారాలు:
జ్యోతిష్యం, సోదె చెప్పడం, రాశిఫలాలు చూడటం, ఇంకా ఈ నిషిద్ధ కార్యాలు చేసేవారి వద్దకు వెళ్ళటం హరాం (నిషిద్ధం) అని ఆధారాలు స్పష్టంగా సూచిస్తున్నాయి; వాటిలో కొన్ని:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ﴾ఆధారం లేని అభిప్రాయాలు గలవారే నాశనం చేయబడేవారు! వారు మాయలో మునిగిపోయి నిర్లక్ష్యంగా ఉన్నారు. వారు ప్రశ్నిస్తారు: 'న్యాయదినం ఎప్పుడు వస్తుంది?'12﴿ [అద్ దారియాత్: 10-12]
అనగా: అబద్ధాన్ని మరియు అసత్యాన్ని ఊహించి చెప్పే జ్యోతిష్కులు శపించబడ్డారు (ఖర్ స్ అనగా అబద్ధం మరియు ఊహ), మరియు ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఇలా పలికారు: "వారే జ్యోస్యులు" [140]. [140] చూడండి: తబ్రీ వ్యాఖ్యానము (21/492).
హజ్రత్ జైద్ బిన్ ఖాలిద్ రజియల్లాహు అన్హు కథనం: మేము హుదైబియా సంవత్సరంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి బయలుదేరాము. ఒక రాత్రి మాపై వర్షం కురిసింది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఫజ్ర్ నమాజ్ చేయించారు. ఆ తర్వాత మా వైపు తిరిగి, “మీ ప్రభువు ఏమన్నాడో తెలుసా?” అని అడిగారు. మేము, "అల్లాహ్ కి, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు" అని చెప్పాము. అప్పుడాయన అన్నారు: “అల్లాహ్ ఇలా అన్నాడు: తెల్లవారేటప్పటికి నా దాసుల్లో కొందరు నన్ను విశ్వసించారు, మరికొందరు నన్ను తిరస్కరించారు. ఎవరైతే, 'అల్లాహ్ కారుణ్యం వల్ల, ఆయన జీవనోపాధి వల్ల మరియు ఆయన అనుగ్రహం వల్ల మాకు వర్షం కురిసింది' అని అన్నారో, వారు నన్ను విశ్వసించారు, నక్షత్రాలను తిరస్కరించారు. మరియు ఎవరైతే, 'ఫలానా నక్షత్రం వల్ల మాకు వర్షం కురిసింది' అని అన్నారో, వారు నక్షత్రాలను విశ్వసించారు, నన్ను తిరస్కరించారు.” [141]. [141] దీనిని బుఖారీ హదీసు సంఖ్య (4147) మరియు ముస్లిం, హదీసు సంఖ్య (71) లో ఉల్లేఖించారు.
ఈ హదీసులో దాసులు రెండు వర్గాలుగా విభజించబడ్డారు:
మొదటి వర్గము: అల్లాహ్ ను విశ్వసించేవాడు. అతడు ఈ అనుగ్రహాన్ని అల్లాహ్ కు ఆపాదించి, దానిపై ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతాడు, అది అల్లాహ్ వద్ద నుండే వచ్చిందని గ్రహించి, దాని ద్వారా అల్లాహ్ ను కీర్తించి, ఆయనను ప్రశంసిస్తాడు.
రెండవ వర్గం: అల్లాహ్ ను తిరస్కరించువారు, మరియు తిరస్కారులు రెండు రకాలు:
మొదటి రకం: చిన్న స్థాయి అవిశ్వాసానికి పాల్పడినవాడు, ఉదాహరణకు “ఫలాన ఫలాన నక్షత్రం లేదా గ్రహం కారణంగా వర్షం కురిసింది” అని చెబుతూ, నక్షత్రాలు మరియు గ్రహాలు వర్షానికి కారణమని విశ్వసించేవాడు. అతని ఈ అవిశ్వాసం చిన్న స్థాయి అవిశ్వాసం; ఎందుకంటే అతడు (వాటికి) దైవత్వంలో భాగస్వామ్యం ఉందని గానీ లేదా అవి స్వతంత్రంగా పనిచేస్తాయని గానీ విశ్వసించలేదు, కానీ అతడు కారణం కాని దానిని కారణంగా పరిగణించాడు మరియు అనుగ్రహాన్ని అల్లాహేతరులకు ఆపాదించాడు. కాబట్టి అతని మాట అవిశ్వాసుల మాటలలో ఒకటి, మరియు ఇది అత్యున్నతుడైన అల్లాహ్ పట్ల చిన్న స్థాయి అవిశ్వాసం.
రెండవ రకం: ఘోరమైన అవిశ్వాసానికి పాల్పడేవాడు. అతడు ఎవరంటే, వర్షం అనేది గ్రహాలు మరియు నక్షత్రాల ప్రభావం వల్లనే కురుస్తుందని, అవే వర్షాన్ని అనుగ్రహంగా కురిపిస్తాయని, మరియు వాటి ఆరాధకులు వాటి వైపుకు తిరిగి ప్రార్థించినప్పుడు, అవి చలించి వారి ప్రార్థనలకు జవాబుగా వర్షాన్ని కురిపిస్తాయని విశ్వసించినవాడు. ఇది ఏకాభిప్రాయం ప్రకారం ఘోరమైన అవిశ్వాసం; ఎందుకంటే ఇది ఘనత వహించినవాడు మరియు సర్వోన్నతుడైన అల్లాహ్ కాకుండా ఇతరులకు ప్రభుత్వాన్ని (రుబూబియత్ ను) మరియు దైవత్వాన్ని ఆపాదించే విశ్వాసం [142]. [142] షైఖ్ సాలిహ్ ఆలుష్షైఖ్ రచించిన అత్తమ్హీద్ లిషరహ్ కితాబుత్తౌహీద్ (పేజీ 356) చూడండి.
అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా ప్రవచించినారు: “ఎవరైతే నక్షత్ర గమనాల ద్వారా (గ్రహాల గమనాల ద్వారా) భవిష్యత్తు గురించి చెప్పే విద్యను నేర్చుకుంటే, అతడు చేతబడి (భూతవైద్యం, మంత్రతంత్రాల విద్య) లో ఒక భాగం (ఒక శాఖను) నేర్చుకున్నట్లే. అతడు ఎంత కాలం ఆ విద్యను గడించితే అంత ఎక్కువగా దానిని పొందినట్లే.” [143]. అనగా: జ్యోతిష్య శాస్త్రమును ఎంత అధికంగా అభ్యసిస్తే, మాయాజాలవిధ్యలో అంత లోతుగా నిమగ్నమవుతాడు, మరియు తత్ఫలితంగా అతని పాపం మరియు అపరాధం అధికమవుతుంది. [143] ఈ హదీసును అబూ దావుద్ హదీసు సంఖ్య (3905) లో ఉల్లేఖించారు.
అబూ మస్'ఊద్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: «మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ కుక్క మూల్యం నుండి, వ్యబిచారి మహర్ (కన్యాశుల్కం) నుండి, జ్యోతిష్కుని పారితోషికం నుండి వారించారు» [144]. మరియు జ్యోతిష్యుని హుల్వాన్ అనగా, అతను తన జ్యోతిష్యం చెప్పినందుకు తీసుకునే ప్రతిఫలం. [144] ఈ హదీసును బుఖారీ, హదీసు సంఖ్య (2237) మరియు ముస్లిం, హదీసు సంఖ్య (1567) లో ఉల్లేఖించారు.
ముఆవియా బిన్ అల్ హకమ్ అస్సులమి రజియల్లాహు అన్హు కథనం: నేను అడిగాను, "దైవప్రవక్తా! నేను నిన్నమొన్నటివరకూ అజ్ఞాన జీవితమే గడిపాను. ఇప్పుడే అల్లాహ్ ఇస్లాం ధర్మం తీసుకు వచ్చాడు. మాలో కొంతమంది జ్యోతిష్యుల వద్దకు వెళ్తున్నారు". అందుకాయన, "నువ్వు వారి వద్దకు వెళ్లకు" అని చెప్పారు [145]. [145] ఈ హదీసును ముస్లిం, హదీసు సంఖ్య (537) లో ఉల్లేఖించారు.
సఫియ రజియల్లాహు అన్హా మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణులలో నుంచి కొందరు ఉల్లేఖించారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “ఏదైనా విషయం గురించి ప్రశ్నించడానికి ఎవరైతే జ్యోతిష్కుని వద్దకు వెళతారో మరియు అతడు చెప్పిన దానిని విశ్వసిస్తారో – నలభై దినముల పాటు అతని నమాజులు స్వీకరించబడవు.” [146]. [146] ఈ హదీసును ముస్లిం హదీసు సంఖ్య (2230) లో ఉల్లేఖించారు.
అబూ హురైర రజియల్లాహు అన్హు మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ద్వారా ఉల్లేఖిస్తున్నారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: "ఎవరైన బహిష్టులో ఉన్న స్త్రీతో సంభోగించినా, లేదా స్త్రీతో ఆమె మల మార్గంలో సంభోగించినా, లేదా జ్యోతిష్యుని వద్దకు వెళ్ళినా, అతడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన దానిని తిరస్కరించాడు". [147] [147] ఈ హదీసును తిర్మిథీ, హదీసు సంఖ్య (135) లో ఉల్లేఖించారు.
ఇమామ్ ఖుర్తుబీ రహిమహుల్లాహ్ జ్యోతిష్కుల విషయంలో ఇలా పలికారు: "హిస్బా బాధ్యత వహించే వారి (అనగా బజారులను మరియు నైతిక వ్యవహారములను పర్యవేక్షించే అధికారి) బాధ్యత ఏమిటంటే, వారిని బజారుల నుండి తొలగించాలి, వారిని కఠినంగా వారించాలి, మరియు ఆ పని కొరకు ఎవరినీ వారి వద్దకు వెళ్ళనివ్వకూడదు" [148]. [148] అల్ ముఫ్హిమ్ లిమా అష్కల మిన్ తల్ఖీసి ముస్లిం (5/633).
నష్టాలు:
జ్యోతిష్యం, శకునాలను తెలపటం, గ్రహ జ్యోతిష్యం మరియు ఈ చెడు కార్యాలను ఆచరించే వారి వద్దకు వెళ్ళటం వల్ల కలిగే నష్టాలు:
- వీటిని చేసే వ్యక్తి తాగూత్ అనే పరిధిలోకి వస్తాడు; అలాంటి వారిని ఆశ్రయించడం తాగూత్ వద్ద తీర్పు కోరినట్లే. తాగూత్ అనగా అల్లాహ్ను వదిలి ఆరాధించబడే ప్రతిదీ. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిస్తున్నాడు: ﴾(ఓ ప్రవక్తా!) ఏమీ? నీ వద్దకు పంపబడిన దానిని మరియు నీ కంటే పూర్వం పంపబడిన దానిని మేము విశ్వసించామని పలికే వారిని (కపట విశ్వాసులను) నీవు ఎరుగవా (చూడలేదా)? తిరస్కరించండని ఆదేశింపబడినా, వారు తమ (వ్యవహారాల) పరిష్కారాలకు తాగూత్ వద్దకే పోవాలని కోరుతూ ఉంటారు. మరియు షైతాన్ వారిని, త్రోవ తప్పించి, దుర్మార్గంలో అతి దూరంగా తీసుకొని పోవాలని కోరుతుంటాడు.60 [నిసా: 60] తబరీ, ఖతాదా నుండి ఉల్లేఖించిన దాని ప్రకారం ఈ ఆయత్ ఇద్దరు వ్యక్తుల గురించి అవతరించింది: ఒకరు అన్సార్లలోని వ్యక్తి, మరొకరు యూదుడు. వారి మధ్య ఒక హక్కు విషయంలో వివాదం ఉండగా, వారు తమ మధ్య తీర్పు కోసం అల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను వదిలి, మదీనాలోని ఒక జ్యోతిష్యుడి వద్దకు వెళ్లారు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ చర్యను ఖండించాడు[149]. [149] తబ్రీ వ్యాఖ్యానం (7/191).
- ఇది పూర్వపు జాహిలియా కాలం వారి చర్యలకు చెందినది, బుఖారీ ఇలా పేర్కొన్నారు: జాబిర్ ఇలా అన్నారు: "ప్రజలు తీర్పు కోసం వెళ్ళే తాగూత్లు ఉండేవారు, జుహైనాలో ఒకరు, అస్లంలో ఒకరు, మరియు ప్రతి తెగలో ఒకరు. వారు జ్యోతిష్యులు, వారిపై షైతాన్ అవతరించేవాడు..." మరియు ఇక్రిమా అన్నారు: "జిబ్త్ అంటే హబషా భాషలో షైతాన్, మరియు తాగూత్ అంటే జ్యోతిష్యుడు" [150]. [150] సహీహ్ బుఖారీ (6/ 45).
- అది మానవులు మానవుల ద్వారా, మరియు మానవులు జిన్నుల ద్వారా కలిగే ఫిత్నా (పరీక్ష)లలో ఒకటి; ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనం: కొంతమంది ప్రజలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను జ్యోతిష్యుల గురించి ప్రశ్నించారు. అప్పుడు ఆయన, “వారికి ఏ జ్ఞానం లేదు” అన్నారు. దానికి వారు, “ఓ రసూలుల్లాహ్, వారు చెప్పే విషయాలు ఒక్కోసారి నిజమవుతాయి కదా!” అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అది సత్యానికి సంబంధించిన ఒక మాట, దానిని జిన్ను దొంగిలించి, కోడి కూసినట్లుగా తన మిత్రుని చెవిలో వేస్తుంది. దానికి వారు వంద కంటే ఎక్కువ అబద్ధాలు కలుపుతారు.” [151]. [151] ఈ హదీసును బుఖారీ హదీసు సంఖ్య (7561) మరియు ముస్లిం హదీసు సంఖ్య (2228) లో ఉల్లేఖించారు.
అంటే: జ్యోతిష్కుడు, షైతానులలోని తన మిత్రుడు తనకు అందించిన ఒక మాటతో పాటు వంద అబద్ధాలు జతచేస్తాడు, లేదా షైతానే ఆకాశం నుండి దొంగిలించిన ఆ మాటతో పాటు వంద అబద్ధాలు కలిపి, వాటన్నింటినీ మానవులలోని తన మిత్రునికి తెలియజేస్తాడు. ఈ విధంగా మానవుడు ఆ జ్యోతిష్కుని ద్వారా, మరియు వారిద్దరూ షైతానులలోని తమ మిత్రుని ద్వారా పరీక్షకు గురవుతారు. వారు ఆకాశం నుండి తీసుకువచ్చే వార్తలలో కొన్నిసార్లు నిజం పలకడం వలన, ప్రజలు వారు చెప్పే సత్య, అసత్యాలన్నింటినీ స్వీకరిస్తారు [152]. [152] చూడండి తైసీరుల్-అజీజిల్-హమీద్ (పేజీ 223).
- జ్యోతిష్కుడి వద్దకి వెళ్ళి అతన్ని ఏదైనా విషయం గురించి అడిగి తెలుసుకొని దాన్ని నమ్మినట్లైతే ఆ వ్యక్తి నమాజు నలభై రోజుల వరకు ఆమోదించబడదు, గత హదీసులో ప్రస్తావించబడినట్లుగా.
రక్షణ:
జ్యోతిష్యం, శకునాలను తెలపటం, మరియు అలాంటి వాటి నుండి రక్షణ కొరకు గల కారణాలలో కొన్ని:
- అగోచర విషయాల జ్ఞానం అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ లేదనే సంపూర్ణ విశ్వాసం, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾వారితో అను: "ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న అగోచర విషయజ్ఞానం గలవాడు అల్లాహ్ తప్ప మరొకడు లేడు...﴿ [అన్-నమ్ల్: 65] పరిశుద్ధుడైన అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾మరియు ఆయన (అల్లాహ్) ఆదమ్ కు సకల వస్తువుల పేర్లను నేర్పాడు, ఆ పిదప వాటిని దేవదూతల ఎదుట ఉంచి: "మీరు సత్యవంతులే అయితే, వీటి పేర్లను నాకు తెలుపండి." అని అన్నాడు. 31 వారు (దేవదూతలు): "నీవు సర్వలోపాలకు అతీతుడవు, నీవు తెలిపినదే తప్ప మాకు మరేమీ తెలియదు. నిశ్చయంగా, నీవే సర్వజ్ఞుడవు, మహా వివేకవంతుడవు." అని అన్నారు. 32﴿ [అల్ బఖర: 31,32] ఆయన వారికి తెలిపినది తప్ప మరేమీ తెలుసుకోలేమనే తమ అసమర్థతను తమ మాటల ద్వారా అంగీకరించడం తప్ప వారికి వేరే గతి లేకపోయింది: ﴾నీవు సర్వలోపాలకు అతీతుడవు, నీవు తెలిపినదే తప్ప మాకు మరేమీ తెలియదు...﴿ ఆ విధంగా, అగోచర జ్ఞానం నుండి ఏదైనా తెలుసని వాదించే జ్యోతిష్కులు మరియు సోది చెప్పేవారిలో ప్రతి ఒక్కరి మాట అసత్యమని చెప్పడానికి ఇందులో అత్యంత స్పష్టమైన నిదర్శనం మరియు రుజువు ఉంది [153]. [153] తబరీ వ్యాఖ్యానం (1/527, 528).
- తాగూత్ను తిరస్కరించడంతో పాటు మహోన్నతుడైన అల్లాహ్ కొరకు దాస్యమును నిరూపించుకోవడం. మరియు ఎవరైతే అగోచర జ్ఞానం తెలుసునని దావా చేస్తాడో లేదా విషయాలను నక్షత్రాలకు ఆపాదిస్తాడో మరియు అవి స్వయంగా ప్రభావం చూపుతాయని భావిస్తాడో, అతను హద్దును అతిక్రమించి, హద్దు దాటి, అవిశ్వాసానికి పాల్పడి, తాగూత్ అయిపోయాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾కావున కల్పితదైవాన్ని (తాగూత్ ను) తిరస్కరించి, అల్లాహ్ ను విశ్వసించిన వాడు, సుస్థిరమైన, ఎన్నటికీ విడిపోని ఆధారాన్ని పట్టుకున్నట్లే. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.﴿ [అల్ బఖర: 256] సయీద్ బిన్ జుబైర్ ఉల్లేఖనం: తాగూత్: సోదెగాడు [154]. [154] తబ్రీ వ్యాఖ్యానం (4/ 557).
- తౌహీద్ నేర్చుకోవడం, దానిని బోధించడం మరియు దానికి విరుద్ధమైన దానిని తెలుసుకోవడం, మంచిని ఆజ్ఞాపించడం మరియు చెడు నుండి వారించడం, మరియు ఈ షైతానీ కార్యాలు చేసే వారిపై షరియా శిక్షలను అమలుపరచడం.
విగ్రహాలను తయారుచేయడం
విగ్రహాలు తయారుచేయడం అనేది షరిఅత్ హెచ్చరించిన మహా పాపాలలో ఒకటి, దానిని చేసేవారిని శపించబడింది మరియు తీవ్రమైన శిక్షతో హెచ్చరించబడింది. ఇది విగ్రహారాధన మరియు సర్వోన్నతుడైన అల్లాహ్ తో షిర్క్ చేయడానికి దారితీసే అతిపెద్ద కారణాలలో ఒకటి.
విగ్రహాలను తయారుచేయడం యొక్క వాస్తవికత ఏమిటంటే: దాసుడు రాయి, మట్టి, ఇనుము, రాగి లేదా ఇతర పదార్థాలతో, అల్లాహ్ సృష్టించిన ప్రాణమున్న వాటిని పోలిన రూపాన్ని తయారుచేయడం.
విగ్రహాలను తయారు చేయడం మరియు వాటిని సొంతం చేసుకోవడం నిషేధమని విద్వాంసులు ఏకగ్రీవంగా అంగీకరించారు [155]. [155]ఫత్హుల్ బారీ చూడండి (10/391).
ఇమాం అన్’నవవీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: "నీడ ఉన్న వాటిని నిషేధించడం మరియు వాటిని మార్చడం తప్పనిసరి అనే దానిపై ఏకాభిప్రాయం ఉంది, ఖాదీ ఇలా అన్నారు: 'చిన్న బాలికలు బొమ్మలతో ఆడుకోవడానికి మరియు ఆ విషయంలో ఇవ్వబడిన అనుమతికి సంబంధించిన విషయం తప్ప" [156]. [156] షర్హు ముస్లిం (14/82)
ఆధారాలు:
చిత్రపటాలు గీయడం మరియు విగ్రహాలు తయారు చేయడం నుండి హెచ్చరిస్తూ సున్నత్ లో అనేక ఉల్లేఖనాలు ప్రస్తావించబడ్డాయి, వాటిలో కొన్ని:
అబ్దుల్లాహ్ ఇబ్న ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎవరైతే ఈ చిత్రపటాలను తయారు చేస్తున్నారో వారిని ప్రళయదినాన శిక్షించబడుతుంది. మరియు వారికి మీరు తయారు చేసిన వాటిలో ప్రాణం పోయమని ఆదేశించబడుతుంది". [157]. [157] ఈ హదీసును బుఖారీ హదీసు సంఖ్య (5607) మరియు ముస్లిం, హదీసు సంఖ్య (2108) లో ఉల్లేఖించారు.
ముస్లిం బిన్ సుబైహ్ ఉల్లేఖనం: మేము మస్రూఖ్ తో కలిసి యసార్ బిన్ నుమైర్ ఇంట్లో ఉన్నాము. అక్కడ ఆయన ఇంట్లో కొన్ని బొమ్మలు చూసి, మస్రూఖ్ ఇలా అన్నారు: నేను అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పగా విన్నాను, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పగా విన్నారని: «ప్రళయదినాన అల్లాహ్ వద్ద అందరికంటే కఠినమైన శిక్ష అనుభవించేవారు చిత్రకారులు» [158]. [158] ఈ హదీసును బుఖారీ (హదీసు సంఖ్య: 5950) మరియు ముస్లిం (హదీసు సంఖ్య: 2109) లో ఉల్లేఖించారు.
అబూ జుర్ఆ ఉల్లేఖనం ప్రకారం: నేను అబూ హురైర రజియల్లాహు అన్హుతో కలిసి మర్వాన్ ఇంట్లోకి ప్రవేశించాను. అక్కడ ఆయన కొన్ని చిత్రపటాలు చూసి, ఇలా అన్నారు: నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవివ్వగా విన్నాను, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: «నేను సృష్టించినట్లు సృష్టించటానికి ప్రయత్నించేవారికంటే దుర్మార్గులు మరెవరుంటారు? వారు ఒక అణువుని సృష్టించాలి, లేక ఒక గింజను సృష్టించాలి, లేక ఒక బార్లీ గింజను సృష్టించాలి» [159]. [159] ఈ హదీసును బుఖారీ (హదీసు సంఖ్య: 7559) మరియు ముస్లిం (హదీసు సంఖ్య: 2111) లో ఉల్లేఖించారు.
సయీద్ ఇబ్నె అబీ హసన్ కధనం: నేను హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా వద్ద ఉండగా, ఒక వ్యక్తి ఆయన వద్దకు వచ్చి ఇలా అన్నాడు: 'నేను నా చేతి వృత్తితో జీవనం సాగించే వ్యక్తిని, నేను ఈ చిత్రాలను తయారు చేస్తాను.' అప్పుడు హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఇలా అన్నారు: 'నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి విన్నది తప్ప మరేదీ నీకు చెప్పను. ఆయన ఇలా ప్రవచించగా నేను విన్నాను: "ఎవరైతే ఒక చిత్రాన్ని రూపొందిస్తారో, అల్లాహ్ అతన్ని అందులో ప్రాణం పోసేంత వరకు శిక్షిస్తాడు, కానీ అతను దానిలో ఎప్పటికీ ప్రాణం పోయలేడు."' అది వినగానే ఆ వ్యక్తి తీవ్రంగా భయపడిపోయాడు (అంటే: అతని శ్వాస బరువెక్కింది, గుండె ఆగినంత పనైంది, భయంతో నిండిపోయాడు), మరియు అతని ముఖం పాలిపోయింది. అప్పుడు ఇబ్నె అబ్బాస్ ఇలా అన్నారు: 'అయ్యో! నీవు బొమ్మలు గీయటం తప్పదనుకుంటే, ఈ చెట్లను, ప్రాణం లేని ప్రతి వస్తువును గీయి [160]. [160] ఈ హదీసును బుఖారీ హదీసు సంఖ్య (2225) మరియు ముస్లిం హదీసు సంఖ్య (2110) లో ఉల్లేఖించారు.
అబూ తల్హహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: «కుక్క మరియు చిత్రపటం ఉన్న ఇంటిలోనికి దైవదూతలు ప్రవేశించరు» [161]. బుఖారీ ఇలా పేర్కొన్నారు: అనగా సజీవుల ప్రతిమలు. [161] ఈ హదీసును బుఖారీ హదీసు సంఖ్య (4002) మరియు ముస్లిం హదీసు సంఖ్య (2106) లో ఉల్లేఖించారు.
అబుల్ హయ్యాజ్ అల్-అసదీ ఉల్లేఖనం: అలీ బిన్ అబూ తాలిబ్ నాతో ఇలా సెలవిచ్చారు: "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఏ ఆదేశాలతో ఇక్కడికి పంపినారో, అవే ఆదేశాలతో నిన్ను కూడా పంపనా! ఏ చిత్రపటాన్నైనా, ప్రతిమ, బొమ్మ, శిల్పము మొదలైన వాటిని చెరిపి వేయకుండా, తొలగించకుండా వదలకు, అలాగే ఎత్తుగా నిర్మించిన లేదా ఏదైనా కట్టడం నిర్మించి ఉన్న ఏ సమాధిని కూడా నేలమట్టం చేయకుండా వదలకు" [162]. [162] ఈ హదీసును ముస్లిం హదీసు సంఖ్య (969) లో ఉల్లేఖించారు.
ఇబ్నె తైమియహ్ ఇలా పలికారు: అందువల్ల ఆయన రెండు ప్రతిమలను నిర్మూలించమని ఆదేశించారు: మరణించిన వ్యక్తి రూపంలో ఉన్న చిత్రం, మరియు అతని సమాధి పైన ఎత్తుగా నిర్మించిన ప్రతిమ. ఎందుకంటే ఈ రెండింటి ద్వారా బహుదైవారాధన సంభవిస్తుంది [163]. [163] మజ్మూఉల్ ఫతావా (17/462).
నష్టాలు:
విగ్రహాలను తయారు చేయడం వలన అనేక నష్టాలు ఉన్నాయి, వాటిలో కొన్ని:
- అది అల్లాహ్ తఆలాతో షిర్క్ కు ఒక కారణము. మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ వాక్కు విషయంలో ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఇలా పలికారు: ﴾మరియు వారు ఒకరితోనొకరు ఇలా అనుకున్నారు: 'మీరు మీ ఆరాధ్యదైవాలను విడిచి పెట్టకండి. వద్ద్ మరియు సువాఅ; యగూస్, యఊఖ్ మరియు నస్ర్ లను విడిచిపెట్టకండి!'23﴿ [నూహ్: 23]. ఇవి నూహ్ జాతికి చెందిన పుణ్య పురుషుల పేర్లు. వారు మరణించిన తరువాత, షైతాన్ వారి జాతి వారికి, వారు కూర్చునే సభాస్థలిలో వారి విగ్రహాలను (అనగా ప్రతిమలను) ప్రతిష్టించి, వాటికి వారి పేర్లను పెట్టుకోమని ప్రేరేపించాడు. వారు అలాగే చేశారు, కానీ వాటిని ఆరాధించలేదు. ఆ తరం నశించి, జ్ఞానం అంతరించిన తరువాత, వాటి ఆరాధన ప్రారంభమైంది [164]. [164] ఈ హదీసును బుఖారీ హదీథు సంఖ్య (4920) లో ఉల్లేఖించారు.
- ఇందులో మహోన్నతుడైన అల్లాహ్తో పోటీ పడటం, అలాగే ఆయన అత్యంత మహత్తరమైన లక్షణాలలో ఒకటైన సృష్టించటం యొక్క లక్షణంలో ఆయనతో భాగస్వామ్యం చేయడం ఉంది.
- ప్రళయదినాన దాసునిపై మహోన్నతుడైన అల్లాహ్ ఆగ్రహానికి ఇది ఒక కారణం, చిత్రాలను రూపొందించేవారు అల్లాహ్ వద్ద అత్యంత హీనమైన సృష్టితాలు. విశ్వాసుల మాత ఆయేషా (రదీయల్లాహు అన్హా) ఉల్లేఖించారు, ఉమ్మ్ హబీబా మరియు ఉమ్మ్ సలమా (రదీయల్లాహు అన్హుమా) ఇథియోపియాలో తాము చూసిన ఒక చర్చి గురించి ప్రస్తావించారు, అందులో చిత్రపటాలు ఉన్నాయి. వారు దాని గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు చెప్పగా, ఆయన ఇలా అన్నారు: "వారిలోని పుణ్యాత్ములు చనిపోయినప్పుడు, వారి సమాధుల పైన ఆలయాలు నిర్మించి, వారి చిత్రాలు చేసేవారు అవే ఈ చిత్రాలు; ప్రళయదినాన అల్లాహ్ వద్ద సృష్టి రాశుల్లో కెల్లా అత్యంత నీచమైన జీవులు వీరు". [165]. [165] ఈ హదీసును బుఖారీ హదీసు సంఖ్య (427) మరియు ముస్లిం హదీసు సంఖ్య (528) లో ఉల్లేఖించారు.
- ఇది చేసేవాడిపై ప్రవక్త ﷺ శాపం పడటానికి ఒక సబబు, అబీ జుహైఫా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: "దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రూపాలను చిత్రించేవాడిని ధూత్కరించారు". [166] [166] ఈ హదీసును బుఖారీ హదీసు సంఖ్య (2238) లో ఉల్లేఖించారు.
- గతంలో హదీసులలో వివరించబడినట్లుగా, ఇది ప్రళయదినాన తీవ్రమైన శిక్షకు కారణమవుతుంది.
- గత హదీసులో ఉన్నట్లుగా చిత్రపటం లేదా విగ్రహం ఉన్న ఇంట్లోకి దైవదూతలు ప్రవేశించరు.
- ఇది క్రైస్తవులు మరియు ఇతరులైన తిరస్కారుల వైఖరిని అవలంభించటం.
రక్షణ:
ఈ మహాపాతకం నుండి రక్షించుకునే మార్గములు:
- దాసుడు ప్రళయదినాన తనపై అల్లాహ్ యొక్క ఆగ్రహాన్ని, మరియు తాను ఊదలేని ఈ విగ్రహంలో ఆత్మను ఊదమని అతనికి బాధ్యత ఇవ్వబడటాన్ని, మరియు తన ప్రవక్త యొక్క శాపం అతనిపై తప్పనిసరి అవ్వటాన్ని స్మరించుకోవాలి.
- ఒకవేళ అతను విగ్రహాలను తయారు చేయడాన్ని తన వృత్తిగా చేసుకున్నట్లయితే, ఎవరైతే అల్లాహ్ కొరకు ఏదైనా వదిలివేస్తారో, అల్లాహ్ అతనికి ఇహపర లోకాల్లో దానికన్నా ఉత్తమమైన దానిని బదులుగా ప్రసాదిస్తాడని అతను తెలుసుకోవాలి; ఎందుకంటే అతను ఆ పనిని అల్లాహ్ కొరకు వదిలివేస్తే, అల్లాహ్ అతనికి అతను ఊహించని చోటు నుండి హలాల్ ఉపాధిని ప్రసాదిస్తాడు.
మరియు తన ప్రార్థన స్వీకరించబడకపోవటం మరియు తన సంతానం సజ్జనులుగా, యోగ్యులుగా ఉండకపోవటంపై నిషిద్ధమైన సంపాదన యొక్క ప్రభావాన్ని గుర్తుంచుకోవాలి.
ఇక, ఎవరైనా ఈ పనిని కేవలం మనోరంజనం కోసం లేదా వారు అభిరుచి అని పిలుచుకునే దాని కోసం చేస్తే, అతను సర్వోన్నతుడైన అల్లాహ్ కోసం దానిని విడిచిపెట్టి, దానికి బదులుగా అల్లాహ్ ధర్మసమ్మతం చేసిన ఇహలోక జీవితపు అలంకారాల నుండి వేరొకదాన్ని ఎంచుకోవడమే అతనికి శ్రేయస్కరం. ఒకవేళ అతను ఆ పని చేయాలనే పట్టుబడితే, అతను చెట్లు, భవనాలు మరియు నిర్జీవ వస్తువుల వంటి ప్రాణం లేని వాటి ప్రతిమలను తయారు చేసుకోవాలి.
-బాధ్యతాయుతమైన మరియు సంబంధిత అధికారుల వంటి అధికారం కలిగిన వారు, మరియు తన ఇంట్లో ఇంటి యజమాని, బొమ్మలను తొలగించి, వాటిని విరగ్గొట్టాలి.
స్వలింగ సంపర్కము
స్వలింగ సంపర్కము, అనగా పురుషుల పిరుదులలో సంభోగించడం, ఘోరపాపాలలో ఒక ఘోరపాపము. అది అల్లాహ్ ప్రజలను సృష్టించిన స్వచ్ఛమైన స్వభావాన్ని తలక్రిందులు చేస్తుంది. అందువల్ల అది నైతికతను నాశనం చేస్తుంది, పౌరుషాన్ని తుడిచివేస్తుంది, సంతానాన్ని అరికడుతుంది, సమాజాన్ని పాడుచేస్తుంది, మరియు మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఆగ్రహాన్ని మరియు కఠినమైన శిక్షను తప్పనిసరి చేస్తుంది. లూతు జాతి వారి గురించి మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మా తీర్పు సమయం వచ్చినపుడు మేము దానిని (సోడోంను) తలక్రిందులుగా జేసి, దాని మీద మట్టితో చేసి కాల్చిన గులకరాళ్ళను ఎడతెగకుండా కురిపించాము.82 అవి నీ ప్రభువు తరఫు నుండి గుర్తు వేయబడినవి. అది (ఆ శిక్ష) ఈ దుర్మార్గులకు ఎంతో దూరంలో లేదు 83﴿ [హూద్: 82 - 83]
ఆధారాలు:
లివాతత్ హరాము అని, దాని వికారము మరియు దాని నేరం యొక్క ఘోరత్వాన్ని గూర్చిన ఆధారాలు చాలా ఉన్నాయి, వాటిలో కొన్ని:
అల్లాహ్ లూత్ అలైహిస్సలాం తన జాతి ప్రజలతో పలికిన మాట గురించి తెలియపరుస్తూ ఇలా పలికాడు: ﴾(ప్రకృతికి విరుద్ధంగా) సర్వప్రాణులలో కెల్లా మీరే పురుషుల వద్దకు పోతారేమిటీ?165 మీ ప్రభువు, మీ కొరకు సహవాసులు (అజ్వాజ్) గా పుట్టించిన వారిని విడిచి పెడుతున్నారేమిటి? అలా కాదు, మీరు హద్దు మీరి ప్రవర్తించే జాతివారు!166﴿ [షు'అరా: 165-166] ﴾عَادُونَ﴿ అనగా: మీ ప్రభువు మీకు ధర్మసమ్మతం చేసిన మర్మావయవాలను మీరు అతిక్రమించి, వాటిలో నుంచి మీపై నిషేధించిన వాటి వైపు వెళ్తున్నారు [167]. [167] తబ్రీ వ్యాఖ్యానం (17/ 630).
పరిశుద్ధుడైన అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾ఇక లూత్! అతను తన జాతి వారితో: "ఏమీ? మీరు ఇంతకు పూర్వం ప్రపంచంలో ఎవ్వరూ చేయని అసహ్యకరమైన పనులు చేస్తారా?" అని అడిగిన విషయం జ్ఞప్తికి తెచ్చుకోండి.80 వాస్తవానికి, మీరు స్త్రీలను వదలి కామంతో పురుషుల వద్దకు పోతున్నారు. వాస్తవంగా, మీరు మితిమీరి ప్రవర్తిస్తున్నారు.81﴿ [అల్ అఅ్ రాఫ్: 80 - 81]
అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: «ఎవరైనా లూత్ అలైహిస్సలాం జాతి వారి చర్యను చేస్తున్నట్లుగా మీరు గమనిస్తే, ఆ పని చేసేవాడిని మరియు చేయించుకునేవాడిని ఇద్దరినీ హతమార్చండి» [168]. [168] ఈ హదీసును అబూ దావుద్ హదీసు సంఖ్య (4462) లో ఉల్లేఖించారు.
జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: "నిశ్చయంగా నా ఉమ్మత్ విషయంలో నన్ను ఎక్కువగా భయాందోళనలకు గురి చేస్తున్న విషయం లూత్ జాతి వారి చర్య". [169] [169] ఈ హదీసును తిర్మిథీ, హదీసు సంఖ్య (1457) లో ఉల్లేఖించారు.
నష్టాలు:
స్వలింగ సంపర్కము వలన అనేక నష్టాలు ఉన్నాయి, వాటిలో కొన్ని ఇవే:
- దీనిని ఆచరించువాడు పరలోకంలో తీవ్రమైన శిక్షకు గురవుతాడు.
- హలాల్ నికాహ్'లు తగ్గిపోవటం, మరియు అవివాహితులుగా మిగిలిపోవటం అధికమవటం.
- సంతానం తగ్గిపోవడం లేదా పూర్తిగా నిలిచిపోవడం; ఇది జీవన జలాన్ని (వీర్యాన్ని) నాశనం చేయడమే. ఇది సాగుకు అనర్హమైన భూమిలో విత్తనాన్ని చల్లినవాడితో సమానం.
"స్వలింగ సంపర్కము, చేసేవాడిలో మరియు చేయించుకునేవాడిలో చింత, విచారం మరియు అసహ్యాన్ని కలిగిస్తుంది" [170].
- ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు: [170] జాదుల్ మఆద్ (4/241-242) సంక్షిప్తంగా.
ఇంకా: అది ముఖాన్ని నల్లగా చేస్తుంది, వక్షస్థలాన్ని చీకటిమయం చేస్తుంది మరియు హృదయ కాంతిని ఆర్పివేస్తుంది.
మరియు ఇంకా ఇది, ఆ పని చేసేవాడికి మరియు ఆ పనికి గురైన వాడికి మధ్య తప్పనిసరిగా విముఖత, తీవ్రమైన ద్వేషం మరియు సంబంధాల విచ్ఛిన్నానికి కారణమవుతుంది.
అంతేకాకుండా, అది చేసేవాడి మరియు దానికి గురైనవాడి స్థితిని కోలుకోలేని విధంగా నాశనం చేస్తుంది, అల్లాహ్ చిత్తశుద్ధితో కూడిన పశ్చాత్తాపం ద్వారా సంస్కరించాలని తలిస్తే తప్ప.
అంతేకాకుండా, ఇది అనుగ్రహాలు తొలగిపోవడానికి మరియు దైవాగ్రహాలు దిగిరావడానికి గల అతిపెద్ద కారణాలలో ఒకటి.
అంతేకాక, ఇది సిగ్గును పూర్తిగా తొలగిస్తుంది. సిగ్గు హృదయాల ప్రాణం, ఒకవేళ హృదయం దానిని కోల్పోతే, అది చెడును మంచిగాను, మంచిని చెడుగాను పరిగణిస్తుంది, మరియు అప్పుడు దాని వినాశనం స్థిరపడిపోతుంది.
అంతేకాకుండా, ఇది మరేదీ కలిగించనంతటి మొండితనాన్ని, దుస్సాహసాన్ని పుట్టిస్తుంది.
- పూర్వ కాలాలలో లేని ఎయిడ్స్ వంటి వ్యాధులు పుట్టుకురావడం.
- ఇది సిహాక్ (స్త్రీల మధ్య లైంగిక సంబంధం) లేదా వ్యభిచారానికి దారి తీస్తుంది; ఎందుకంటే పురుషులు పురుషులతోనే తృప్తి చెందితే, స్త్రీలు స్త్రీలతోనే తృప్తి చెందుతారు, లేదా తమ వాంఛను తీరించుకోవడానికి స్త్రీ తన భర్త కానివారిని ఆశ్రయించే పరిస్థితి కూడా కలుగవచ్చు.
రక్షణ:
స్వలింగసంపర్కము నేరములో పడకుండా రక్షణ పొందే మార్గములు:
- వివాహం, స్వలింగ సంపర్కం నుండి కాపాడే అత్యంత శక్తివంతమైన కారణాలలో ఒకటి. ఎవరికైతే వివాహం చేసుకోగల స్థోమత లేదో వారు ఉపవాసం పాటించాలి; అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఉల్లేఖించారు, ఆయన ఇలా అన్నారు: “మీలో వివాహం చేసుకోగల స్థోమత కలిగిన వారు వివాహం చేసుకోవాలి. ఎందుకంటే (ఇది ఇతర మహిళలను చూడకుండా) చూపులను నిగ్రహిస్తుంది, మరియు (చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలలో పడకుండా) మర్మాంగాలను రక్షిస్తుంది. మరియు ఎవరైనా అలా చేయలేకపోతే (వివాహం చేసుకునే స్థోమత లేకపోయినట్లైతే), అతడు ఉపవాసం ఉండాలి, ఎందుకంటే అది అతనికి రక్షణగా ఉంటుంది.” [171]. [171] ఈ హదీసును బుఖారీ హదీసు సంఖ్య (1905) మరియు ముస్లిం హదీసు సంఖ్య (1400) లో ఉల్లేఖించారు.
- పురుషుడు మరో పురుషుని మర్మాంగాలను చూడరాదు; అబూ సయీద్ అల్ ఖుద్రి రజియల్లాహు అన్హు కథనం, మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ప్రవచించారు: “ఒక పురుషుడు మరో పురుషుని మర్మాంగవయవాల వైపుకు చూడకూడదు. అలాగే ఒక స్త్రీ మరో స్త్రీ మర్మాంగవయవాల వైపుకు చూడకూడదు. ఒక పురుషుడు మరో పురుషుడితో కలిసి ఒక దుప్పటిలో పడుకోకూడదు. అలాగే ఒక స్త్రీ మరో స్త్రీ తో కలిసి ఒక దుప్పటిలో పడుకోకూడదు” [172]. [172] ఈ హదీసును ముస్లిం హదీసు సంఖ్య (338) లో ఉల్లేఖించారు.
- అశ్లీల వెబ్సైట్లలోకి ప్రవేశించవద్దు, లేదా స్త్రీ, పురుషులైన చెడు స్నేహితులతో సంప్రదించవద్దు.
- పది సంవత్సరాల వయసుకు చేరుకున్నప్పుడు సంతానం పడకలను - వారు మగపిల్లలైనా లేదా ఆడపిల్లలైనా సరే - వేరు చేయాలి. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ప్రకారం, అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “మీ సంతానం ఏడు సంవత్సరాల వయసులో ఉన్నపుడు సలాహ్ (నమాజు) ఆచరించమని ఆదేశించండి; పది సంవత్సరాల వయసులో (సలాహ్ ఆచరించకపోతే) వారిని దండించండి; అలాగే వారి పడకలు (ఆడపిల్లల పడకలు, మగపిల్లల పడకలు) వేరు చేయండి.” [173]. [173] ఈ హదీసును అబూ దావుద్ హదీసు సంఖ్య (495) లో ఉల్లేఖించారు.
- స్వలింగ సంపర్కము అనే మహాపాపం యొక్క ఇహపరలోక పరిణామాల నుండి భయపెట్టటం.
- సరైన అఖీదాను నాటడం, దాని మూలస్తంభాలను స్థిరపరచడం మరియు వ్యక్తులు, సమాజాల హృదయాలలో దానిని ఎల్లప్పుడూ పెంపొందించడం పట్ల సంపూర్ణ శ్రద్ధ వహించడం: ఎందుకంటే ప్రవర్తనా విచలనం చాలా సందర్భాలలో అఖీదాలోని లోపం వల్లనే సంభవిస్తుంది.
కారణం లేకుండా రమజాన్ మాసంలో ఒక రోజు ఉపవాసం వదలడం
అల్లాహ్ రమజాన్ మాసపు ఉపవాసాలను విశ్వాసులపై విధిగావించి, ఇలా సెలవిచ్చాడు: ﴾ఓ విశ్వాసులారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది, ఏ విదంగానైతే మీ పూర్వీకులకు విధిగా నిర్ణయించబ ఉండెనో బహుశా మీరు దైవభీతిపరులై ఉంటారని! 183﴿ [బఖర: 183]
రమజాన్ మాసపు ఉపవాసాలు ఇస్లాం యొక్క మూలస్థంభాలలో ఒకటి. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: "ఇస్లాం ధర్మం ఐదు పునాదులపై ఆధారపడి ఉంది: అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడనీ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవప్రవక్త అని సాక్ష్యం పలకటం, నమాజ్ స్థాపించటం, జకాత్ చెల్లించటం, దైవగృహ యాత్ర చేయటం, రమజాన్ నెలలో ఉపవాసాలు పాటించటం" [174]. [174] ఈ హదీసును బుఖారీ హదీసు సంఖ్య (8) లో మరియు ముస్లిం హదీసు సంఖ్య (16) లో ఉల్లేఖించారు.
ఎవరైతే ఎటువంటి కారణం లేకుండా రమజాను మాసంలో లేదా దానిలోని ఒక రోజు ఉపవాసాన్ని ఉద్దేశపూర్వకంగా వదులుతారో, అతను మహోన్నతుడైన అల్లాహ్ ఆజ్ఞను ఉల్లంఘించాడు, ధర్మ స్తంభాలలో ఒకదానిని అతిక్రమించాడు మరియు ఘోర పాపాలలో ఒక పెద్ద పాపానికి పాల్పడ్డాడు.
హాఫిజ్ జహబీ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు: "విశ్వాసుల వద్ద ఇది స్థిరపడిన విషయం: ఎవరైతే అనారోగ్యం లేదా మరే ఇతర కారణం లేకుండా రమజాన్ ఉపవాసాన్ని విడిచిపెడతాడో, అతను వ్యభిచారి, పన్ను వసూలుదారు మరియు మద్యపానసేవకుని కంటే అధముడు. అంతేకాదు, వారు అతని ఇస్లాంపై సందేహిస్తారు మరియు అతనిలో ధర్మభ్రష్టత్వం మరియు నైతిక పతనం ఉన్నాయని భావిస్తారు" [175]. [175] చూడండి: ఫైజుల్ ఖదీర్ (4/311).
ఆధారాలు:
సరైన కారణం లేకుండా రమజాన్ మాసంలోని ఒక రోజు ఉపవాసం వదలటాన్ని నిషేధించే, మరియు దాని ఘోరత్వాన్ని, దాని నేరం యొక్క తీవ్రతను వివరించే రుజువులు చాలా ఉన్నాయి, వాటిలో:
అబూ ఉమామహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా నేను విన్నాను: ‘నేను నిద్రలో ఉండగా, ఇద్దరు వ్యక్తులు నా వద్దకు వచ్చి నన్ను తమతో తీసుకువెళ్లారు. అక్కడ నేను ఒక సమూహాన్ని చూశాను, వారు తమ చీలమండల (అనగా పాదం వెనుక భాగం) నుండి వేలాడదీయబడి ఉన్నారు, వారి దవడలు (అనగా నోటి వైపు భాగం) చిరిగిపోయి ఉన్నాయి, వాటి నుండి రక్తం కారుతోంది. నేను అడిగాను: వీరు ఎవరు? అతను ఇలా అన్నాడు: వీరు తమ ఉపవాసాన్ని విరమించే సమయం కాకముందే విరమించేవారు’ [176]. [176] ఈ హదీసును నసాయీ కుబ్రాలో హదీసు సంఖ్య (3273) సంక్షిప్తంగా ఉల్లేఖించారు.
సహబలు రదియల్లాహు అన్హుమ్, రమజాను మాసంలో ఎటువంటి కారణం లేకుండా ఉపవాసం వదిలిన వారిని శిక్షించేవారని అనేక ఉల్లేఖనాలు ఉన్నాయి, వాటిలో ఒకటి: ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వద్దకు రమజాను మాసంలో మధ్యం సేవించిన ఒక వృద్ధుడిని తీసుకురావడం జరిగింది, అప్పుడు ఆయన ఇలా అన్నారు: ముక్కుపుటముల శబ్దం! ముక్కుపుటముల శబ్దం! –అది గాడిద తన ముక్కుపుటముల నుండి చేసే శబ్దం– మరియు మా పిల్లలు సైతం సియామ్ (ఉపవాసం) పాటిస్తున్నారు –అంటే మా చిన్నపిల్లలు ఉపవాసంతో ఉండగా, నీవు ఉపవాసం పాటించడం లేదు–, తరువాత అతను అతనికి ఎనభై కొరడా దెబ్బలతో శిక్షించాడు, మరియు అతనిని షామ్ (సిరియా ప్రాంతం)కు బహిష్కరించాడు.
అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం: ఆయన వద్దకు రమదాన్ మాసంలో మధ్యం సేవించిన ఒక వ్యక్తిని తీసుకురావడం జరిగింది, అప్పుడు ఆయన అతనికి ఎనభై కొరడా దెబ్బలు కొట్టారు, ఆ తర్వాత మరుసటి రోజు ఇరవై కొరడా దెబ్బలు కొట్టి, ఇలా అన్నారు: "అల్లాహ్ పై నీ దుస్సాహసానికి, మరియు రమజానులో ఉపవాసం విరమించినందుకు మేము నీకు ఇరవై దెబ్బలు కొట్టాము"
అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: "రమజాను మాసంలో ఉద్దేశపూర్వకంగా ఒక రోజు ఉపవాసం వదిలిన వ్యక్తి, జీవితాంతం ఉపవాసాలు ఉన్నా కూడా దాని ఖజా చేయలేడు".
- ఇబ్నె మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: "ఎవరైతే షరీయత్ అనుమతించిన కారణం లేకుండా రమజానులో ఒక రోజు ఉపవాసం వదిలేస్తారో, వారు జీవితాంతం ఉపవాసం ఉన్నప్పటికీ అది ఆ ఒక్క రోజుకు సరిపోదు" [177]. [177] చూడండి ఇబ్నె హజమ్ గారి అల్-ముహల్లా (4/ 311).
నష్టాలు:
రమజాన్ మాసంలో సరైన కారణం లేకుండా ఉపవాసం విరమించడంలో అనేక నష్టాలు కలవు, వాటిలో కొన్ని:
- ఇస్లాం మూలస్థంభాలలో ఒకదాన్ని వదిలివేయడం.
- మహోన్నతుడైన అల్లాహ్ ఆజ్ఞలను తేలికగా తీసుకోవడం.
- మహోన్నతుడైన అల్లాహ్ యొక్క విధిని ఉల్లంఘించి, ప్రజల ముందు ఉపవాసం విరమించే దుస్సాహసం అతడిని అల్లాహ్ యొక్క క్షమాభిక్షకు అనర్హుడిని చేస్తుంది. అల్లాహ్ పట్ల ఈ దుస్సాహసానికి పాల్పడిన వ్యక్తి ఉపవాసం విరమించిన విషయం, అతడు స్వయంగా తన మాటల ద్వారా లేదా చేతల ద్వారా బహిరంగపరిస్తే తప్ప, తెలియదు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పగా విన్నాను: «నా ఉమ్మత్ లో (సమాజం లో) ప్రతీ ఒక్కరికీ క్షమాబిక్ష ప్రసాదించబడుతుంది కానీ ముజాహిరీన్ (పాపాలను బహిరంగంగా చేసేవారు) కు మాత్రం ఆ భాగ్యం దక్కదు» [178]. [178] ఈ హదీసును బుఖారీ హదీసు సంఖ్య (6069) మరియు ముస్లిం హదీసు సంఖ్య (2990) లో ఉల్లేఖించారు.
- ఇతరులను ఈ పాపాన్ని వ్యాప్తి చేయడానికి ప్రోత్సహించడంపై అల్లాహ్ శిక్ష విధిస్తానని హెచ్చరించాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾నిశ్చయంగా, ఎవరైతే విశ్వాసవర్గంలో అశ్లీలత వ్యాపించాలని కోరుతారో, అలాంటి వారికి ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా కఠినశిక్ష పడుతుంది. మరియు అల్లాహ్ కు అంతా తెలుసు, కాని మీకు తెలియదు.19﴿ [నూర్: 19]
రక్షణ:
రమజాన్ లో సకారణం లేకుండా ఉపవాసం వదిలివేయడంలో పడకుండా ఉండేందుకు నివారణ మార్గాలు:
- చిన్నతనం నుండే ఉపవాసాలకు అలవాటు పడటం; అర్-రుబయ్యి బిన్తె ముఅవ్విద్ రదియల్లాహు అన్హా కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆషూరా ఉదయం అన్సార్ల గ్రామాలకు (ఈ సందేశం) పంపారు: «ఎవరైతే ఉదయం ఉపవాసం పాటించలేదో, వారు తమ మిగిలిన రోజు ఉపవాసం ఉండాలి. మరియు ఎవరైతే ఉపవాసంతో ఉన్నారో, వారు తమ ఉపవాసాన్ని పూర్తి చేయాలి». ఆమె ఇలా అన్నారు: ఆ తర్వాత నుండి మేము ఆ రోజు ఉపవాసం ఉండేవారం, మరియు మా పిల్లల చేత కూడా ఉపవాసం ఉంచేవారం. మేము వారి కోసం ఉన్నితో చేసిన ఆటవస్తువును తయారు చేసేవారం. వారిలో ఎవరైనా ఆహారం కోసం ఏడిస్తే, ఇఫ్తార్ సమయం అయ్యే వరకు మేము దానిని వారికి ఇచ్చేవారం. [179] [179] ఈ హదీసును బుఖారీ హదీసు సంఖ్య (1960) మరియు ముస్లిం హదీసు సంఖ్య (1136) లో ఉల్లేఖించారు.
- సహనం వహించేలా ఆత్మకు శిక్షణ ఇవ్వడం, అబూ సయీద్ అల్-ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: «ఎవరైతే సహనం వహిస్తాడో, అల్లాహ్ అతనికి సహనాన్ని ప్రసాదిస్తాడు» [180]. [180] ఈ హదీసును బుఖారీ హదీసు సంఖ్య (1960) మరియు ముస్లిం హదీసు సంఖ్య (1136) లో ఉల్లేఖించారు.
- ఉపవాసంపై అల్లాహ్ వద్ద ఉన్న గొప్ప ప్రతిఫలం కొరకు ఆత్మను ప్రోత్సహించడం, అందులో భాగంగా అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, దైవ ప్రవక్త ﷺ ఇలా పలికారు: “అల్లాహ్ ఇలా పలికినాడు: ఆదము కుమారుని ఆచరణలన్నీ అతని కొరకే, ఒక్క ఉపవాసం తప్ప; అది నాకొరకు, మరియు దానికి నేనే ప్రతిఫలాన్ని ఇస్తాను” [181]. [181] ఈ హదీసును బుఖారీ (హదీసు సంఖ్య: 1904) మరియు ముస్లిం (హదీసు సంఖ్య: 1151) లో ఉల్లేఖనం చేశారు.
సహల్ బిన్ సాద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: «నిశ్చయంగా స్వర్గంలో ఒక ద్వారం ఉంది, దానిని అర్-రయ్యన్ అని పిలుస్తారు. ప్రళయదినాన దాని గుండా ఉపవాసులు ప్రవేశిస్తారు, వారు తప్ప మరెవరూ దాని గుండా ప్రవేశించలేరు. ‘ఉపవాసులు ఎక్కడ?’ అని ప్రకటించబడుతుంది. అప్పుడు వారు నిలబడతారు, వారు తప్ప మరెవరూ దాని గుండా ప్రవేశించలేరు. వారంతా ప్రవేశించాక, ఆ ద్వారం మూసివేయబడుతుంది, ఆ తర్వాత దాని గుండా ఎవరూ ప్రవేశించలేరు» [182]. [182] ఈ హదీసును బుఖారీ హదీసు సంఖ్య (1896) మరియు ముస్లిం హదీసు సంఖ్య (1152)లో ఉల్లేఖించారు.
అస్సుఖ్ రియతు వల్ ఇస్తేహ్జావు - అవహేళన మరియు అపహాస్యం
ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరుడిని ఎగతాళి చేయటం, హేళన చేయటం మహా పాపాలలో ఒకటి. ఇది అవిశ్వాసులు మరియు కపట విశ్వాసుల లక్షణాలలో ఒకటి. దీనికి పాల్పడే వాడు కఠిన శిక్షకు గురవుతాడు. మరియు ఈ మహా పాపం అల్లాహ్ యొక్క పుణ్యాత్ములైన దాసుల విషయంలో జరిగినప్పుడు దాని పాపభారం మరింత అధికమవుతుంది.
ఒక ముస్లిం తన సోదరుడిని ఎగతాళి చేయడం మరియు అపహాస్యం చేయడం వివిధ రూపాలలో ఉంటుంది, వాటిలో కొన్ని: అతనిని తక్కువగా చూడటం మరియు చులకనగా చూడటం, ఇతరులు అతనిని చూసి నవ్వేలా అతని లోపాలను మరియు బలహీనతలను ఎత్తి చూపడం. ఇది చేతలతో, మాటలతో లేదా సంజ్ఞలతో అనుకరించడం ద్వారా కూడా ఉండవచ్చు. లేదా అతను మాట్లాడేటప్పుడు తడబడినా లేదా తప్పుగా మాట్లాడినా అతని మాటలను చూసి నవ్వడం, లేదా అతని పనిని, లేదా అతని వికారమైన రూపాన్ని చూసి నవ్వడం, మరియు అతన్ని కించపరిచే ఇతర విషయాలు.
ఆధారాలు:
ముస్లింను పరిహాసమాడటం మరియు హేళన చేయటం నిషేధం అనడానికి ఆధారాలు:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ﴾సత్యతిరస్కారులకు ఇహలోక జీవితం మనోహరమైనదిగా చేయబడింది. కావున వారు విశ్వాసులతో పరిహాసాలాడుతుంటారు. కానీ, పునరుత్థాన దినమున, దైవభీతి గలవారే వారి కంటే ఉన్నత స్థానంలో ఉంటారు. మరియు అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తాడు.212﴿ [అల్ బఖర: 212]
షైఖ్ స'అది' రహిమహుల్లాహ్ చెప్పారు: మహోన్నతుడైన అల్లాహ్ తెలియజేస్తున్నాడు: ఎవరైతే అల్లాహ్ ను, ఆయన ఆయతులను, ఆయన ప్రవక్తలను తిరస్కరించారో, మరియు ఆయన షరిఅత్ కు కట్టుబడి ఉండలేదో, అటువంటి అవిశ్వాసపరులకు ఇహలోక జీవితం మనోహరమైనదిగా చేయబడింది. అది వారి కళ్ళలో, వారి హృదయాలలో మనోహరమైనదిగా చేయబడింది, కావున వారు దానితో ఇష్టపడి, దానితోనే తృప్తి చెందారు. వారి కోరికలు, సంకల్పాలు, కర్మలు అన్నీ దాని కొరకే అయిపోయాయి. కావున వారు దాని వైపుకు మరలి, దానిని సంపాదించడంలో నిమగ్నమైపోయారు. వారు దానిని, మరియు వారి ఈ పనిలో వారితో పాలుపంచుకున్న వారిని గొప్పగా భావించారు. మరియు విశ్వాసులను నీచంగా చూసి, వారితో పరిహాసాలాడారు. మరియు ఇలా అన్నారు: 'ఏమిటి, మా మధ్యలో నుండి అల్లాహ్ అనుగ్రహించిన వారు వీరేనా?' [183]. [183] సఅదీ వ్యాఖ్యానం (పేజీ: 95).
ఇది వారి బలహీనమైన బుద్ధి మరియు సంకుచిత దృష్టి వలననే, ఎందుకంటే ఈ ప్రపంచం ఒక పరీక్షా స్థలము, ఇందులో విశ్వాసులకు మరియు అవిశ్వాసులకు కష్టాలు ఎదురవుతాయి, కానీ ఈ ప్రపంచంలో ఒక విశ్వాసికి ఏదైనా కష్టం కలిగినప్పుడు, అతను సహనం పాటిస్తాడు, పుణ్యఫలాన్నికాంక్షిస్తాడు, తద్వారా అల్లాహ్ అతని ఈమాన్ మరియు సహనం కారణంగా ఇతరులకు లభించని విధంగా అతని కష్టాన్ని తేలికపరుస్తాడు.
వాస్తవానికి, పూర్తి ఘనత మరియు నిజమైన ఆధిక్యత శాశ్వతమైన నివాసంలోనే ఉంది, అందుకే అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾దైవభీతి గలవారే ప్రళయదినాన వారి కంటే ఉన్నత స్థానంలో ఉంటారు﴿. దైవభీతిపరులు అత్యున్నత స్థానాలలో, వివిధ రకాల అనుగ్రహాలను, సుఖసంతోషాలను మరియు ఆనందోత్సాహాలను అనుభవిస్తూ ఉంటారు. మరియు అవిశ్వాసపరులు వారి క్రింద అట్టడుగు స్థానాలలో, వివిధ రకాల శిక్ష, అవమానం మరియు అంతం లేని శాశ్వత దౌర్భాగ్యంతో శిక్షించబడుతూ ఉంటారు. కావున ఈ ఆయతులో విశ్వాసుల కొరకు సాంత్వన మరియు అవిశ్వాసపరుల దుర్గతి గురించి ఒక ప్రకటన ఉంది.
పరిశుద్ధుడైన అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾మనస్ఫూర్తిగా సంతోషంతో (అల్లాహ్ మార్గంలో) దానం చేసే విశ్వాసులను నిందించే వారినీ మరియు తమ శ్రమ తప్ప మరేమీ ఇవ్వటానికి లేని వారిని ఎగతాళి చేసే వారినీ, అల్లాహ్ ఎగతాళికి గురి చేస్తాడు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.79﴿ [తౌబా: 79]
ఇబ్నె కసీర్ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు:- ఇది కపటుల లక్షణాల్లోంచిది, వారి నిందల నుండి మరియు దూషణల నుండి ఏ పరిస్థితిలోనూ ఎవరూ, చివరకు దానం చేసేవారు కూడా తప్పించుకోలేరు. వారిలో ఎవరైనా అధిక ధనంతో వస్తే, వారు: "ఇతను ప్రదర్శనకారుడు" అని అంటారు, మరియు అతడు తన శక్తిసామర్థ్యాల మేరకు ఏదైనా చిన్న వస్తువుతో వస్తే, వారు ఇలా అంటారు: {అల్లాహ్ ఇతని దానమునకు అవసరం లేనివాడు.} మరియు ఆయన వాక్కు: {వారు వారిని ఎగతాళి చేస్తారు, అల్లాహ్ వారిని ఎగతాళికి గురి చేస్తాడు}. ఇది వారి దుష్టకార్యాలకు మరియు విశ్వాసులను హేళన చేసిన దానికి ప్రతిఫలము; ఎందుకంటే కర్మకు తగిన ప్రతిఫలమే ఉంటుంది. కాబట్టి ఆయన వారితో, వారిని హేళన చేసే విధంగా వ్యవహరించాడు. ఇది ఇహలోకంలో విశ్వాసులకు విజయం చేకూర్చడానికే. మరియు పరలోకంలో కపటవిశ్వాసుల కొరకు బాధాకరమైన శిక్షను సిద్ధపరిచాడు. [184] తఫ్సీర్ ఇబ్నె కసీర్ (4/184) కొంత వ్యత్యాసంతో మరియు సంక్షిప్తంతో.
పరిశుద్ధుడైన అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾నిశ్చయంగా, నా దాసులలో కొందరు ఇలా ప్రార్థించే వారున్నారు: "ఓ మా ప్రభూ! మేము విశ్వసించాము, మమ్మల్ని క్షమించు మరియు మమ్మల్ని కరుణించు మరియు కరుణించేవారిలో నీవే అత్యుత్తముడవు!109 కాని మీరు వారిని పరిహాసానికి గురి చేసేవారు, చివరకు (ఆ పరిహాసమే) మిమ్మల్ని నా ధ్యానం నుండి మరపింపజేసింది; మరియు మీరు వారి మీద నవ్వేవారు (ఎగతాళి చేసేవారు)!110 నిశ్చయంగా, ఈ రోజు నేను వారికి, వారి సహనానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చాను. నిశ్చయంగా వారే విజయం పొందినవారు!111﴿ [అల్ మూమినూన్: 109-111]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఓ విశ్వాసులారా! మీలో ఎవరూ (పురుషులు) ఇతరులెవరినీ ఎగతాళి చేయరాదు. బహుశా వారే (ఎగతాళి చేయబడే వారే) వీరి కంటే శ్రేష్ఠులు కావచ్చు! అదే విధంగా స్త్రీలు కూడా ఇతర స్త్రీలను ఎగతాళి చేయరాదు. బహశా వారే (ఎగతాళి చేయబడే స్త్రీలే) వీరి కంటే శ్రేష్ఠురాండ్రు కావచ్చు! మీరు పరస్పరం ఎత్తి పొడుచుకోకండి మరియు చెడ్డ పేర్లతో పిలుచుకోకండి. విశ్వసించిన తర్వాత ఒకనిని చెడ్డ పేరుతో పిలవటం ఎంతో నీచమైన విషయం మరియు (ఇలా చేసిన పిదప) పశ్చాత్తాప పడకుంటే, అలాంటి వారు చాలా దుర్మార్గులు.11﴿ [అల్ హుజరాత్: 11]
పరిశుద్ధుడైన అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾వాస్తవానికి (ప్రపంచంలో) అపరాధులు విశ్వసించిన వారిని హేళన చేసేవారు.29 మరియు వీరు (విశ్వాసులు), వారి (అవిశ్వాసుల) యెదుట నుండి పోయి నప్పుడు, వారు (అవిశ్వాసులు) పరస్పరం కనుసైగలు చేసుకునేవారు. 30 మరియు (అవిశ్వాసులు) తమ ఇంటి వారి దగ్గరికి పోయినప్పుడు (విశ్వాసులను గురించి) పరిహసిస్తూ మరలేవారు.31 మరియు (విశ్వాసులను) చూసినపుడల్లా: "నిశ్చయంగా, వీరు దారి తప్పినవారు!" అని అనేవారు. 32 మరియు వారు (అవిశ్వాసులు) వీరి (విశ్వాసుల) మీద కాపలాదారులుగా పంపబడలేదు! 33 కాని ఈ రోజు (పునరుత్థాన దినం నాడు) విశ్వసించినవారు, సత్యతిరస్కారులను చూసి నవ్వుతారు.34 ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గదృశ్యాలను) తిలకిస్తూ 35 ఇక! ఈ సత్యతిరస్కారులకు, వారి చేష్టలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా దొరుకునా? 36﴿ [అల్ ముతఫ్ఫిఫీన్: 29-36]
షైఖ్ స'అది' రహిమహుల్లాహ్ చెప్పారు: సర్వోన్నతుడు తెలియజేశాడు, నిశ్చయంగా అపరాధులు ఇహలోకంలో విశ్వాసులను ఎగతాళి చేసేవారు, వారిని హేళన చేసేవారు మరియు వారిని చూసి నవ్వేవారు. వారు తమ వద్ద నుండి వెళ్ళినప్పుడు వారిని అవమానిస్తూ, తృణీకరిస్తూ సైగలు చేసుకునేవారు. ఇది ఉన్నప్పటికీ, వారు నిశ్చింతగా ఉండేవారు, వారి మనస్సులలో భయమనేది ఉండేది కాదు. మరియు వారు ఉదయం లేదా సాయంత్రం తమ వారి వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు, వారు ఆనందంగా, ఉల్లాసంగా తిరిగి వచ్చేవారు. ఇది అత్యంత తీవ్రమైన ఆత్మవంచన. వారు ఘోరమైన పాపాలకు పాల్పడుతూనే, ఈ లోకంలో తాము సురక్షితంగా ఉన్నామని నిశ్చింతగా ఉంటారు. దైవం తరఫు నుండి తాము సౌభాగ్యవంతులమని ఒక గ్రంథం లేదా వాగ్దానం అందినట్లుగా వారి ధీమా ఉంటుంది. తామే సన్మార్గంలో ఉన్నామని, విశ్వాసులు మార్గభ్రష్టులని తమకు తామే తీర్పు ఇచ్చుకున్నారు. ఇది దైవంపై అపనింద మోపడం, మరియు ఎలాంటి జ్ఞానం లేకుండా ఆయన గురించి మాట్లాడే దుస్సాహసం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ﴾وَمَا أُرْسِلُوا عَلَيْهِمْ حَافِظِينَ﴿ అనగా: మరియు వారు విశ్వాసుల మీద వారి కర్మలను కాపాడటానికి బాధ్యులుగా పంపబడలేదు, కానీ వారు విశ్వాసులను మార్గభ్రష్టులని నిందించడంలో అత్యుత్సాహం చూపుతున్నారు. వారి ఈ చర్య కేవలం మూర్ఖత్వం, మొండితనం మరియు ఎగతాళి మాత్రమే, దీనికి ఎలాంటి ఆధారం గానీ, రుజువు గానీ లేదు, అందుకే, పరలోకంలో వారి ప్రతిఫలం వారి కర్మలకు తగినట్టుగానే ఉంటుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: కాని ఈ రోజు (పునరుత్థాన దినం నాడు) విశ్వసించినవారు, సత్యతిరస్కారులను చూసి నవ్వుతారు; వారు యాతనా తీవ్రతలో అల్లాడుతుండగా, మరియు వారు కల్పించుకున్న అసత్యాలన్నీ వారి నుండి అంతరించిపోయి ఉండగా చూస్తారు. మరియు విశ్వాసపరులు సంపూర్ణమైన సుఖశాంతులతో, అలంకరించిన పీఠాలపై (అవి అలంకరించబడిన ఆసనాలు) కూర్చుని, అల్లాహ్ తమ కొరకు సిద్ధపరచిన అనుగ్రహాలను మరియు తమ దయామయుడైన ప్రభువు యొక్క వదనాన్ని చూస్తూ ఉంటారు [185]. [185] తఫ్సీర్ సాదీ (సాద్: 916).
ఇక! ఈ సత్యతిరస్కారులకు, వారి చేష్టలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా దొరుకునా?"" అంటో, వారికి వారి కర్మలకు అనుగుణంగానే ప్రతిఫలం ఇవ్వబడిందా? ఏ విధంగానైతే వారు ఇహలోకంలో విశ్వాసులను చూసి నవ్వారో మరియు వారిని మార్గభ్రష్టులని నిందించారో, అదే విధంగా పరలోకంలో విశ్వాసులు వారిని చూసి నవ్వుతారు మరియు వారిని శిక్ష మరియు యాతనలో చూస్తారు, అది వారి దుర్మార్గం మరియు మార్గభ్రష్టత్వానికి శిక్ష. అవును, వారు ఏమైతే చేసేవారో దానికి, అల్లాహ్ తరఫున న్యాయంగా మరియు వివేకంగా ప్రతిఫలం ఇవ్వబడింది. మరియు అల్లాహ్ సర్వజ్ఞాని, మహా వివేకవంతుడు.
అబూ జర్ రజియల్లాహు అన్హు కధనం: నాకూ, నా సోదరులలో ఒక వ్యక్తికీ మధ్య వాగ్వివాదం జరిగింది. అతని తల్లి అరబేతరురాలు కావడంతో, నేను ఆమెను గురించి ప్రస్తావించి ఎత్తిపొడిచాను. దాంతో అతను నాపై దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలిశాను, అప్పుడాయన ఇలా అన్నారు: “ఓ అబూ జర్ర్! నిశ్చయంగా నీలో అజ్ఞానం ఉంది.” నేను ఇలా అన్నాను: “ఓ దైవప్రవక్తా! ఎవరైనా ఇతరులను తిడితే, ప్రజలు తిరిగి వారి తండ్రినీ, తల్లినీ తిడతారు.” అందుకాయన అన్నారు: “ఓ అబూ జర్ర్! నిశ్చయంగా నీలో అజ్ఞానం ఉంది...” [186]. [186] ఈ హదీసును బుఖారీ హదీసు సంఖ్య (30) మరియు ముస్లిం, హదీసు సంఖ్య (1661) లో ఉల్లేఖించారు.
అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఒక ముస్లిం మరొక ముస్లింకు సోదరుడు. అతనికి అన్యాయం చేయడు, అతనికి అవసరమైనప్పుడు సహాయం చేయకుండా నిరాకరించడు, అతడిని అవమానించడు. "నిజమైన తఖ్వా (అల్లాహ్ పట్ల భయభక్తి) ఇక్కడ ఉంది" అని ఆయన తన ఛాతీ వైపు మూడుసార్లు సూచించారు. ఒక ముస్లిం తన ముస్లిం సోదరుడిని ధిక్కరించడం, అవమానించడం చాలా చెడ్డ పని. ఒక ముస్లింపై మరొక ముస్లిం కొరకు నిషేధించబడిన విషయాలు - అతని ప్రాణం, ఆస్తి మరియు గౌరవం. [187]. [187] ఈ హదీసును ముస్లిం, హదీసు సంఖ్య (2564) లో ఉల్లేఖించారు.
నష్టాలు:
ఒక ముస్లింను పరిహాసమాడటం, హేళన చేయటం వల్ల కలిగే హానులు:
- ఇది మహోన్నతుడైన అల్లాహ్ పట్ల అవిధేయత, మరియు ఘోరమైన పాపములలో (కబాయిర్ లలో) ఒకటి.
- దానికి పాల్పడిన వాడు ఫాసిఖు (విధేయత నుండి వైదొలగినవాడు) అవుతాడు, మరియు దీని వలన అతని షహాద తిరస్కరించబడుతుంది. మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ వచనాన్ని పేర్కొన్న తరువాత ఖుర్తుబీ ఇలా అన్నారు: ﴾ఓ విశ్వాసులారా! మీలో ఎవరూ (పురుషులు) ఇతరులెవరినీ ఎగతాళి చేయరాదు. బహుశా వారే (ఎగతాళి చేయబడే వారే) వీరి కంటే శ్రేష్ఠులు కావచ్చు!﴿ ఇంకా అల్లాహ్ ఇలా అంటున్నాడు: ﴾విశ్వసించిన తర్వాత ఒకనిని చెడ్డ పేరుతో పిలవటం ఎంతో నీచమైన విషయం.﴿ [అల్ హుజరాత్: 11] వారు ఇలా అన్నారు: "ఎవరైతే తన సోదరునికి అపహాస్యమైన బిరుదు ఇస్తాడో లేదా అతడిని ఎగతాళి చేస్తాడో, అతడు ఫాసిఖ్ అని చెప్పబడింది" [188]. [188] తఫ్సీరె ఖుర్తుబీ (16/ 328).
- అది అవిశ్వాసుల మరియు కపట విశ్వాసుల గుణాలలో ఒకటి, ఎందుకంటే ప్రతి యుగంలో విశ్వాసుల పట్ల హేళన చేయడమే వారి అలవాటు.
- ఎగతాళి మరియు అపహాస్యం చేసేవాడు, తాను ఎవరినైతే ఎగతాళి చేస్తున్నాడో వారి యందే నిమగ్నమవ్వడం వలన, అల్లాహ్ తనపై విధిగా చేసిన ఆరాధనను మరియు ఆయన స్మరణను మరచిపోతాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾కాని మీరు వారిని పరిహాసానికి గురి చేసేవారు, చివరకు (ఆ పరిహాసమే) మిమ్మల్ని నా ధ్యానం నుండి మరపింపజేసింది...﴿ [అల్ ముమినూన్: 110]
- అది తరచుగా నిషిద్ధమైన చాడీలతో కూడి ఉంటుంది; అది చాడీలలో పడిపోవడానికి ఒక అనివార్యమైన మార్గం; ఎందుకంటే ఎగతాళి చేసేవాడు ఇతరులను ఎక్కువగా వారి పరోక్షంలోనే ఎగతాళి చేస్తాడు మరియు హేళన చేస్తాడు.
ఎగతాళి మరియు అపహాస్యం చాలాసార్లు ప్రజలను తృణీకరించడం వల్లనే జరుగుతుంది, ఇది నిందనీయమైన అహంకారానికి చెందినది, దీనికి పాల్పడే వానికి బాధాకరమైన శిక్ష గురించి హెచ్చరించబడింది. ఒక ప్రామాణిక హదీసులో అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ‘ఎవరి హృదయంలో అణువంత గర్వం ఉన్నా అతను స్వర్గంలో ప్రవేశించలేడు.’ అప్పుడు ఒక వ్యక్తి ఇలా అడిగాడు: ‘ఒక వ్యక్తి తన దుస్తులు అందంగా ఉండాలని, తన పాదరక్షకాలు అందంగా ఉండాలని ఇష్టపడతాడు కదా!’ దానికి ప్రవక్త ఇలా బదులిచ్చారు: ‘నిశ్చయంగా అల్లాహ్ సుందరుడు, ఆయన అందాన్ని ప్రేమిస్తాడు. గర్వం అంటే సత్యాన్ని త్యజించడం మరియు ప్రజలను హీనంగా చూడటం.’ [189] సత్యాన్ని తృణీకరించడం: గర్వంతో మరియు అహంకారముతో దానిని తిరస్కరించడం. వ్యక్తులను తక్కువగా చూడటం: వారిని తృణీకరించడం. [189] ఈ హదీసును ముస్లిం హదీసు సంఖ్య (91) లో ఉల్లేఖించారు.
- ఇది సమాజంలోని వ్యక్తుల మధ్య ద్వేషం మరియు శత్రుత్వం వ్యాప్తి చెందడానికి గల అతిపెద్ద కారణాలలో ఒకటి, మరియు బహుశా వారి మధ్య పరస్పర ఘర్షణలకు కూడా దారితీయవచ్చు.
- దానిలో అల్లాహ్ సృష్టిని హేళన చేయటం కూడా ఉండవచ్చు; ముఖ్యంగా ఒక వ్యక్తి ఇతరులను వారి రూపం, స్వరం లేదా రంగు వంటి వారి శారీరక నిర్మాణంలోని ఏదైనా విషయం కారణంగా ఎగతాళి చేసినప్పుడు.
- అవహేళన మరియు ఎగతాళి అవహేళన చేసేవాడి గౌరవాన్ని పోగొట్టి, అతనిలోని మానవీయ గుణాన్ని (మురూఅత్) క్షీణింపజేస్తుంది.
రక్షణ:
ఎగతాళి మరియు అపహాస్యం నుండి రక్షణ మార్గములు:
- సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పట్ల భీతి మరియు ఆయన పట్ల అవిధేయత వలన కలిగే ఆయన పట్టు నుండి భయపడటం.
- మనిషి తన ధార్మిక మరియు ప్రాపంచిక విషయాలలో తనకు ప్రయోజనం చేకూర్చే వాటిలో తనను తాను నిమగ్నం చేసుకోవాలి; తద్వారా తన సోదరుల లోపాలతో నిమగ్నమవ్వడానికి తనకు తాను ఏ మాత్రం అవకాశం ఇవ్వడు.
- అహంకారాన్ని మరియు ప్రజలను తృణీకరించడాన్ని విడనాడటం; ఎందుకంటే ఇతరులను ఎగతాళి చేసే వారిలో చాలా మందిని, వారి సహోదరుల పట్ల వారికున్న అహంకారం మరియు వారిని తక్కువగా చూడటమే అలా చేయడానికి ప్రేరేపిస్తుంది.
- దీనికి కారణమయ్యే చెడు స్నేహాన్ని వదిలివేయడం; ఎందుకంటే వారి సమావేశాలు ప్రజలను ఎగతాళి చేయడం లేకుండా ఉండవు, దానినే వారు వినోదానికి ఒక మార్గంగా భావిస్తారు.
- తన వద్ద ఉన్న అనుగ్రహాలు అల్లాహ్ నుండేనని, మరియు అల్లాహ్ తాను ఉన్న స్థితిని అతని నుండి తీసివేసి, అతను ఎగతాళి చేసే వారి కంటే హీనమైన స్థితికి అతన్ని మార్చగల సమర్థుడని అతను తెలుసుకోవాలి.
- ఒక వ్యక్తి ఇతరులు తన సోదరులను ఎగతాళి చేయడాన్ని చూసినప్పుడు, ఆ చర్యను అంగీకరించకుండా వారిని నివారించాలి; తద్వారా వారు ఈ విషయంలో హద్దు మీరకుండా ఉంటారు.